Wednesday, May 22, 2019

ప్రజాస్వామ్యానికి ఫేక్‌న్యూస్‌ వైరస్‌

Apr 04,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/788542


వికాసం నుంచి విద్వేషానికి బీజేపీ వ్యూహం

 Apr 06,2019

http://www.navatelangana.com/article/net-vyaasam/789099

 ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కర్తవ్యం ఎన్నికల సంస్కరణలు

Apr 11,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/791442


గాడి తప్పుతున్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం

భారత ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందా? రాజ్యాంగ నిర్మాతలు ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ సూత్రం స్వాతంత్య్రానంతర ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి మూల సూత్రంగా ఉంది. బీజేపీ హిందూత్వ ఆధిపత్య రాజకీయాలు కేంద్ర స్థానం ఆక్రమించటం మొదలయ్యాక ఈ సూత్రం - ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ - సూత్రానికి కొత్త నిర్వచనం అమల్లోకి వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతినిధిగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ నేడు అధికారంలో ఉన్న బీజేపీ మౌలిక అవగాహనలో దేశంలో ఎటువంటి భిన్నత్వానికి తావు లేదు. దేశమంతా అఖండ హిందూ దేశమే. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి బీజేపీ ఇస్తున్న నిర్వచనం కూడా ఈ అవగాహనకు తగ్గట్టుగానే ఉంది. బీజేపీ నమూనా ప్రజాస్వామ్యంలో కొన్ని సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం అక్కర్లేదు. ముస్లింలు అటువంటి ఓ సామాజిక తరగతి.
సాధారణంగా ఎన్నికల పోరాటంలో బరిలోకి దిగేటప్పుడు రాజకీయ పార్టీలు సాధ్యమైనన్ని ఓట్లు సంపాదించేందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అభ్యర్ధుల పొందిక ఆయా సామాజిక తరగతుల నుంచి ఓట్లు రాబట్టడంలో ఉపయోగపడుతుందా లేదా అన్నది అభ్యర్థుల ఎంపికలో పని చేసే ఏకైక సూత్రం అదేసమయంలో భారతదేశంలోని భిన్నత్వానికి అనుగుణంగా చట్టసభల్లో భిన్నత్వం ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా అన్నది కూడా ప్రజాస్వామ్యం ఎంత ప్రజాతంత్రయుతంగా అమలవుతున్నదో వివరించే ఒక ఉదాహరణ. ఈ సారాంశాన్ని గాలికొదిలి కేవలం అభ్యర్థుల పొందిక ఆయా సామాజిక తరగతుల ఓట్లు రాబట్టే ఒక తాత్కాలిక వ్యూహంగా మారింది. చట్టసభలు ప్రజలందరి ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. కాలక్రమంలో అస్థిత్వ రాజకీయాలు ముందుకొచ్చిన తర్వాత ఆయా సామాజిక తరగతులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉందా లేదా అన్న ప్రశ్నకు, ఆయా తరగతుల ప్రయోజనాలకు ఏ మేరకు ప్రాతినిధ్యం ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు మధ్య సంబంధం ఉంది. అటువంటి ఓ సామాజిక తరగతి సమకాలీన రాజకీయాల్లో ప్రాతినిధ్య రాహిత్యాన్ని ఎదుర్కొంటోంది. అది ముస్లిం సామాజిక తరగతి. 2019లో ముస్లిం సామాజిక తరగతి రాజకీయ హక్కుల గురించి మాట్లాడటానికి ఎంతో కొంత సాహసం కావాలి.

భారత రాజకీయ సామాజిక వ్యవస్థకు పునాదిగా ఉన్న లౌకిక వ్యవస్థపై ఆరెస్సెస్‌, జనసంఫ్‌ు, బీజేపీలు గత ఐదారు దశాబ్దాలుగా సాగిస్తూ వచ్చిన సైద్ధాంతిక దాడి మోడీ పరిపాలనలో పతాకస్థాయికి చేరింది. దీంతో లౌకిక ప్రజాతంత్ర రాజకీయాల స్థానంలో హిందూ ఆధిపత్య రాజకీయాలే ప్రధాన స్రవంతి రాజకీయాలుగా తెరమీదకు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపన్యాసాలు దీనికి పెద్ద ఉదాహరణ. దేశం అంటే హిందూమతం, హిందూమతమే దేశంగా మోడీ ఉపన్యాస ధోరణి ఉండటం గాడితప్పిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి చిహ్నం.
ఒకసారి మతం, మతోన్మాద స్థాయికి చేరాక లౌకిక ప్రజాతంత్ర విలువలు వెనకపట్టు పడతాయి. స్వాతంత్య్రోద్యమ విలువలను పుణికిపుచ్చుకున్న లౌకిక ప్రజాతంత్ర విలువల ఆధారిత సామాజిక చైతన్యం స్థానే మత విశ్వాసాల ఆధారిత సామాజిక చైతన్యం నూతన రాజకీయ వేదికగా మారింది. సాధారణంగా చైతన్యం అనే భావన ఓ పురోగామి దృక్ఫధాన్ని ప్రతిబింబించే భావన. కానీ మతోన్మాద రాజకీయాల వేళ్లూనుకుపోయే కొద్దీ ఈ పురోగామి దృక్ఫథం, విశాల దృక్కోణం కాస్తా సంకుచిత అస్థిత్వాల చుట్టూ గిరిగీసుకుపోయే తిరోగామి భావనగా మారింది. సాధారణంగా జనసామాన్యంలో వాడుకలో ఉన్న భావనలకు కొత్త కొత్త టీకా తాత్పర్యాలను రూపొందించి ప్రచారంలో పెట్టడంలో ఆరెస్సెస్‌ది అందె వేసిన చేయి. అటువంటి ప్రచారం గత ఐదేండ్లుగా ఇంకా చెప్పాలంటే 2002నుంచీ ఓ ఉద్యమంలా సాగించింది ఆరెస్సెస్‌. దాంతో సామాజిక అవగాహన యావత్తూ తిరోగమన పట్టాలెక్కింది. దీనికి సరైన ఉదాహరణ చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య.

బీజేపీ, దాని మాతృక ఆరెస్సెస్‌ అవగాహనలో భారతదేశంలో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులు. ప్రజాస్వామ్యంలో పౌరులను శ్రేణులవారీగా విభజించి వ్యవహరించే పద్ధతి లేదు. సమాజంలోని పౌరులను దొంతర్లుగా విభజించి సామాజిక నిర్మాణంలో ఆయా దొంతరకున్న స్థానాన్ని బట్టి హక్కులు, అవకాశాలు కల్పించటం భూస్వామ్య, అర్థ భూస్వామ్య వ్యవస్థ లక్షణం. ఒకవైపున దేశాన్ని 21వ శతాబ్దంలో ఆర్థికంగా ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాలని వాగ్దానాలు చేస్తూనే సామాజికంగా దేశాన్ని చీకటియుగాలకు తీసుకెళ్లటం బీజేపీ, ఆరెస్సెస్‌ ద్వంద్వ వైఖరి. ఏ విషయంలో నైనా ద్వంద్వ వైఖరిని ఆరెస్సెస్‌ పెట్టింది పేరు. ప్రతిధ్వని సినిమాలో రాజకీయ నాయకుని పాత్ర శైలిలో.
2014లో ఎన్నికైన 16వ లోక్‌సభలో అత్యంత తక్కువగా 22మంది పార్లమెంట్‌ సభ్యులు ముస్లిం మైనారిటీలున్నారు. లోక్‌సభలో ఆధిపత్యం వహిస్తున్న బీజేపీ నుంచి ఒక్కరు కూడా ముస్లిం ఎంపి లేకపోవటం గమనించాల్సిన విషయం. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో మొదటిసారి 23మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు. నాటి నుంచీ పూర్తిగా జనాభా ప్రాతినిధ్యానికి అనుగుణంగా కాకపోయినా మెరుగైన మోతాదులో ముస్లిం అభ్యర్ధులకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం, వారిని గెలిపించటం సాంప్రదాయంగా మారింది. గత ఐదు దశాబ్దాలుగా లౌకికతత్వం అంటే (హిందు, ముస్లింలు సమానమనే భావన) ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయమే అంటూ ఆరెస్సెస్‌ సాగించిన ప్రచారం ప్రభావం నేడు చట్టసభల్లో కనిపిస్తుంది. అటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభలో తమ పార్టీ తరపున ముస్లింలకు ప్రాతినిధ్యం వహించకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న నమ్మకం కలిగాక బీజేపీ మరింత బరితెగించింది. 2016లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కనీసం ఒక్క ముస్లిం అభ్యర్ధిని కూడా నిలబెట్టకుండా ఎన్నికల్లో గెలిచింది. ఈ క్రమం 2002లో గుజరాత్‌ శాసనసభ ఎన్నికలతో మొదలైంది.

దాదాపు 14శాతంగా ఉన్న ముస్లిం జనాభాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా వారి ప్రయోజనాలు కాపాడే మార్గం ఉందా? ఇక్కడ ముస్లిం ప్రాతినిధ్యం గురించి చేస్తున్న చర్చ అస్థిత్వ రాజకీయాల చర్చగా పరిగణించరాదు. లౌకిక ప్రజాతంత్ర కోణం ఇందులో ఉంది. పురోగామి లక్షణాలకు, తిరోగామి లక్షణాలకు, ప్రజాతంత్ర స్వభావానికి, నిరంకుశాధిపత్యానికి మధ్య ఉన్న సన్నని గీతను గమనించకపోతే అస్థిత్వ రాజకీయాలు మితవాదులు, మతోన్మాదులు, ఫాసిస్టుల చేతుల్లో ఆయుధాలుగా మారతాయి. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు అన్న మధ్యయుగాల అవగాహనతో వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దూరం చేయటం ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే చర్య కాదు. దేశ జనాభాలో హిందువుల తర్వాత అతి పెద్ద సామాజిక తరగతి ముస్లింలు. అటువంటి ముస్లింలను చట్టసభల నుండి వెలి వేయటం, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం అంటే సామాజిక జీవనంలో వారి పాత్రను కుదించటమే. అటువంటి సంకుచిత రాజకీయా లతో హిందూ ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం సాధించేందుకు బీజేపీ ముస్లింలను శతృవులుగా చూపబూనుకొంటోంది.
మోడీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించే వారినందరినీ దేశ ద్రోహులుగా ముద్ర వేయటం ఈ కాలంలో పెరిగిన ఆందోళనకర పరిణామం. ఇది మరింత ముదిరి మోడీ లేదా బీజేపీ లేదా ఆరెస్సెస్‌ వ్యతిరేకులు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చన్న చర్చలు బాహాటంగా ఎంపీలు, మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులే చేస్తున్నారు. వీటి ఖండించేందుకు ప్రయత్నం చేయకపోగా మోడీ స్వయంగా దీన్ని మరింత విస్తరించి హిందూత్వం = దేశభక్తి = ఉగ్రవాద వ్యతిరేకత = పాకిస్థాన్‌ వ్యతిరేకత = ముస్లిం వ్యతిరేకత అన్న అర్థంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మతం పేరుతో ఓటర్లను ప్రభావితం చేయరాదన్న చట్టం ప్రధానికి వర్తించదా? బాహాటంగా హిందూ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అని గాండ్రించటం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని మరణశయ్యపైకి చేర్చటమే తప్ప మరోటి కాదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాతంత్ర విలువలతో కూడిన సామాజిక చైతన్యం, ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ సూత్రం అమలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించటం మినహా మరో మార్గం లేదు.
- కొండూరి వీరయ్య సెల్‌: 9871794037
Apr 18,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/794807


పొట్ట విప్పి చూడ పురుగులుండు..!

ఒక్కోసారి సమకాలీన వాస్తవికతకు దర్పణం పట్టేలా చెప్పాలంటే గతంలోకి వెళ్లాలి. సామాజిక రుగ్మతలపై తెలుగులో వేమన సరళమైన భాష, శైలిలో అందించినంత సాహిత్యాన్ని మరో తెలుగు కవి అందించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మోడీ అవినీతిపై సాగిస్తున్న పోరాట స్వభావాన్ని ఎత్తి చూపటానికి వేమన పద్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. భారతదేశంలో అవినీతి ప్రవాహాలకు వెయ్యి చేతులతో అడ్డుకట్ట వేసే కార్తవీర్యార్జునుడు అని బీజేపీ శ్రేణులు భజన చేశాయి. మనసా వాచా కర్మణా నీతి తప్పని నేతగా మోడీ వ్యక్తిత్వాన్ని ప్రచారం చేయటానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో, ఆ సొమ్ము బీజేపీకి లేదా మోడీకి ఎలా దక్కిందో బట్టబయలు చేస్తే పారదర్శక పాలన నినాదం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతను విశ్వసించవచ్చు. ఐదేండ్ల పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోని ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు అని భుజకీర్తులు తగిలించేందుకు కుహనా విశ్లేషకులు, ఎన్డీ టీవీ యాంకర్‌ రవిష్‌ తివారీ మాటల్లో పాలకుల ఒళ్లో ఒదిగిపోయిన మీడియా విశ్లేషకులు శాయశక్తులా ప్రయత్నం చేశారు. అయినా రాఫెల్‌ కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిశీలించాక అవినీతిపై మోడీ సాగిస్తున్న పోరాటం మేడిపండువంటిదనీ, విదేశీ స్వదేశీ కార్పొరేట్‌ శక్తుల ముందు మోడీ రెక్కలు తెగిన జటాయువులా పడిపోయాడని రుజువవుతోంది.
మోడీ అధికారానికి వచ్చాక తాను అవినీతికి పాల్పడే అవకాశం లేదని జనాన్ని నమ్మించేందుకు రెండు విషయాలు చెప్పారు. మొదటిది తనకు కుటుంబం, వారసులు లేరన్నది అందులో మొదటిది. తనకు కుటుంబంలేదని చెప్పటం ద్వారా మోడీ కాంగ్రెస్‌ నేతలు కుటుంబం కోసం కోట్లు వెనకేసుకునే ప్రయత్నంలో అవినీతికి పాల్పడ్డారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. మరో సందర్భంలో తాను పకీరునని, పదవి నుంచి దిగిపోతే జోలె పట్టుకుని తన మానాన తాను పని చేసుకుంటానని చెప్పుకున్నారు. మోడీ ఏ వ్యాఖ్య చేసినా, ఏ ఉపన్యాసం చేసినా, ఏ నిర్ణయం చేసినా నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంటాయన్న సామెతను నెమరేసుకుని మరీ మోడీ వ్యాఖ్యలు, విమర్శలు, ఉపన్యాసాలు చూడాలి. ఇక్కడ అవినీతి ఏదో వ్యక్తిగత బలహీనత వల్ల చోటుచేసుకునే పరిణామం అన్న అభిప్రాయాన్ని కల్పించటానికి విదేశీ గుత్తపెట్టుబడిదారీ సంస్థలు, ద్రవ్యపెట్టుబడి కంపెనీలు గత మూడు దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రచారాన్నే దేశంలో బీజేపీ నెత్తికెత్తుకున్నది.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై నడుస్తున్న వ్యాజ్యంపై గతేడాది డిసెంబరులో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు ఆధారం ప్రభుత్వం ఇచ్చిన కొన్ని పత్రాలు, కోర్టుకు నివేదించిన కొంత సమాచారం. ఈ పత్రాలు, సమాచారం అవాస్తవాలని, అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం మోసగించేందుకు మోడీ ప్రభుత్వం పూనుకున్నదని తేటతెల్లం కావటానికి పెద్దగా సమయం పట్టలేదు. గత మూడు నెల్లుగా పత్రికల్లో వస్తున్న వివరాలు నేపథ్యంలో ప్రశాంత్‌ భూషన్‌, అరుణ్‌శౌరీ, యశ్వంత్‌సిన్హాలు మరోసారి సుప్రీం గడప తొక్కారు. డిసెంబరులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్నది వారి అభ్యర్థన. ఈ అభ్యర్థనపై విచారణ మొదలవటం అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పాక్షికమైనదీ, న్యాయస్థానాన్ని దారితప్పించేదీ అని అంగీకరించటమే. అంతే కాదు. పత్రికల్లో వచ్చిన వాస్తవాలేనని కూడా అంగీకరించినట్టు. ఈ పరిస్థితిని అడ్డుకోవటానికి మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, ముందుకు తెచ్చిన వాదనలు, వ్యాఖ్యలు బహుశా భారత న్యాయవ్యవస్థలో ఎన్నడూ జరిగి ఉండవు.
ఎట్టకేలకు ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌తో పాటు మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చిన కొన్ని దస్తావేజులను సైతం సాక్ష్యాలుగా పరిగణించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఫలితంగా గత రెండేండ్లుగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు జరుగుతున్న న్యాయ, న్యాయేతర పోరాటం ఓ కొలిక్కి రానుంది. గత వారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూడు విషయాలను స్పష్టం చేస్తోంది.

మొదటిది రాఫెల్‌ కొనుగోలు గురించి మీడియా వెలుగులోకి తెచ్చిన అనేక పత్రాలు, దస్తావేజులు, ఒప్పందాలు, అధికారిక పత్రాలు వాస్తవమైనవే అన్నది. ఈ కుంభకోణం గురించి లోతైన పరిశోధన చేసిన హిందూ పత్రిక అధినేత ఎన్‌ రామ్‌ తనకు అందిన పత్రాలు అధికారికమైనవేనని కూడా స్పష్టం చేశారు. ఈ పత్రాలు ప్రకారం రాఫెల్‌ కొనుగోలు విషయంలో రక్షణశాఖను పక్కనపెట్టి నేరుగా ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవటం పతాక స్థాయి ఉల్లంఘనగా రక్షణశాఖ అభిప్రాయపడింది. ఓ స్వచ్ఛంద సంస్థకు గ్రాంట్‌ ఇచ్చినా ప్రభుత్వం వారి నుంచి బాండ్‌ తీసుకుంటుంది. అలాంటిది వేల కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నామో ఆ దేశ ప్రభుత్వం హామీ ఉండాలన్న షరతు అంతర్జాతీయ వాణిజ్య షరతు. ఈ షరతుతో పని లేదని మోడీ కార్యాలయం తేల్చిచెప్పటం వెనక ఉన్న మతలబు వెలుగు చూడాల్సి ఉంది. అంతేకాదు. అటువంటి కొనుగోళ్లల్లో అవినీతికి తావు లేకుండా కూడా కొన్ని షరతులు కొనుగోలు దార్లు అమ్మకం దార్లకు మధ్య కుదిరే ఒప్పందాల్లో కొన్ని షరతులు, ఒడంబడిక ఉంటాయి. వీటిని కూడా రద్దు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించింది. యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సిన దస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీకి నిజంగా ఒప్పందం మేరకు అన్ని యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసి నిర్దిష్ట గడువులో సరఫరా చేయగలదా లేదా అన్న విషయంపై రక్షణశాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ప్రధాని కార్యలయం తొక్కిపట్టింది. ఇవన్నీ విధానపరమైన అవినీతికి సంబంధించిన విషయాలు.

గతేడాది జరిగిన విచారణలో సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని వాస్తవాలు నివేదించలేదన్నది రెండో విషయం. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే పద్ధతి వింతగా ఉంది. వాస్తవంతో న్యాయస్థానానికి పని లేదు. కేవలం ఆధారాలు మాత్రమే పరిశీలిస్తుంది. కక్షిదారులు తమ ముందుంచిన వివరాలు మాత్రమే తీర్పుకు ప్రాతిపదికగా ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో వాస్తవాలు కక్షిదారులు కోర్టు ముందుకు తేగలిగిన ఆధారాల కంటే వాస్తవాలు చాలా విశాలంగానూ లోతైనవిగానూ ఉంటాయి. కానీ న్యాయస్థానం ఇవన్నీ పరిశీలించదు. అందుకే ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మరో న్యాయస్థానం కొట్టేస్తుంది. సుప్రీం కోర్టులోనే ఏక సభ్య న్యాయస్థానం తీర్పులను బహుళసభ్య న్యాయస్థానాలు కొట్టేయటమో సవరించటమో చేసిన సందర్భాలు కోకొల్లలు. అటువంటి పరిమితులకు లోబడిందే డిసెంబరులో రాఫెల్‌ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని నేడు స్పష్టమైంది. దీనికి కారణం న్యాయస్థానానికి మోడీ ప్రభుత్వం పూర్తి వాస్తవాలు నివేదించకపోవటం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించిందన్న విషయం ఈ తీర్పుతో రుజువైంది. అటువంటి వాటిలో రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం, కేంద్ర రక్షణ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం, కేంద్ర విజిలెన్స్‌ విభాగం మార్గదర్శకాలు, మధ్యవర్తుల బృందం (ఫ్రాన్స్‌ కంపెనీతో చర్చలు జరిపిన బృందం) అభ్యంతరాలు వంటి అనేక కీలక పత్రాలను ప్రభుత్వం సుప్రీం మెట్లు ఎక్కకుండా తొక్కిపట్టింది. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు. మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరీ చేసిన వాగ్దానం, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయాన్నీ అనుమతించనన్న వాగ్దానాన్ని ఉల్లంఘించటమే. ఇది అత్యంత నీతిబాహ్యమైన చర్య.
ఫ్రాన్స్‌కు చెందిన లిమోండె పత్రిక సంచలన వార్త మూడో విషయం. ఈ వార్త సారాంశం అనిల్‌ అంబానీ కంపెనీ ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అపరాధ రుసుముల్లో దాదాప 12వందల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నది. భారతదేశంలో బడా కంపెనీలకు సుమారు రూ.ఐదు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసినందున ఫ్రాన్స్‌ 1200కోట్లు మాఫీ చేయటం గొప్ప విషయం కాదు. కానీ రాఫెల్‌ విడిభాగాల తయారీ కాంట్రాక్టు అనిల్‌ అంబానీ కంపెనీకి కట్టబెట్టిన తర్వాత ఈ అపరాధ రుసుము మాఫీ కావటంలోనే కిటుకంతా ఉంది. ఇక్కడ విడివిడిగా కనిపిస్తున్న మూడు విషయాలను కలిపి చూస్తే తప్ప ఈ కుంభకోణంలో తుదీ మొదలూ వెలుగులోకి రావు. అలాంటి ఈ మూడు విషయాలు.

మొదటిది అటు ఫ్రాన్స్‌లో దస్సాల్ట్‌, ఇటు భారత్‌లో రిలయన్స్‌ జూనియర్‌ కంపెనీలు ఆర్థికంగా దివాళా తీసి ఉన్నాయి. రెండు కంపెనీలకూ ఈ యుద్ధ విమానాలు తయారు చేయటానికి కావల్సిన పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత కానీ విడి భాగాలు తయారు చేయటానికి కావల్సిన నిధులు కానీ లేవు. దాంతో ఈ కాంట్రాక్టు అవసరం వచ్చింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ఒప్పందం గురించిన చర్చలు ఓ మేరకు పురోగమించాయి. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని మోడీ తన కార్పొరేట్‌ భక్తి ప్రదర్శించదల్చుకున్నారు.. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను విడిభాగాల తయారీకి భాగస్వామిగా అంగీకరిస్తే దస్సాల్ట్‌ ఆర్థిక అవసరాలు తీరుతాయేమో కానీ అనిల్‌ అంబానీ దివాళా నుండి బయట పడరు. అందుకే ప్రభుత్వరంగ స్థానంలో ప్రయివేటు కంపెనీ తెరమీదకు రావటం, దానికి లేని అర్హతలకు మెరుగులు దిద్దటం జరిగింది. ఈ తప్పుడు పనికి ఫ్రాన్స్‌ ఎందుకు ఒప్పుకుంది అన్నది ప్రశ్న. దస్సాల్ట్‌ కంపెనీ మూతపడితే వేల మంది కార్మికులు రోడ్డున పడతారు. బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత మరింత పుంజుకుంటుంది. ఉద్యమాలకు వేదికవుతుంది. దీనికి బదులు ఇలాంటి ఓ కాంట్రాక్టు సంపాదిస్తే దేశంలో కార్మికుల మద్దతు పొందవచ్చు. ఈ రెండు లక్ష్యాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఫ్రాన్స్‌ కూడా అనిల్‌ అంబానీ కట్టాల్సిన రూ.12వందల కోట్ల అపరాధ రుసుము కూడా మాఫీ చేసింది.
అర్హత లేని అనిల్‌ అంబానీ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న విధి విధానాలను, ప్రమాణాలు, చట్టాలు, పద్ధతులను తుంగలో తొక్కింది. వడ్డించేవాడు మనవాడే అయితే దివాళా తీసిన కంపెనీలకు కూడా వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టవచ్చని నిరూపించారు. తనకంటూ కుటుంబమే లేని మోడీ, ఫకీర్‌ అయిన మోడీ ఏ ప్రయోజనం ఆశించి ఈ అడ్డగోలు వ్యవహారాలకు, చివరకు సుప్రీం కోర్టును మోసం చేయటానికి బరితెగించారు?
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
Apr 22,2019
 http://www.navatelangana.com/article/net-vyaasam/797093


హిందూయిజం - హిందూత్వ ఉగ్రవాదం

 గత నాలుగు దశాబ్దాల్లో చూడని స్థాయిలో ఎన్నికల రణరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో పాలక బీజేపీ ముందంజలో ఉంది. కులమతాల పేరుతో ఓట్లు అడగ్గకూడదన్నది మౌలిక నిబంధనగా ఉంది. దీన్ని ఉల్లంఘించటానికి అటు మోడీకి కానీ ఇటు ఆయన శిష్య బృందానికి గానీ ఏ మాత్రం వెరపు లేదు. ఇటువంటి ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాల్సిన ఎన్నికల సంఘం గోళ్లు, కోరలు పీకిన తెగ్గోసిన పులిలా నిల్చుంది. బీజేపీ విజయానికి గండికొట్టే త్రిపుర, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొరాయిస్తున్నాయి. సాంప్రదాయకంగా బీజేపీ కేంద్రాలుగా ఉన్న రాష్ట్రాల్లో ఈ యంత్రాలు సజావుగా పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం రెండున్నర వేల కోట్లు జప్తు చేసింది. ఇందులో 95శాతం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే జప్తు అయ్యింది. బీజేపీకి పెట్టని కోటలుగా ఉన్న రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రభావితం చేయటానికి యథేచ్ఛగా పంపిణీ అవుతున్న నల్లధనం కంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పంపిణీ అవుతున్న నల్లధనమే ఎన్నికల సంఘానికి ప్రమాదకారిగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఈ ఎన్నికల్లో మరో ప్రమాదకరమైన ధోరణిని బీజేపీ ముందుకు తెస్తోంది. ఇప్పటి వరకు దేశ ప్రజల దృష్టిలో ఉగ్రవాదం విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఉగ్రవాదం పేరుతో ప్రజల ప్రాణాలు తీయటం తీవ్రమైన నేరం అన్న అభిప్రాయమే ఉంది. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని కూడా మతాల ప్రాతిపదికన చీల్చి హిందూ ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారి తరపున ఓట్ల వేట సాగిస్తున్నారు. ఎమర్జెన్సీ తర్వాత మతాల ప్రాతిపదికన ఓటర్లను చీల్చటం మొదలైన ఈ క్రమం మోడీ పాలనలో మరింత సిగ్గు విడిచి బరితెగింపు స్థాయికి చేరింది. మాలేగాం బాంబు పేలుళ్లల్లో ప్రధాన సూత్రధారి, నేరస్తురాలు అయిన 'సాధ్వి' ప్రగ్యను ఏకంగా భోపాల్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంతకు ముందే హైందవోన్మాద ఉగ్రవాదం దేశంలో లేనే లేదనీ, ఈ పేరుతో కేవలం హిందూ మతాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు కాంగ్రెస్‌ కంకణం కట్టుకుందన్న విమర్శలకు స్వయంగా ప్రధాని మోడీ ఒడిగట్టారు.

దేశంలో మతోన్మాద రాజకీయాల జోరు, ఉగ్రవాద చర్యల ఉధృతి, మిశ్రమ ఆర్థిక విధానం స్థానంలో ప్రపంచీకరణ విధానాలకు తెరతీయటం కుడిఎడంగా ఒకే సమయంలో మొదలయ్యాయి. ప్రపంచీకరణ గావించబడిన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుదలతో పాటే లౌకిక రాజ్యంగా భారత్‌ పతనం కూడా మొదలైంది. ప్రపంచీకరణ విధానాల్లో కీలకమైనది ఆర్థిక విధాన నిర్ణయాల్లో ప్రభుత్వ పాత్రను కుదించటం. ఈ సూత్రాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు మార్గదర్శకత్వంలో బీజేపీ మరింత నవీకరించింది. సామాజిక జీవితంలో సైతం ప్రభుత్వం పాత్ర, సామాజిక తప్పొప్పులను సరి చేయటంలో ప్రభుత్వ పర్యవేక్షక పాత్రను కుదించటం కూడా ప్రపంచీకరణలో అంతర్భాగమేనని బీజేపీకి చెందిన మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలకవర్గాల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా ప్రజలను గాడిలో పెట్టడానికి ఉనికిలోకి వచ్చిన సాధనమే ఆధునిక రాజ్యం అన్న సూత్రం నానాటికీ రుజువవుతోంది. సామాజిక జీవితంలో ప్రభుత్వ పాత్ర కుదించుకుపోవటంతో అనివార్యంగా ధామస్‌ హాబ్స్‌ చెప్పిన కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న సూత్రం ముందుకొస్తోంది. మందబలం సామాజిక జీవితాన్ని నియంత్రించే సాధనంగా మారటం ఈ సూత్రానికి విస్తరణే. ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని నిర్వచించేందుకు ఒకే ప్రమాణాన్ని పాటించాలి. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వమే ద్వంద్వ ప్రమాణాలు ప్రత్యేకించి మతాల ప్రాతిపదిక ద్వంద్వ ప్రమాణాలు పాటించటం మొదలు పెట్టడం దేశ భద్రతకు ముప్పుగా మారుతుందనటంలో సందేహం లేదు. కాశ్మీర్‌లో ముస్లిం ఉగ్రవాదుల పట్ల, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెంచి పోషిస్తున్న హైందవోన్మాద ఉగ్రవాదం పట్ల బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో మోడీ ఉపన్యాస శైలి.

హైదరాబాద్‌లోని మక్కా మసీదు బాంబు లోనూ, అజ్మీర్‌లోని షరీఫ్‌ దర్గాలో, అమృతసర్‌- లాహౌర్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేల్చివేత వంటి కేసుల్లో కేంద్ర హౌం శాఖ ప్రారంభించిన దర్యాప్తు తీగలాగితే డొంకంతా కదిలినట్టు నాగపూర్‌ మీదుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌, స్వామి అసీమానంద, సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ల వద్దకు చేరింది. 2006 సెప్టెంబర్‌ 8న మాలెగాంలో జరిగిన పేలుళ్లల్లో 36మంది చనిపోయారు. 2007 ఫిబ్రవరి 18న జరిగిన సంఝౌతా పేల్చివేతలో 68మంది అక్కడికక్కడే చనిపోయారు. అదే ఏడాది మే 18న మక్కామసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుళ్లలో 16మంది, అక్టోబరు 11, 2007న అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా ప్రాంగణంలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం, సీబీఐ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఇది ఇస్లామిక్‌ ఉగ్రవాదుల చర్యలు కావని నిర్ధారణ కావటంతో ఉగ్రవాద చర్యల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఎ)కు ఈ కేసులు 2011లో బదిలీ అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు 2014కు ముందే పూర్తి అయినా ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ మాత్రం 2014 తర్వాత కూడా కొనసాగింది. దర్యాప్తు సమయంలోని విలువైన సాక్ష్యాధారాలన్నీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కాక చిత్తుకాగితాలుగా మారాయి. ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో నిగ్గు తేలిన పురోహిత్‌, స్వామి అసీమానందలతో పాటు పని చేసిన వారంతా నిర్దోషులుగా బయటకొచ్చారు. న్యాయవ్యవస్థను తొలుచుకుంటూ పోయిన ప్రత్యేక యంత్రాంగం, దానికి రాజ్యం అండదండలు లేనిదే ఈ కేసులు తారుమారు అయ్యాయని భావించగలమా? బహుశా ఇందుకేనేమో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగొరు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఓ బలమైన అదృశ్య శక్తి పని చేస్తోందని దేశాన్ని హ్చెరిస్తున్నారు.

ఇక్కడ కోర్టుల్లో జరిగిన కొన్ని పరిణామాలు పాఠకుల దృష్టికి తేవాలి. 2010 డిసెంబరు 18న అసీమానంద కోర్టులో వాంగ్మూలమిచ్చారు. 42పేజీల వాంగ్మూలాన్ని తెహెల్కా పత్రిక యథాతథంగా ప్రచురించింది. పైన ప్రస్తావించిన బాంబు పేలుళ్లన్నీ అత్యున్నత స్థాయిలో హిందూత్వ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రమేయంతో సాగినవేన్నది సారాంశం. దేశ విభజన సమయంలో నాటి నిజాం నవాబు పాకిస్థాన్‌లో విలీనం కావాలని ప్రయత్నం చేశాడనీ అందుకే హిందూత్వ నేతల మార్గదర్శకత్వంలో మక్కా మసీదును లక్ష్యంగా బాంబుదాడి జరిగిందని స్వయంగా వెల్లడించారు. ఇదే తరహాలో అజ్మీర్‌ దర్గా బాంబు పేలుళ్ల కేసులో నిందితులు దేవేంద్ర గుప్త, భవేష్‌ పటేల్‌, సునీల్‌ జోషి (ఆరెస్సెస్‌ జాతీయ నాయకుల్లో ఒకరు) దోషులుగా నిర్ధారింపబడ్డారు. కానీ అసీమానంద మాత్రం నిర్దోషిగా బయట కొచ్చారు. అజ్మీర్‌ దర్గా కేసులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన అశ్వని శర్మ, జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులనుద్దేశించి ''అనేకమంది సాక్ష్యులను నిందితుల తరపున న్యాయవాదులు ప్రభావితం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు సాక్ష్యుల ఫోన్‌ కాల్‌ వివరాలు సేకరిస్తే ఈ విషయం నిర్ధారణవుతుంది. నిందితుల తరపు న్యాయవాది సాక్ష్యులతో ఓ హౌటల్లో సమావేశ మయ్యారు. సదరు హౌటల్‌ నుంచి సీసీి కెమెరాల రికార్డులు తెప్పించినా ఈ విషయం రుజువవు తుంది. సాక్ష్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులదే'' అన్న హెచ్చరికలు మోడీ పాలనలో న్యాయదేవత కురుసభలో ద్రౌపదిగా మారిన తీరు తేటతెల్లమవుతోంది. దర్యాప్తు సంస్థ న్యాయ విచారణలో ప్లేటు ఫిరాయించటంతో న్యాయస్థానం లో ఇచ్చిన వాంగ్మూలాలు సైతం చెల్లని ప్రకటనలు గా మారి హైందవోన్మాద ఉగ్రవాదులు నిర్దోషులు గా జనారణ్యంలో అడుగుపెట్టడం సాధ్యమైంది.
సాధారణంగా సీబీఐ గానీ మరో కేంద్ర ప్రభుత్వ సంస్థగానీ చిన్న చిన్న కేసుల విషయంలో దిగువ న్యాయస్థానాల్లో ఓడిపోతే పై న్యాయస్థానాల్లో అప్పీలు చేస్తాయి. ఉదాహరణకు 2018లో ఒంగోలుకు చెందిన ఓ యువకుడు ఐఎఎస్‌గా ఎంపికయ్యారు. అతని సర్టిఫికెట్ల విషయంలో వివాదం తలెత్తింది. సదరు అభ్యర్థి హైదరాబాద్‌లో అడ్మినిష్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌లో యూపీఎస్సీ మీద దావా నడిపి గెలిచాడు. దీనికి వ్యతిరేకంగా యూపీఎస్సీ హైదరాబాద్‌ హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. కానీ దేశ భద్రతకు ప్రమాదంగా మారిన ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో మాత్రం కేంద్ర హౌం శాఖ అప్పీలు చేయటానికి సిద్ధం కాలేదు. అసీమానందతో పాటు సాధ్వి ప్రగ్య, కల్నల్‌ పురోహిత్‌ హిందూత్వ ఉగ్రవాద కార్యక లాపాల వ్యూహకర్తలు. 2008లో బాంబు దాడి తర్వాత ఈ ముగ్గురు నిందితులూ అరెస్టయ్యారు. జైల్లో ఉన్నారు. దర్యాప్తు పూర్తి అయ్యింది. విచారణ జరుగుతోంది. ఉన్నట్టుండి 2016 ఏప్రిల్‌ 13న ఎన్‌ఐఏ సంస్థ కోర్టులో ఓ అనుబంధ పత్రం దాఖలు చేసింది. ఈ పత్రం ప్రకారం ప్రగ్య ఠాకూర్‌ను నిర్దోషిగా భావిస్తున్నామని తెలిపింది. అంతకు ముందే ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయాధికారిగా పని చేస్తున్న రోహిణి సాలియాన్‌ ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా మరింత లోతుగా విచారణ చేయొద్దని కేంద్ర హౌం శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. పాలక పార్టీ ఎవరి పక్షాన ఉంటే వాళ్లకు రాఫెల్‌ కాంట్రాక్టులు దక్కటమే కాదు. ఏ నిందితుల పక్షాన ఉంటే ఆ నిందితులు నిర్దోషులుగా బయటకొస్తారని కూడా బీజేపీ ఈ ఐదేండ్లలో రుజువు చేసింది. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా ఉగ్రవాద చర్యలను మత ప్రాతిపదికన విడదీసి హైందవో న్మాద ఉగ్రవాదులు చేసేది హిందూమత పరిరక్షణ చర్య ఇస్లామిక్‌ ఉగ్రవాదులది దేశ వ్యతిరేక చర్య అని చెప్పటానికి ఓ ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారటం ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వెల్లడిస్తోంది. హిందూమతం అంటే హైందవో న్మాదుల ఉగ్రవాద చర్యలు కాదని నిజమైన హిందువులు పాలక బీజేపీకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
May 04,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/802210


ప్రజాస్వామ్యం.. ధన స్వామ్యం

ప్రజాస్వామ్యం రంగు మారుతోంది. కరెన్సీ కట్టలు రంగు మారినట్టే. నానాటికీ సమాజం సత్యానికి దూరంగా జరుగుతుంటే నిజం చెప్పే వాళ్లనే నిజం అసహ్యించుకుంటుందని జార్జి ఆర్వెల్‌, ప్రముఖ ఆంగ్ల నవల రచయిత అంటారు. సర్వకాలాల్ల నికరంగా నిలబడేదే నిజం. కానీ నేడు మనమున్నది సత్యానంతర సమాజం. ఇంకా చెప్పాలంటే సత్యదూరమైన సమాజం. ఇక్కడ నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే సత్యానికి కూడా బొమ్మా బొరుసు ఉంటాయి. ఎవరి నిజం వారిదే. కానీ కొన్ని నిజాలు నిప్పులాంటివి. అందులో ఒక నిజం ఎన్నికల్లో డబ్బు పాత్ర గురించిన నిజం.
            ప్రజల చేత ప్రజల కోసం ప్రజల వలన సాగే పాలన ప్రజాస్వామ్యమని అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్‌ ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పారు. భారత లోక్‌సభ ఎన్నికల తీరు గమనిస్తే బహుశా లింకన్‌ ముక్కు మీద వేలేసుకునేవాడేమో. ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రజలను ఒప్పించి ఇతరులను నొప్పించక ఓటు వేయించుకోవటం ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం. కానీ ఇక్కడ ప్రలోభాలకు కొదవలేదు. లోక్‌సభ నియోజకవర్గంలో పోటీచేసే అభర్థి 70లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు రుజువయితే సదరు అభ్యర్థి గెలిచినా అనర్హునిగా ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నది. అనంతపురం లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎంపీ జేసీ దివాకరరెడ్డి 50కోట్ల వరకు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వాపోయారు. పూట గడవని వ్యవసాయ కూలీలు దళితులు కూడా నిలబెట్టి నాయకుల వద్ద ఓటు విలువ వసూలు చేశారని తెగబాధ పడిపోయారు. బహుశా నిమ్న వర్గాల శ్రమ దోచుకోవటానికి తేరగా అవకాశాలు కల్పించే ఈ వ్యవస్థలో అటువంటి వారి ఓటుకు ఖరీదు కట్టాల్సి రావటం ఈయనకి అంతగా రుచించలేదు కాబోలు. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి పది కోట్లకు తక్కువ ఖర్చు పెట్టలేదని ఒక టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం వెల్లడిస్తోంది. ఎన్నికల ప్రచారం మరో రెండ్రోజుల్లో ముగుస్తుంది అనగా హైదరాబాద్‌లో బీజేపీ ఏకంగా ఎనిమిది కోట్లు బ్యాంక్‌ నుంచి డ్రా చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడింది. ఒక సాధారణ ఖాతాదారునికి ఒకేసారి పదివేలకు మించి ఇవ్వటానికి నానా యాగీ చేసే బ్యాంకు నిబంధనలు పాలక పార్టీకి ఏకంగా ఒకే రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎలా డ్రా చేసుకోవటానికి అనుమతినిచ్చాయో అడిగే నాధుడు కరువయ్యాడు.

                దేశంలో అత్యంత ధనం మూట గట్టుకున్న పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి తనను తాను ఫకీరునని చెప్పుకుంటున్నాడు. ఊళ్ళో పెళ్లికి ఎవరికో సందడి అన్నట్టు ఎన్నికలంటే ఎక్కడెక్కడి నిధులు నదుల్లా పొంగి పొర్లుతాయి. దేశంలో నల్ల ధనాన్ని మాయం చేస్తానంటూ మోడీ నోట్లరద్దు మంత్ర దండాన్ని గాల్లో తిప్పాడు. కానీ ఈ ఎన్నికల్లో దొరికిన దాదాపు 4వేల కోట్ల రూపాయలు నల్లధనం ఏ కలుగులో నుంచి వచ్చిందో కనుక్కునే ప్రయత్నం కూడా చేయటం లేదు ప్రభుత్వం.
         ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఖాతాలకి గొళ్ళెం పెట్టి మరీ బీజేపీ వేల కోట్లు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టింది. ఇదేశైలి త్రిపుర ఎన్నికల వరకు కొనసాగింది. సన్యాసులు సాధువులు సంత్లు నాయకులుగా ఉన్న పార్టీకి ఇన్ని నిధులు ఎలా వచ్చాయన్న విషయాన్ని దర్యాప్తు చేయాల్సిన సంస్థలన్నీ బీజేపీ పెరట్లో పలుపు తాళ్లకు కట్టేయబడ్డాయి. దాంతో అసలైన నిజాలు ఎన్నటికీ ప్రజల దృష్టిలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ప్రత్యామ్నాయ మార్గాల్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు.

                మోడీ మంత్ర దండమో అమిత్‌షా తంత్ర గండమో తెలీదు కానీ రాజుగారి గంగాణం నిధులతో పొంగి పొర్లుతోంది. ఇంకా చెప్పాలంటే కార్పొరేట్‌ కంపెనీల లాభాల రేటును మించి బీజేపీ ఖాతాలో నికర నిల్వలు పెరుగుతూ వచ్చాయి. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల్లో లబ్దిదారులంతా బీజేపీకి చందాలు ఇచ్చి కాంగ్రెస్‌కు కరువు కాలం చూపినట్టు కనిపిస్తోంది. వేరే పార్టీల విషయంలో ఇలా జరిగి ఉంటే జాతిని మేల్కొలపటానికి అటు ప్రభుత్వంలోని ఇటు పాత్రికేయ రంగంలోని నిఘావర్గాలు జూలు విదిలించి ఉండేవి. కానీ ఇక్కడ ఆయా నిఘా వ్యవస్థలను మేల్కొల్పాల్సిన చౌకీదారే కండ్లు మూసుకున్నారు.
             ఈ ఎన్నికల్లో ప్రధాన బూర్జువా పార్టీలు పెట్టిన ఖర్చు నిస్సందేహంగా ఎన్నికల సంఘం అనుమతించిన పరిమితి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఒక్కటే 125 హెలికాఫ్టర్లు అద్దెకు తీసుకున్నది. ఇక ప్రయివేటు విమానాల సంఖ్య తేలాల్సి ఉంది. ఒకే రోజు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఏపీ మీదుగా కేటాల5 వరకు జరిగిన బహిరంగసభల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరయ్యారు. ప్రయివేటు విమానం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. సగటున హెలికాప్టర్ల అద్దె గంటకు ఏడున్నర వేల డాలర్లు. అంటే సుమారు ఐదు లక్షల రూపాయలు. కనీసం ఓ మీటింగ్‌కు ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చి మీటింగ్‌లో ఉపన్యాసం ఇచ్చి తిరిగి వెళ్లితే ఎంత లేదన్నా 4 గంటల సమయం అవసరం. అంటే 20లక్షల ఖర్చు. ఈ విధంగా ఏ పార్టీకి చెందిన ఎంత మంది నాయకులు ఇలాంటి మీటింగ్‌లల్లో ఎన్నింటిలో పాల్గొన్నారో లెక్క తీయటం బ్రహ్మ విద్య ఏమీ కాదు. దేశీయ పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగాల వద్ద గగన వీధుల్లో తిరిగిన గాలిమరల వివరాలు అన్నీ నిక్షిప్తం అయి ఉంటాయి. ఎన్నికల సంఘం కనీసం కండ్లు తెరిచి వ్యవహరించి ఈ వివరాలు తెప్పించుకుంటే ఏ పార్టీ స్టార్‌ నాయకుల ప్రయాణాలకే ఎంత ఖర్చు పెట్టిందో లెక్క తేల్చవచ్చు. ఓ సారి అలాంటి లెక్క తీసాక ఆ ఖర్చు మొత్తాన్ని లెక్కిస్తే బూర్జువా పార్టీలు ప్రత్యేకించి బీజేపీ అభర్థులందరినీ అనర్హులుగా ప్రకటించవచ్చు. ఇవి కాక జేసీ దివాకర్‌ రెడ్డి వెల్లడించిన వివరాలు పోగేస్తే ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాడో లెక్క తేల్చడం కూడా పెద్ద శ్రమతో కూడిన వ్యవహారం కాదు.

                    ఈ ఆర్భాటాల్లో బీజేపీని మించగల శక్తి మరో పార్టీకి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి బీజేపీ ఖాతాలో రూ.570 కోట్లు జమ పడ్డాయి. 2016-17నాటికి ఈ మొత్తం 1034 కోట్లకు పెరిగింది. ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన వివరాలలోని విషయాలే. రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాల విషయంలో పారదర్శకతకు మంగళం పాడిన తర్వాతనే బీజేపీకి ఈ నిధుల వరద పెరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థాయిలో నిధులు సమీకరించుకునే వెసులుబాటు బీజేపీకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ చందాలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు నడిచింది. వాద ప్రతివాదనలు విన్నాక ఏ పార్టీకి ఎంత మొత్తంలో కార్పొరేట్‌ కంపెనీల నుంచి నిధులు అందాయో మార్చి 31నాటికి తెలియ చేయాలని ఆదేశించింది.
               ఎన్నికల వ్యవస్థే బూర్జువావర్గ పాలనను పరిరక్షించే మార్గాల్లో ఒకటి అన్న అంచనా ఉన్నపుడు ఈ ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెడితే ఏమిటి ఎవరు గెలిస్తే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఎంత అస్త వ్యస్థంగా ఉన్నా ఈ ఎన్నికల వ్యవస్థలో ఎంతో కొంత మేర ప్రజల వాణి వినిపించే వామపక్షాల లాంటి శక్తులు చట్టసభల్లో అడుగు పెట్టగలుగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు బలంగా ఉన్న కేరళ, బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్థాయిలో లేదు. ఎన్నికల ప్రచారం ఎంతో కొంత విధానాలకు పరిమితమయ్యే పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో ఉంది. కానీ సరళీకరణ విధానాలు దేశంలో అన్ని వ్యవస్థలను దిగమింగుతున్నట్టు రాజకీయ వ్యవస్థను పార్టీలను కూడా దిగ మింగుతోంది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని దీనికి ఓ మార్గంగాను, రహస్య మార్గాల్లో పార్టీలకు చందాలు చేరవేయటం ఓ సాధనంగానూ మారింది. సాధారణంగా ఎన్నికల్లో కోటీశ్వరులు కార్పొరేట్‌ వర్గం బరిలోకి దిగాక ఎన్నికల ప్రచారంలో రైతు వ్యవసాయ కార్మిక సమస్యలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు, ధరల భారం, నిరుద్యోగ సమస్య వంటి సాధారణ పౌరుల ఈతిబాధలకు ఎన్నికల ప్రచారంలో చోటు దక్కుతుందని ఆశించటం నేతి బీరకాయలో నేయి చందమే.

ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వారి గెలుపునకు 91శాతం అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. గత 20ఏండ్లల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు విశ్లేషిస్తే కోట్లల్లో ఖర్చు పెట్ట గలిగిన అభ్యర్థులు 84శాతం గెలిచారు. మిగిలిన 16శాతం బహుశా వామపక్షాల అభ్యర్థులు, రిజర్వుడ్‌ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అయి ఉంటారు.
అభ్యర్ధుల ధన బలానికి పార్టీల ధన బలం తోడైతే? ఇక పర్యవసానం ఏమిటో ఊహించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్నికల్లో రానురాను పెరుగుతున్న ధన ప్రభావం ఎన్నికలను కార్పొరేట్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించే మరో రంగంగా మారుతోంది.
              ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అడ్డుకోకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు చట్టసభల్లో ప్రవేశించలేవు. అటువంటి శక్తులకు చట్టసభల్లో ప్రవేశం లేకుండా ప్రజా సమస్యల మీద చట్ట సభల్లో చర్చకు అవకాశం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడే శక్తులు ప్రత్యామ్నాయ ఎన్నికల వ్యవస్థ గురించిన చర్చ కూడా తమ ఎజెండాలో చేర్చుకోవాలి. కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తమవుతున్న ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలను కాపాడుకోవటం కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల తక్షణ కర్తవ్యం కావాలి. చేజారిపోతున్న ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037