Mar 25,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/783627
ఏది భారత జాతీయత ?
దేశంలో
గత కొంత కాలంగా జాతీయత పేరు మీద కుహనా జాతీయవాదం వెర్రితలలు వేస్తోంది.
ప్రభుత్వ ప్రాయోజిత భావజాలాన్ని వ్యతిరేకించే వారు, ప్రశ్నించేవారు దేశ
ద్రోహులుగా ముద్రించబడుతున్నారు. దేశ సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను
ప్రభావితం చేస్తున్న అంశాల పట్ల ప్రభుత్వ ప్రాయోజిత నిపుణులు, మేధావుల
అభిప్రాయాలకు భిన్నంగా స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉండటం రాజద్రోహంగా
మారిపోయింది. ఈ పరిణామాలన్నింటి వెనక దండలో దారంలాగా కొనసాగుతున్న అంశం
జాతీయత గురించిన చర్చ. పాలక వర్గాల అభిప్రాయాలే సర్వసాధారణంగా
ప్రజాభిప్రాయాలుగా చెలామణీ అవుతాయన్న మార్క్స్ సూత్రీకరణ తాజా పరిణామాల
నేపథ్యంలో మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రాయోజిత ప్రసార మాధ్యమాలు
(ఎంబెడెడ్ జర్నలిజం) ఏకశిలా సదృశమైన ఉన్మత్త హిందూత్వమే నిజమైన జాతీయత
అని నమ్మించ చూస్తున్నాయి. సమ్మిళిత సాంస్కృతిక సామాజిక పునాదులు కలిగిన
భారతీయతకు ప్రత్యామ్నాయంగా ప్రచారంలో పెడుతున్నాయి.
నిజానికి భారతీయ
జాతీయత అంటే ఏమిటన్న విషయాన్ని నిర్ధారించే కోణంలో చారిత్రక పరిశోధనలు
లేకపోవటంతో పాచిపళ్ల దాసుడు పాడిందే పాటగా మారింది. ఈ కాలంలో ఉన్మత్త
హిందూత్వ శక్తులు రాజ్యాంగ పునాదులుపై సాగిస్తున్న విధ్వంసక దాడికి మరింత
పదును పెట్టిన సందర్భంగా తాజాగా భారత జాతీయ అన్న భావనపై సాగుతున్న దాడిని
చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారతీయత గురించి ప్రజాతంత్ర రాజ్యాంగం అందించిన
అవగాహనకు నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శనం అయిన ఆరెస్సెస్ ముందుకు
తెస్తున్న అవగాహనకు మధ్య ఉన్న విభజన రేఖను అర్థం చేసుకోలేకపోతే మరో తరం
మతోన్మాదులు ప్రేరేపించే భావోద్వేగాలకు బలికాక తప్పని పరిస్థితి
కనిపిస్తుంది.
చారిత్రక
పరిశీలన కోణం నుండి చూసినపుడు ఆధునిక ప్రపంచ చరిత్ర, ఆధునిక జాతీయ రాజ్యాల
చరిత్ర, పెట్టుబడిదారీ వ్యవస్థ దాని పరిణామ చరిత్ర విడదీయ రానంతగా
ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. చారిత్రక పరిణామ క్రమంలో దేశం ప్రాథమికంగా
భౌగోళిక యూనిట్గా మొదలవుతుంది. వివిధ భౌగోళిక ప్రాంతాల మధ్య నిర్దిష్టంగా
స్పష్టంగా గుర్తించగలిగిన సంస్కృతి, ఆచార వ్యవహారాలూ భాషలూ ఇతర ప్రమాణాలుగా
ఉంటాయి. అందువల్లనే ఉన్నత పాఠశాల స్థాయిలో రాజ్యం గురించిన పరిచయ
పాఠ్యాంశాల్లో రాజ్యానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు - ప్రభుత్వం, భాష,
ప్రజలు, నిర్దిష్టమైన సరిహద్దులు - అని నిర్వచించారే తప్ప మరే ప్రమాణం
గురించీ ప్రస్తావించలేదు. అదేవిధంగా సాంఘిక శాస్త్రాల అధ్యయనంలో
ప్రభుత్వాలు (ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వారి) అనుసరించే విధి
విధానాలు పద్ధతులు ప్రాతిపదికన రాజ్యాలను నాల్గు తరగతులుగా విభజించారు. అవి
కూడా నియంతృత్వ రాజ్య వ్యవస్థలు, పోలీసు రాజ్యం, సంక్షేమ రాజ్య, సోషలిస్టు
రాజ్య వ్యవస్థలుగా చెప్పుకుంటున్నాము. వీటిలో ఎక్కడా రాజ్య వ్యవస్థలను
మతాల ప్రాతిపదికన, సంకుచిత లక్ష్యాల కోసం రూపొందించిన నిర్వచనాల
ప్రాతిపదికన నిర్వచించలేదు. 19వ శతాబ్దం ముగింపు నాటికి లౌకిక నిర్వచనం
ప్రకారమే జాతీయతను నిర్దారించటం ప్రమాణంగా ఉంది. పాశ్చాత్య దేశాలన్నీ పైన
చెప్పిన నాలుగు లక్షణాల ప్రాతిపదికనే సరిహద్దులు విభజితం అయినట్టు
యూరోపియన్ దేశాల చరిత్ర మనకు విదితం చేస్తుంది.
యూరోపియన్ జాతీయవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణతో పాటు సంఘటితం అవుతూ
వచ్చింది. దేశంలో ఉన్న అంతర్గత శతృవును గుర్తించి వారిని అస్థిత్వపరంగా
రాజకీయంగా సైద్ధాంతికంగా ఒంటరిపాటు చేసే క్రమంలో యూరోపియన్ జాతీయత
క్రోడీకరించబడింది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారీ దేశాలు తమ మార్కెట్ అవసరాలు
తీర్చుకునే నేపథ్యంలో వలసవాదాన్ని ఆశ్రయించటంతో జాతీయతకు సరికొత్త
వ్యాఖ్యానం తెరమీదకు వచ్చింది. వర్ధమాన దేశాల్లో తెరమీదకు వచ్చిన
జాతీయభావాలు బాహ్య శతృవుకు వ్యతిరేకంగా అంతర్గతంగా వైవిధ్య భరితమైన ప్రజా
సమూహాలను ఏకం చేసే క్రమంలో ముందుకొచ్చిన జాతీయత. ఈ విధంగా చూసినపుడు
యూరోపియన్ జాతీయ నిర్దిష్ట వర్గాలను, సామాజిక తరగతులను, మత విశ్వాసాలను
వెలివేసింది (ఎక్స్క్లూజివ్) జాతీయత కాగా వర్ధమాన దేశాల జాతీయత సకల
సామాజిక తరగతులు, మత విశ్వాసాలు, వర్గాలను సంలీనం చేసుకునే (ఇన్క్లూజివ్)
జాతీయత అన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. యూరోపియన్
దేశాల్లో పెల్లుబుకిన జాతీయత ఆయా దేశాలను పదేపదే విచ్ఛిన్నం చేస్తూ
పునరేకీకరణ గావిస్తూ షుమారు రెండు వందల ఏండ్ల రక్తసిక్త యూరప్కు
తెరతీసింది. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాల్లో సంఘటితమైన జాతీయత సుమారు
వందేండ్ల వర్తమాన చరిత్రలో శాంతియుత సహజీవనానికి పునాదులు వేసింది. ఆధునిక
ప్రపంచ చరిత్రలో ఇంత దీర్ఘకాలం వర్థమాన దేశాల్లో అంతర్గత శాంతియుత
పరిస్థితులు కొనసాగటం ఇదే ప్రథమమం అని చెప్పటం అతిశయోక్తి కాదు.
భారత
రాజ్యాంగం, భారత జాతీయత రెండూ స్వాతంత్య్రోద్యమ పోరాట నేపథ్యంలో రాటుదేలిన
వైవిధ్య భరితమైన రాజకీయ సామాజిక మేధోమధనం ఫలితం. యూరోపియన్ జాతీయత
సంఘటితమయ్యే క్రమంలో పాలకవర్గాలు, మార్కెట్ కీలక పాత్ర పోషిస్తే భారత
జాతీయ సంఘటితం కావటంలో ప్రజలు, ప్రజా పోరాటాలు, ప్రత్యేకించి పెట్టుబడిదారీ
వ్యవస్థ అంశంగా మారిన వలసవాదానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజా
పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రజా పోరాటాలు దేశ రాజకీయ వ్యవస్థ ముందు
ఉంచిన ఆశలు, ఆశయాలు, లక్ష్యాల సాధనతో పాటు యూరోపియన్ తరహా జాతీయతకు
భిన్నంగా విలక్షణమైన సమ్మిళితమైన భారత జాతీయతను పాలకవర్గాలు
అంగీకరించాల్సిన పరిస్థితి కల్పించింది. భారత రాజ్యాంగం కొన్ని మౌలిక
విషయాలను ప్రత్యేకించి నిర్వచించకుండా వదిలేసింది. జాతీయత అంటే ఏమిటి?
ఇండియా దట్ ఈజ్ భారత్ అన్న పదబంధం అటువంటి మౌలిక విషయాల్లో ఒకటి.
అంతమాత్రాన రాజ్యాంగ పరిషత్ ఈ అంశాలను తడమలేదు అనుకుంటే పొరపాటు. అప్పటికే
సర్వాంగీకృత అభిప్రాయాలను వ్యక్తీకరించేవిగా ఈ పదబంధాలు ఉన్నందున వాటి
గురించి ప్రత్యేకంగా చర్చించలేదు. కానీ వాటిని విపులీకరిస్తూ వివిధ
అధికరణాల్లో ప్రస్తావనలు వదిలారు.
భారత భూభాగంపై జన్మించి నివశిస్తున్న
పౌరులందరు భారతీయులే అని పౌరసత్వాన్ని ధృవీకరించింది. తద్వారా భారత జాతీయత
భారత దేశంలో నివశించే వారందరి ఉమ్మడి జాతీయత పర్యవసానం అని చెప్పకనే
చెప్పింది. అంతేకాదు. దేశంలో నివసిస్తున్న వైవిధ్యభరితమైన సామాజిక ఆర్థిక
తరగతులు, మత విశ్వాసాలకు చెందిన వారిని గుర్తించటమే కాక వారి అస్థిత్వాన్ని
రాజ్యాంగం అంగీకరించింది. అందువల్లనే అటువంటి బలహీనులైన తరగతులందరికీ
అవసరమైన రక్షణలు కూడా కల్పించాలని, స్వాతంత్య్రోద్యమ పర్యవసానంగా సంఘటితమైన
భారత జాతీయతను కాపాడుకోవాలంటే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అన్ని తరగతుల
ప్రజల మనోభావాలు, ఆశలు, ఆశయాలు నెరవేర్చుకునేందుకు రాజ్యాంగం ద్వారా కనీస
హామీ ఇవ్వాలని రాజ్యాంగ పరిషత్ నిర్ణయించింది. అందువల్ల భారత రాజ్యాంగంలో
ప్రస్తావన లేని కోణాలు భారత జాతీయతలోనూ లేవు. స్వతంత్ర భారతదేశం ఎన్నో
వేర్పాటువాద ఉద్యమాలను తట్టుకుని అధిగమించి జాతీయ సమైక్యతా సమగ్రతలను
కాపాడుకుంటూ తన ఉనికిని కొనసాగించుకుంటూ వచ్చింది. రాజ్యాంగం ఆరెస్సెస్
కోరుకుంటున్న మనువాద వ్యవస్థ, కుల వ్యవస్థను తిరుగులేని విధంగా దెబ్బ
తీసింది.
కుల వ్యత్యాసాలు, మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా రాజ్యంగం భారతదేశంలో
జన్మించిన వారందరికీ సమాన హక్కులు, అవకాశాలు, ఓటింగ్ హక్కులు
ప్రసాదించింది. ఇటువంటి పరిమిత ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్థానంలో
సార్వత్రిక ఓటుహక్కును మొదటిగా అందరికీ అందించింది ఫ్రెంచి విప్లవం. ఈ
విప్లవం స్ఫూర్తిగా నాటి వలస దేశాలన్నింటిలోనూ ఈ నినాదం పోరాట నినాదంగా
మారింది. ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో సార్వత్రిక ఓటు హక్కు 1960 దశకం
నాటికి గానీ చట్టబద్ధం కాని పరిస్థితుల్లో భారత రాజ్యాంగం 1947 నాటికే
సార్వత్రిక ఓటు హక్కును రాజ్యాంగ బద్ధం చేసింది. ఈ విధంగా సార్వత్రిక ఓటు
హక్కు ఇవ్వటాన్ని నాడే ఆరెస్సెస్ వ్యతిరేకించింది. కుల మత ప్రాంత
విద్వేషాలతో దేశాన్ని రక్తసిక్తం చేసే మనువాద సంస్కృతినే జాతీయతగా దేశం మీద
రుద్దేందుకు శతాబ్ద కాలం నుంచీ ప్రయత్నిస్తూనే ఉంది.
అటువంటి
సంఘపరివారం స్వదేశీ ముసుగులో భారతదేశాన్ని యూరోపియన్ దేశాల తరహాలో
ఉన్మాదపూరిత జాతీయతవైపు నెడుతున్న వాస్తవాన్ని గత ఐదేండ్లలో జరిగిన
పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దేశీయంగా రూపొందిన జాతీయత పునాదులు
సంఘపరివారానికి అక్కర్లేదు. విదేశీ నమూనాలో ఉన్న ఉన్మాద భరిత జాతీయతే
దానికి ముద్దు. అందుకే సమీకృత, ప్రజాతంత్ర భారత జాతీయతను కాపాడేందుకు కంకణ
బద్ధులైన వారంతా ఈ ఎన్నికల్లో ఉన్మాద జాతీయవాదానికి ప్రతినిధులుగా ఉన్న
బీజేపీ, దాని మిత్రులను ఓడించటం జాతీయ కర్తవ్యంగా ఎంచుకోవాలి.
Mar 26,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/783962
ఏది భారత జాతీయత ?
మెజారిటీ
హిందూత్వమే భారతీయ జాతీయత అన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే
స్వాతంత్య్రోద్యమం నిజమైన ప్రజాతంత్ర ఉద్యమంగా పరిణామం చెందిన తీరును అర్థం
చేసుకోవాలి. ప్రజాతంత్రీకరణ కోణంలో చూసినపుడు భారత స్వాతంత్య్రోద్యమ పోరాట
చరిత్రను మూడు భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ ప్రజాతంత్ర స్వభావాన్ని
పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ప్రాతిపదికగా విశ్లేషిస్తున్నాం. విస్తృత ప్రజా
బాహుళ్యం భాగస్వామ్యం ఉన్న అసంఘటిత పోరాటాల దశ మొదటిది. ఈస్టిండియా కంపెనీ
ప్రారంభించిన భూసంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వేర్వేరు
ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో చెలరేగిన సమరశీల పోరాటాలు, ఫకీర్ల
తిరుగుబాటు నుంచి ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం వరకూ ఉన్న కాలాన్ని ఈ
తొలిదశగా నిర్దారించుకోవచ్చు.
ప్రజల భాగస్వామ్యం
తక్కువగా ఉండి సంఘటిత ప్రయత్నాలు, పోరాటాలు సాగిన కాలం రెండోది. ప్రధానంగా ఈ
దశ ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం తర్వాతి కాలంలో ముఖ్యంగా ఎ ఒ హ్యూమ్
సమన్వయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది మొదలు మహాత్మాగాంధీ
భారతదేశానికి తిరిగి వచ్చే వరకు ఉన్న కాలాన్ని ఈ రెండో దశ కింద చూడొచ్చు. ఈ
కాలంలోనే జాతీయవాదానికి సైద్ధాంతిక జవసత్వాలు చేకూర్చే ప్రయత్నం జరిగింది.
రెండు మార్గాల్లో ఇది జరిగింది. ఇంగ్లాండ్ పార్లమెంట్లో సభ్యులుగా ఉన్న
గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా, దాదాబాయి నౌరోజి, గోపాలకృష్ణ గోఖలే
వంటి వారు ఆర్థిక కోణంలో భారతదేశం గురించిన చర్చను ముందుకు తేవడం మొదటి
కృషి. కమ్యూనిస్టు కుట్రలుగా బ్రిటిష్ నిఘా నివేదికల్లో చోటుచేసుకున్న
లాహౌర్, మీరట్, కాన్పూర్ కుట్ర కేసులుగా నమోదైన పోరాటాలు, ఆ సందర్భంగా
జరిగిన చర్చల్లో భారత జాతీయతకు సంబంధించిన ప్రత్యామ్నాయ కోణాన్ని ముందుకు
తెచ్చిన రెండో మార్గం. స్వాతంత్య్ర పోరాటంలో ఈ కుట్ర కేసుల సందర్భంగా సాగిన
సైద్ధాంతిక మేథోమథనం మరెన్నడూ లేదు. అప్పటికి స్వాతంత్య్రోద్య మానికి
తిరుగులేని నాయకుడుగా ఉన్న కాంగ్రెస్ ఈ కుట్రకేసులు తెరమీదకు తెచ్చిన
అంశాలను కాదనలేక క్రమంగా తన ఎజెండాలోకి తీసుకొచ్చింది. చివరి దశ సంఘటిత
ప్రయత్నాలతోపాటు విశాల జనబాహుళ్యం స్వాంత్రోద్యమంలో భాగస్వాములు అయిన దశగా
చెప్పుకోవచ్చు. ఇది స్వాతంత్య్ర పోరాటంలో నిర్ణయాత్మక దశ. లాహౌర్, మీరట్,
కాన్పూర్ కుట్ర కేసుల విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపించిన వారు నేడు
జేఎన్యూలో చరిత్ర విభాగంలో పరిశోధకులుగా దరఖాస్తు చేసుకుంటే ప్రవేశం
తిరస్కరించగలిగే ధైర్యం నేడు ఎవ్వరికీ లేదని ప్రముఖ చరిత్రకారిణి మృదులా
ముఖర్జీ తాజాగా వ్యాఖ్యానించారంటే వారి వాదనల పటిమ, శాస్త్రీయత, చారిత్రక
స్థాయి ఏమిటో అర్థమవుతుంది.
ఈ మూడు దశల్లోనూ తనదైన పాత్ర పోషించింది నాటి కాంగ్రెస్ పార్టీ. చివరి
రెండుదశల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించింది జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం.
అందువల్లే భావసారూప్యత రీత్యా స్వాతంత్రోద్యమం తొలిదశలో జరిగిన పోరాటాల
స్ఫూర్తీ కొనసాగిస్తామని భారతకమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) తమ
తాజాపర్చిన కార్యక్రమంలో తెలిపింది. కాంగ్రెస్పార్టీ తన వ్యవస్థాపక
లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్టు నేటికీ చెబుతోంది. కానీ భారత స్వాతంత్య్ర
పోరాటంతో కానీ, పోరాట వారసత్వంతో కానీ ఏ మాత్రం సంబంధం లేని పార్టీ నేటి
బీజేపీ. దానికి మాతృక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్. స్వాతంత్య్రోద్యమ
పోరాటంలో బలిదానం చేసిన అమరులను అటు నాటి కాంగ్రెస్ గానీ, నేటి
కమ్యూనిస్టు ఉద్యమం గానీ వేలసంఖ్యలో పేర్లతో సహా ప్రస్తావించే సత్తా కలిగి
ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసి బ్రిటిష్ జైళ్లల్లో మగ్గటం
ద్వారానో, పోరాటపథంలో అసువులు బాశారనో చెప్పుకోవటానికి వీలైన పేర్లు
ఆరెస్సెస్కు లేవు. ఆరెస్సెస్కు స్వాతంత్య్రోద్యమానికి ఉన్న ఏకైక లింకు
వినాయక దామోదర్ సావర్కార్. ఆయన్ను పూనేలో అరెస్టు చేసి అండమాన్ జైలుకు
పంపితే ఈ జైలు నుంచి విడుదల చేయమని బ్రిటిషోళ్ల కాళ్లా వేళ్లా పడ్డాడని
ఆరెస్సెస్ పట్ల సానుభూతి కలిగిన చరిత్రకారులే ధృవీకరించారు. స్వాతంత్య్రం
నా జన్మ హక్కు అని ప్రకటించిందుకు బాలగంగాధర తిలక్ను రాజద్రోహం నేరం మీద
అండమాన్ జైలుకు పంపితే నాటి బొంబాయి నగరం నిరసనలతో స్తంభించింది. పూనేలో
ప్లేగు వ్యాపించిన సందర్భంలో బ్రిటిష్ అధికారుల హత్యకు ప్రయత్నించినందుకు
సావర్కర్ను అండమాన్ జైలుకు పంపితే ఆయన గురించి చెప్పుకునే నాధుడే
కరువయ్యాడు. ఆరెస్సెస్ ఆద్యుల్లో ఒకరని చెప్పుకుంటున్న సావర్కర్కు ఉన్న
నాడున్న ప్రజాదరణదీ...
భారత్లో కమ్యూనిస్టు ఉద్యమం ఊపిరి పోసుకోవటానికి ముందే దేశ రాజకీయ
రంగస్థలంలో ఆరంగేట్రం చేసి ఆర్ఎస్ఎస్కు స్వాతంత్య్రోద్యమంలో
ప్రత్యక్షంగా పాల్గొనే మాట అటుంచి స్వాతత్య్రోద్యమానికి, దాని లక్ష్యాలకు,
ప్రజల ఆశలు, ఆశయాలకు పూర్తి వ్యతిరేకంగా పని చేసింది. ప్రత్యక్షంగా
బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా పని చేసింది. స్వాతంత్య్రోద్యమ
లక్ష్యాలకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ దాని అనుబంధ సంఘాలూ పని చేయటం ఈనాటిది
కాదు. జాతీయ పతాకగా త్రివర్ణ పతాకాన్ని నాటి స్వాతంత్రోద్యమం ముక్తకంఠంతో
అంగీకరించింది. అదే పతాకాన్ని స్వాతంత్య్రానంతరం అధికారికంగా జాతీయ పతాకగా
దేశం అంగీకరించింది. కానీ ఈ పతాకలో వ్యవసాయాభివృద్ధికి ప్రాతినిధ్యం వహించే
హరిత వర్ణం పరోక్షంగా ఇస్లాం సంస్కృతికి ప్రాతినిధ్యంవహించేదిగా ఉన్నందున
త్రివర్ణపతాకాన్ని జాతీయ పతాకగా తొలగించాలని 1947లోనే ఆరెస్సెస్ అధికారిక
పత్రిక ఆర్గనైజర్ డిమాండ్ చేసింది. రాజ్యాంగం ప్రతిపాదించిన పలు అంశాలు,
అందించిన విలువలకు వ్యతిరేకంగా కుహనా వాదనలు ముందుకు తేవటం ఆరెస్సెస్
పుట్టుకతో నేర్చిన కుటిల విద్య. స్వాతంత్య్రానంతరం భారత సమీకృత
(ఇన్క్లూజివ్) జాతీయతకు ఈశాన్య భారతంలోనూ, పంజాబ్లోనూ, జమ్ము
కాశ్మీర్లోనూ తెరమీదకు వచ్చిన సమరశీల వేర్పాటువాద ఉద్యమాలు సవాలు
విసిరాయి. సవాలును స్వీకరించింది జాతీయ సమైక్యత సమగ్రతల కోసం వేలాదిమంది
కార్యకర్తలను ఫణంగా పెట్టి పోరాడిందీ భారత కమ్యూనిస్టు పార్టీ(
మార్క్సిస్టు) మాత్రమే. ఈ విచ్ఛిన్నకర ఉద్యమాలు పతాక స్థాయిలో కొనసాగు
తున్నపుడు, దేశాన్ని అస్థిరత్వం వైపు నెట్టిన సమయంలో నేడు భారత జాతీయత
ప్రమాదపుటంచున ఉన్నది అని ఘోషిస్తున్న పార్టీ నేతలెవ్వరూ నోరెత్తలేదు.
వేర్పాటువాద ఉద్యమాలను చట్టసభల్లోనూ, బయటా విధానపరంగానైనా వ్యతిరేకించలేదు.
ఎందుకంటే ఆరెస్సెస్ కోరుకుంటున్న భారత్ నేటి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా
విభజితమైన భారతదేశం కాదు. 1947కు పూర్వం ఉన్న 560పైగా సంస్థానాలు,
జమీందార్ల పాలనలో ఉన్నట్టుగా ఆధునిక భారతదేశం సాధ్యమైనంత చిన్నచిన్న
రాష్ట్రాలుగా చీల్చాలన్నది ఆరెస్సెస్ ప్రతిపాదన.
(తరువాయి రేపటి సంచికలో)
స్వాతంత్య్రోద్యమంలో
భాగంగా ప్రజాతంత్ర జాతీయవాదానికి పునాదులు వేసిన మరో మైలురాయి భాషా
ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు. యిప్పుడు చెప్పుకున్న దశల్లో చివరి దశలో
తెరమీదకు వచ్చిన ఈ ఉద్యమాలు అవిభక్త బెంగాల్ నుంచి ఒరిస్సాను వేరు చేయటంతో
ప్రారంభమై రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా
స్వతంత్ర భారతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ముగిసాయి. నాటి నుండీ
నేటి వరకు కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్కు గానీ, స్వాతంత్య్రానంతరం ఆరెస్సెస్
రాజకీయ విభాగాలుగా తెరమీదకు వచ్చిన జనసంఫ్ుకు గానీ, నేటి బీజేపీకి గానీ ఈ
ఉద్యమాలతో ఏ మాత్రం సంబంధం లేదు. స్వాతంత్రోద్యమ పోరాటంలో మరో కీలక కోణం
కూడా ఉంది. నాడు పోరాటం విదేశీ పాలకులకు వ్యతిరేకంగా సాగింది. దేశీయ ఆర్థిక
వనరుల మీద వారి పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం. జాతీయ వనరుల మీద ఈ
దేశ ప్రజలందరికీ సమాన హక్కు కోసం జరిగిన పోరాటం. ఈ పోరాటంలోనే జాతీయత అన్న
భావనలో ప్రజలు, వారి ఆర్థిక అవసరాలు, వనరులపై ప్రజల ఆధిపత్యం ఇమిడి
ఉన్నాయి.
సమీకృత, సమ్మిళిత భారతీయ జాతీయతకు ఆర్థిక పునాదులు వేసిన
స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, ఆ స్ఫూర్తిని కాగడాల పట్టి నిలిపిన మహౌన్నతుల
త్యాగాలను తృణీకరిస్తూ నేటి ఆరెస్సెస్, బీజేపీ భక్తులు ముందుకు
తీసుకొస్తున్నది కుహనా భారత జాతీయత. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, మౌలానా
ఆజాద్, భగత్సింగ్ వంటి నేతల త్యాగాలతో స్ఫూర్తి పెనవేసుకుపోయింది.
అందుకే ఈ స్వాతంత్య్రోద్యమ సేనానులను దూషించి, తూలనాడి, తృణీకరించి,
బహిరంగంగా అవమానపరిస్తే తప్ప వారితో పాటు పెనవేసుకుపోయిన జాతీయతా భావాన్ని
తప్పుపట్టడం సాధ్యం కాదు. నెహ్రూని ఏకంగా హిందూస్థాన్ని దోచుకున్న
బందిపోటు ముఠా నాయకుడు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర టీవీ
చర్చలో వ్యాఖ్యానించినా మందలించిన పాపాన పోలేదు బీజేపీ నాయకత్వం. తాజాగా
అరుణ్ జైట్లీ నెహ్రూవల్లనే భారతదేశానికి దక్కాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా
మండలి శాశ్వత సభ్యత్వం చైనా తన్నుకుపోయిందని వ్యాఖ్యానించటం కూడా ఇందులో
భాగమే.
ప్రపంచీకరణ,
ఆర్థిక సంస్కరణల పేరుతో తిరిగి దేశాన్ని ఆర్థిక సామ్రాజ్యవాద శక్తులకు
కుదవపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను ప్రతిఘటించే ఉద్యమాలను బలహీనం చేసే
కుట్రపూరిత ప్రయత్నమే భారత జాతీయత అంటే కేవలం హిందూ జాతీయత అని చెప్పడం. ఈ
దేశంలో మిగిలిన సామాజిక, ధార్మిక తరగతులను దేశం నుంచి జాతీయ ఆర్థిక జీవన
స్రవంతి నుంచి వెలివేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నది వీరి భావన! ఈ విధంగా
దేశంలో వివిధ మత విశ్వాసాలకు చెందిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను, అంతర్గత
ప్రత్యర్థులను దేశద్రోహులుగా ముద్ర వేసుకుంటూ పోతే చివరకు ప్రభుత్వమే
దేశం, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీయే దేశంగా మారటం,
చిట్టచివరకు సదరు పార్టీనాయకుడే దేశంగా మారుతుందని నియంతృత్వాల చరిత్ర
నిర్ధారిస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా మోడీ దైవాంశ సంభూతుడన్న నాటి
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను గమనించవచ్చు. ఇంతకు ముందు
చెప్పినట్టు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వ వ్యతిరేకతే దేశ వ్యతిరేకత అని
ఆరెస్సెస్ మందీ మార్బలం సాగిస్తున్న ప్రచారం చివరకు ప్రభుత్వానికి
నాయకత్వం వహిసుస్తన్న పార్టీయే ప్రభుత్వం అన్న స్థాయికి పార్లమెంటరీ
ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తోంది.
ఈ
క్రమంలో సదరు ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీ సిద్ధాంతాలను, వివిధ
సామాజిక ఆర్థిక సాంస్కృతిక వ్యవహారాలపై వారి అభిప్రాయాలను ప్రశ్నించటం,
తిరస్కరించటం అంతిమంగా దేశద్రోహంగా మారే విపరీత పరిస్థితి సృష్టించింది.
ఇక్కడ పాఠకులు, పాలకులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం
ప్రపంచ దేశాల్లోకల్లా అత్యంత ప్రజాతంత్ర రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ
పీఠిక భారతీయులమైన మేము భారత దేశాన్ని సర్వ సత్తాక ప్రజాతంత్ర లౌకిక
సామ్యవాద గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాము అని చెప్పటం ద్వారా ఇక్కడ
ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ నిర్మాతగా మారాడు. గత ఆరు దశాబ్దాల్లో వివిధ
సందర్భాల్లో రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అని సుప్రీం
కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పదే పదే గుర్తు చేస్తూనే వచ్చింది. ఈ రాజ్యాంగం,
తద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించే న్యాయవ్యవస్థనే గుర్తించ
నిరాకరిస్తున్న సంఘ పరివారం ప్రభుత్వంపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించే అవకాశం
కల్పించటం భారత రాజ్యాంగంలోని ప్రజాతంత్ర స్వభావానికి తాజా ఉదాహరణ.
మోడీ
కేబినెట్లో పలువురు ఆరెస్సెస్ యూనిఫారం ధరించటం మానేశారు తప్ప
ఆరెస్సెస్ మౌలిక లక్ష్యాలను మక్కికి మక్కీ అమలు చేస్తున్నారు. అటువంటి
వారి చేతుల్లో రాజ్యాంగయంత్రం నేడు బందీ అయ్యింది. ఈ రాజ్యాంగ యంత్రం దేశ
వాసులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత నుంచి నిర్దిష్ట
సామాజిక సమూహాలకు దేశ వనరులు, అవకాశాలు, హక్కులను దఖలు పరుస్తూ మిగిలిన
వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేందుకు బాహాటంగానే కృషి చేస్తోంది.
బీజేపీ చేస్తున్న విధ్వంసం కేవలం దేశంలో జాతీయవాద భావాలు తగ్గినందువల్ల
దాన్ని పెంపొందించటానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్పబూనుకోవటం విడ్డూరం.
నిజమైన జాతీయవాదం, రాజ్యాంగ నిర్మిత జాతీయవాదానికి తూట్లుపొడవటానికి
జరుగుతున్న ప్రయత్నమే తప్ప మరోటి కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవటంలో
విఫలమైతే స్వాతంత్య్రో ద్యమం ప్రజాతంత్ర లక్ష్యాలు ఆశయాలకు ప్రాతనిధ్యం
వహిస్తూ నిర్మితమైన పలు రాజ్యాంగ వ్యవస్థలకు ఆరెస్సెస్ భావజాల ప్రేరేపిత
ప్రభుత్వం తెచ్చిపెడుతున్న ముప్పు పట్ల ఏమరుపాటు వహించిన వాళ్లమే అవుతాము.
ప్రపంచ
దేశాల రాజ్యాంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి, సామాజిక అభివృద్ధికి
సంబంధించిన అత్యంత పురోగామి భావాలను రాజ్యాంగ బద్ధమైన హక్కులు, అవకాశాలు,
బాధ్యతలు, విధులు కింద మార్చటంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు బిఆర్
అంబేద్కర్ పాత్ర అద్వితీయం. రాజ్యాంగం ప్రతిపాదించిన ఇటువంటి అనేక
అవకాశాలు ప్రజాతంత్ర జాతీయతను పరిపుష్టం చేశాయి. నేడు జాతీయత పేరుతో
ఆరెస్సెస్ ముందుకు తెస్తున్న వాదనలన్నీ ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు
వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తామని
రాష్ట్రపతి ముందు ప్రమాణం చేసిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన దాడికి
నాయకత్వం వహించటం దేశాధ్యక్షుడుగా ఉన్న హిట్లరే స్వయంగా జర్మనీ
పార్లమెంట్కు నిప్పంటించే కుట్రకు వ్యూహం పన్నిన సందర్భాన్ని గుర్తుకు
తెస్తుంది. రష్యాలో గోర్బచేవ్ నాయకత్వంలో విప్లవ రష్యా రాజ్యాంగాన్ని,
విప్లవ పతాకాన్ని, పార్టీని, పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసి జార్ కాలం
నాటి చిహ్నాలను చట్టబద్ధం చేసిన సందర్భంతోనూ మోడీ పాలనకు పోలికలున్నాయి.
అదికూడా బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పార్లమెంట్
ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకు మొక్కుబడిగా నీరాజనాలు పలుకుతూ
మరోవైపు ఆయన అందించిన రాజ్యాంగంలోని ప్రజాతంత్రయుతమైన హక్కులను 'హిందూ'మహా
సముద్రంలో నిమజ్జనం చేయటానికి పాచికలు వేస్తోంది ఆరెస్సెస్. ఆరెస్సెస్
శకుని తరహాలో ఆడిస్తున్న పాచికలాటను దుర్యోధనుడు ఆడినట్టుగా మోడీ, కౌరవ
సమూహంలా ఆయన మంత్రివర్గంలోని హేమా హేమీలు ఆడుతున్నారు. నాటి మహాభారతంలో
ద్రౌపది వస్త్రాపహరణానికి గురైతే నేటి భారతంలో రాజ్యాంగంలోని ప్రజాతంత్ర
హక్కులు వస్త్రాపహరణానికి గురవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో డాక్టర్
అంబేద్కర్ ఆశయాల పరిరక్షణకు పాటుపడటం అంటే అంబేద్కర్ విరచిత
రాజ్యాంగాన్ని, దాని ప్రజాతంత్ర స్వభావాన్ని, స్వాంత్య్రోద్యమ వారసత్వంగా
అందివచ్చిన ప్రజాతంత్ర జాతీయతను కాపాడుకోవటానికి పోరాడటమే. ఇదే నిజమైన
దేశభక్తుల కర్తవ్యం. జాతీయవాదం ముసుగులో రాజ్యాంగ విరచిత ప్రజాతంత్ర జాతీయత
స్థానంలో ఆరెస్సెస్ విరచిత మతోన్మాద జాతీయతను ముందుకు తేవటానికి, అదే
అసలైన జాతీయతగా చిత్రించేందుకు జరుగు తున్న కుయత్నాలను ఆమూలాగ్రం
వ్యతిరేకించి పోరాడటమే నిజమైన భారతీయతకు నీరాజనం పట్టే మార్గం. ఈ సందర్భంగా
స్వాతం త్యోద్యమం తోనూ, స్వాతంత్య్రోద్యమం అందించిన ప్రజాతంత్ర జాతీయవాద
భావనలతోనూ ఏ మాత్రం సంబంధం లేని ఆరెస్సెస్ బీజేపీలు ఏ విధంగా మిథ్యా
జాతీయవాదాన్ని తెరమీదకు తెస్తున్నాయో వివరించే ప్రయత్నం చేయాలి. ఆరెస్సెస్
కుట్రలకు అడ్డు కట్ట వేయాలి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తున్న శక్తులను గద్దె
దింపాలి. దీనికి 2019 ఎన్నికలే తగిన సందర్భం.