Tuesday, September 28, 2010

దారి మళ్లిన ఉద్దీపన ఫలాలు


Published in PRajasakti Business Watch on 27th September 2010

* పెరిగిన అమెరికా కంపెనీల లాభాలు
* మాంద్యం అనంతరం రెండేళ్లలో తగ్గిన శ్రామికుల వేతనాలు

కార్మికుల సంఘటిత శక్తి బలంగా ఉన్నపుడు, ఆర్థికాభివృద్ధి ఫలాలు గణనీయగా కార్మికవర్గానికి దక్కాయి. దాంతో ఆర్థికాభివృద్దితో పాటు దేశాలు సమగ్ర సామాజిక అభివృద్ధి దిశగా నడకసాగించాయి. కార్మికుల సంఘటిత శక్తి బలహీనమైనపుడు ఆర్థికాభివృద్ధి మాత్రం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ అభివృద్ధి 50, 60 దశకాల్లో చూసినట్లు సార్వజనీక సమగ్రాభివృద్ధిగా మారదు. కేవలం ఆర్థికాభివృద్ధిగా మాత్రమే మిగిలిపోతోంది.... అందుకే కార్మికులకు, అమెరికాలోనైనా ఆంధ్రప్రదేశ్‌లో నైనా....

సంఘం శరణం

గశ్చామి !


ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభానికి లోనై రెండేళ్లు పూర్తయింది. ఈ కాలంలో వివిధ రంగాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా రాజకీయ రంగంలో గతంలో ఉన్నంత దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. యూరప్‌ జర్మనీ నాయకత్వంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన విషయాన్ని తాజా సంక్షోభం తదనంతర పరిణామాలు రుజువు చేశాయి. ఈ రెండేళ్ల కాలంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో అమలు జరిపిన ఉద్దీపన పథకాలు సంక్షోభాన్ని మరింత విస్తరించకుండా కట్టడి చేశాయి. అయితే మూడు దశాబ్దాలుగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, ప్రభుత్వ వ్యయాన్ని పరిమితం చేయటం లక్ష్యాలుగా పని చేసిన నయా ఉదారవాద భావజాలం ఈ మార్పులను ఆహ్వానించలేకపోతోంది. దాంతో ఉద్దీపన పథకాలు వాటి వెన్నంటి వచ్చే ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నాయి. 2008లో సంక్షోభం ప్రారంభమైన సమయంలో ఆత్మరక్షణ ధోరణితో ఉన్న కార్మికోద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకొంటోంది.

భారతదేశంలో ఈ కాలంలోనే నాలుగు సార్లు రాజకీయ అంశాలపై కార్మికవర్గం జాతీయ స్థాయి ఆందోళనకు పూనుకొంది. ఈ ఆందోళనల్లో కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు కోట్ల సంఖ్యలో పాల్గొన్నారు. యూరోపియన్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ కార్మికుల సమ్మె, ఫ్రాన్స్‌లో ఫించను ఉపసంహరణకు వ్యతిరేకంగా జరిగిన సమ్మె, గ్రీస్‌లో సంస్థాగత సర్దుబాట్లకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ ఆందోళన వంటి పరిణామలు కార్మికవర్గంపై సంక్షోభ ప్రభావం గురించిన చర్చను ముందుకు తెస్తున్నాయి. ప్రత్యేకించి సంక్షోభానికి అమెరికా కేంద్ర స్థానంగా ఉంది కనుక అమెరికాలోనే ఈ రెండేళ్ల కాలంలో కార్మికవర్గంపై పడిన భారాల గురించి, ఉద్దీపన పథకాల వల్ల ఒరిగిన మేలు గురించి ఈ వ్యాసంలో చర్చిద్దాం.

ప్రపంచ దేశాలు ఉద్దీపనల పేరుతో 11.4 ట్రిలియన్‌ డాలర్ల నిధులు మార్కెట్‌లో కుమ్మరించాయి. 2008లో ఉద్దీపనల గురించి చర్చించినపుడు ఈ పథకాలు సంక్షోభం నేపథ్యంలో పెరిగే నిరుద్యోగాన్ని అదుపు చేయవచ్చని దేశాధినేతలు చెప్పారు. అంతేకాదు, పారిశ్రామికోత్పత్తి సంక్షోభ పూర్వపు స్థాయికి చేరుతుందని, అంతర్జాతీయ వాణిజ్యం నిలకడగా ఉంటుందని, తద్వారా ఉపాధి అవకాశాలను కాపాడుకోవచ్చన్నది ఉద్దీపనల సమయంలో ప్రభుత్వాలు, పలువురు ఆర్థిక వేత్తలు ముందుకు తెచ్చిన వాదనలు. అయితే ఈ వాదనల్లో చివరి రెండు, అంటే పారిశ్రామికోత్పత్తి, అంతర్జాతీయ వాణిజ్యంలో పతనాన్ని అదుపుచేయటంలో మాత్రం ఉద్దీపనలు జయప్రదం అయ్యాయి. కానీ, కార్మికులకు సంబంధించి ఉపాధి అవకాశాలను కాపాడటంలో గానీ, సామాజిక భద్రతను విస్తరించటంలో గానీ, కుటుంబ ఆదాయాన్ని పెంచటంలోగానీ ఈ ఉద్దీపనలు లక్ష్యాలను చేరలేదు. దీనికి ఉద్దీపన ఫలాలు అమెరికాలో పంపిణీ అయిన తీరే నిదర్శనం. ఉద్దీపన పథకాలు అమలు జరిగిన కాలంలో అమెరికాలో కార్పొరేట్‌ లాభాలు 57.2 కోట్ల డాలర్ల మేర పెరిగాయి. అంటే 2008 నాటి లాభాలతో పోల్చి చూస్తే 57 శాతం పెరుగుదల అన్న మాట. ఇదే కాలంలో కార్మికుల వేతనాలు మాత్రం 2008 నాటి స్థాయి కంటే రెండు శాతం తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, బ్యాంకేతర ఆర్థిక సంస్థల చేతుల్లో 1.84 ట్రిలియన్ల నిధులు పోగుపడ్డాయి. అంటే మొత్తం ప్రపంచ దేశాలు కుమ్మరించిన ఉద్దీపన నిధుల్లో ఆరవ వంతు వీరి చేతుల్లోకి చేరాయి. కంపెనీల లాభాలు పెరిగినంత వేగంగా పారిశ్రామికోత్పత్తి గానీ, ఉపాధి అవకాశాలు గానీ, వేతనాలుగానీ పెరగలేదు.

నిజానికి 2007 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి 13363 బిలియన్‌ డాలర్లు ఉండగా 2010 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెల్ల కాలంలో ఇది 13139 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంటే -1.7 శాతం తక్కువ. కానీ నిరుద్యోగం మాత్రం 4.8 శాతం నుండి 10 శాతానికి పెరిగింది. ఉత్పత్తిలో పతనానికి, నిరుద్యోగంలో పతనానికి మధ్య ఎక్కువ తేడా ఉండటం అంటే ఉన్న కార్మికులే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారన్న మాట. ఆ విధంగా వేతనాల్లో పతనం ఉన్నా కార్మికులు ఎక్కువ ఉత్పత్తి సృష్టిస్తున్నారు. దాంతో కంపెనీల లాభాలు యథాతథంగా ఉండటమే కాదు, పెరుగుతున్నాయి. 2008 ఆర్థిక సంవత్సరం చివరి మూడు మాసాల్లో కంపెనీల నికర లాభాలు 995 బిలియన్‌ డాలర్లు ఉంటే 2010 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెల్లల్లో ఈ లాభాలు1567 బిలియన్‌ డాలర్లుకు పెరిగాయి. ఈ విధంగా తక్కువ శ్రమ శక్తితో ఎక్కువ ఉత్పాదకత సాధించటం ద్వారా అమెరికా కంపెనీలు సంక్షోభ కాలంలో ప్రభుత్వ వ్యయంపై ఆధారపడి తమ లాభాలు పెంచుకున్నాయి.

ఈ ధోరణి కేవలం ఈ ఒక్క సంక్షోభ కాలానికే పరిమితం కాలేదు. 1980లో తెరమీదకు వచ్చిన మదుపు ఖాతాల సంక్షోభం నుండీ ఈ ధోరణి కొనసాగుతోంది. మదుపు ఖాతాల సంక్షోభం నుండి బయటకు వచ్చేందుకు జరిగిన ప్రయత్నాల్లో కార్మికవర్గానికి రాయితీలు దక్కాయి. అప్పట్లో అనుసరించిన విధానాలు కారణంగా కార్పొరేట్‌ వర్గాల ఆదాయం 15 బిలియన్‌ డాలర్లు ఉండగా కార్మికుల దక్కిన వాటా 148 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విధానానికి 1991 తర్వాత తెరపడింది. 1990-1991లో అమెరికా కార్పొరేట్‌ లాభాల రేటు తిరోగమనంలో ఉంది. ఈ కాలంలో కార్మికవర్గం దక్కించుకున్న వాటాలు కూడా 80తో పోల్చితే సగానికి సగం తక్కువ. 1991 తర్వాత సైద్ధాంతిక, రాజకీయ బలాలు పెట్టుబడిదారీ దోపిడీకి అనుకూలంగా మారాయి. దాంతో 2001 నాటికి అమెరికా కార్పొరేట్‌ లాభాలు 93 బిలియన్ల్‌కు చేరుకోగా కార్మికుల వేతనాలు 80 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2007-2009 నాటికి ఈ మార్పు పెట్టుబడికి అనుకూలగా కార్మికవర్గానికి వ్యతిరేకంగా స్థిరీకరించబడింది. తాజా సంక్షోభ కాలంలో పన్నులకు ముందు కంపెనీల లాభాల్లో పెరుగుదల 388 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా కార్మిక వేతనాల్లో పెరుగుదల మాత్రం 68 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యింది. అంటే ఈ కాలంలో కంపెనీల ఆదాయం కార్మికుల ఆదాయం కంటే 85 శాతం అదనంగా పెరిగింది. ఈ మార్పుకు అమెరికాలో కార్మికవర్గ పొందికలో వచ్చిన మార్పు ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.

ప్రధానంగా అమెరికా కార్మికవర్గంలో సంఘ చైతన్యం లోపించటం ఇందుకు ముఖ్యమైన కారణం. 1955 నాటికి మొత్తం అమెరికాలోని కార్మికుల్లో మూడోవంతు మంది ఏదో ఒక విధమైన కార్మిక సంఘాల్లో సభ్యులు.

ప్రతి పరిశ్రమలోనూ, ప్రైవేటు ఆఫీసులోనూ కార్మిక సంఘాలుపని చేసేవి. కలెక్టివ్‌ బార్గెయినింగ్‌ అన్న సూత్రం ఆధారంగా యాజమాన్యం, కార్మికవర్గం మధ్య వివాదాలు పరిష్కృతం అవుతూ ఉండేవి. మహా మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధనాలు కార్మికవర్గ ప్రయోజనాలను కూడా పాక్షికంగానైనా కాపాడేవిగా ఉండేవి. రీగన్‌ కాలంలో అమెరికా ప్రభుత్వం కార్మికవర్గ ప్రయోజనాలు పక్కన పెట్టి సంపూర్ణంగా పెట్టుబడిదారీ ప్రయోజనాలు కాపాడటానికి కంకణం కట్టుకోవటంతో కార్మికవర్గం దశాబ్దాల తరబడి పోరాటంతో సాధించుకున్న హక్కులన్నీ అటకెక్కాయి. దాంతో 1983 నాటికి కార్మిక సంఘాల సభ్యత్వం మొత్తం కార్మికవర్గంతో పోల్చినపుడు 20 శాతానికి పడిపోయింది. కోటి డెభ్బై లక్షలమంది కార్మికులు అమెరికాలో కార్మికసంఘాల్లో 1983 నాటికిసభ్యులుగా ఉండేవారు. 2009 నాటికి ఈ సభ్యత్వం కాస్తా కోటి యాభై లక్షలకు పడిపోయింది. మొత్తంగా ఉపాధి రహిత అభివృద్ధి నేపధ్యంలో మొత్తం అమెరికా శ్రమశక్తి మార్కెట్‌లో కేవలం 12.3 శాతం మాత్రమే కార్మిక సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు.గత మూడు దశాబ్దాలుగా తగ్గిపోతూ ఉన్న అమెరికా కార్మికుల సంఘటిత శక్తి, సంఘాల శక్తి పై గణాంకాల్లో కనిపిస్తోంది.

కార్మికుల సంఘటిత శక్తి తగ్గిపోవటం, చట్టపరమైన భద్రత లేకపోవటం, ఉపాధి అవకాశాల పతనం నేపథ్యంలో కలెక్టివ్‌ బార్గెయినింగ్‌ గురించిన చర్చే లేదు. ఈ పరిస్థితుల్లో తాజా సంక్షోభం నుండి బయట పడటానికి అమలు జరుగుతున్న చర్యల భారం ప్రధానంగా కార్మికవర్గంపై ఎక్కువగా ఉంటోంది. అందువల్లనే ఈ కాలంలో ఉద్దీపనల తర్వాత అమెరికా కంపెనీల లాభాల్లో 54 శాతం పెరుగుదల ఉంటే కార్మికుల వేతనాల్లో రెండు శాతం పతనం ఉంది. ఈ అనుభవాలు సంక్షోభాల సమయంలోనైనా, సానుకూల సమయంలోనైనా కార్మికులకు సంఘాలే బలం, సంఘటిత శక్తే కార్మికుల ప్రయోజనాలు కాపాడుతుందన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి. పైన ప్రస్తావించుకున్నట్లు కార్మికుల సంఘటిత శక్తి బలంగా ఉన్నపుడు, ఆర్థికాభివృద్ధి ఫలాలు గణనీయగా కార్మికవర్గానికి దక్కాయి. దాంతో ఆర్థికాభివృద్దితో పాటు దేశాలు సమగ్ర సామాజిక అభివృద్ధి దిశగా నడకసాగించాయి. కార్మికుల సంఘటిత శక్తి బలహీనమైనపుడు ఆర్థికాభివృద్ధి మాత్రం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ అభివృద్ధి 50, 60 దశకాల్లో చూసినట్లు సార్వజనీక సమగ్రాభివృద్ధిగా మారదు. కేవలం ఆర్థికాభివృద్ధిగా మాత్రమే మిగిలిపోతోంది.... అందుకే కార్మికులకు, అమెరికాలోనైనా, ఆంధ్రప్రదేశ్‌లోనైనా.... సంఘం శరణం గశ్చామి !

కొండూరి వీరయ్య

No comments: