Wednesday, May 22, 2019

May 08,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/804659


ఓటర్ల స్పందన బీజేపీని బెంబేలెత్తిస్తోందా?

May 11,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/805849


మోడీ మజిలీ కథలు

ఆదివారం నాటికి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరో ఘట్టం ముగుస్తుంది. మరో పది రోజుల్లో భావి భారత పాలకులు ఎవరన్న విషయం స్పష్టం కానుంది. దాంతో మార్చి ఏడో తేదీ ఎన్నికల ప్రకటనతో మొదలైన 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కథ కంచికి చేరనుంది. పాలక పార్టీ ఈ ఎన్నికల్లో గెలవటానికి ప్రచారంలో పెట్టిన అంశాలు గమనిస్తే చిన్నప్పటి కాశీ మజిలీ కథలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన గానీ, స్వర్ణచతుర్భుజి పేరుతో నిర్మించిన జాతీయ రహదారులు కానీ లేవు. దాంతో కాశీయాత్రకు బయలుదేరేటప్పుడు జట్లు జట్లుగా బయలుదేరే వారు. ఒక్కో జట్టులో వయసులో పెద్దవాడైన వ్యక్తి ఒక్కో మజిలీలో ఒక్కో కథ చెపుతూ సాటి ప్రయాణీకుల్లో ఉత్సాహం నింపటానికి ప్రయత్నం చేసేవాడు. అలా వచ్చినవే కాశీ మజిలీ కథలు. కట్టు కథలైనా, పుక్కిటి పురాణాలైనా మనువాద సాహిత్యంలో కొకొల్లలు. మనువాదమే మానవవాదమని నమ్మే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ుకు తిరుగులేని ప్రతినిధిగా ఉన్న మోడీ కూడా ఈ పుక్కిటి పురాణాల నుంచి బాగా స్ఫూర్తి పొందినట్టున్నారు. ఒక్కో దశ పోలింగ్‌కు ఒక్కో ప్రచారాస్త్రాన్ని ముందుకు తెచ్చి ఓటర్లల్లో ఉత్సాహం నీరుగారకుండా చూసేందుకు విశ్వప్రయత్నం చేశారు.
మోడీ మరోసారి ఢిల్లీ మజిలీ చేరుకోవటానికి ఎన్నికల ప్రచారంలో సైతం అనేక మజిలీలు దాటుకుంటూ వచ్చారు. తొలి దశ ఎన్నికల్లో మోడీ ప్రధాన కేంద్రీకరణ యావత్తూ బాలకోట్‌ దాడుల నేపథ్యంలో దేశానికి శక్తివంతమైన పాలన కావాలని, అటువంటి శక్తివంతమైన పాలన అందించే సత్తా తనకు మాత్రమే ఉందని ఉపన్యాసాలిచ్చారు. వందిమాగధుల పాత్ర పోషించటానికి పోటీ పడే సాక్షిమహరాజ్‌ వంటి వారు మరోసారి మోడీ అధికారానికి వస్తే భవిష్యత్తులో భారతదేశంలో ఎన్నికలతో పని ఉండబోదని ఇంటిగుట్టును రట్టు చేశారు. రెండో దశలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ప్రచారం నాటికి మరో అడుగు ముందుకేసి యోగీ ఆదిత్యనాథ్‌ వంటి నేతలు ఏకంగా భారతీయ సైన్యాన్ని మోడీ సేనగా ప్రకటించారు. వందలమందికి గుండెలు ఎదురొడ్డే మగధీరులున్న ఈ దేశంలో 56అంగుళాల ఛాతీ కలిగిన నేతలు సైతం లక్షల మంది సైనికులు వెన్నంటి వుంటే తప్ప ఎన్నికల బరిలో నెగ్గలేని స్థితికి చేరుకున్నారు.

ఇక మూడో దశకు వచ్చేసరికి పాచికలు విసరటం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వంతు అయ్యింది. ఏకంగా తాము అధికారానికి వస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ ఏర్పాటు చేస్తామని, సదరు రిజిష్టరులో ఇమడని పౌరులందరినీ విదేశీయులుగా పరిగణించి తరిమి వేస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ సమయానికి రాఫెల్‌ వివాదాన్ని విచారిస్తున్న సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ డిసెంబర్‌ నాటి తన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనను మన్నించింది. విచారణ చేపట్టింది. దాంతో రాఫెల్‌ వివాదంలో భాగమైన అనుమానాస్పద లావాదేవీలు, జోక్యాలను విచారిస్తే దేశ భద్రతను బహిరంగ మార్కెట్‌లో పెట్టినట్టేనని మోడీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. సైనికోన్మాదం ఉఛ్చదశకు చేరుకోవటంతో కాంగ్రెస్‌ కూడా తానేమీ వెనకబడలేదని చెప్పుకోవటానికి తమ హయాంలో సైతం 12సార్లు పాకిస్థాన్‌ శిబిరాలపై మెరుపు దాడులు చేశామని వెల్లడించింది. ఈ విధంగా వెల్లడించుకోవటం అంటే దేశభద్రత కాపాడటంలో తమకు సామర్థ్యం ఉందని చెప్పుకోవటమే. తద్వారా బీజేపీ వేసిన ఉచ్చులో కాంగ్రెస్‌ చిక్కుకుపోయింది.

బీజేపీ వ్యూహకర్తలు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజనసమాజ్‌ పార్టీల మధ్య పొత్తు ఇంటికి చేరదని అంచనా వేశారు. ములాయంసింగ్‌ మాయావతిల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే దీనికి పునాది. ఈ వైరానికి సంబంధించిన అనేక విషయాలు ఒళ్లో ఒదిగిన మీడియా ద్వారా, కోట్ల ఖర్చు ఇంధనంతో నడుస్తున్న సోషల్‌ మీడియా ద్వారా ఉత్తరప్రదేశ్‌ ఓటర్లకు చేరవేసేందుకు బీజేపీ నేతృత్వంలోని పుకార్ల ఫ్యాక్టరీలు షికార్లు మొదలు పెట్టాయి. ఈ పుకార్లలో వాస్తవం లేదని నిరూపిస్తూ మాయావతి ములాయం సింగ్‌ యాదవ్‌లు ఒకే వేదిక మీద ఎన్నికల సభల్లో పాల్గొని ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారు. దీంతో నాల్గో దశ పోలింగ్‌ సమయం దగ్గరపడే కొద్దీ బీజేపీ మజిలీ ఢిల్లీ చేరుతుందా లేదా అన్న సందేహం మొదలైంది. ఫలితంగా సహనం కోల్పోయిన ప్రధాని ఏకంగా అణోన్మాదం రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఎన్నికల బహిరంగ సభలో భారతదేశంలోని అణ్వాయుధాలు దీపావళి రోజు పేల్చటానికి దాచుకోలేదని కనుసైగతో కరాచీని నేలమట్టం చేస్తాయని హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రయోగం కేవలం పాకిస్థాన్‌నే కాదు, భారతదేశాన్నీ మట్టిపాలు చేస్తుందన్న సంయమనం లేకుండా వ్యవహరించటం ప్రధాని బాధ్యతలో ఉన్న మోడీకి తగని పని. ఇటువంటి ఉపన్యాసాలు విన్నప్పుడే కోతికి కొబ్బరి చిప్ప సామెత గుర్తుకొస్తుంది.

మొదటి మూడు దశల్లో ముస్లిం వ్యతిరేకతనే ఆయుధంగా మల్చుకున్న మోడీ, ఆయన వంది మాగధులు నాల్గో దశకు వచ్చే సరికి మోడీ వెనకబడిన కులానికి చెందినవాడు కావటంతో దేశంలోని అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ ఓర్వలేక ఒక్కటవు తున్నాయని సానుభూతి రాజకీయాలకు పాల్పడ్డారు. మొదటి మూడు దశల్లో ప్రధానంగా దక్షణాది రాష్ట్రాల్లో పోలింగ్‌ హడావుడి పూర్తి అయ్యింది. నాల్గో దశలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎక్కువ స్థానాలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ఈ దశలో మోడీ తన వెనకబడిన కులాన్ని ముందుకు తేవటం బీజేపీ ఎన్నికల వ్యూహంలోని పదునును గుర్తు చేసే అంశం.
ఐదో దశ పోలింగ్‌ పూర్తి అయ్యే నాటికి క్రమంగా బీహార్‌ రాజస్థాన్‌ ఒడిషా రాష్ట్రాలతో సహా మెజారిటీ సీట్లల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. పంజాబ్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దాంతో చాకచక్యంగా రాజీవ్‌గాంధీని దుమ్మెత్తిపోసే ప్రచార వ్యూహానికి బీజేపీ తెరతీసింది. తదుపరి దశల్లో పోలింగ్‌ జరిగే అన్ని నియోజకవర్గాలకు రాజీవ్‌గాంధీకి మధ్య సంబంధం ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఈ ప్రాంతానికి చెందిన వారే. సిక్కులు, జాట్‌ సిక్కులు వీరిలో అధికులు. దాంతో వారి మనోభావాలు రెచ్చగొట్టేందుకు మోడీ మిగిలిన దశల పోలింగ్‌ను రాజీవ్‌గాంధీ పాలనపై రిఫరెండంగా మార్చటానికి తాను సిద్ధమంటూ సవాలు విసిరారు. ఆరోదశ పోలింగ్‌కు వచ్చే సరికి తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారనీ తిరిగి సానుభూతి కార్డు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. గత ఐదేండ్లలో మోడీ గురించి ప్రయోగించిన ఉపమానాలతో ఓ డిక్షనరీ తయారు చేసి తనను ఇన్ని మాటలంటున్నారు చూడండి అంటూ వాపోయారు మోడీ. ఈ విధంగా మోడీ మజిలీ కథల్లో ఒక్కో మజిలీలో చెప్పిన కథకు ఒక్కో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. ఈ అన్ని దశల్లో ఒక్క చోట కూడా ఐదేండ్లలో సాధించిన విజయాలు గురించి చెప్పుకునేందుకు మోడీ ప్రయత్నం చేయకపోవ టం గమనించాల్సిన విషయం. మోడీ పాలన, విజయాల డొల్లతనాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
ఈ ఆరుదశల్లో దేశం ఎన్నో కథలు విన్నది. భారీ తారాగణంతో రాజకీయ స్కోప్‌ సినిమాలు చూసింది. కథానాయకులు ప్రతినాయకులుగా మారటం, ప్రతినాయకులు కథా నాయకులుగా మారటాన్ని దేశం గమనించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు ముందుకు తెచ్చిన అంశాలు, ప్రజల దృష్టినాకర్షించటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యం పట్ల జవాబుదారీ తనం పట్ల రాజకీయనాయకులకు ఏమాత్రం పట్టింపు ఉందో అర్థం చేసుకోవటానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాజకీయ విలువలు అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల లోకాలు దాటి పాతాళానికి చేరుకున్నాయి. మన పాలకులు విశిష్టంగా భావించే పురాణ ఇతిహాసాల ప్రకారం పాతాళానికి చేరే కొద్దీ ఈతి బాధలు పెరుగుతూ పోతాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యం కూడా పాతాళానికి జారిపోయే కొద్దీ కొత్త కొత్త సమస్యల సుడిగుండంలో కూరుకుపోతుంది. ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి చేర్చటానికి పాలకవర్గం మండుటెండలో సైతం మడమ తప్పికుండా పని చేసింది. ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోకుండా ప్రజల మధ్యే ఉండేలా చేయటం ప్రజలు, ప్రతిపక్షాల కర్తవ్యం.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
May 14,2019

 Nava Telangana Daily

ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం ప్రమాదకరం

దేశం ఎన్నికల కొలిమి నుంచి ఎండల కొలిమిలోకి నడుస్తోంది. ఈ వేడిలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో విసురుతున్న సవాళ్లలో కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతున్నాం. అటువంటి వాటిలో ఒకటి పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య ఉండాల్సిన సంబంధం. మోడీ అధికారానికి రావటానికి ముందే ఈ దేశాన్ని కాంగ్రెస్‌ చెర నుంచి విముక్తి చేయటం లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అధికారానికి వచ్చాక దేశాన్ని ప్రతిపక్షం నుంచి విముక్తి చేయటమే లక్ష్యమని సవరించుకున్నారు. మరోవైపున ఆర్నెల్ల క్రితం ఎన్నికలు జరిగిన తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు, కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయనున్నట్టు వార్తలు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ జెండా కింద గెలిచిన దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పచ్చ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో కలిపేసుకున్నారు. కొద్దికాలం క్రితం జమ్ముకాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల పొత్తు వికటించిన తర్వాత పీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలో విలీనం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. చివరకు పీడీపీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు జతకట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని గవర్నర్‌ను కోరటంతో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్షాన్ని కబళించటం పాలకపక్షం హక్కయింది. ఈ నేపథ్యంలో కొన్ని మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతిపక్షం ప్రజాస్వామ్య మౌలిక లక్షణాల్లో ఒకటి. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే శక్తి. ప్రభుత్వ తప్పొప్పులను పరిశీలించి జవాబుదారీతనం కోరే శక్తి. ఐదేండ్లకొకసారి ప్రజల ముందుకొచ్చే ఎన్నికల్లో ఏదో ఒక మోతాదులో ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకుతెచ్చే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయం ప్రతిపాదించటం అంటే పాలకపక్ష వైఫల్యాలను ముందు పరిశీలించాలి. విమర్శించాలి. ప్రజలకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తించి అర్థం చేసుకుని నివారణ అవకాశాలను ప్రజల ముందుంచాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను, దొర్లిన పొరపాట్లను గుర్తించి ప్రజల ముందు ఎత్తి చూపాలి. బహుశా ప్రతిపక్షం ఉంటే తమ వైఫల్యాలు, చేతగానితనం, బండారం ఒకరోజు కాకపోతే మరో రోజైనా బట్టబయలు కాక తప్పదన్న సూత్రాన్ని పాలక పార్టీలు అర్థం చేసుకున్నట్టున్నాయి. అందుకే అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్టున్నాయి.

ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం గురించి చర్చించాలనుకున్నప్పుడు పురాణాల్లో ప్రతిపక్షం పాత్ర, ప్రతిపక్షం లేకపోవటం వల్ల కలిగిన నష్టాలనేకం గుర్తు కొస్తాయి. రామాయణంలో దశరధుడు రాముడిని వనవాసం పంపాలని నిర్ణయించినప్పుడు ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలు ఎవ్వరూ వేయలేదు. సీతను అడవిలో విడిచి రమ్మని రాముడు ఆదేశించినప్పుడు ఇది నైతికమా, చట్టబద్ధమా, న్యాయసమ్మతమా అని ఎవ్వరూ ప్రశ్నించలేదు. రావణుడు సీతను అపహరించుకు వచ్చినప్పుడు మండోదరి మనకు ఇది తగదు అని చెప్పిందే తప్ప ప్రతిఘటించలేదు. విభీషణుడు ఎదురు తిరిగాడు. రావణుడు కాదు కూడదు అన్నప్పుడు లంక నుంచి వాకౌట్‌ చేశాడు. ఇది ప్రతిపక్షం. ఇదే ప్రతిపక్షానికి తగిన బలం ఉంటే రామ రావణ యుద్ధం జరిగి ఉండేదే కాదు. రామరాజ్యంలో ప్రతిపక్షానికి ఈమాత్రం అవకాశం కూడా లేదు. లంకలోని రావణ రాజ్యంలోనే ప్రతిపక్షానికి చోటుంది. ఈ ప్రతిపక్షం మాట కూడా విననప్పుడు లంక రావణ కాష్ఠమైంది.
మహాభారతంలో పాచికలాటలో ద్రౌపదిని పణంగా పెట్టేటప్పుడు కొలువులో ఉన్న పెద్దలందరూ ముఖముఖాలు చూసుకున్నారే తప్ప ఎవ్వరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. మహాభారతంలో పాలకుల నిర్ణయాలను ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని నాటి సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు నిలదీసి అడ్డుకుని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. కౌరవసేనలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి తర్వాత పెద్దవాడు వికర్ణుడు. వస్త్రాపహరణ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వికర్ణుడు కూడా వాకౌట్‌ చేస్తాడు. కనీసం వికర్ణుడు పోషించిన ప్రతిపక్ష పాత్రనైనా కురువృద్ధులు, గురువృద్ధులు పోషించి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. మహాభారత, రామాయణాలే ప్రతిపక్షం పాత్ర గురించి హెచ్చరిస్తున్నాయి. నాటి కథలన్నిటిలో రాచరికమూ, నియంతృత్వమే. కానీ మనమిప్పుడున్నది ప్రజాస్వామ్యంలో. ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. అటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మరెన్ని ఉత్పాతాలకు దారి తీయనున్నాయో ఆలోచించుకోవటం ఓటర్ల వంతు.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

18 May 2019

Nava Telangana 

సంస్కృతిక జాతీయవాదం దిశగా బీజేపీ ప్రయాణం

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్‌షో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య కండబల ప్రదర్శన కేంద్రంగా మారింది. గతేడాది రోడ్‌షోకు అనుమతించకపోవటంపై బీజేపీ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జాతీయ స్థాయిలో బీజేపీ బెంగాల్‌లో తృణమూల్‌ ప్రధానశక్తులుగా ఆవిర్భవించటంతో రెండు పార్టీలూ రాజకీయ పోరాటానికి కొత్త నిర్వచనం ఇచ్చాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు బెంగాల్‌ రాజకీయాలను మలుపు తిప్పిన కార్మిక కర్షక పోరాటాల స్థానాన్ని మూకస్వామ్యం ఆక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి వీధిపోరాటాల నడుమనే రాజకీయ అస్థిత్వాన్ని వెతుక్కున్న మమతా బెనర్జీని ఎదుర్కోటానికి బీజేపీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నది.
ప్రజాస్వామిక వ్యవస్థలను తుత్తునియలు చేయటానికి మూకస్వామ్యం రూపంలో బీజేపీ వినూత్న వ్యూహాలను ఎలా అనుసరిస్తుందో శబరిమల తీర్పు నేపథ్యంలో కేరళ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. బీజేపీ దృష్టిలో రాజకీయ ఆందోళన అంటే ప్రత్యర్థి శ్రేణులపై భౌతికదాడులే. 2011నుంచీ బెంగాల్‌లో పోలింగ్‌ సందర్భంగా జరుగుతున్న హింసాకాండ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే సీపీఐ(ఎం) విన్నవించినా వీడియోలు ఫోటోలు అందచేసినా అటు ఎన్నికల సంఘం గానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. అప్పట్లో సీపీఐ(ఎం)ను ఓడించటం పాలకవర్గాల ఏకైక లక్ష్యంగా నిలిచింది. దాంతో వేలాదిమంది సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవటమేకాక పార్టీకి చెందిన వందలాది కార్యాలయాలను తృణమూల్‌ ఆక్రమించింది. ఇదే మార్గాన్ని నేడు బీజేపీ అనుసరిస్తోంది. ఫలితంగా దేశంలో అత్యంత హింసాత్మక సంఘటనలు జరిగిన రాష్ట్రంగా ఈ సారి బెంగాల్‌ నమోదైంది.

అదలా ఉంచితే అమిత్‌షా రోడ్‌షో సందర్భంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ కళాశాల ప్రాంగణంలో నిలబెట్టిన విద్యాసాగర్‌ విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేయటం దేశాన్ని నివ్వెరపర్చింది. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక లెనిన్‌ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చి వేసిన ఫోటోలు వీడియోలు దేశమంతా వైరల్‌ అయితే సోకాల్డ్‌ ప్రజాతంత్ర శక్తులు నోరు మెదపలేదు. అదే సాంప్రదాయాన్ని బీజేపీ ఇప్పుడు బెంగాల్‌కు వ్యాపింపచేసింది. ఏకంగా ఆధునిక బెంగాల్‌ నిర్మాతగా పేరుగాంచిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాలను కూల్చివేతకు తెరలేపింది. విగ్రహాల కూల్చివేతకు ముందు జరిగిన పరిణామాలు రాజకీయ ప్రాధాన్యత కలిగినవి. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్న మోడీ రామనామాన్ని జపిస్తే బెంగాల్‌లో ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని ఉపన్యసించారు. దీన్నే మంత్రంగా పరిగణించిన బీజేపీ శ్రేణులు జై శ్రీరాం అంటూ వీధుల్లోకి రావటం మొదలైంది. చివరి దశలో పోలింగ్‌ జరగనున్న తొమ్మిది నియోజకవర్గాలు ప్రధానంగా పట్టణ ప్రాంత నియోజకవర్గాలే. పట్టణ ప్రాంతాల్లో బలం పుంజుకున్న బీజేపీ తృణమూల్‌ ఆధిపత్యాన్ని సవాలు చేయబూనుకుంది.
బీజేపీకి రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ పార్టీ నిర్మాణంలేదు. ఈ మధ్యకాలం వరకు బీజేపీ భావజాలాన్ని నమ్మిన శ్రేణులూ పెద్దగా లేవు. ప్రధానంగా తృణమూల్‌, కాంగ్రెస్‌లలో సీట్లు దక్కని నేతలే బీజేపీకి తొలి పెట్టుబడిగా మారారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా ప్రజాదరణ లేకపోయినా రెండు వనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. మొదటిది నిరుద్యోగం. రెండోది డబ్బు. 2011వరకు ఎన్నికల్లో ధన ప్రభావం నామమాత్రంగా ఉండేది. విధానాలే కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరిగేది. సీపీఐ(ఎం) స్థానంలో టిఎంసీ అధికారానికి రావటంతో క్రమంగా ఎన్నికల రంగం రూపురేఖలు మార్చుకొంది. ధన ప్రభావానికి తెరతీసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీని ఈ విషయంలో ఢ కొట్టే పార్టీలు లేవు. దాంతో బీజేపీ పెద్దఎత్తున రాష్ట్రంలోకి కోట్ల కట్లను దించింది. నిరుద్యోగులను సైన్యంగా మార్చుకుంది. వీధిపోరాటాలే వ్యూహంగా ఎంచుకుంది.

గత ఆరు దశాబ్దాలుగా చాపకింద నీరులాగా పని చేసిన ఆరెస్సెస్‌ శాఖలు నేడు మితవాద రాజకీయాలకు కేంద్రంగా మారాయి. కోల్‌కతా వాణిజ్యమంతా మార్వాడీల చేతుల్లో ఉంటుంది. ఈ మార్వాడిలే ఆరెస్సెస్‌ను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టారు. 1990వరకు ఆరెస్సెస్‌ కార్యకలాపాలు, ఉపన్యాసాలు హిందీలో జరిగేవి. తర్వాతి కాలంలో ఉపన్యాసాలన్నీ బెంగాలీలోనే జరపాలని సంఫ్‌ు పట్టుబట్టి పెద్దఎత్తున సాహిత్యాన్ని బెంగాలీ భాషలోకి అనువదించి విచ్చలవిడిగా అందుబాటులోకి తేవటం ప్రారంభించింది. ఇక్కడే ఓ విషయాన్ని ప్రస్తావించాలి బెంగాల్‌లో సీపీఐ(ఎం) ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుందని బూర్జువా పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. అరుణ్‌శౌరీ లాంటి వాళ్లు బెంగాల్‌లో ముస్లింల జనాభా గురించి పుంఖాను పుంఖాలుగా రాశారు. అయినా వామపక్ష సంఘటన అధికారంలో ఉన్నంత కాలమూ సంఫ్‌ుపరివారం కార్యక్రమాలు సాధారణ స్థాయి దాటలేదు. కానీ సీపీఐ(ఎం)ను గద్దె దించే లక్ష్యంతో కాంగ్రెస్‌ సహకారంతో తృణమూల్‌ 28శాతంగా ఉన్న ముస్లింలను ఓటుబ్యాంకుగా మార్చుకోవటం మొదలు పెట్టిన తర్వాతనే సంఘపరివారం కార్యకలాపాలు విస్తరించటానికి కావల్సిన ఇంధనాన్ని సమకూర్చి పెట్టింది. దాంతో అటు దుర్గాపూజ కమిటీలను స్పాన్సర్‌ చేయటంతో పాటు క్రమంగా రామనవమి యాత్రలు, హనుమాన్‌ జయంతు లను కూడా తృణమూల్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించటం మొదలుపెట్టింది. అప్పటివరకు నిద్రాణంగా ఉన్న సంఘపరివారం కార్యకలాపాలు రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో ఊపందుకోవడం మొదలైంది. అది నిద్రపోతున్న సంఘపరివారం జూలు విప్పటానికి కారణమైంది. ఈ విధంగా తృణమూల్‌ అనుసరించిన కాంపిటేటివ్‌ మత సమీకరణలు బెంగాల్‌ రాజకీయ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. దాని ఫలితమే రోడ్‌ షో సందర్భంగా జరిగిన ఘర్షణలు, దాడులు, ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగిన హత్యాకాండ.

గతేడాది తృణమూల్‌ విద్యార్థి విభాగం జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చటానికి ప్రతీకారంగా బీజేపీ శ్రేణులు విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూల్చేశాయి. విద్యాసాగర్‌ జీవితాంతం కట్టుబడి ఉన్న విలువలకు ఆరెస్సెస్‌ అవగాహన పూర్తిగా భిన్నమైనది. రాజారామ్మోహన్‌ రారు కంటే ముందే బాల్య వివాహాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా సాధికారిత, ప్రజాతంత్ర హక్కులు వంటి అంశాలపై జీవితాంతం కృషిచేశారు. బంగ్లబాషకు వర్ణమాల రూపొందించారు. మహిళా విద్యాభ్యాసానికి పెద్దపీట వేశారు. దేశంలో మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు స్థాపించిన ఇరువురిలో ఒకరిగాఖ్యాతి గడించారు. వారిలో ఒకరు జ్యోతిబాపూలే కాగా, మరొకరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌. అంతేకాదు. అప్పటివరకు పండిత పుత్రులకు మాత్రమే అవకాశం ఉన్న సంస్కృత విద్యను అన్ని కులాల వారికీ అందించేందుకు అడ్మిషన్‌ పద్ధతిలో మార్పులు తెచ్చారు. ఆ తర్వాతనే శూద్రులు కూడా సంస్కృత పాఠశాలలో విద్యార్థులయ్యారు. ఈ విలువలకు ఆది నుంచీ ఆరెస్సెస్‌ బద్ద వ్యతిరేకి. దీంతో ఈ ఘటన ఆధునిక బెంగాల్‌ సంస్కృతిపై దాడిగా పరిగణించబడుతోంది.
బీజేపీ ఎక్కడ రాజకీయాలు చేసినా అవి ముందుగా సాంస్కృతిక రాజకీయాలుగానే ఉంటాయి. బీజేపీ తొలినినాదమే సాంస్కృతిక జాతీయవాదం. దీన్ని సాధించుకోవటానికి ప్రజాదరణ పొందిన సంస్కృతిని ధ్వంసం చేయటం ఏకైక వ్యూహంగా బీజేపీ రాజకీయాలు సాగుతాయి. ఉమ్మడి విలువలు, ఉమ్మడి వారసత్వం, ఉమ్మడి సాంప్రదాయాలను ధ్వంసం చేయాలంటే అటువంటి ఉమ్మడి స్వభావానికి పునాదులు వేసిన త్యాగధనులను వారి స్ఫూర్తిని కాలరాయాలి. విగ్రహాలు కూల్చివేత ఇందులో ఓ అంకం మాత్రమే. వ్యవస్థల విధ్వంసం మరో అంకం. గత ఐదేండ్లల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ స్థాయి పాలనా వ్యవస్థలను కుప్పకూల్చిన తీరు పాఠకుల ముందు ఉంది. ఇప్పుడు సాంస్కృతిక వైవిధ్యానికి గల పునాదులు ద్వంసం చేయటంలో నిమగమైంది. ఆధునిక భారత నిర్మాణం బెంగాల్‌ నవనిర్మాణంతోనే మొదలైంది. ఆధునిక భారత్‌ను అంధకారంలోకి నెట్టాలంటే బెంగాలీ చైతన్యాన్ని దారి మళ్లించటం తక్షణ అవసరం. బెంగాల్‌లో బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం రానున్న కాలంలో బీజేపీ సంఘపరివారం అనుసరించనున్న సాంస్కృతిక జాతీయవాద రాజకీయాలకు సూచికగా, వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి హెచ్చరికగా నిలుస్తోంది.
- ప్రశాంత్‌