Thursday, March 3, 2011

కార్పొరేట్‌ ప్రయోజనాలకే పెద్ద పీట

నేటి వ్యాసం Wed, 2 Mar 2011, IST కె. వీరయ్య

ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం నాడు ప్రతిపాదించిన బడ్జెట్‌ తీరు తెన్నులు పరిశీలిస్తే దేశం ముందున్న రాజకీయ ఆర్థిక సమస్యల పరిష్కారానికి కాక విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడుల అవసరాలు తీర్చటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్య సమానత్వంతో కూడిన అభివృద్ధి, దాన్ని సాధించటానికి అవసరమైన పరిపాలనా సామర్థ్యం. ఈ రెండు లక్షణాలను రుజువు చేసుకోవటానికి ప్రభుత్వాలకు బడ్జెట్‌ ఒక అవకాశం. యుపిఏ-2 ప్రభుత్వం ఈ సందర్భానికి తగినట్లు వ్యవహరిచలేక పోయిందని బడ్జెట్‌ దిశ, అందులోని అంకెలు రుజువు చేస్తున్నాయి. బడ్జెట్‌ ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి మూడో వారంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో ఆర్థిక వ్యవస్థ ముందున్న ఐదు సవాళ్ల గురించి ప్రస్తావించింది. అవి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, ద్రవ్య వ్యవస్థ స్థిరీకరణ, ఉత్పాదక రంగంలో కదలిక తేవటం, కరెంట్‌ ఖాతా లోటును తగ్గించుకోవటం. బడ్జెట్‌ ఈ నాలుగు సమస్యలను పరిష్కరించే దిశలో ఉండాలని హితబోధ చేసింది. కానీ ఈ బడ్జెట్‌ను పరిశీలిస్తే ఆ హితబోధ ప్రభుత్వానికి ఏమీ ఎక్కినట్లు కనిపించటం లేదు. ఒక్కో లక్ష్యం గురించి బడ్జెట్‌ ఏమంటుందో పరిశీలిద్దాం.

ద్రవ్యలోటునే తీసుకుందాం. స్థూల జాతీయోత్పత్తిలో ఇది 5.5 శాతం ఉంటుందని 2010-11 బడ్జెట్‌ అంచనా వేసింది. సవరించిన అంచనాల మేరకు 2010-11లో ఈ ద్రవ్యలోటును 4.6 శాతానికి తగ్గించగలిగామని ప్రణబ్‌ ముఖర్జీ జబ్బలు చర్చుకున్నాడు. కానీ వాస్తవం ఏమిటి ? ఈ ద్రవ్యలోటు నియంత్రణ ఎలా సాధ్యమైంది? గత సంవత్సరం బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 40,000 కోట్లు రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 34 వేల కోట్ల రూపాయలు 3జి స్పెక్ట్రం వేలం ద్వారా సంపాదించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా ద్రవ్యలోటు పూడ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ స్పెక్ట్రం వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం సంపాదించటంతో ప్రభుత్వం దగ్గర నిల్వ రొక్కం విషయంలో కాస్తంత వెసులుబాటు వచ్చింది. అయాచితంగా వచ్చిన ఆదాయం ప్రభుత్వ లోటు పూడ్చటానికి ఉపయోగపడింది. ఇది ఒకసారి వచ్చే ఆదాయం మాత్రమే. ఏటా వచ్చే ఆదాయం కాదు. అంటే ఈ సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో ఈమేరకు ఆదాయాన్ని తగ్గించి లెక్కవేసుకోవాలి. ఇంతవరకు విశ్లేషకులదంరూ చెప్పారు. కానీ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించని మరో మార్గంలో కూడా ప్రభుత్వం లోటు తగ్గించే పనికి పూనుకొంది. అది వివిధ ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా ఉండటం. ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్‌, ఇందిరా ఆవాస్‌ యోజన, యాక్సెలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం, గ్రామీణ తాగు నీటి పథకాలకు 2010-11 బడ్జెట్‌లో 92,510 కోట్లు కేటాయించగా 2010 డిసెంబరు చివరి నాటికి ఖర్చు చేసింది 48,757 కోట్లు మాత్రమే. అంటే కేటాయింపుల్లో దాదాపు సగం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన సొమ్ము పొదుపు చేయటం ద్వారా ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ డబ్బులు ఉండేలా చూసుకుంది. ఇవన్నీ వెరసి ఫిబ్రవరిలో లోటు లెక్కించే సమయానికి లోటును తక్కువ చేసి చూపాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలకు మరింత తక్కువ కేటాయించారు. పైగా అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని బడ్జెట్‌ హామీ ఇచ్చింది. కానీ, నూతన పథకానికి బడ్జెట్‌ పద్దుల్లో స్థానం దక్కలేదు. కాబట్టి ఆహార భద్రత ఈ ఏడాది కూడా హుళక్కే! ఈ విధంగా ప్రజల కడుపు కాల్చి సంపాదించిన సొమ్ముతో లోటు భర్తీ చేసుకొంటోందీ ప్రభుత్వం.

రెండవది, ద్రవ్యోల్బణం. ప్రభుత్వ గణాంకాల్లో, వివరణల్లో ఒక పద్ధతి ఉంటుంది. వాస్తవిక పరిస్థితికి తగ్గట్లు సమాధానం చెప్పలేకపోతే చర్చ ప్రాతిపదికనే మార్చటం ఈ పద్ధతి. ద్రవ్యోల్బణం గురించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇలాగే ఉంది. గత రెండేళ్ల పాటు ప్రజలను పీడిస్తున్న ధరాఘాతానికి మూలాలు పంపిణీ వ్యవస్థను ప్రజలకందుబాటులోకి తేలేకపోవటం, అంతర్జాతీయ పరిణామాలు, వాయిదా వ్యాపారాల్లో ఉంటే ఈ విషయాలను నియంత్రించేందుకు, సరిచేసేందుకు బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ ప్రతిపాదించలేదు. ప్రణబ్‌ ముఖర్జీ మాటలను బట్టి చూస్తే ప్రభుత్వం ద్రవ్యోల్బణానికి సంస్థాగత కారణాలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందట. అది గుర్తించిన కారణాలు నిజంగా సంస్థాగత కారణాలా కాదా అన్నది ఒక చర్చ. ఆర్థిక సర్వేలో సరుకులు ప్రజలకు చేరవేయటంలో లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడితే బడ్జెట్‌ మాత్రం పప్పు ధాన్యాలు, ఇతర ఆహారోత్పత్తులు ఉత్పత్తిలో కొరత వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తోంది. కానీ ఇద్దరూ చెప్పిన పరిష్కారం ఒక్కటే. ఆహారోత్పత్తులను ప్రజలకు చేర్చటానికి మార్కెట్‌ ఒక్కటే సాధనం అన్నది అటు ఆర్థిక సర్వే, ఇటు బడ్జెట్‌ సూచిస్తున్న పరిష్కారం. పైగా ప్రజలకు మార్కెట్‌లో నేరుగా సరుకులు కొనుగోలు చేయటానికి వీలుగా డబ్బులు ఇస్తామని చెప్తోంది. మరోవైపున ద్రవ్యోల్బణం పెరగటానికి మార్కెట్‌లో అవసరానికి మించిన డబ్బులు చలామణి కావటం కూడా ఒక కారణమని సర్వే చెప్తోంది. ఈ విధంగా ద్రవ్యోల్బణం పరిష్కారం విషయంలో ప్రభుత్వం వైఖరి మోకాలికి, బోడిగుండుకు ముడేసేదిగా ఉంది. పైగా ద్రవ్యోల్బణం అందుపుకోసం అంటూ ప్ర్రతిపాదించిన అనేక చర్యలు నిజానికి ధరల పెరుగుదలకు దారితీయనున్నాయి. ప్రజలు ధరల సమస్యను తీవ్రంగా చూడటం లేదని ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చిన ఇంటర్వూ ప్రభుత్వం దృక్ఫధానికి అద్దం పడుతుంది. పైగా వస్తువులు, సేవల చట్టం అమలు దిశగా మరో 130 రకాల ఉత్పత్తులను ఎక్సైజు పన్ను పరిధిలోకి తేవటం ద్వారా ధరల పెరుగుదలకు మార్గం సిద్ధం చేసిందీ బడ్జెట్‌.

మూడవది, ఉత్పాదకరంగంలో కదలిక తీసుకురావటం. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ప్రకటించిన అనేక రాయితీలు ఈ లక్ష్యసాధనకోసమే అని చెప్తున్నారు. నిజానికి ఈ రాయితీలు ఉత్పత్తిరంగంలో కదలిక తేవటానికి ఉపయోగపడితే గత సంవత్సరం పారిశ్రామికోత్పత్తి, ప్రత్యేకించి వస్తూత్పత్తి రంగం 8.1 శాతం వృద్ధి రేటు నుండి ఎందుకు పురోగమించలేదన్న ప్రశ్నకు బడ్జెట్‌లోనూ, ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వస్తూత్పత్తి రంగం వృద్ధి రేటు సాధించటానికి తగిన పరిస్థితులు ఉత్పత్తి వ్యవస్థలోనే కాదు. వాటిని వినియోగించుకునే సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటాయి. గత రెండేళ్లుగా ఉద్దీపనల పేరుమీద ప్రభుత్వం ప్రకటించిన వరాలు, పన్ను రాయితీలన్నీ రెండో సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఈ విషయాన్ని గుర్తించి సరి చేయటానికి బదులు తిరిగి అవే విధానాలు అమలుకు పూనుకుంటూ సంపన్నులకు, పారిశ్రామికవ్తేలకూ మరో 5 లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు అమలు చేస్తోంది. గత మూడేళ్లలో కేవలం సంపన్నులకు ఆదాయపన్ను రూపంలో ఇచ్చిన రాయితీలే రు.3,61,415కోట్లు...

నాల్గవది, కరెంట్‌ ఖాతా లోటు తగ్గించుకోవటం. కరెంట్‌ ఖాతా లోటు తగ్గించుకోవాలంటే ఎగుమతులు పెరగాలి. లేదా దిగుమతులు తగ్గాలి. ప్రభుత్వం మౌలికసదుపాయాల కల్పన నిమిత్తం దిగుమతి చేసుకునే వివిథ రకాల యంత్రసామాగ్రికి రాయితీలు ప్రకటించింది, కాబట్టి ఇదే అదనుగా పరిశ్రమలు వీటిని తక్కువ ఖర్చుకు దిగుమతి చేసుకోవటానికి ప్రయత్నిస్తాయి. దాంతో దిగుమతులు తగ్గే అవకాశం లేదు. ఇక ఎగుమతుల విషయానికొస్తే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు. ప్రస్తుతం పశ్చిమాసియా పరిణామాలు, ఉత్తర ఆఫ్రికా పరిణామాలు మొత్తంగా యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అమెరికాలో, జపాన్‌లో ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కానీ ఈవిషయాలు పరిగణనలోకి తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం చమురు ఉత్పత్తుల మార్కెట్‌లో వస్తున్న మార్పులు ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపనున్నాయన్న విషయాన్ని మాటమాత్రంగా కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. అంతేకాక చమురు ధరల పెంపు సమయంలో ఆ భారం ప్రజలపై పూర్తిగా పడకుండా ఉండటానికి గత సంవత్సరం 35వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 20వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. అంటే రానున్న కాలం కనీసం 15 వేల కోట్ల రూపాయల మేర చమురు ధరలు పెరగటం ఖాయం.

బడ్జెట్‌లో అంచనాలన్నీ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇదే తరహా వృద్ధి రేటు సాధిస్తుందని, ఎటువంటి అవాంతరాలు ఉండవనే దృష్టితో రూపొందించినవి. ఈ అంచనాల్లో తేడాలొస్తే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యల గురించిన ప్రస్తావన లేకపోవటంతో 2011-12 ఆర్థిక సంవత్సరం నడక తీరు మార్కెట్‌ శక్తుల విజృంభణకే ఎక్కువ అవకాశమిచ్చేదిగా వుంది.

No comments: