Tuesday, December 7, 2010

ఆర్థిక సంక్షోభం: కరెన్సీ యుద్ధాలు

మార్క్సిస్టు Sun, 5 Dec 2010

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ యుద్ధం తాజా చర్చనీయాంశంగా మారింది. సంపన్న దేశాలు ప్రత్యేకించి అమెరికా తన కరెన్సీ, డాలర్‌ విలువను కృత్రిమంగా తగ్గించ టం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరెన్సీ యుద్ధం ప్రకటిస్తోందని అక్టోబరులో బ్రెజిల్‌ ఆర్థిక మంత్రి గిడో మాంటెగా విమర్శించటంతో ఈ అంశం ప్రపంచం దృష్టిని ఆక్రమించింది. గత సంవత్సర కాలంగా జి20 దేశాల మధ్య అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కావటం లేదు. తాజాగా జరిగిన సియోల్‌ శిఖరాగ్ర సదస్సు కూడా వైఫల్యంతోనే ముగిసింది. వీటన్నింటికీ మూలం అమెరికా, చైనాల మధ్య కరెన్సీ విలువ గురించిన వైరు ధ్యమే. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొత్త సమస్య కరెన్సీ యుద్ధాలు అని ప్రకటించటం ద్వారా ఈ అంశం రాజకీయ ఆర్థిక చర్చల్లో కీలక స్థానం ఆక్రమించింది.

కరెన్సీ యుద్ధం అంటే ఏమిటి ?

అంతర్జాతీయ వాణిజ్యం అనేది అంతర్జా తీయ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం. ఈ వాణి జ్యంలో ఏ దేశమైనా తన ఉత్పత్తులు అమ్ము కోవాలంటే అనేక మార్గాలు అవలంబిస్తుంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులు తయారు చేయటం మొదలు సరుకులు ఎగుమతి చేయటం, పెట్టుబడులు ఎగుమతి చేయటం వంటి అనేక మార్గాలు అమల్లో ఉంటాయి. పెట్టుబడులు తరలించి వస్తువులు, సేవలు దిగుమతి చేసుకుంటే దాన్ని ఔట్‌సోర్సింగ్‌ అంటున్నాము. దానికి బదులు వస్తువులు సేవలు ఎగుమతిచేయాలంటే ఆ దేశపు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా ఉండాలి. అపుడే అమ్ముడవుతాయి. ఉత్పత్తయ్యే వస్తువులు, సేవల విలువ తక్కువగా ఉండాలంటే ప్రభు త్వాలు ఉత్పత్తికి కీలకమైన పెట్టుబడి, శ్రమ శక్తి విలువ తగ్గించాలి. పన్నుల రాయితీలు, ప్రభుత్వమే మౌలిక వసతుల రంగాన్ని నిర్మించి సిద్ధం చేసి ఉంచటం, బడ్జెట్‌ ప్రతిపాదనల్లో టాక్స్‌ హాలిడేస్‌ వంటి రూపాల్లో పెట్టుబడి విలువ తగ్గించవచ్చు. దేశీయంగా శ్రమశక్తి విలువ తగ్గించాలంటే ఏకైక మార్గం సంక్షేమ ఆర్థిక విధానాలు అవలంబించటమే. తద్వారా శ్రమశక్తి పునరుత్పత్తికి అవసరమైన వ్యయాన్ని తగ్గించ వచ్చు. నయాదారవాద సిద్ధాంతాలు తలకెక్కిన ప్రభుత్వాలు దీనికి సిద్ధపడవు. మరో మార్గం అంతర్జాతీయ వాణిజ్య సాధనంగా ఉన్న కరెన్సీ విలువను తగ్గించుకోవటం. అంతర్జా తీయ కరెన్సీ మార్కెట్‌ పరస్పరాధారితం. అంత ర్జాతీయ రిజర్వు కరెన్సీ హౌదా కలిగిన కరెన్సీతోపాటు అటువంటి హౌదా లేని కరెన్సీల మధ్య సంబంధాలు పరస్పరం విలోమాను పాతంలో ఉంటాయి. అంటే రిజర్వు కరెన్సీ విలువ పెరిగితే మిగిలిన కరెన్సీల విలువ తగ్గు తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కరెన్సీల మధ్య సంబంధాలు ఆయా దేశాల ఆర్థిక ద్రవ్య విధా నాల నేపథ్యంలో నిర్దిష్ట నిష్పత్తిని పాటిస్తున్నపుడే మార్కెట్‌ సమతూకం కొనసాగుతుంది. అలాకాక ఏవైనా కొన్ని దేశాలు కృత్రిమ చర్యల ద్వారా తమ కరెన్సీ విలువలను అంతర్జాతీయ మార్కెట్‌ లో తక్కువ చేసి ఉంచటానికి పోటీ పడితే అంత ర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో సమతౌల్యం దెబ్బ తింటుంది. ఇటువంటి పరిస్థితిని కరెన్సీ యుద్ధా లు అంటారు.

ఎందువల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది?

ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా జాతీయంగా అంతర్జాతీయంగా రాణించాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవటంతో పాటు విదేశీ వాణి జ్యంలో ఆధిపత్య స్థానం కలిగి ఉండాలి. వాణి జ్యంలో ఆధిపత్య స్థానం ఉండాలంటే ఉత్పత్తి లోనూ అదే ధోరణితో ఉండాలి. ఉత్పత్తికి అవ సరమైన రెండు కీలక సాధనాలు పెట్టుబడి, శ్రమశక్తికి చేతి నిండా పని కల్పించగల స్థాయి లో ఉండాలి. అదేసమయంలో మిగిలిన దేశాల ఉత్పత్తులతో విలువలోనూ, నాణ్యత లోనూ పోటీ పడి మార్కెట్‌ స్థానాన్ని నిలుపుకోగలిగి ఉండాలి. ఏ దేశంలోనైనా పెట్టుబడిని ఉత్పత్తికి వినియోగించడం లేదు అంటే పెట్టుబడికి తగిన లాభం రావట్లేదని అర్థం. అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రూపాంతరం చెంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు,(ఎఫ్‌డిఐ) సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) దాతృత్వపు పెట్టుబడులు ( యుఎస్‌ ఎయిడ్స్‌, డిఎఫ్‌ఐడి, జపాన్‌ సహకార బ్యాంకు వంటివి) రూపంలో మిగిలిన దేశాలకు వలస వెళ్తాయి. శ్రమశక్తిని ఆ విధంగా ఎగుమతి చేయ టం సాధ్యం కాదు కనుక దేశీయంగానే ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో పెద్దఎత్తున మార్కెట్‌ను కబ్జా చేయటం ద్వారా భారీ ఉత్పత్తితో ఉత్పత్తులకయ్యే ఖర్చు పాక్షికంగా తగ్గించుకోవచ్చు. దేశీయంగా జరిగే ఈ పరిణామాన్ని ఉత్పాదక పెరుగుదల అంటారు. శ్రమశక్తికి విలువ తగ్గించటం ఉత్పాదక పెంచటంలో అనివార్యమైన అంత ర్భాగం. సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెంచటం ద్వారా, ఉత్పత్తిని ముక్కలు ముక్కలు చేసి అసంఘటిత రంగానికి బదిలీ చేయటం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఈ ప్రక్రియకు కూడా పరిమితులు ఉంటాయని తాజా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం రుజువు చేస్తోంది.

దేశీయంగా ఉన్న ఈ సాధనాల నిడివి పరిమితం అయినది. ఒకదశ తర్వాత పునరు త్పత్తి స్థాయికంటే దిగువన వేతన మార్కెట్‌ను కొనసాగించటం సాధ్యం కాదు. అటువంటప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత వాటా కోసం దేశాలు పాకులాడతాయి.1940 దశకా నికి ముందు ఇటువంటి పాకులాటలు యుద్ధా లతో ముగిసేవి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇటువంటి పోటీ తలెత్తితే యుద్ధం ద్వారా పరిష్కరించుకున్న సామ్రాజ్యవాద దేశా లు ఈ యుద్ధంలో వచ్చిన అనుభవాలతో గత ఐదు దశాబ్దాలుగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో పోటీని పరిష్కరించుకుంటున్నాయి. ఈ ప్రయ త్నాల సారాంశం తన ఆధిపత్యాన్ని కాపాడు కోవటం, ఆధిపత్యానికి మూలమైన రాజకీయ పట్టును నిలిపి ఉంచుకునేందుకు అవసరమైన ఉపాధి కల్పన, జీవన ప్రమాణాలు పెంచటమే. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటువంటి ఇచ్చి పుచ్చుకునే ఒప్పందాలకు ముఖ్యమైన వేదికగా ఆవిర్భవించింది. ఈ కాలంలోనే వస్తూత్పత్తి రంగం తన పునాదిని ఒకదేశం నుండి మరో దేశానికి బదిలీ చేయటంతో పాటు ఒకప్పుడు బలమైన ఉత్పాదక వ్యవస్థలు కలిగిన దేశాలు నేడు ప్రధాన దిగుమతి దారులుగా మారటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన వ్యవస్థాగత మార్పులు, మారుతున్న భౌగోళిక కేంద్రీకరణకు తెరతీశాయి. దాంతో రెండో ప్రపంచయుద్ధకాలం వరకూ ప్రధాన దిగుమతి దారులుగా ఉన్న ఆసియా దేశాలు గత మూడు దశాబ్దాలుగా ఎగుమతి మార్కెట్‌లో కీలక స్థానంలోకి ప్రవేశించాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశం అనుభవించే నష్టాలు కష్టాలు మరో దేశానికి లాభాలు వరాలుగా మారతాయి. ఈ మార్పుల్లో భాగంగా నేడు సంపన్న దేశాలుగా చెప్పబడుతున్న మాజీ సామ్రాజ్యవాద దేశాలకు పరిమితమైన ఉత్పాదక శక్తుల అభివృద్ధి, 60 దశకం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పుంజుకోవటం, మహా మాంద్యం నేపథ్యంలో అమెరికా అనుసరించిన సంక్షేమ విధానాలు చరమాంకానికి చేరటం వంటి పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎవరు కీలకమైన ఎగుమతి దారులుగా ఉంటారో ఆ దేశం మిగిలిన దేశాలు అనుసరించాల్సిన ఆర్థిక విధానాలను ప్రత్యక్షం గానో, పరోక్షంగానో నిర్దేశించటం ఆనవాయితీగా వస్తోంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధా నాల రూపంలో మనం ఈ మార్పులు చూస్తు న్నాము. అంతర్జాతీయంగా ఈ పరిణామాలు చోటుచేసుకునే సమయంలో దేశీయంగా పరిణామాలు ప్రతికూల ప్రభావాలు చూపి స్తాయి. అదేవిధమైన పరిస్థితిని నేడు అమెరికా ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు వస్తువులు, సేవలు, సాంకేతిక పరిజ్ఞా నం,పెట్టుబడులు ఎగుమతి చేసిన అమెరికా నేడు వస్తువులు సేవల విషయంలో ప్రధాన దిగుమతి దారుగా మారింది. దాంతో పాటే ఆ దేశ ఉత్పత్తి వ్యవస్థలు చితికిపోయాయి. లక్షల కోట్ల డాలర్ల అదనపు పెట్టుబడులు కంపెనీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. అయినా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ యజమానులు సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తన స్థానాన్ని కోల్పో తే తప్ప అమెరికా వాటా పెరగదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఉన్న ఫళంగా చితికిపోయిన ఉత్పాదక వ్యవస్థలను దారికి తేవటం సాధ్యం కాని పని. దాంతో కరెన్సీ విలువను తారు మారు చేయటం ద్వారా తన పూర్వపు స్థానాన్ని సంపా దించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందువల్లనే కీలకమైన దేశాల మధ్య కరెన్సీ యుద్ధాలు చోటుచేసుకునే పరిస్థితి వచ్చింది. అమెరికా వాణిజ్యంలో తన వాటా పెంచు కోవాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లో కీలకమైన వాటాదారులు తమ దేశాల మారక ద్రవ్యం విలువ పెంచటం ద్వారా తమ ఉత్పత్తుల విలువ కృత్రిమంగా పెంచాలి. అలా చేయటం ఆయా దేశాల్లో ఉత్పాదక వ్యవస్థలపై ప్రతికూల ప్రభా వం చూపించనుంది. నిరుద్యోగం పెరగటం, అది రాజకీయ అస్థిరతకు దారితీయటం వంటి సమాంతర ధోరణులుకూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అందువల్లనే మిగలిన దేశాలు అమెరికా ప్రతిపాదించిన ఈ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీన్నే కరెన్సీ యుద్ధమని ఆర్థిక వేత్తలు ప్రకటిస్తున్నారు.

చరిత్ర ఏమి చెప్తోంది?

పెట్టుబడిదారీ విధానం వాణిజ్య పెట్టుబడి దారీ విధానం నుండి సంపూర్ణ పెట్టుబడిదారీ విధానంగా పరిణామం చెందే క్రమంలో ఆధి పత్యం కలిగిన దేశాల అవసరాలకు అనుగు ణంగా కరెన్సీ విలువలు నిర్ధారితమయ్యేవి. 18వ శతాబ్దం వరకూ దేశాల మధ్య జరిగే వాణిజ్యం విలువ నామమాత్రంగానే ఉండేది. దాంతో కరెన్సీ మారకం విలువలు అప్పట్లో సమస్యగా కనిపించలేదు. 19వ శతాబ్దంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధాల సమ యంలో ఫ్రెంచి కరెన్సీ విలువను ఉద్దేశ్యపూర్వ కంగా తగ్గించినట్లు ఆర్థిక చరిత్రకారులు స్పష్టం చేశారు. పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్య వాదం స్థాయికి చేరుకుని, నేటి వర్ధమాన దేశాలను వలసలుగా మార్చుకున్న కాలంలో తమ వాణిజ్యోత్పత్తుల మార్కెట్‌ కోసం పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీ కరెన్సీ విలువల తారుమారు స్థాయికి చేరుకోలేదు. వలసపాలన దశలో మార్కెట్‌ ఆధిపత్యం సాధించే మర్గాలు వేరుగా ఉండేవి. భారతదేశంలో ఫ్రెంచి, డచ్‌, బ్రిటిష్‌ కంపెనీల మధ్య జరిగిన ఘర్షణల చరిత్ర ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. వలస పాలన కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వ వాణిజ్య, రాజకీయ అవసరాల మేరకు భారతదేశ రూపాయి విలువ ఉండాలని కీన్స్‌ ప్రతిపాదిస్తే అంబేద్కర్‌ దీనికి భిన్నమైన ప్రతిపాదనలు చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ దఫ దఫాలుగా పౌండ్‌ మారకం రేటును మార్చటం, చివరకు బంగారం రిజర్వు కరెన్సీగా అంగీకరించకపోవటంతో తొలిసారిగా బహుళ కరెన్సీలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకే సమ యంలో వేర్వేరు నిర్దిష్ట విలువలతో చలామణి అయ్యేందుకు అవకాశం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ, బ్రిటన్‌లు మరోసారి బంగారాన్ని రిజర్వు కరెన్సీగా అంగీక రించబోమని ప్రకటించాయి. ప్రత్యేకించి 1929 నాటి మహామాంద్యం అంతర్జాతీయ ఆర్థిక వ్యవ స్థలో కరెన్సీ విలువల ప్రాధాన్యతను పెంచింది. పైనచెప్పుకున్నట్లు ఆర్థిక వ్యవస్థల్లోని మిగిలిన సాధనాలు విఫలమైనప్పుడు ఆర్థిక పరిశోధకులు ఈ అంశంపై దృష్టి సారించారు. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో ఈ సాధనం ప్రయోజనకరమైనదిగా మారటంతో ప్రభుత్వాలు తక్షణమే స్వంతం చేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన నష్టాలను పూడ్చుకుని వలసలకు ఎగుమతులు ముమ్మరం చేసేందుకు బ్రిటన్‌ పౌండ్‌ విలువ తగ్గించింది. మహా మాంద్యం కాలంలో అన్ని దేశాల్లో నిరుద్యోగం, ఉత్పత్తి పతనం, లాభాల పతనం వంటి పరిణామాలు చోటు చేసుకు న్నాయి. దాంతో ఏ దేశానికి ఆ దేశం ఈ సమస్యల నుండి బయటపడటానికి అంతర్జాతీయ మార్కెట్‌లో తమ దేశంలో ఉత్పత్తి అయ్యే మరిన్ని సరుకులను కుమ్మరించటమే పరిష్కారమనీ, అందుకు కరెన్సీ విలువ తగ్గించటం సాధనమన్న నిర్ధారణకు వచ్చాయి. జర్మనీలో నెలకొన్న ఆర్థిక స్తబ్దత నుండి బయట పడి, పెరుగుతున్న నిరుద్యోగాన్ని పరిష్కరించుకునేందుకు జర్మనీ మార్క్‌ విలువలో కోత విధించింది. తద్వారా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ, ఇంగ్లాండ్‌లలో పారిశ్రామికోత్పత్తి రేటు పెరిగిం దని చరిత్ర చెప్తోంది.

రెండు ప్రపంచ యుద్ధాల నడుమగల కాలంలో బ్రిటన్‌ అనుసరించిన పద్ధతినే నేడు అమెరికా అనుసరించబూనుకొంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి కాలంలో యూరోపి యన్‌ ఆర్థిక వ్యవస్థ యుద్ధ పదఘట్టనల నడుమ చచ్చుపడి పోయింది. దాంతో సత్వరం కోలుకోవ టానికి అవసరమైన వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసే సామర్థ్యం దానికి లేకపోయింది. దాంతో తక్కువ నష్టంతో బయటపడ్ద అమెరికా ఈ బాధ్యత నెత్తిన వేసుకుంది. ఒకవైపు యూరో పియన్‌ మార్కెట్‌కు అవరసరమైన వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేయటంతోపాటు దీర్ఘకాలంలో పెట్టుబడులు ఎగుమతి చేయటం ద్వారా అమెరికాలో ఉపాధి అవకాశాలు విపరీ తంగా పెంచుకోగలిగింది. ఈ సమయంలో మిగిలిన దేశాలు తమ దేశాల కరెన్సీ విలువ లను తారుమారు చేయకుండా చూసేందుకు బ్రెటన్‌వుడ్స్‌ యంత్రాంగం కీలక సాధనంగా పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో తెరమీదకు వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి అమెరికాలోని బ్రెటన్‌ వుడ్స్‌లో జరిగిన సమావేశం పునాదులు వేయ టంతో ఈ వ్యవస్థను బ్రెటన్‌ వుడ్స్‌ యంత్రాంగం అంటున్నారు. యుద్ధంలో చితికిపోయిన వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించటానికి ప్రపంచ బ్యాంకూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ లో కరెన్సీ నిల్వలు, రిజర్వు కరెన్సీ, వాణిజ్యం వంటి విషయాలు పర్యవేక్షించటానికి అంతర్జా తీయ ద్రవ్య నిధి సంస్థా ఈ బ్రెటన్‌ వుడ్స్‌ పునాదులపై పుట్టుకొచ్చినవే. ఈ యంత్రాంగం ఏ దేశ ద్రవ్యానికి ఎంత మారకం రేటు ఉండాలన్న విషయాన్ని నిర్ధారించి అన్ని దేశాల కరెన్సీలను బంగారం విలువతో ముడిపెట్టారు. ఈ వ్యవస్థ రెండున్నర దశాబ్దాల పాటు సజా వుగానే పనిచేసింది.

ఈ కాలంలో వివిధ దేశాలు తమ కరెన్సీ విలువలను వివిధ స్థాయిల్లో తగ్గించినా అన్ని దేశాలూ సామూహికంగా ఈ పనికి పాల్పడ లేదు. ఒక దేశం ఈ నిర్ణయం తీసుకున్నపుడు మిగిలిన దేశాలు సమర్థిస్తూ వచ్చాయి. ఎక్కువ సందర్భాల్లో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థల సమతౌల్యం కాపాడే బాధ్యత నెత్తిన వేసుకున్న ఐఎంఎఫ్‌ ఆదేశాలతోనే దేశాల కరెన్సీ విలువలు తగ్గాయి. భారతదేశమే దీనికి ఉదాహరణ. 1982-83లో తొలిసారి ఐఎంఎఫ్‌ వద్ద అప్పు కు వెళ్లినపుడు డాలర్‌తో పోల్చి రూపాయి మారకం విలువ తగ్గింది. తర్వాత 1991లో మరో దఫా అప్పుకు వెళ్లినపుడు కూడా ఇదే పరిణామం చోటుచేసుకుంది. 1989 నాటికి డాలరు విలువ సుమారు 17 రూపాయలు ఉంటే 1991 నాటికి అది 35 రూపాయలకు చేరింది. 1970 దశకం నాటికి ప్రపంచ వ్యాప్తం గా ఉత్పాదక వ్యవస్థలు నిర్ణీత స్థాయికి చేరాయి. దాంతో అమెరికా సరుకులతో పాటు మిగిలిన దేశాల సరుకుల అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడే స్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి బయట పడి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి నిక్సన్‌ హయాంలో డాలరు-బంగారం విలువల మధ్య సమతౌల్యాన్ని తారుమారు చేసింది అమెరికా. అప్పట్లో సోషలిష్టు దేశాలతో జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో సామ్రాజ్యవాద శిబిరానికి అమెరికా నాయకత్వం వహిస్తూండటంతో మిగి లిన దేశాలు అయిష్టంగానే అయినా ఈ తారు మారు ప్రక్రియను అంగీకరించి బంగారం స్థానం లో అనధికారికంగా డాలరును అంతర్జాతీయ రిజుర్వు ద్రవ్యంగా గుర్తించాయి. ఈ రకంగా సామ్రాజ్యవాద శిబిరానికి రాజకీయ నాయకుడు గా ఉన్న అమెరికా, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ను కూడా డాలర్‌ నాయకత్వంలో ముందుకు నడిపించేందుకు నడుం కట్టింది. అయితే అదే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ పరిస్థితులు తలకిందులయ్యాయి. డాలర్‌ ఆధిపత్యం అట్టే కాలం నిలిచే సూచనలు కనిపిం చటం లేదు.

కరెన్సీ విలువలను మార్కెట్‌ నిర్ధారిస్తుందన్న సూత్రం 70 దశకం నుండీ ఐఎంఫ్‌ షరతుల్లో అనివార్యమైన అంతర్భాగమైంది. ఈ సూత్రం మేరకు ప్రభుత్వాలు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ జాతీయ కరెన్సీ విలువల విషయంలో జోక్యం చేసుకోవటం మానేశాయి. దాంతో ఎగుమతులు ఎక్కువగా జరిగినపుడు విదేశీ మారక ద్రవ్యం నిల్వలలు పేరుకుపోవటం, దేశీ య కరెన్సీ విలువ పెరగటం, తర్వాత ఎగుమ తులు పడిపోవటం వంటి పరిణామాలు క్రమాను గతంగా చోటుచేసుకుంటూ వచ్చాయి. 1997 ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం తర్వాత జాతీ య కరెన్సీ విలువలను మార్కెట్‌ నిర్దేశిస్తుందన్న సూత్రంపై ప్రభుత్వాలు విశ్వాసం కోల్పోయాయి. దాంతో ఏ దేశానికి ఆ దేశం తగిన స్థాయిలో మారకద్రవ్యం నిల్వలు పోగేసుకోవటం ప్రారం భించాయి. తూర్పు ఆసియా దేశాలు, మరికొన్ని ముఖ్యమైన దేశాలు క్రమంగా డాలర్‌ విలువతో తెగతెంపులు చేసుకుని ప్రత్యామ్నాయ కరెన్సీలతో తమ విలువలు ముడి పెట్టుకోనారంభించాయి. ఈ క్రమంలోనే చైనా తన విదేశీ మారకద్రవ్యం నిల్వలలను డాలర్లతో పాటు బ్రెజిల్‌ కరెన్సీ, యూరోలలో కూడా పెట్టుబడులు పెట్టటంతో పాటు డాలర్‌ నిల్వలతోనే ఆఫ్రికా వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ఆర్థిక వ్యవ స్థపై ప్రపంచీకరణ ద్వారా వచ్చిన డాలర్‌ ఆధి పత్యానికి స్వస్తి చెప్పింది. యూరప్‌లో అమెరి కాకు బంటుగా ఉన్న బ్రిటన్‌ స్థానంలో స్వతంత్ర శక్తిగా ఆధిపత్య స్థానం కోసం చూస్తున్న జర్మనీ ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదిగింది. వర్ధమాన దేశాల్లో కొరియా, బ్రెజిల్‌ వంటి దేశాలు అంతర్జా తీయ వాణిజ్యంలో తమకున్న ప్రయోజనాల రీత్యా కేవలం డాలరుపై ఆధారపడటానికి సిద్ధం గా లేవు. ఈ సమయంలో నిక్సన్‌ తరహాలో డాలర్‌ విలువను తారుమారు చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. 1930-36 నాటి అనుభవాలు గమనంలోకి తీసుకుంటే నేటి కరెన్సీ యుద్ధాలకూ, నాటి కరెన్సీ యుద్ధానికీ మధ్య కొన్ని మౌలిక వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటిది నాడు అంతర్జాతీయ ఎగుమతిదారులకు జరగ నున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు మెరుగైన బీమా సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలకు అనుగుణ మైన అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌ అభివృద్ధి చెంది ఉంది. నాడు సంపన్న దేశాలైన అమె రికా, బ్రిటన్‌, జర్మనీలు కరెన్సీ విలువల తగ్గింపు వల్ల నష్టపోతే నేడు చైనా, బ్రెజిల్‌, భారతదేశం వంటి శక్తివంతమవుతున్న దేశాలు (ఎమర్జింగ్‌ కంట్రీస్‌) భారీగా నష్టపోనున్నాయి.

తాజా చర్చ

రెండో ప్రపంచయుద్ధం తర్వాత కరెన్సీ సమస్యపై ప్రధానమైన దేశాల మధ్య ఇంత స్థాయిలో వివాదం నెలకొనటం ఇదే మొదటి సారి. ఈ వివాదానికి పునాదులు 2008లో మొదలైన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సంక్షో భంలో ఉన్నాయి. పైన ఉదహరించుకున్నట్లు ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా ఆర్థిక శక్తి క్షీణించింది. గత దశాబ్దకాలంగా దాచుకుంటూ వచ్చిన ఆనేక బలహీనతలు తాజా సంక్షోభంతో బట్టబయలు అయ్యాయి. ఒక్క అమెరికాలోనే నిరుద్యోగం పది శాతానికి చేరుకొంది. యూరోపి యన్‌ యూనియన్‌ సంఘటితమవుతున్న కొద్దీ గతంలో లాగా అమెరికా ఉత్పత్తులు యూరప్‌ మార్కెట్‌ను ముంచెత్తలేకపోతున్నాయి. దానికి తోడు యూరప్‌లో ఐర్లాండ్‌, స్పెయిన్‌, గ్రీస్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు ఎదుర్కొంటున్న సార్వ భౌమత్వ రుణసంక్షోభం (సావరిన్‌ డెట్‌ క్రైసిస్‌)తో జర్మనీ నాయకత్వంలో పలు దేశాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహజంగానే ఆయా దేశాల మార్కెట్లను జర్మనీ తన ఉత్పత్తులతో నింపటానికి ఏర్పాట్లు చేసుకొంటోంది. మరో వైపున జపాన్‌ ఆర్థిక పరిస్థితి యథాతథంగా మాంద్యోల్బణంతో ఈడికగా సాగుతోంది. గతం లో ఎగుమతి మార్కెట్‌లో జపాన్‌ ఆక్రమించిన వాటాను కొరియా, ఇండొనేషియా, సింగపూర్‌ వంటి దేశాలు ఆక్రమించాయి. పెట్టుబడికి పడిపోతున్న లాభాల రేటు కాపాడుకోవటానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తి స్థావరంగా చైనా మారిం ది. ఈ పరిస్థితుల్లో ఉన్నఫళంగా అమెరికా అవసరాలకు అనుగుణంగా మిగిలిన దేశాలు తమ జాతీయ ద్రవ్యం విలువను తగ్గించు కోవాలన్న డిమాండ్‌ అసమంజసం. ఆచరణ సాధ్యం కానిది కూడా. ఈ డిమాండ్‌ను బలవం తంగా ఆయా దేశాల నెత్తిన రుద్దే శక్తి అమెరికాకు ప్రస్తుతం లేదు. అందువల్లనే సియోల్‌ జి20 సదస్సుకు ముందు అదనంగా 600 శతకోటి (బిలియన్‌) డాలర్లు అచ్చు వేసి మార్కెట్‌లోకి వదులుతామని ప్రకటించిన అమెరికా ప్రస్తుతానికి ఆపని వాయిదా వేసింది.

పర్యవసానాలు

కరెన్సీ యుద్ధాల పర్యవసానాల గురించి చెప్పుకునే ముందు 1931-36 మధ్య కాలంలో జరిగిన కరెన్సీ విలువల తగ్గింపు పర్యవసానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అప్పట్లో ద్రవ్యోత్పత్తుల మార్కెట్‌ నేడున్న స్థాయిలో విస్తరించి లేదు. అంతేకాక అప్పట్లో బంగారం రిజర్వు ద్రవ్యంగా చలామణి అవుతోంది. దాంతో తమ తమ దేశాల్లోని బంగారం నిల్వలు పెంచుకునేందుకు, దాంతో పాటు దేశీయ కరెన్సీ విలువలు తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిం చాయి. దాంతో దేశీయ ఆర్థికవ్యవస్థల్లో ద్రవ్య సరఫరా పెరిగింది. అంతర్జాతీయంగా బంగా రం విలువలో అట్టే మార్పు లేదు కనుక దీని ప్రభావం అంతర్జాతీయ వస్తూత్పత్తిరంగంపై లేదు. ఆంతరంగిక శక్తి సామర్థ్యాలు ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ద్రవ్య సరఫరా పెరగటం ద్వారా అదనంగా మార్కెట్‌లోకి వచ్చిన నిధులను ఉపయోగించుకుని ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకున్నాయి. మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరగటం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావం పెరిగినా యుద్ధ అవసరాలు, యుద్ధానంతరం నెలకొన్న ప్రత్యేక రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనుసరించిన వేతనవిధానాలు, సంక్షేమ చర్యలు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అదుపు చేయటానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలతో వచ్చే విపరీతాలను ఎదుర్కోవటానికి కావల్సిన రంగం సిద్ధమైంది. అంతేకాదు. అప్పట్లో వడ్డీ రేట్లు సున్నా కంటే ఎక్కువగానే ఉన్నాయి. వడ్డీ రేట్లలో కొద్ది పాటి దిగువముఖంగా సడలింపు ద్వారా మార్కెట్‌లో నిధులు పెంచే అవకాశం ఉండేది. నేడు ఈ మూడు లక్షణాలకు సంబంధించి పరిస్థితులు మారిపోయాయి. ముందుగా వడ్డీ రేట్ల పరిస్థితి చూద్దాం.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానం ఆక్రమించిన జపాన్‌, అమెరికాల్లో వడ్డీ రేట్లు సున్నాకు చేరిపోయాయి. ఇంతకంటే తగ్గించటం మరిన్ని దుష్ఫలితాలకు దారితీయ నుంది. రెండో అంశం రిజర్వు కరెన్సీ, దాని విలువ. 70 దశకంనాటి సంక్షోభం నేపథ్యంలో క్రమంగా అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థల మధ్య సంతులనం దెబ్బతింది. ప్రపంచీకరణ విధా నాల నేపథ్యంలో ఇది మరింత కృశించిపో యింది. నేడు డాలర్‌కున్న రిజర్వు కరెన్సీ హౌదా అనధికారికమైనదే తప్ప అధికారికమైనది కాదు. 1997 ఆసియా సంక్షోభం, 1999 రష్యా బాండ్ల సంక్షోభం, 2000-2004 మధ్య లాటిన్‌ అమెరికా దేశాల సంక్షోభాల తర్వాతి కాలంలో పలు దేశాలు రిజర్వు కరెన్సీగా డాలరును ఆమోదించే స్థితిలో లేవు. కేవలం నాలుగు దశాబ్దాల్లోనే తాను అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ బాధ్యతలు నిర్వహించలేనని డాలర్‌ తేల్చేసింది. నేడు డాలర్‌ విలువే తగ్గుముఖం పట్టింది. ఇక వినూత్న ద్రవ్యోత్పత్తుల మార్కెట్‌ పరిస్థితి. నాడున్న పరిస్థితుల్లో నిజ ఆర్థిక వ్యవస్థ పునాదిగా తెరమీదకు వచ్చిన ఫ్యూచర్స్‌, ఫార్వార్డ్‌ ట్రేడింగ్‌ తప్ప నేడు మనం చూస్తున్న విన్నూత్న ద్రవ్యోత్పత్తులు లేవు. నేటి పరిస్థితి దానికి భిన్నమైనది. ప్రాథమిక సరుకులు, కమోడిటీస్‌ ఫ్యూచర్స్‌ మాత్రమే కాదు. తనఖా ఆస్తులు, ఒకటి నుండి పది దొంతరల నడుమ పేరుకుపోయి, విస్తరించిన తనఖా పెట్టబడిన రుణాలపై ఒప్పం దాలు వంటివి అనేకం ఉన్నాయి. తాజాగా సూక్ష్మ రుణ సంస్థల పోర్ట్‌ఫోలియోలను కూడా ఈ విధమైన దొంతరలతో ద్రవ్య ఉత్పత్తులుగా మార్చేందుకు రేటింగ్‌ సంస్థలు సిద్ధమవు తున్నా యి. ఈ పరిస్థితుల్లో ద్రవ్య మార్కెట్‌ దాహాన్ని తీర్చటానికి ఎన్ని నిధులైనా సరిపోవు. ఉత్పత్తి రంగ అవసరాల గురించిన ప్రస్తావనే నేటి పరిస్థితుల్లో రాదు. మరోవైపున వస్తూత్పత్తి రంగం పాత్ర కృశించుకుపోతోంది. ఉపాధి అవకాశాల కల్పన ఎండమావిగా మారింది. మార్కెట్‌లో ద్రవ్య సరఫరా ఉపాధి కల్పనకు ప్రమాణం అనుకుంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల డాలర్ల మేర నిల్వలు అమెరికా కంపెనీల ఖాతాల్లో ఉన్నాయి. ఈ నిధులు ఉత్పత్తి మార్కెట్‌ లోకి వచ్చే సూచనలు మచ్చుకైనా కనిపించటం లేదు. అటువంటప్పుడు పరిమాణాత్మక సడ లింపు, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌కు పాల్పడకపోతే తమ ఆర్థిక వ్యవస్థల్లో ఉపాధి అవకాశాలు పెంచలేమన్న అమెరికా, బ్రిటన్‌ వాదనలు అర్థం లేనివి.

నూతన పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ విలువల తారుమారు మరో కొత్త ప్రమాదాన్ని ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అదే కరెన్సీ బదిలీ వ్యాపారం - క్యారీ ట్రేడ్‌. అంటే ద్రవ్య మార్కెట్‌ శక్తులు సున్నా వడ్డీకి అమెరికాలో అప్పులు తీసుకుని భారతదేశంలో 7-8 శాతం వడ్డీకి తిరిగి అప్పులిస్తాయి. ఇది భారతదేశంలో బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే తక్కువ కాబట్టి మన పారిశ్రామిక సంస్థలు విదేశీ వాణిజ్య రుణాలు ఎక్స్టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ రూపంలో అప్పులు తీసుకుంటాయి. ఆ విధంగా కూడా దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయి. ఒకవైపున పెరుగుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు, మరోవైపున దేశీయ కరెన్సీకి అంటే రూపాయికి తగ్గుతున్న గిరాకీ నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువలు మరింత పడిపోతాయి. ఇదే తరహాలో ఉత్పత్తి రంగానికి వెళ్లని నిధులతో కరెన్సీ ఫ్యూచర్స్‌, ఇతర అనేక రకాలైన డెరివేటివ్‌, బదలాయింపు వాణిజ్యాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఇవన్నీ గాలివాటు పెట్టుబడుల్లో అంతర్భాగమే. ఉత్పత్తి అవసరాలు, వినియోగం అవసరాల ఆధారంగా ఉపయోగానికి వచ్చే పెట్టుబడులు కావు. బొమ్మా బొరుసూ, జూదం వంటి ఆటల్లో పెట్టుబడులు పెరుగుతాయి. వీటివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరతకు లోనవుతుంది.

తక్షణ పరిష్కారాలు

పైన చెప్పుకున్న విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే దేశీయంగా పెట్టుబడికి డిమాండ్‌ కల్పించే మార్గాలు వెతకాలి. అదేసమయంలో అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వ్యవస్థకు అక్కరకురాని పెట్టుబడి కార్యకలాపాలు, స్పెకుల్యలేటివ్‌ పెట్టుబడుల చలనాన్ని నియం త్రించే చర్యలు చేపట్టాలి. భారతదేశంలో ప్రతి పాదించిన సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ పన్ను, పశ్చిమ దేశాల ఆర్థికవేత్తల్లో కొందరు ప్రతిపాదించినట్లు టోబిన్‌ పన్ను వంటివి రెండో కోణం కిందకు వస్తాయి. అంతేకాదు, టాక్స్‌ హెవెన్స్‌లను అంతర్జాతీయ మనీలాండరింగ్‌ చట్టాల పరిధి లోకి తీసుకురావటం, ఫోర్బ్స్‌ ప్రకటించే టాప్‌ 500 కంపెనీలకు సంబంధించి లాభాల విని యోగంపై సామాజిక నియంత్రణలు వంటి వినూత్న చర్యలు గురించి ఆలోచించాలి. ఇక దేశీయంగా పెట్టుబడికి డిమాండ్‌ కల్పించటం అంటే ఆయా దేశాల్లో ఉత్పాదక రంగ పునాదిని విస్తరించటం. ఈ దిశగా నామమాత్రపు వడ్డీలకు సాంకేతికపరిజ్ఞానం, ఇతర రూపాల్లో పరిశ్రమల ఆధునీకరణకు అకాశం కల్పించాలి. ప్రత్యేకించి ప్రపంచం పర్యావరణ ముప్పును ఎదుర్కొంటోంది. అందువల్ల ఇంధన వనరులు పొదుపు చేసుకునే విధంగా ప్రత్యామ్నాయ ఉత్పత్తి ప్రక్రియల గురించి పరిశోధనలకు, భూమి పై హరితం పెంచేందుకు అవసరమైన పెట్టు బడులు సమకూర్చవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా శ్రమశక్తికి విలువ పెంచాలి. సార్వత్రిక సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు నేరుగా కార్మికుల చేతికి వచ్చే ఆదాయం పెరిగేలా వేతనాలు పెంచాలి. భవిష్యత్తు లాభాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు జస్టేషన్‌ పీరియడ్‌ ఎక్కువగా ఉండే రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారో అదేవిధంగా మానవాభివృద్ధి విషయంలో కూడా అదేవిధమైన పెట్టుబడులు పెట్టాలి. తద్వారా దేశంలో అదనంగా ఉన్న ద్రవ్యసరఫరాను సద్వినియోగం చేసుకోవటంతో పాటు దుర్వినియోగం కాకుండా చూడవచ్చు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరెన్సీ యుద్ధాల పరిస్థితికి చేరుకోవటం వెనక ముఖ్యమైన కారణం అంతర్జాతీయ వాణిజ్యం తగ్గిపోవటం. తాజా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం 12 శాతం పడిపోయిందని అంచనా. పరిమి తమైన మార్కెట్‌లో ఎవరి ఉత్పత్తులు వారు అమ్ముకోవటానికి అనేక మార్గాలు అనుసరిస్తు న్నారు. సంపన్న దేశాలు అనుసరించే కరెన్సీ విలువ తగ్గింపు అందులో ఒక సాధనం. అందు వల్ల పైన పేర్కొన్న ప్రత్యామ్నాయ చర్యల ద్వారా అంతర్జాతీయ డిమాండ్‌ పెంచవచ్చు. తద్వారా అసలు కరెన్సీ యుద్ధాలకు దారితీసే పరిస్థితులే లేకుండా చేయవచ్చు. ఇవీ, ఇంకా ఇటువంటి అనేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంలో విఫలమైతే 1930 నాటి పరిస్థితుల్లో ప్రపంచం ముందుకొచ్చినట్లు తొలుత వాణిజ్య ఉద్రిక్తలు, తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఉద్రిక్తతలు ఆయా స్థలకాల పరిస్థితులను బట్టి ఏ రూపం అయినా తీసుకోవచ్చు.

కె. వీరయ్య

No comments: