Wednesday, May 22, 2019

 http://www.navatelangana.com/article/net-vyaasam/782502

కాపలా మాని కథలు చెపుతున్న చౌకీదార్‌!

ఏది భారత జాతీయత?

(నిన్నటి సంచిక తరువాయి)
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ప్రజాతంత్ర జాతీయవాదానికి పునాదులు వేసిన మరో మైలురాయి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు. యిప్పుడు చెప్పుకున్న దశల్లో చివరి దశలో తెరమీదకు వచ్చిన ఈ ఉద్యమాలు అవిభక్త బెంగాల్‌ నుంచి ఒరిస్సాను వేరు చేయటంతో ప్రారంభమై రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా స్వతంత్ర భారతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ముగిసాయి. నాటి నుండీ నేటి వరకు కొనసాగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు గానీ, స్వాతంత్య్రానంతరం ఆరెస్సెస్‌ రాజకీయ విభాగాలుగా తెరమీదకు వచ్చిన జనసంఫ్‌ుకు గానీ, నేటి బీజేపీకి గానీ ఈ ఉద్యమాలతో ఏ మాత్రం సంబంధం లేదు. స్వాతంత్రోద్యమ పోరాటంలో మరో కీలక కోణం కూడా ఉంది. నాడు పోరాటం విదేశీ పాలకులకు వ్యతిరేకంగా సాగింది. దేశీయ ఆర్థిక వనరుల మీద వారి పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం. జాతీయ వనరుల మీద ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కు కోసం జరిగిన పోరాటం. ఈ పోరాటంలోనే జాతీయత అన్న భావనలో ప్రజలు, వారి ఆర్థిక అవసరాలు, వనరులపై ప్రజల ఆధిపత్యం ఇమిడి ఉన్నాయి.
సమీకృత, సమ్మిళిత భారతీయ జాతీయతకు ఆర్థిక పునాదులు వేసిన స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, ఆ స్ఫూర్తిని కాగడాల పట్టి నిలిపిన మహౌన్నతుల త్యాగాలను తృణీకరిస్తూ నేటి ఆరెస్సెస్‌, బీజేపీ భక్తులు ముందుకు తీసుకొస్తున్నది కుహనా భారత జాతీయత. అంబేద్కర్‌, గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్‌, భగత్‌సింగ్‌ వంటి నేతల త్యాగాలతో స్ఫూర్తి పెనవేసుకుపోయింది. అందుకే ఈ స్వాతంత్య్రోద్యమ సేనానులను దూషించి, తూలనాడి, తృణీకరించి, బహిరంగంగా అవమానపరిస్తే తప్ప వారితో పాటు పెనవేసుకుపోయిన జాతీయతా భావాన్ని తప్పుపట్టడం సాధ్యం కాదు. నెహ్రూని ఏకంగా హిందూస్థాన్‌ని దోచుకున్న బందిపోటు ముఠా నాయకుడు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర టీవీ చర్చలో వ్యాఖ్యానించినా మందలించిన పాపాన పోలేదు బీజేపీ నాయకత్వం. తాజాగా అరుణ్‌ జైట్లీ నెహ్రూవల్లనే భారతదేశానికి దక్కాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం చైనా తన్నుకుపోయిందని వ్యాఖ్యానించటం కూడా ఇందులో భాగమే.

ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల పేరుతో తిరిగి దేశాన్ని ఆర్థిక సామ్రాజ్యవాద శక్తులకు కుదవపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను ప్రతిఘటించే ఉద్యమాలను బలహీనం చేసే కుట్రపూరిత ప్రయత్నమే భారత జాతీయత అంటే కేవలం హిందూ జాతీయత అని చెప్పడం. ఈ దేశంలో మిగిలిన సామాజిక, ధార్మిక తరగతులను దేశం నుంచి జాతీయ ఆర్థిక జీవన స్రవంతి నుంచి వెలివేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నది వీరి భావన! ఈ విధంగా దేశంలో వివిధ మత విశ్వాసాలకు చెందిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను, అంతర్గత ప్రత్యర్థులను దేశద్రోహులుగా ముద్ర వేసుకుంటూ పోతే చివరకు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీయే దేశంగా మారటం, చిట్టచివరకు సదరు పార్టీనాయకుడే దేశంగా మారుతుందని నియంతృత్వాల చరిత్ర నిర్ధారిస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా మోడీ దైవాంశ సంభూతుడన్న నాటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను గమనించవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వ వ్యతిరేకతే దేశ వ్యతిరేకత అని ఆరెస్సెస్‌ మందీ మార్బలం సాగిస్తున్న ప్రచారం చివరకు ప్రభుత్వానికి నాయకత్వం వహిసుస్తన్న పార్టీయే ప్రభుత్వం అన్న స్థాయికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తోంది.

ఈ క్రమంలో సదరు ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీ సిద్ధాంతాలను, వివిధ సామాజిక ఆర్థిక సాంస్కృతిక వ్యవహారాలపై వారి అభిప్రాయాలను ప్రశ్నించటం, తిరస్కరించటం అంతిమంగా దేశద్రోహంగా మారే విపరీత పరిస్థితి సృష్టించింది. ఇక్కడ పాఠకులు, పాలకులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకల్లా అత్యంత ప్రజాతంత్ర రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ పీఠిక భారతీయులమైన మేము భారత దేశాన్ని సర్వ సత్తాక ప్రజాతంత్ర లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాము అని చెప్పటం ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ నిర్మాతగా మారాడు. గత ఆరు దశాబ్దాల్లో వివిధ సందర్భాల్లో రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పదే పదే గుర్తు చేస్తూనే వచ్చింది. ఈ రాజ్యాంగం, తద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించే న్యాయవ్యవస్థనే గుర్తించ నిరాకరిస్తున్న సంఘ పరివారం ప్రభుత్వంపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించే అవకాశం కల్పించటం భారత రాజ్యాంగంలోని ప్రజాతంత్ర స్వభావానికి తాజా ఉదాహరణ.
మోడీ కేబినెట్‌లో పలువురు ఆరెస్సెస్‌ యూనిఫారం ధరించటం మానేశారు తప్ప ఆరెస్సెస్‌ మౌలిక లక్ష్యాలను మక్కికి మక్కీ అమలు చేస్తున్నారు. అటువంటి వారి చేతుల్లో రాజ్యాంగయంత్రం నేడు బందీ అయ్యింది. ఈ రాజ్యాంగ యంత్రం దేశ వాసులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత నుంచి నిర్దిష్ట సామాజిక సమూహాలకు దేశ వనరులు, అవకాశాలు, హక్కులను దఖలు పరుస్తూ మిగిలిన వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేందుకు బాహాటంగానే కృషి చేస్తోంది. బీజేపీ చేస్తున్న విధ్వంసం కేవలం దేశంలో జాతీయవాద భావాలు తగ్గినందువల్ల దాన్ని పెంపొందించటానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్పబూనుకోవటం విడ్డూరం. నిజమైన జాతీయవాదం, రాజ్యాంగ నిర్మిత జాతీయవాదానికి తూట్లుపొడవటానికి జరుగుతున్న ప్రయత్నమే తప్ప మరోటి కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమైతే స్వాతంత్య్రో ద్యమం ప్రజాతంత్ర లక్ష్యాలు ఆశయాలకు ప్రాతనిధ్యం వహిస్తూ నిర్మితమైన పలు రాజ్యాంగ వ్యవస్థలకు ఆరెస్సెస్‌ భావజాల ప్రేరేపిత ప్రభుత్వం తెచ్చిపెడుతున్న ముప్పు పట్ల ఏమరుపాటు వహించిన వాళ్లమే అవుతాము.

ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి, సామాజిక అభివృద్ధికి సంబంధించిన అత్యంత పురోగామి భావాలను రాజ్యాంగ బద్ధమైన హక్కులు, అవకాశాలు, బాధ్యతలు, విధులు కింద మార్చటంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు బిఆర్‌ అంబేద్కర్‌ పాత్ర అద్వితీయం. రాజ్యాంగం ప్రతిపాదించిన ఇటువంటి అనేక అవకాశాలు ప్రజాతంత్ర జాతీయతను పరిపుష్టం చేశాయి. నేడు జాతీయత పేరుతో ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్న వాదనలన్నీ ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తామని రాష్ట్రపతి ముందు ప్రమాణం చేసిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన దాడికి నాయకత్వం వహించటం దేశాధ్యక్షుడుగా ఉన్న హిట్లరే స్వయంగా జర్మనీ పార్లమెంట్‌కు నిప్పంటించే కుట్రకు వ్యూహం పన్నిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. రష్యాలో గోర్బచేవ్‌ నాయకత్వంలో విప్లవ రష్యా రాజ్యాంగాన్ని, విప్లవ పతాకాన్ని, పార్టీని, పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసి జార్‌ కాలం నాటి చిహ్నాలను చట్టబద్ధం చేసిన సందర్భంతోనూ మోడీ పాలనకు పోలికలున్నాయి. అదికూడా బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకు మొక్కుబడిగా నీరాజనాలు పలుకుతూ మరోవైపు ఆయన అందించిన రాజ్యాంగంలోని ప్రజాతంత్రయుతమైన హక్కులను 'హిందూ'మహా సముద్రంలో నిమజ్జనం చేయటానికి పాచికలు వేస్తోంది ఆరెస్సెస్‌. ఆరెస్సెస్‌ శకుని తరహాలో ఆడిస్తున్న పాచికలాటను దుర్యోధనుడు ఆడినట్టుగా మోడీ, కౌరవ సమూహంలా ఆయన మంత్రివర్గంలోని హేమా హేమీలు ఆడుతున్నారు. నాటి మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణానికి గురైతే నేటి భారతంలో రాజ్యాంగంలోని ప్రజాతంత్ర హక్కులు వస్త్రాపహరణానికి గురవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయాల పరిరక్షణకు పాటుపడటం అంటే అంబేద్కర్‌ విరచిత రాజ్యాంగాన్ని, దాని ప్రజాతంత్ర స్వభావాన్ని, స్వాంత్య్రోద్యమ వారసత్వంగా అందివచ్చిన ప్రజాతంత్ర జాతీయతను కాపాడుకోవటానికి పోరాడటమే. ఇదే నిజమైన దేశభక్తుల కర్తవ్యం. జాతీయవాదం ముసుగులో రాజ్యాంగ విరచిత ప్రజాతంత్ర జాతీయత స్థానంలో ఆరెస్సెస్‌ విరచిత మతోన్మాద జాతీయతను ముందుకు తేవటానికి, అదే అసలైన జాతీయతగా చిత్రించేందుకు జరుగు తున్న కుయత్నాలను ఆమూలాగ్రం వ్యతిరేకించి పోరాడటమే నిజమైన భారతీయతకు నీరాజనం పట్టే మార్గం. ఈ సందర్భంగా స్వాతం త్యోద్యమం తోనూ, స్వాతంత్య్రోద్యమం అందించిన ప్రజాతంత్ర జాతీయవాద భావనలతోనూ ఏ మాత్రం సంబంధం లేని ఆరెస్సెస్‌ బీజేపీలు ఏ విధంగా మిథ్యా జాతీయవాదాన్ని తెరమీదకు తెస్తున్నాయో వివరించే ప్రయత్నం చేయాలి. ఆరెస్సెస్‌ కుట్రలకు అడ్డు కట్ట వేయాలి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తున్న శక్తులను గద్దె దింపాలి. దీనికి 2019 ఎన్నికలే తగిన సందర్భం.
- కొండూరు వీరయ్య
సెల్‌: 9871794037

మారుతున్న సంఘ్‌' వ్యూహాలు.. 

http://www.navatelangana.com/article/net-vyaasam/787073

సామాజిక జీవితంపై ప్రభావంలోక్‌సభ ఎన్నికలకు గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లాల్‌ కిషన్‌ అద్వానీ స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నామినేషన్‌ దాఖలు చేయటంతో బీజేపీ తొలితరం నాయకత్వం పూర్తిగా తెరమరుగైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పార్టీకి రాజకీయంగా సైద్ధాంతికంగా సారధ్యం వహించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి-అద్వానీ స్థానంలో అమిత్‌షా- నరేంద్రమోడీ ద్వయం పార్టీ వ్యవస్థపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్టీకి సారధ్యం వహించటంలో ఈ రెండు జోడీల మధ్య సాపత్య వ్యత్యాసాలు రానున్న కాలంలో చర్చనీయాంశం కానున్నాయి.
మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి వాజ్‌పేయి-అద్వానీ సారధ్యం వహించిన తీరుకు గత ఐదేండ్లుగా మోడీ-షా సారధ్యం వహిస్తున్న తీరుకూ మధ్య పోలిక లేదు. మోడీ-షా ద్వయం నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఫ్‌ు పడగ నీడ అటు పార్టీపైనా ఇటు ప్రభుత్వంపైనా మర్రి ఊడలా పర్చుకుంటోంది. 1998లో ఎన్డీయే తొలిసారి అధికారానికి రావటంతో భారత రాజకీయాల్లో హిందూత్వ ఆధిపత్య రాజకీయాలు నిర్ణయాత్మక దశకు చేరుకుంటే 2014లో మోడీ-షా ద్వయం పగ్గాలు చేపట్టాక హిందూత్వ రాజకీయాలు కాస్తా హిందూ ఉన్మాద రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. రెండు దశల్లోనూ సంఘపరివారం వ్యూహాత్మకంగానే వ్యవహరిం చింది. 1998లో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో పరివార్‌కు కీలకమైన రాజకీయ విధానాలను కూడా పక్కన పెట్టింది. 2014లో ఎలాగైనా అధికారం చేజారిపోదు అన్న ధీమా వచ్చాక మోడీ-షా ద్వయం అప్పటి వరకు పక్కన పెట్టిన విధానాలు, వ్యవహారాలు, ఎజెండాలు అన్నీ తెరమీదకు తెచ్చేసింది.
ఇప్పటి వరకు కేంద్రంలో అధికారం చేపట్టిన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంతో పోల్చి చూస్తే 2014లో బీజేపీకి మాత్రమే అతి తక్కువ ఓట్ల శాతం -31 శాతం వచ్చాయి. అంటే సంఖ్యరీత్యా పార్లమెంట్‌లో బలంగా ఉన్నా ప్రజాపునాది రీత్యా అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. కానీ మోడీ పరిపాలన ప్రాధాన్యతలు దేశాన్ని మరో రెండు దశాబ్దాల వరకు ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. పరిమిత ప్రజా పునాది కలిగిన ప్రభుత్వం దేశ భవిష్యత్తును అపరిమితంగా ప్రభావితం చేసే విధానాలకు తెర తీసే అధికారం కలిగి ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఇటువంటి విధానాలన్నీ రాజకీయ సైద్ధాంతిక సాంస్కృతిక రంగంలో ఏ విధంగా ప్రభావం చూపుతాయో అర్థం చేసుకుంటే తప్ప మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకోలేం. మరో మాటలో చెప్పాలంటే ఆధిపత్య రాజకీయాల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామిక వ్యవస్థపై విస్తరిస్తున్న సంఘపరివారం పడగ నీడ ప్రమాదాన్ని కూడా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే ఏమిటి అన్న ప్రశ్నతో కాలం వెళ్లబుచ్చదల్చుకున్న వారికి ఓటు కేవలం ప్రభుత్వాలను ఎన్నుకోవటం కోసం మాత్రమే కాదనీ, ప్రజల భవిష్యత్తును, దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయటంలో ఓటు కీలకపాత్ర పోషిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించటంలో విఫలమవుతాము.
మోడీ పరిపాలనలో భారతీయ సమాజంలో పెరుగుతున్న మితవాద ప్రజాతంత్ర వ్యతిరేక ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటే మోడీ పాలన ప్రభావాన్ని విశ్లేషించాలి. అర్థం చేసుకోవాలి. హిందూత్వ రాజకీయాల నాందీ ప్రస్తావన నుంచి పరిశీలిస్తే తప్ప దీన్ని అర్థం చేసుకోలేము. వలసవాదంతో మొదలైన హిందూ-ముస్లిం విభజన స్వాతంత్య్రానంతరం ఏయే రూపాలు తీసుకుంది, జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించిన తర్వాత పరిస్థితుల గురించిన ప్రశ్న అటువంటి వాటిలో ఒకటి. ముస్లిం వేర్పాటువాదానికి ప్రతిగా హిందూ మతోన్మాదం తలెత్తిందన్న వాదన తరచూ వినిపిస్తోంది. కానీ చరిత్రను పరిశీలిస్తే ఈ వాదన సత్యదూరమని తేటతెల్లమవుతుంది. వలస పాలనలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు ఆవిర్భÛవించిన దశాబ్దం తర్వాతే ముస్లింలీగ్‌ భారత రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది. అందుకే సంఫ్‌ుపరివారానికి మొదటి శతృవు చరిత్ర. చరిత్రకారులు. చరిత్ర నుంచి పుట్టుకొచ్చిన సంస్కృతి. సాంస్కృతిక రంగ కార్యదక్షులు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల బీజేపీ రాజకీయ ప్రస్థానంలో అనేక విధానపరమైన ప్రయోగాలు చేసింది. ప్రపంచ సోషలిస్టు శిబిరం పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఎన్ని పరిమితులతోనైనా కొనసాగుతున్న దశలో బీజేపీ వంటి పచ్చి మితవాద పార్టీ కూడా ప్రజల ముందుకు రావటానికి గాంధేయ సామ్యవాదం నినాదాన్ని స్వీకరించాల్సి వచ్చింది. బీజేపీ పూర్వావతారం భారతీయ జనసంఫ్‌ు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో సాగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం వహించటం ద్వారా తన మతోన్మాద రాజకీయ కోణాలను జయప్రదంగా కప్పిపెట్టుకుని ప్రజల ముందుకు వచ్చింది. ఈ రెండు నినాదాలు పెద్దగా ఆరెస్సెస్‌ పరివారానికి పెద్దగా రాజకీయ ప్రాబల్యాన్ని తెచ్చిపెట్టలేక పోయాయి.

ఈ రెండు ప్రయోగాలు విఫలమయ్యాక బీజేపీ చేపట్టినదే రామమందిరం సమస్య. శతాబ్దాల తరబడి భారతీయ మానసికతలో అంతర్భాగంగా ఉన్న రాముడు, రామాయణాన్ని కుహనా చరిత్ర ఆధారంగా రాజకీయ సాధనంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు వచ్చిందే అయోధ్యలో రామమందిర నిర్మాణం సమస్య. పూర్వపు రెండు ప్రయత్నాల కంటే ఈ ప్రయత్నం బీజేపీకి దాన్ని వెన్నంటి నడుపుతున్న ఆరెస్సెస్‌కు రాజకీయ ప్రాబల్యాన్ని, ప్రజామోదాన్ని తెచ్చి పెట్టింది. దీంతో రామమందిరం బీజేపీకి రాజ్యాధికార సోపానంగా మారింది. దీంతోపాటే ప్రపంచ వ్యాప్తంగా మారిన భౌగోళిక రాజకీయ వాతావరణం కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేకత కాగడాను నిలిపి ఉంచటానికి దోహదం చేసింది.
2014లో మోడీ-షా ద్వయం నాయకత్వ స్థానానికి వచ్చాక హిందూత్వ రాజకీయాల సామాజిక పునాది పెరగటానికి, ప్రజామోదం పొందటానికి వీలుగా మతోన్మాద రాజకీయ చిహ్నాలు, వ్యూహాల్లో పరిణామాత్మక మార్పులు వచ్చాయి. కేవలం ధార్మిక జీవనమే కాక ప్రజా సాంస్కృతిక జీవన శైలి కూడా రాజకీయ కురుక్షేత్రంలో భాగమైంది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చినవే లవ్‌ జీహాద్‌, నవనిర్మాణ సేనలు, ఘర్‌వాపసీ క్రతువులు. వీటన్నింటికీ పరాకాష్ట గోరక్ష, మూక హత్యలు. ఈ నూతన ఎజెండా యావత్తు భారత సామాజిక జీవితాన్ని అతలాకుతలం చేసింది. మరీ ముఖ్యంగా మహిళలను నూతన ఆధిపత్య హిందూ రాజకీయాలకు కేంద్రంగా మార్చింది. ఈ విధంగా సాధారణ హిందూ మతావలంబీకులకు, హిందూమతోన్మాదులకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేసేందుకు ఈ ఐదేండ్లల్లో జరిగిన కృషి భవిష్యత్తు భారతాన్ని మార్చటంలో బీజాక్షరాలుగా పని చేస్తాయనటం సందర్భరహితం కాబోదు.

తమ నిత్యజీవన సమస్యల పరిష్కారానికి బీజేపీ/మోడీ ప్రతిపాదించిన పరిష్కారాలను అమలు చేయాలని 2014లో ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. కానీ బీజేపీ ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి తాను ఎంచుకున్న లక్ష్యాలను, నిర్దేశించుకున్న ఉద్దేశ్యాలతో ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తూ 21వ శతాబ్దంలో మధ్యయుగాల నాటి ప్రపంచం తిరస్కరించిన సామాజిక నిర్మాణాలను పున:ప్రతిష్టించటానికి శాయశక్తులా పని చేసింది. 2014 నాటి మోడీ పాలనకు ప్రజా పునాది పరిమితం అన్న సంగతి గుర్తెరిగారు కనకనే సామాజిక సమీకరణాల అవసరాన్ని బీజేపీ- సంఘపరివారం గుర్తించింది. వాజ్‌పేయి- అద్వానీ బీజేపీని అధికారానికి తేవటానికి రాజకీయ సంకీర్ణాలు నిర్మిస్తే మోడీ-షా ద్వయం సామాజిక సంకీర్ణాలను నిర్మిస్తోంది. రాజకీయ సంకీర్ణాలు ఐదేండ్లకొకసారి మారుతూ ఉంటాయి. కానీ సామాజిక సమీకరణాలు తరానికి ఒకసారో రెండు మూడు తరాలకు ఒకసారో మారతాయి. మోడీ-షా ద్వయం ప్రారంభించిన ఈ ప్రయత్నాలకు గండి కొట్టాలంటే 2019 ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించటం తప్ప మరో మార్గం లేదు. మరో రెండు మూడు తరాలను ఆధిపత్య మతోన్మాద భావజాలానికి బలి చేయకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయం కోరుకునే లౌకిక ప్రజాతంత్ర శక్తులు రాజకీయంగా మతోన్మాదశక్తులను గద్దెనెక్కకుండా చూడటంతో పాటు సామాజిక సాంస్కృతిక జీవనం నుంచి మతోన్మాద శక్తులను వెలివేయాలి.
- కొండూరి వీరయ్య

సెల్‌: 987179403
7

ప్రజాస్వామ్యానికి ఫేక్‌న్యూస్‌ వైరస్‌

Apr 04,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/788542


వికాసం నుంచి విద్వేషానికి బీజేపీ వ్యూహం

 Apr 06,2019

http://www.navatelangana.com/article/net-vyaasam/789099

 ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కర్తవ్యం ఎన్నికల సంస్కరణలు

Apr 11,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/791442


గాడి తప్పుతున్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం

భారత ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందా? రాజ్యాంగ నిర్మాతలు ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ సూత్రం స్వాతంత్య్రానంతర ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి మూల సూత్రంగా ఉంది. బీజేపీ హిందూత్వ ఆధిపత్య రాజకీయాలు కేంద్ర స్థానం ఆక్రమించటం మొదలయ్యాక ఈ సూత్రం - ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ - సూత్రానికి కొత్త నిర్వచనం అమల్లోకి వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతినిధిగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ నేడు అధికారంలో ఉన్న బీజేపీ మౌలిక అవగాహనలో దేశంలో ఎటువంటి భిన్నత్వానికి తావు లేదు. దేశమంతా అఖండ హిందూ దేశమే. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి బీజేపీ ఇస్తున్న నిర్వచనం కూడా ఈ అవగాహనకు తగ్గట్టుగానే ఉంది. బీజేపీ నమూనా ప్రజాస్వామ్యంలో కొన్ని సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం అక్కర్లేదు. ముస్లింలు అటువంటి ఓ సామాజిక తరగతి.
సాధారణంగా ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగేటప్పుడు రాజకీయ పార్టీలు సాధ్యమైనన్ని ఓట్లు సంపాదించేందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అభ్యర్ధుల పొందిక ఆయా సామాజిక తరగతుల నుంచి ఓట్లు రాబట్టడంలో ఉపయోగపడుతుందా లేదా అన్నది అభ్యర్థుల ఎంపికలో పని చేసే ఏకైక సూత్రం అదేసమయంలో భారతదేశంలోని భిన్నత్వానికి అనుగుణంగా చట్టసభల్లో భిన్నత్వం ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా అన్నది కూడా ప్రజాస్వామ్యం ఎంత ప్రజాతంత్రయుతంగా అమలవుతున్నదో వివరించే ఒక ఉదాహరణ. ఈ సారాంశాన్ని గాలికొదిలి కేవలం అభ్యర్థుల పొందిక ఆయా సామాజిక తరగతుల ఓట్లు రాబట్టే ఒక తాత్కాలిక వ్యూహంగా మారింది. చట్టసభలు ప్రజలందరి ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. కాలక్రమంలో అస్థిత్వ రాజకీయాలు ముందుకొచ్చిన తర్వాత ఆయా సామాజిక తరగతులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉందా లేదా అన్న ప్రశ్నకు, ఆయా తరగతుల ప్రయోజనాలకు ఏ మేరకు ప్రాతినిధ్యం ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు మధ్య సంబంధం ఉంది. అటువంటి ఓ సామాజిక తరగతి సమకాలీన రాజకీయాల్లో ప్రాతినిధ్య రాహిత్యాన్ని ఎదుర్కొంటోంది. అది ముస్లిం సామాజిక తరగతి. 2019లో ముస్లిం సామాజిక తరగతి రాజకీయ హక్కుల గురించి మాట్లాడటానికి ఎంతో కొంత సాహసం కావాలి.

భారత రాజకీయ సామాజిక వ్యవస్థకు పునాదిగా ఉన్న లౌకిక వ్యవస్థపై ఆరెస్సెస్‌, జనసంఫ్‌ు, బీజేపీలు గత ఐదారు దశాబ్దాలుగా సాగిస్తూ వచ్చిన సైద్ధాంతిక దాడి మోడీ పరిపాలనలో పతాకస్థాయికి చేరింది. దీంతో లౌకిక ప్రజాతంత్ర రాజకీయాల స్థానంలో హిందూ ఆధిపత్య రాజకీయాలే ప్రధాన స్రవంతి రాజకీయాలుగా తెరమీదకు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపన్యాసాలు దీనికి పెద్ద ఉదాహరణ. దేశం అంటే హిందూమతం, హిందూమతమే దేశంగా మోడీ ఉపన్యాస ధోరణి ఉండటం గాడితప్పిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి చిహ్నం.
ఒకసారి మతం, మతోన్మాద స్థాయికి చేరాక లౌకిక ప్రజాతంత్ర విలువలు వెనకపట్టు పడతాయి. స్వాతంత్య్రోద్యమ విలువలను పుణికిపుచ్చుకున్న లౌకిక ప్రజాతంత్ర విలువల ఆధారిత సామాజిక చైతన్యం స్థానే మత విశ్వాసాల ఆధారిత సామాజిక చైతన్యం నూతన రాజకీయ వేదికగా మారింది. సాధారణంగా చైతన్యం అనే భావన ఓ పురోగామి దృక్ఫధాన్ని ప్రతిబింబించే భావన. కానీ మతోన్మాద రాజకీయాల వేళ్లూనుకుపోయే కొద్దీ ఈ పురోగామి దృక్ఫథం, విశాల దృక్కోణం కాస్తా సంకుచిత అస్థిత్వాల చుట్టూ గిరిగీసుకుపోయే తిరోగామి భావనగా మారింది. సాధారణంగా జనసామాన్యంలో వాడుకలో ఉన్న భావనలకు కొత్త కొత్త టీకా తాత్పర్యాలను రూపొందించి ప్రచారంలో పెట్టడంలో ఆరెస్సెస్‌ది అందె వేసిన చేయి. అటువంటి ప్రచారం గత ఐదేండ్లుగా ఇంకా చెప్పాలంటే 2002నుంచీ ఓ ఉద్యమంలా సాగించింది ఆరెస్సెస్‌. దాంతో సామాజిక అవగాహన యావత్తూ తిరోగమన పట్టాలెక్కింది. దీనికి సరైన ఉదాహరణ చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య.

బీజేపీ, దాని మాతృక ఆరెస్సెస్‌ అవగాహనలో భారతదేశంలో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులు. ప్రజాస్వామ్యంలో పౌరులను శ్రేణులవారీగా విభజించి వ్యవహరించే పద్ధతి లేదు. సమాజంలోని పౌరులను దొంతర్లుగా విభజించి సామాజిక నిర్మాణంలో ఆయా దొంతరకున్న స్థానాన్ని బట్టి హక్కులు, అవకాశాలు కల్పించటం భూస్వామ్య, అర్థ భూస్వామ్య వ్యవస్థ లక్షణం. ఒకవైపున దేశాన్ని 21వ శతాబ్దంలో ఆర్థికంగా ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాలని వాగ్దానాలు చేస్తూనే సామాజికంగా దేశాన్ని చీకటియుగాలకు తీసుకెళ్లటం బీజేపీ, ఆరెస్సెస్‌ ద్వంద్వ వైఖరి. ఏ విషయంలో నైనా ద్వంద్వ వైఖరిని ఆరెస్సెస్‌ పెట్టింది పేరు. ప్రతిధ్వని సినిమాలో రాజకీయ నాయకుని పాత్ర శైలిలో.
2014లో ఎన్నికైన 16వ లోక్‌సభలో అత్యంత తక్కువగా 22మంది పార్లమెంట్‌ సభ్యులు ముస్లిం మైనారిటీలున్నారు. లోక్‌సభలో ఆధిపత్యం వహిస్తున్న బీజేపీ నుంచి ఒక్కరు కూడా ముస్లిం ఎంపి లేకపోవటం గమనించాల్సిన విషయం. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో మొదటిసారి 23మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు. నాటి నుంచీ పూర్తిగా జనాభా ప్రాతినిధ్యానికి అనుగుణంగా కాకపోయినా మెరుగైన మోతాదులో ముస్లిం అభ్యర్ధులకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం, వారిని గెలిపించటం సాంప్రదాయంగా మారింది. గత ఐదు దశాబ్దాలుగా లౌకికతత్వం అంటే (హిందు, ముస్లింలు సమానమనే భావన) ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయమే అంటూ ఆరెస్సెస్‌ సాగించిన ప్రచారం ప్రభావం నేడు చట్టసభల్లో కనిపిస్తుంది. అటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభలో తమ పార్టీ తరపున ముస్లింలకు ప్రాతినిధ్యం వహించకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న నమ్మకం కలిగాక బీజేపీ మరింత బరితెగించింది. 2016లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఒక్క ముస్లిం అభ్యర్ధిని కూడా నిలబెట్టకుండా ఎన్నికల్లో గెలిచింది. ఈ క్రమం 2002లో గుజరాత్‌ శాసనసభ ఎన్నికలతో మొదలైంది.

దాదాపు 14శాతంగా ఉన్న ముస్లిం జనాభాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా వారి ప్రయోజనాలు కాపాడే మార్గం ఉందా? ఇక్కడ ముస్లిం ప్రాతినిధ్యం గురించి చేస్తున్న చర్చ అస్థిత్వ రాజకీయాల చర్చగా పరిగణించరాదు. లౌకిక ప్రజాతంత్ర కోణం ఇందులో ఉంది. పురోగామి లక్షణాలకు, తిరోగామి లక్షణాలకు, ప్రజాతంత్ర స్వభావానికి, నిరంకుశాధిపత్యానికి మధ్య ఉన్న సన్నని గీతను గమనించకపోతే అస్థిత్వ రాజకీయాలు మితవాదులు, మతోన్మాదులు, ఫాసిస్టుల చేతుల్లో ఆయుధాలుగా మారతాయి. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు అన్న మధ్యయుగాల అవగాహనతో వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దూరం చేయటం ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే చర్య కాదు. దేశ జనాభాలో హిందువుల తర్వాత అతి పెద్ద సామాజిక తరగతి ముస్లింలు. అటువంటి ముస్లింలను చట్టసభల నుండి వెలి వేయటం, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం అంటే సామాజిక జీవనంలో వారి పాత్రను కుదించటమే. అటువంటి సంకుచిత రాజకీయా లతో హిందూ ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం సాధించేందుకు బీజేపీ ముస్లింలను శతృవులుగా చూపబూనుకొంటోంది.
మోడీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించే వారినందరినీ దేశ ద్రోహులుగా ముద్ర వేయటం ఈ కాలంలో పెరిగిన ఆందోళనకర పరిణామం. ఇది మరింత ముదిరి మోడీ లేదా బీజేపీ లేదా ఆరెస్సెస్‌ వ్యతిరేకులు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చన్న చర్చలు బాహాటంగా ఎంపీలు, మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులే చేస్తున్నారు. వీటి ఖండించేందుకు ప్రయత్నం చేయకపోగా మోడీ స్వయంగా దీన్ని మరింత విస్తరించి హిందూత్వం = దేశభక్తి = ఉగ్రవాద వ్యతిరేకత = పాకిస్థాన్‌ వ్యతిరేకత = ముస్లిం వ్యతిరేకత అన్న అర్థంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మతం పేరుతో ఓటర్లను ప్రభావితం చేయరాదన్న చట్టం ప్రధానికి వర్తించదా? బాహాటంగా హిందూ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అని గాండ్రించటం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని మరణశయ్యపైకి చేర్చటమే తప్ప మరోటి కాదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాతంత్ర విలువలతో కూడిన సామాజిక చైతన్యం, ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ సూత్రం అమలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించటం మినహా మరో మార్గం లేదు.
- కొండూరి వీరయ్య సెల్‌: 9871794037