Tuesday, September 14, 2010

ఆర్థిక సంస్కరణల అమానవీయ ముఖం

published in Prajasakti Business Watch on Monday September 13th 2010


ప్రభుత్వాలు రూపొందించి, అమలు చేసే విధానాలన్నింటికీ ప్రజా సంక్షేమమే ప్రాతిపదిక అన్న భావన ఉండేది. సంక్షేమ రాజ్యంలో ఈ భావన మరింత హెచ్చు. కానీ ఎఫ్‌సిఐ గోదాముల్లో ముక్కిపోతున్న ఆహార ధాన్యాలను పేదలకు పంచే విషయమై ప్రధానమంత్రి చేసిన ప్రకటన, అంతకు ముందు పార్లమెంట్‌లో వ్యవసాయశాఖ మంత్రి శరద్‌ పవార్‌ చేసిన ప్రకటనలు ఈ భావనలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2001 నుండి సుప్రీం కోర్టు ఆహార భద్రత హక్కు గురించి అనేక సందర్భాల్లో జోక్యం చేసుకున్నా ప్రభుత్వాలకు చలనం లేకపోయింది. చివరకు కోర్టే ప్రత్యక్షంగా కమిషనర్లను నియమించి, పరిస్థితిని అధ్యయనం చేయించి నివేదిక తెప్పించుకొంటోంది. దీనర్థం ప్రభుత్వం అంత చావ చచ్చిపోయి ఉందని కాదు. అవసరమైన అన్ని చోట్లా, అంటే మార్కెట్‌కు అవసరమైన అన్నిచోట్లా ప్రభుత్వం క్రియాశీలకంగానే పని చేస్తోంది. ఉద్దీపన పథకాలు, కార్పొరేట్లకు నాలుగు లక్షల కోట్లకుపైగా పన్ను రాయితీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు, కార్మిక సంస్కరణలు, అమెరికాతో అణుఇంధన ఒప్పందం వంటి విషయాల్లో ప్రభుత్వం క్రియాశీలత స్పష్టంగానే కనిపిస్తోంది. మార్కెట్‌ సూత్రాల అమలు సాధ్యం కాని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆహార ధాన్యాల సేకరణ, ప్రజలకు, పిల్లలకు పౌష్టికాహారం అందుబాటులోకి తేవటం వంటి చోట్ల మాత్రం ప్రభుత్వం నామమాత్రపు ఆసక్తిని కూడా ప్రదర్శించటం లేదు. 1991-96 మధ్య దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ 95 నుండి మానవీయ ముఖంతో కూడిన ఆర్థిక సంస్కరణలు అన్న చర్చను ముందుకు తెచ్చారు. అటువంటి వ్యక్తి నేడు వాస్తవమైన, సంస్కరణల అమానవీయ ముఖాన్ని ఇంత తేలికగా బట్టబయలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.

ప్రధానమంత్రి ప్రకటనలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది విధాననిర్ణయాల విషయంలో సుప్రీం కోర్టు జోక్యం అవసరం లేదు అన్నది. రెండో అంశం దేశంలో 37.7 శాతంగా ఉన్న పేదలకు ఉచితంగా సరఫరా చేయటం ఎలా సాధ్యమవుతుంది అన్నది. దీనికి అనుబంధంగా ప్రధానమంత్రి ముందుకు తెచ్చిన మరో చర్చ గోదాముల్లోని ఆహారధాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉచితంగా పంచి పెడితే ఇది రైతాంగానికి ఇచ్చే మద్దతు ధరపై ప్రభావం చూపుతుందన్నది. బహుశా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పేదలకు ఆహారధాన్యాలు ఉచితంగా అందచేయటం ఎలా అన్నది ప్రధాని ప్రశ్న అయి ఉండొచ్చు. సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహామండలి ఈ మధ్యే సమావేశమై పేదలందరికీ ఆహారధాన్యాలు అందచేయటం ఎలా అన్న అంశం చుట్టూ భారీ కసరత్తు నిర్వహించింది. అక్కడున్న మేధావులు ఏ ప్రమాణాలు పరిగణనలోకి తీసుకున్నారో ఏమో తెలియదు గానీ దేశవ్యాప్తంగా ఒకేసమయంలో పేదలందరికీ ఆహారధాన్యాలు చేర్చటం సాధ్యంకాదని తేల్చేశారు. కనుక ఆహారభద్రత హక్కు చట్టాన్ని జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టం తరహాలో దశల వారీగా అమలు చేయాలని, ముందుగా కడుపేదలతో నిండిన 150 జిల్లాల్లో ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సలహా ఇచ్చారు. బహుశా ప్రధాని ఈ సలహా నుంచి స్పూర్తి పొందారేమో.. 37.7శాతంగా ఉండి, దేశవ్యాప్తంగా విస్తరించిన పేదలకు ఉచితంగా ఎలా సరఫరా చేయాలని బహిరంగంగా ప్రశ్నించారు.


ఇందులో మరో ప్రశ్న కూడా ఉంది. అసలు ఉచితంగానే సరఫరా చేయలేనపుడు నిజంగా చట్టం ద్వారా మాత్రం ఎలా సరఫరా జరుగుతుంది అన్నది ఆ ప్రశ్న. అంటే చైనా సరిహద్దుల్లో హిమగిరి శిఖరాలపై ఉన్న లేV్‌ా, తవాంగ్‌, హిందూమహాసముద్రంలో ఇమిడిపోయిన లక్షదీవులకు ఓటింగ్‌ సమయంలో ఎన్నికల సిబ్బంది క్షేమంగా చేరుకోగలిగారు. గానీ ఈ ప్రాంతాలకు ఆహారధాన్యాలు మాత్రం చేరుకోలేవన్నది ప్రధాని ప్రకటన సారాంశం. ఇది నిజమా ? ఒకవేళ నిజమైతే స్వాతంత్య్రానంతరం ఆరున్నర దశాబ్దాల తర్వాత ఈ పరిస్థితిని కల్పించిన నేరం ఎవరిది ? ఈ ప్రశ్న వేయటం ప్రజల తప్పు కాబోదు. సలహా మండలి సూచన అనుసారం దశలవారీగా అమలు ప్రారంభిస్తే ఈ సరఫరాలు అందుకునే వరకూ ఆకలిని వాయిదా వేయటం ఎలాగో సదరు మేధావులే శెలవిస్తే బాగుంటుంది. ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తే రైతంగానికి ఇచ్చే మద్దతు ధరపై దాని ప్రభావం ఉంటుందన్న మాజీ ఆర్థికవేత్తగారి లాజిక్కును పరిశీలిద్దాం. ఆ విషయంలోకి వెళ్లబోయే ముందు తక్షణ సమస్య గురించి ఒక విషయం పరిశీలిద్దాం. ఈ సంవత్సరం ఉత్తర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు ఎగువన ఉండే పంజాబ్‌, హర్యానాలు జలమయ్యాయి. ఈ ప్రాంతంలోనే ఎఫ్‌సిఐ గోదాముల్లో పెద్దఎత్తున ఆహారధాన్యాల నిల్వలు పోగుపడ్డాయి. గోదాముల్లో చోటు లేకపోవటంతో అధికారులు రైతాంగం, మిల్లుల నుండి సేకరించిన లెవీ బియ్యాన్ని టార్పాలిన్లు కప్పి ఆరుబయటే ఉంచారు. ఆరుబయట ఉన్న ఈ ధాన్యం తడిచి ముక్కిపోయింది. ఈ ధాన్యాన్ని ముక్కిపోయేందుకు ఆరుబయట వదిలిపెట్టకపోతే ప్రజలకు పంచవచ్చు కదా అన్నది సుప్రీం కోర్టు. దానికి ప్రధానమంత్రిగారికి కోపం వచ్చింది. సాధారణ ఆర్థిక సూత్రాల పరిచయం ఉన్న వారికెవరికైనా తెలిసిన విషయం ఒకటే. గాదెలో ధాన్యం నూర్పిళ్ల సమయానికి ఖాళీ అయితేగానీ నూర్పిడితో వచ్చిన ధాన్యాన్ని తిరిగి గాదెలో నింపటం సాధ్యంకాదు. అంటే గోదాముల్లో ఇప్పుడున్న ధాన్యం ఖర్చు అయితేగానీ తిరిగి నింపే అవసరం రాదు. తిరిగి నింపే అవసరం ఉన్నపుడే ఎఫ్‌సిఐ రైతుల నుండి, మిల్లర్ల నుండి లెవీ ధాన్యం సేకరిస్తుంది.

లెవీ ధాన్యం సేకరించాలంటే మద్దతు ధర నిర్ణయించాలి. ప్రధానిగారి లాజిక్కుకు, ఆచరణలో ఉన్న వాస్తవ పరిస్థితికి మధ్య పొంతనే లేదు. అందుకే ప్రధాని చేసేది వితర్కమో కుతర్కమో అవుతుంది తప్ప అర్థవంతమైన తర్కం కాదు ఈ సంవత్సరం రుతుపవనాలు కనికరించటంతో పెద్దఎత్తున దిగుబడులు ఉంటాయని, ఆర్థిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటుందని ప్రభుత్వమే చెప్తోంది. మరి గోదాముల్లో ఉన్న సరుకే కదలని పరిస్థితి ఉంటే కొత్తగా వచ్చే దిగుబడులు ఎక్కడ నింపుతారు ? ఈ వాదన పర్యవసానం మరింత దారుణంగా ఉంటుంది. ఎఫ్‌సిఐ లెవీ ధాన్యం సేకరించే అవసరం రాదు కాబట్టి రైతులనుండి సేకరణ నిలిపివేస్తుంది. దాంతో రైతులకు గిట్టుబాటు ధర రాదు. వాళ్లు కూడా ఇళ్లల్లోని గాదెల్లో ధాన్యం నింపుకుని కొనుగోలు చేసే వారి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. వాస్తవం ఇది. దీన్ని తిరగేసి చెప్తున్నారు మన ప్రధానమంత్రి. ఇది నిజానికి రైతాంగాన్ని దివాళా తీయించే వ్యవహారమే తప్ప వారిని ఆదుకునేందుకు కాదు.

యథారాజా తథా ప్రజా అన్నట్లు ప్రధానమంత్రే ఇలా ఉంటే ఆయన ప్రభుత్వంలోని మంత్రులు అధికారులు ఇందుకుభిన్నంగా ఎందుకుంటారు! ఉదాహరణకు ఒక్క అధికారి గురించి ప్రస్తావించుకుందాం. ఆయన ప్రధానమంత్రికి స్వయానా ఆర్థిక సలహాదారు. అమెరికాలో ఉదారవాద సిద్ధాంతాలు బోధించి వచ్చిన కౌషిక్‌ బసు. ఉచితంగా పంచిపెట్టటం సాధ్యం కాదు కనుక ఆహారధాన్యాన్ని ఎగుమతి చేద్దాం అన్నది ఆయన ప్రతిపాదన. తద్వారా ఎఫ్‌సిఐ గోదాములు ఖాళీ చేయొచ్చు. కొత్త పంటకు అవకాశం ఇవ్వవచ్చు. మరి దేశంలో ఆకలిగొన్న కడుపుల సంగతి ఏమిటన్న ప్రశ్న ఈ ఆర్థిక సలహదారుకు ఆలస్యంగా తట్టింది. దానికి ఆయన ఇచ్చిన పరిష్కారం రెండు మూడేళ్ల పాటు మన ధాన్యం విదేశాల్లో ఉంటుందట. తర్వాత ఎపుడు కావాలంటే అపుడు తిరిగి వెనక్కు తెచ్చుకోవచ్చట. ఈ విధంగా ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలట...రోగికి పిచ్చి ముదిరిందని డాక్టరు వద్దకు వస్తే రోకలి తలకు చుట్టమన్నాడట సదరు డాక్టరు. పిచ్చి రోగికా, డాక్టరుకా అన్న విషయం పాఠకులకే వదిలేస్తున్నాను.

చివరిగా అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయాన్ని సుప్రీం కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోలేదు. నేడు మన గోదాముల సామర్ధ్యాన్ని మించి ఆహారోత్పత్తులు ఉత్పత్తి అవుతున్నాయి. నేడున్న ఎఫ్‌సిఐ గిడ్డంగులు 80వ దశకంలో నిర్మితమైనవి. ఆ తర్వాత టన్ను ధాన్యాన్ని అదనంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభుత్వం సృష్టించలేదు. కానీ వంగడాల్లో వచ్చిన మార్పుల వల్ల సేద్యపు భూమి తగ్గుతున్నా, ఉత్పాదకత పెరిగింది. కానీ వ్యవసాయోత్పత్తుల నిల్వ సామర్థ్యం మాత్రం పెరగలేదు. ప్రస్తుత సమస్యకు మూలకారణం ఇది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయోత్పత్తుల నిల్వ సామర్థ్యం పెంచుకునే అవకాశాలు గురించి చర్చించకుండా ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టిస్తోంది. ఇది వ్యవసాయానికీ, రైతాంగానికే కాదు. స్థూలంగా జాతీయ ఆర్థిక వ్యవస్థకే ముప్పు తెచ్చే వైఖరి. ఈ వైఖరి నుండి ప్రభుత్వాలు బయటపడనంత కాలం ఆహారభద్రత హక్కు, జీవించే హక్కు ఏ హక్కు అయినా వారికి కంటగింపుగానే కనిపిస్తుంది.

కొండూరి వీరయ్య

No comments: