Monday, August 30, 2010

ఢిల్లీలో 'జనంపాట-జనంమాట'



తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ప్రజా కవి సుద్దాల హనుమంతు శతజయంతి ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 'జనంపాట-జనంమాట' కార్యక్రమం స్థానిక తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. మూడు గంటలకు పైగా ఏకబిగిన సాగిన సాంస్కృతిక సాయంత్రం ఆహూతులను కట్టిపడేసింది. ఆదివారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో సాహితి, ఆంధ్ర అసోసియేషన్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాత్రికేయులు ఎ. కృష్ణారావు అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ప్రజాశక్తి మాజీ సంపాదకులు వి.శ్రీనివాసరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉద్యమ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న, ఆశుకవి అందెశ్రీ, ఆంధ్రా అసోసియేషన్‌ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రజా కళలు కార్పొరేట్‌ కౌగిలిలో విలవిలలాడుతున్నాయని తన ప్రారంభోపన్యాసంలో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ' కామన్‌వెల్త్‌ క్రీడల కోసం తాను రూపొందించిన థీమ్‌సాంగ్‌కు ఎఆర్‌ రహమాన్‌ ఐదున్నర కోట్లు వసూలు చేశారు. పల్లెటూరి పిల్లగాడా....అంటూ తెలంగాణా ప్రజానీకాన్ని తట్టిలేపిన సుద్దాల హనుమంతకు మనం ఎన్నికోట్లు ఇవ్వాలి ?



ప్రజల కోసం పనిచేశాడు కాబట్టే వంద సంవత్సరాల తర్వాతా ఆయన్ను మనం స్మరించుకుంటున్నాం. ఆయన ప్రజాభక్త హనుమంతు..రామభక్త హనుమంతు కాదు..కాబట్టే ఆయన చిరంజీవి ' అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవార్డులు, రివార్డులు లేకపోయిన ప్రజలిచ్చిన ప్రజాకవి అన్న బిరుదు ముందు అన్నీ దిగదుడుపేనని పేర్కొన్నారు. ప్రజా కళలను హనుమంతు వంటి ప్రజా కళాకారులను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వ్యాపార ధోరణుల మధ్య చిక్కిశల్యమౌతోన్న ప్రజా కళలను కాపాడటమే హనుమంతుకిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రజల దుర్భర జీవిత పరిస్థితులే తన తండ్రిని ఒక ప్రజాకవిగా మార్చాయని అశోక్‌తేజ పేర్కొన్నారు. ఆర్య సమాజంలో క్రియాశీలంగా పనిచేసిన తన తండ్రిని పేదల బాధలే కమ్యూనిస్టుగా మలిచాయని వివరించారు. నూరు ఉపన్యాసాలు, నాటికల కంటే ఒక్క పాట ఎంతో శక్తివంతమైనదని హనుమంతు సుధృడంగా నమ్మారని పేర్కొన్నారు. సుద్దాల హనుమంతు ట్రస్ట్‌ అధ్వర్యంలో ఇకపై ప్రతిఏటా జానపద గాయకులు, పరిశోధకులకు అవార్డు ఇవ్వనున్నట్లు అశోక్‌తేజ ప్రకటించారు. ఆస్తులు కూడబెట్టే అవకాశాలు ఉండీ, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన హనుమంతే తమకు స్ఫూర్తని వెంకన్న పేర్కొన్నారు. వేమన, అన్నమాచార్య వలె సుద్దాల నిజమైన ప్రజాకవని ప్రశంసించారు.

అలరించిన జానపదాలు

సదస్సు అనంతరం వక్తలు పాడిన జానపదాలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి. మూడు గంటలకు పైగా ఎంతో ఉత్సాహంతో సభికులు ఈ కార్యక్రమంలో లీనమవ్వడమే ఇందుకు నిదర్శనం. పల్లె కన్నీరు పెడుతుందో...అంటూ వెంకన్న, నేలమ్మనేలమ్మ నేలమ్మా...అంటూ అశోక్‌తేజ, నది నడిచిపోతున్నదీ...అంటూ అందెశ్రీ ఉత్తేజపూరితంగా పాడిన పాటలు ఢిల్లీ తెలుగు ప్రజలను స్పందింప చేశాయి. ప్రజా కళాకారులు చైతన్య, ఉదరు తదితరులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Monday, August 2, 2010

ద్రవ్యోల్బణంతో యుపిఎ-2 సయ్యాట

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదటి వారం రోజులు గడిచాయి. ధరాఘాతం సెగతో ఈ వారం రోజులూ ఎటువంటి చర్చలు, బిల్లులు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదలను నియంత్రించటంలో యుపిఎ-2 ప్రభుత్వ వైఫల్యం గురించి వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టు పట్టాయి. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం కింద ఓటింగ్‌ జరుగుతుంది. ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. దాంతో స్పీకర్‌ మాటల్లో రోజువారీ వ్యవహారాలపై ఓటింగ్‌ ఆధారిత చర్చ జరపాలని పట్టుపట్టటం అసమంజసం అని ప్రకటింపచేసింది ప్రభుత్వం.

ఇదే సంవత్సరం ధరల సమస్యపై పార్లమెంట్‌ స్థంభించటం వరుసగా ఇది మూడో సారి. ఫిబ్రవరి చివరి వారంలో తీవ్రమైన చర్చ జరిగింది. ఏప్రిల్‌లో మరోమారు బడ్జెట్‌ సందర్భంగా ప్రతిపక్షాలకు అందుబాటులో ఉండే సాధనం కోత తీర్మానం ద్వారా ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చ జరిగింది. వివిధ సందర్భాల్లో ధరల అదుపు గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు, వాగ్దానాలు, ఇచ్చిన హామీలు, చేరుకున్న అంచనాలను పరిశీలించినప్పుడు వాగ్దానాలకు, అంచనాలకు మధ్య పోలిక లేదని అర్థమవుతోందని. అయినా ధరల పెరుగుదలపై ఈ హామీలు, అంచనాలు, వాగ్దానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. బహుశా మూడునెల్ల వ్యవధిలో రెండు సార్లు ఒకే సమస్యపై దేశవ్యాపిత ఆందోళనలు జరిగాయి. అయినా ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదు. పైగా తీసుకున్న ఇతర విధాన పరమైన చర్యలు కూడా ద్రవ్యోల్బణాన్ని, తద్వారా ధరల భారాన్ని పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయి. దాంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం షరామామూలుగానే అంగీకరించలేదు. వారం రోజుల సమావేశాల్లో విలువైన సమయం దుర్వినియోగం కావటంపై పలువురు వ్యాఖ్యాతలు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతిపక్షాలదే తప్పన్నట్లు వాదిస్తున్నారు. నిజానికి జరిగింది ఏమిటి అన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

నవంబరు 2009 - ఆర్థిక సంవత్సరంముగింపునాటికి ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది - అహ్లువాలియా

ఫిబ్రవరి 16, 2010 - ఆహార ధాన్యాల ధరలు పడిపోవటం ప్రారంభమైంది. రానున్న కాలంలో మరింత పడిపోతాయి. - పవార్‌

ఫిబ్రవరి 6, 2010 - ఇక కష్ట కాలం గట్టెక్కినట్లే - ప్రధానమంత్రి

మే 24, 2010 - డిశంబరు నాటికి ద్రవ్యోల్బణం ఆరు శాతానికి తగ్గుతుంది. - ప్రధానమంత్రి

జూలై 24, 2010 - రోజురోజుకు ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం తగ్గిపోతోంది - ప్రధానమంత్రి

జూలై 24, 2010 - పంటల సీజన్‌ పూర్తయ్యాక ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది - పవార్‌

సాధారణంగా ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న వారిది పైచేయి. అంటే గద్దెనెక్కిన వారు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు ఎంచుకోవాల్సి ఉంది. అనుసరించాల్సి ఉంది. అంటే రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తాయి. నిర్దేశించాలి. అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విధానాలు, డెవలప్‌మెంటల్‌ ఎకనమిక్స్‌ అమలు జరిగే అన్ని దేశాల్లోనూ ఇదే జరుగుతుంది. కానీ ప్రపంచీకరణతో ఈ క్రమం తారుమారు అయ్యింది. ప్రపంచీకరించబడిన ఆర్థిక వ్యవస్థ అవసరాలు, అవకాశాల మేరకు దేశీయ ఆర్థిక విధానాలు రూపొందుతున్నాయి. అందువల్లనే ప్రభు త్వం వార్షికంగావిడుదల చేసే ఆర్థిక సర్వేలోనూ, రెండున్నర, మూడేళ్లకొకసారి విడుదల చేసే ప్రణాళిక మధ్యంతర సమీక్షలోనూ, ఐదేళ్లకొకసారి రూపొందించే పంచవర్ష ప్రణాళికలోనూ ... అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిణామాలకు లోబడి... అన్న వాక్యం చేర్చటం సర్వసాధారణంగా మారింది. ఈ ఒక్క వాక్యంతో ప్రభుత్వాలు దేశీయంగా చేపట్టాల్సిన చర్యల నుండి తమ బాధ్యతను విరమించుకుని చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ వ్యవస్థపై ఆర్థిక రంగం స్వారీ చేయటానికి కావల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయి. పరిస్తితిని ఇలా కాకపోతే మరెలా అర్థం చేసుకోవాలి ?

2009 ఎన్నికలకు ముందు తారా స్థాయికి చేరిన ధరల గురించి సోనియా గాంధీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియాతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేకరులతో మాటా ్లడుతూ అహ్లువాలియా 2009 మార్చినాటికి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంటే 2009 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి ప్రభుత్వంపై ప్రజాగ్రహం లేకుండా చేయటానికి కావల్సిన కసరత్తు చేయగలమని చెప్పటమన్న మాట. 2009 ఎన్నికల తర్వాత వివిధ సందర్భాల్లో ప్రభుత్వాధినేతలు చేసిన ప్రకటనలు తేదీల వారీగా ఉన్నాయి. 2008లో ఆర్థిక వ్యవస్థను కట్టడి చేసి 2009 మార్చినాటికి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలిగిన ప్రభుత్వం 2009 తర్వాత ఎందుకు అదుపు చేయలేకపోతోంది ? 2009 ఎన్నికలకు ముందు ఆర్థిక వ్యవస్థ నడక తీరును సరిగ్గానే అంచనా వేయగలిగిన ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఎందుకు అంచనా వేయలేకపోతోంది ? ప్రధానమంత్రి స్థాయిలోని వ్యక్తి ఫిబ్రవరి 6, 2009 నాటికి ప్రజలు ధరల విషయంలో కష్టకాలం నుండి గట్టెక్కినట్లేనని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు. 2009 మే 24, జూలై 24న చేసిన ప్రకటనల్లో సైతం డిశంబరు నాటికి ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించగలమని ప్రకటించారు. కానీ మరి జరిగిందేమిటి ? తాజాగా 24 జూలై 2010న జరిగిన జాతీయ అభవృద్ధి మండలి సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ ఖరీఫ్‌ పంట రుతువు తర్వాత ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. తాజాగా గత నెల్లో పెంచిన పెట్రోలు ధరల ప్రభావం వల్ల మరో రెండు పాయింట్లు ద్రవ్యోల్బణం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ ప్రధాన గణాంకాల అధికారి ప్రకటించారు. మరోవైపున ప్రభుత్వం ధరల సమస్యను నేడున్న పరిస్థితులకనుగుణంగా పరిష్కరించటానికి గాక ఫలానా సమయంలో పరిష్కరించబడుతుంది, ఫలానా తేదీ నాటికి అదుపు చేయబడుతుంది అని జోస్యం చెప్పటానికే పరిమితం అవుతుంది. ఈ ప్రకటనలన్నీ వ్యవసాయోత్పత్తుల దిగుబడి కాలంతో ముడి పడి ఉన్నాయి. అంటే వ్యవసాయ దిగుబడులు చేతికొచ్చే సమయానికి నిల్వలు పెరిగి, కాగితాలపై మాత్రం డిమాండ్‌ సరఫరా సూత్రం ప్రకారం ద్రవ్యోల్బణం తటస్థ స్థాయికి చేరుతుంది. మిగిలిన సమయానికంటే ప్రజల వద్ద కాస్తోకూస్తో అదనపు నిధులు సమకూరతాయి. దాంతో ఒక వేళ ధరలు అదే స్థాయిలో ఉన్నా గత ఏడెనిమిది నెల్లుగా అలవాటు పడిన ప్రజలు నెలసరి వెచ్చాల ఖాతాలో మార్పులు చేసుకుని సర్దుకు పోతారు. ఈ విషయం మనం నిత్యజీవితంలో చూస్తూ ఉన్నదే. అంతే తప్ప ప్రభుత్వం ధరల తగ్గింపు కోసం క్రియాశీలకంగా ఏదో నిర్ణయం తీసుకుని, ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం వల్ల ధరల ప్రభావంలో మార్పులు రావటం అనుకోవటానికి అవకాశమే లేదు. నేడు ప్రభుత్వం కూడా చెప్తున్న వాదన ఇదే. పెరుగుతున్న జనాభా రేటు, పెరుగుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు అధ్యయనం చేస్తే కొరతకు అవకాశం లేదు. కనుక ధరల పెరుగుదల ఎలా సాధ్యం అన్నది నయాఉదార ఆర్థిక వేత్తలు ముందుకు తెస్తున్న వాదన. మార్కెట్‌ తన పని తాను చేసుకుపోతోంది. ఏ ఉత్పత్తులకు గిరాకీ ఉంటే ఆ ఉత్పత్తులకు ధరలు పెరుగుతున్నాయి అన్నది మరో వాదన. మరి వంద కోట్లకు పైగా ఉన్న ప్రజలు రోజుకు ఒక పూట కడుపు నిండా తినాలన్నా ఆహార ధాన్యాల గిరాకీ పెరుగుతుందన్న మాట. మరి ప్రజలకు కావల్సిన ఆహార పదార్ధాలు కూడా మార్కెట్‌ దయకు వదిలేస్తే ఈ ప్రభుత్వాలు సాధించేది ఏమిటి ? సేవ చేస్తుంది ఎవరికి? అన్న ప్రశ్నలు తలెత్తటం సహజం. ఇక్కడే ద్రవ్యోల్బణానికి, రాజకీయాలకు మధ్య సంబంధం తెరమీదకు వస్తుంది. ప్రభుత్వం ఏ వస్తువుల ధరలు అదుపులో ఉంచితే పారిశ్రామిక వర్గాల లాభాలు సుస్థిరంగా ఉంటాయో ఆ వస్తువులు, ఉత్పత్తుల ధరలు అదుపు చేస్తోంది. ఉదాహరణకు ఇనుము, ఉక్కు అత్యధికంగా వినియోగించేది మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు. అంటే ఎస్‌ఇజెడ్‌లలో కొత్త యూనిట్లు ప్రారంభించే కంపెనీలు, జాతీయ రహదారులు నిర్మించే కంపెనీలు. ఈ ఉత్పత్తుల ధరలు పెరిగితే ప్రభుత్వం అగ్గిమీద గిగ్గలమైపోతుంది. వరుసగా ఈ సరుకు ఉత్పత్తిదారులు, మార్కెట్‌ విక్రయదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నయానో భయానో ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఈ సరుకు ఉత్పత్తిదారులకు తగ్గే లాభాలను పూడ్చటానికి పన్ను రాయితీలుఇస్తుంది. మరి నిత్యం ప్రజలు ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినపుడు అటువంటి ప్రయత్నం ఎందుకు చేయదు? ఈ విషయాన్ని చర్చించటానికే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం కోరుతున్నాయి. ఈ విషయంపై అంతగా ఆసక్తి, అవసరం లేని ప్రభుత్వం దీన్ని తిరస్కరిస్తోంది. అటువంటపుడు పార్లమెంట్‌ను స్తంభించటం మినహా మరో మార్గం లేకపోతోంది.

కొండూరి వీరయ్య

Wednesday, July 28, 2010

మూలాలను తడమని ఉపాధి నివేదిక




కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన దేశంలో ఉపాధి గురించిన నివేదిక విడుదల చేసింది. గత ఐదేళ్లలో దేశంలో ఉపాధి కల్పన వృద్ధి రేటు రెండు శాతంగా ఉందని చెప్పుకుని మురిసిపోయింది. రానున్న ఐదేళ్ల కాలంలో మరో 2.5 శాతం వృద్ధి రేటు సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ రకంగా ఉపాధి కల్పన గురించి ప్రత్యేకంగా నివేదిక విడుదల చేయటం హర్షదాయకమనే చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వం చెప్పకుండా దాచిన విషయం ఒకటి ఉంది. గడచిన ఐదేళ్లలో సగటున వృద్ధి రేటు 8 శాతానికిపైగానే ఉంది. ఈ కాలంలో ఉపాధిలో వృద్ధిరేటు రెండుశాతం మాత్రమే ఉంది. వచ్చే అయిదేళ్ల కాలంలో 2.5శాతం వృద్ధి సాధించాలంటే ఆర్థికాభివృద్ధి రేటు అంతకంటే ఎక్కువగా ఉండాలన్నది నిర్వివాదం. అయితే మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో ఈ వృద్ధి రేటు సాధ్యమా అన్న ప్రశ్న వేసుకున్నపుడు ఉపాధి వృద్ధి రేటు అంచనా వేయటంలో ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించటం లేదు. ముందు ఉపాధి నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిద్దాం.

యుపిఎ-1 అధికారంలో ఉన్న మొదటి మూడేళ్లు అంటే 2005-2008 మధ్య కాలంలో అదనంగా 24 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అంటే సంవత్సరానికి సగటున ఎనిమిది లక్షల చొప్పున ఉద్యోగాలు వచ్చాయి. 1999-2000 నుండి 2004-2005 మధ్యకాలంలో సాధించిన ఉపాధి కల్పన రేటు కంటే ఇది చాలా తక్కువ. అంతేకాదు. 1983 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 239 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగల సామర్థ్యంతో ఉంటే, 1993 నాటికి ఈ సామర్థ్యం 314 మిలియన్లకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో 75 మిలియన్ల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించగల పరిస్థితికి చేరింది. అయితే సంస్కరణల తర్వాత కాలంలో ఈ ఎదుగుదల వేగం కొనసాగలేదు. 1983తో పోల్చి చూస్తే 1993, 2000 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చింది. అయితే వృద్ధి రేటు వేగానికి అనుగుణంగా ఉపాధి కల్పన సామర్థ్యం పెరగలేదు. సంస్కరణల వేగంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన సామర్థ్యం పెరగలేదన్న విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన ఈ గణాంకాలే రుజువు చేస్తున్నాయి. 1993-2000 మధ్య కాలంలో 338 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా 2000-2004 మధ్య కాలంలో 385 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగింది భారత ఆర్థిక వ్యవస్థ. 1991 తర్వాత జనాభా పొందికలో వచ్చిన మార్పులు పరిగణనలోకి తీసుకుంటే ఈ వృద్ధి రేటు ఇంకా తగ్గిపోతుందన్న విషయం వాస్తవం. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో కష్టించి పని చేయగలిగిన వయస్సున్న వారు 58 శాతంగా ఉన్నారు. 2010 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అంటే మొత్తం 2001 నాటికి భారత జనాభా 99 కోట్లు అనుకుంటే, కుడిఎడంగా 60 కోట్ల మంది పని చేయగలిగిన వారున్నారు. ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2000 నాటికి 33 కోట్ల 80 లక్షల మంది, 2004లో 38 కోట్ల 50 లక్షల మంది ఉపాధి పొందగలిగారు. అంటే శ్రమించగలిగిన జనాభాతో పోలిస్తే నిరుద్యోగం 50 శాతానికి పైగా ఉంటే మొత్తం జనాభాతో పోలిస్తే నిరుద్యోగం 15 శాతానికి దగ్గరగా ఉంటుంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా 15 శాతం ఉత్పాదక సామర్థ్యం నిరుపయోగంగా పడి ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా వెనకబడినట్లే అని వేరే చెప్పనవసరంలేదు.


ఈ కాలంలో మొత్తం శ్రమశక్తి మార్కెట్‌ 46 కోట్లకు చేరుకొంది. పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్రజల రేటు ఈ కాలంలో బాగా పెరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ఈ రేటు 2.85గా ఉంటే ఉపాధి కల్పన కేవలం రెండు శాతంగా మాత్రమేఉంది. అంటే సంవత్సరానికి ఉపాధి కల్పన వృద్ధి రేటు శ్రమ శక్తి మార్కెట్‌ వృద్ధి రేటు కంటే వెనుకబడి ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన సామర్థ్యాన్ని తగ్గించి వేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2008 అక్టోబరులో ఐదు లక్షల మంది అదనంగా నిరుద్యోగ సైన్యానికి తోడు కాగా జనవరి 2009 నాటికి అందులో 2.76 లక్షల మంది తిరిగి శ్రమ మార్కెట్లోకి ప్రవేశించారు. అంటే వీరికి ఉద్యోగాలు దక్కాయి. కానీ అందులో జూన్‌ 2009 నాటికి మరో లక్షా ముప్పయివేల మంది నిరుద్యోగులయ్యారు. అంతేకాదు. సంక్షోభం ఉపాధి మార్కెట్‌పై మరో విధమైన ప్రభావం కూడా చూపింది. 2004-2008 మధ్య కాలంలో మధ్యతరగతి ఉద్యోగికి సగటున వేతనాల్లో 8-11 శాతం వృద్ధి రేటు ఉంటే 2008 తర్వాతి కాలంలో ఇది దాదాపు స్థబ్దతకు లోనైందని చెప్పవచ్చు. ఈ కాలంలో ప్రభుత్వం ఆరవ వేతన సంఘం నివేదిక అమలు చేయకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో రుతుపవనాలపై ఆధారపడ్డ ఉపాధి కల్పనలోని లోటుపాట్లు ఉండనే ఉన్నాయి. ఈ నివేదిక మరో విషయాన్ని కూడా దృష్టికి తెస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్య అది. గ్రామీణ ప్రాంతంలో 57 శాతం మంది స్వయం ఉపాధి చూసుకుంటున్నారని నివేదిక ప్రస్తావించింది. అందులో కూడా గ్రామీణ ఉపాధి మార్కెట్‌కు కీలకంగా ఉన్న వ్యవసాయ రంగం ఈ కాలంలో వృద్ధి రేటు మందగించటంతో వ్యవసాయ కూలీ వేతనాలపై ఆధారపడ్డ మహిళలు, దళితులు, బలహీన వర్గాలకుచెందిన ప్రజలు ఎక్కువ మంది నిరుద్యోగం బారిన పడ్డారని నివేదిక చెప్తోంది. అందువల్లనే ఈ వర్గాలకు చెందిన ప్రజలు ఈ కాలంలో పెద్దఎత్తున పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లిన విషయాన్ని కూడా నివేదిక గుర్తించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల మూడేళ్లలో అంటే 2004-005 నాటికి 221 మిలియన్లుగా గ్రామీణ ఉపాధి అవకాశాలు కల్పిస్తే 2007-2009 నాటికి 939 మిలియన్లకు పెరిగిందని ప్రభుత్వం చెప్తోంది. పైన చెప్పిన లెక్కలకు ఎన్‌ఆర్‌ఇజిఎ లెక్కలకు మధ్య పొంతన కుదరని పరిస్థితిని ఈ గణాంకాలు ముందుకు తెస్తున్నాయి. 2010-2015 నాటికి 63.5 మిలియన్ల మంది అదనంగా శ్రమశక్తి మార్కెట్లో చేరనున్నారని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకున్నపుడు రానున్నకాలంలో నిరుద్యోగ మహమ్మారి మరింత స్వైరవిహారం చేయనున్నట్లు అర్థమవుతోంది.

2004-05లో మొత్తం ఉపాధిలో శాశ్వత ఉపాధి శాతం ఆధారంగా ప్రధాన రాష్ట్రాల వర్గీకరణ

అట్టడుగు స్థాయి

(పది శాతం కంటే తక్కువ)

బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌

దిగువస్థాయి

(10 నుంచి 15 శాతం)

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ , అస్సోం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌

మధ్యస్థాయి

(15 - 20 శాతం)

జమ్మూకాశ్మీర్‌, గుజరాత్‌, కేరళ, హర్యానా

అధిక స్థాయి (20 శాతానికి పైబడి)

మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ

విద్యార్హతను అనుసరించి కార్మికులు విభజన శాతం- వారి ఉపాధి స్థాయి

కార్మికుల విద్యార్హత స్వయం ఉపాధి రెగ్యులర్‌ క్యాజువల్‌

నిరక్షరాస్యులు 56.11 4.33 39.56

ప్రాథమిక 56.03 8.86 35.11

మాధ్యమిక 58.94 11.88 29.18

సెకండరీ 60.34 15.75 23.91

హైయర్‌ సెకండరీ 62.33 25.08 12.59

పట్టభద్రలు- ఆపైన 49.45 46.29 4.26

2009-10 నుంచి 2014-15 వరకు అంచనాగా చూపిన జనాభా, పనిలో ఉన్న కార్మికుల రేటు(ఎల్‌ఎఫ్‌పిఆర్‌), మొత్తం కార్మికులు, ఉపాధి వివరాలు...

2009-10 2010-11 2011-12 2012-13 2013-14 2014-15

మొత్తం జనాభా (పదిలక్షల్లో) 1177 1193 1208 1224 1239 1254

ఎల్‌ఎఫ్‌పిఆర్‌ (%) 44.2 44.4 44.8 45.1 45.4 45.8

కార్మికులు (పదిలక్షల్లో) 520 530 541 552 563 574

వార్షిక కార్మికుల జనాభా పెరుగుదల (పదిలక్షల్లో) 10 10 11 11 11 11

ఉపాధి వృద్ధి రేటు రెండుశాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 516 526 537 548 559

ఉపాధి వృద్ధి రేటు 2.25శాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 517 529 541 553 566

ఉపాధి వృద్ధి రేటు 2.50శాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 519 532 545 559 572

1993-94 నుంచి 2004-05 మధ్యకాలంలో ఉపాధి వారిగా కార్మికుల శాతం

ఉపాధి రకం 1993-94 1999-2000 2004-05

గ్రామీణ

స్వయం ఉపాధి 57.96 55.76 60.2

వేతన కార్మికులు 42.04 44.24 39.9

1) రెగ్యులర్‌ 6.45 6.83 7.1

2) క్యాజువల్‌ 35.59 37.41 32.8

పట్టణాలు

స్వయం ఉపాధి 42.29 42.23 45.4

వేతన కార్మికులు 57.71 57.77 54.5

1) రెగ్యులర్‌ 39.40 40.03 39.5

2) క్యాజువల్‌ 18.31 17.74 15.0

కొండూరి వీరయ్య

Thursday, July 8, 2010

చంచల్‌ పెట్రోల్‌

Published in Sunday supplement Book, Prajasakti July 4th 2010
జూన్‌ 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో చమురు ఉత్పత్తుల ధరలపై నియంత్రణలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు ఆహ్వానించాయి. ఇకపై చమురు ఉత్పత్తుల రంగంలో అవధుల్లేని విధంగా ప్రైవేటు పెట్టుబడులు వచ్చిపడతాయని ప్రభుత్వం, 'కొంతమంది' మేధావులు చెప్తున్నారు. మరోవైపున ధరాఘాతంతో కకావికలవుతున్న సామాన్య ప్రజానీకంపై ఇది కొండంత భారం అనటానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో నిత్య జీవితంలో చమురు ఉత్పత్తుల పాత్ర, చమురు ఉత్పత్తుల ధరవరల్లో వచ్చే మార్పులు, వాటికి కారణాలు, శుద్ధి ప్రక్రియ, పన్నుల విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

పెట్రోలు, డీజిలు, కిరోసిన్‌, గ్యాస్‌. ఈ నాలుగు సరుకులు లేకుండా ఆధునిక మానవుడి అత్యాధునిక జీవితాన్ని ఊహించటం సాధ్యం కాదు. షుమారు శతాబ్దిన్నర కాలంగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో చమురు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి చమురు శుద్ధి ప్రక్రియ మొదటిప్రపంచ యుద్ధానికి కాస్తంత ముందుగా ప్రారంభమైన చమురు శుద్ధి ప్రక్రియతో నిత్య జీవితంలో చమురు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయింది. లేటెక్స్‌ కాటుక మొదలు, వాహనాలు సున్నితంగా నడవటానికి ఉపయోగించే కందెన నూనెల వరకూ, ధరించే బట్టల మొదలు ఇళ్లలో అలంకరించే కార్పెట్ల వరకూ... అంతెందుకు. మహిళలు నిత్యం ఉపయోగించే సౌందర్యసాధనాల మొదలు వైద్యులు రాసిచ్చే మందుల వరకూ అన్నింటిలోనూ చమురు ఉత్పత్తులు వివిధ పాళ్లలో మనకు దర్శనం ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ''ఎందెందు వెదకి చూసిన అందందే గలదు 'చమురు'' అని నిర్ధారించుకోవచ్చు. చమురు, దాని ఉప ఉత్పత్తుల నుండి తయారయ్యే వస్తువులు జాబితా తయారు చేయాలనుకుంటే కనీసం 212 వస్తువుల జాబితాను చూడవచ్చు. కంప్యూటర్లు, కంప్యూటరు డిస్కులు, ఎరువులు, పురుగుమందులు, కృత్రిమ హృదయాలు, పేస్‌మేకర్స్‌, యాస్పిరిన్‌, కాంటాక్టు కళ్లద్దాలు, బ్యాండేజిలు, అత్యవసర శస్త్రచికిత్స సాధనాలు, ప్లాస్టిక్కు వస్తువులు, గృహోపకరణాలు, ఫోన్లు, బట్టలు, ఫుట్‌బాల్‌ వంటి క్రీడా వస్తువులు, తలంటుకునే షాంపూలు... ఇలా చెప్పుకుంటూ పోతే చమురు ఉత్పత్తులు లేని సరుకులు గుర్తించటం బ్రహ్మ విద్యే అవుతుంది. అందుకనే శాస్త్రజ్ఞులు మనం పెట్రో రసాయనాల యుగంలో జీవిస్తున్నామని నిర్ధారించారు.

ఇంత చమురు ఎక్కడ నుండి వస్తోంది ?

నిత్యజీవితంలో అంతగా ముడిపడి ఉన్న ఈ చమురు ఎలా వస్తుంది, ఎక్కడ నుండి వస్తుంది అన్న ఆసక్తి కలగటం సహజం. మన దేశానికి సంబంధించినంత వరకు దేశంలోని చమురు నిల్వలు వెలికి తీసే బాధ్యత భారత చమురు సహజవాయువుల కంపెనీది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో అస్సాంలోని డిగ్బోరు, మహారాష్ట్రలోని బోంబే హై, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా గోదావరి బేసిన్‌లలో చమురు వెలికితీత కార్యక్రమాలు గత మూడు దశాబ్దాలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మధ్యనే రిలయన్స్‌ కంపెనీ కెజి బేసిన్‌లో గ్యాస్‌ వెలికితీత పనుల్లో ప్రవేశించింది. ఎస్సార్‌, గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షెల్‌ అదాని వంటి మరికొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా దేశంలో ఈపనిలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బ్రిటిష్‌ పెట్రోలియం (బిపి), షెల్‌ కంపెనీలు ప్రపంచంలో మూడొంతుల చమురు రంగంపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఈ సముద్ర నిల్వలు భూగర్భంలోనే కాదు. సముద్ర గర్భంలో కూడా దాగి ఉన్నాయి. ఆధునిక పెట్టుబడిదారీ విధానం నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడి పొట్ట చీల్చి పేగులు బయటికి తీసినట్లుగా భూగర్భాన్ని చీల్చి చమురు బయటికి తీయటంలో ఎప్పటికపుడు అత్యాధునిక సాధనాలు కనిపెడుతోంది. ఇవి కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను యధా విధిగా కొనసాగించేందుకు అవసరమైన చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు, చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల కూటమిగా ఒపెక్‌గా ఏర్పడ్డాయి. ఇందులో ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా, వెనిజులా వంటి దేశాలు కీలకమైనవి.

ఎక్కడెక్కడ ఎంతెంత....

నిత్య జీవితంలో ఇంత కీలక పాత్ర పోషిస్తోంది కనుకనే అంతర్జాతీయంగా చమురు నిల్వలపై పెత్తనం సంపాదించేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2002 నాటికి అధికారిక అంచనాల ప్రకారం ప్రపంచంలో ప్రధానమైన చమురు నిల్వలున్న దేశాల గురించిన సమాచారాన్ని ప్రత్యేకంగా ఇచ్చిన బాక్స్‌లో చూడొచ్చు. 2002 ప్రామాణికంగా తీసుకోవటం వెనక వున్న ఉద్దేశ్యం స్పష్టం. నూతన సహస్రాబ్దిలో అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాదం వెనక కీలక లక్ష్యం అంతర్జాతీయ ఇంధన వనరులపై పెత్తనం సాధించటమే. కీలకమైన చమురు వనరులున్న దేశాల్లో నయానో భయానో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇంధన వనరుల ఉత్పత్తిని రోజువారి నియంత్రిస్తోంది.

శుద్ధి ప్రక్రియ

భూగర్భం నుండి వెలికి తీసిన ముడి చమురు యథాతథంగా వినియోగించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది కర్బన ఇంధనాల సముదాయం. ఇది యథాతథంగా వాడితే ప్రాణాంతకం. అందువల్ల దాన్ని శుద్ధి చేయాలి. ఈ శుద్ధి ప్రక్రియలోనే రవాణాకు ఉపయోగించే పెట్రోలియం, డీజిల్‌, ఇళ్లల్లో అవసరాలకు వాడే గ్యాస్‌, కిరోసిన్‌, ఎరువుల తయారీలో ఉపయోగించే నాఫ్తా, కందెన నూనెలు, మైనం, తారు, వంటి ఇతర ఉత్పత్తులు వెలుగు చూస్తాయి. 1900కి పూర్వం నుండే చమురు శుద్ధి చేయటానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. తొలినాళ్లలో జరిగే శుద్ధి ప్రక్రియలో 15 బారెళ్ల చమురు నుండి ఒక బారెల్‌ పెట్రోలు మాత్రమే వెలికి తీయగలిగేవారు. 19వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాల్లో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం తారాస్థాయికి చేరుకోవటంతో దాని అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ఇంధన వనరులు కూడా అవసరమయ్యాయి. ఈ దిశగా అనేక ప్రయోగాలు జరిగాయి. 1913లో ఇండియానాకు చెందిన స్టాండర్డ్‌ ఆయిల్‌ కంపెనీ ఉద్యోగి విలియం బర్టన్‌ థర్మల్‌ క్రాకింగ్‌ అనే ప్రక్రియను కనిపెట్టాడు. చమురు అంటే కర్బన వాయువుల సముదాయం అని పైన చెప్పుకున్నాము.

ఈ ప్రక్రియలో ముడి చమురును బాయిలర్‌లో వేసి నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకూ వేడి చేయటం ద్వారా అందులోని హైడ్రోకార్బన్లను వేరు చేస్తారు. వివిధ దశల్లో జరిగే ఈ ప్రక్రియలో వివిధ ఉత్పత్తులు బయటికి వస్తాయి. మనం పురాణాల్లో చూసే క్షీరసాగర మధనానికి ఇదేమీ తక్కువ కాదు. ఈ తొలినాటి ప్రక్రియల్లో 15 బారెళ్ల చమురును శుద్ధి చేసి ఒకే బారెల్‌ పెట్రోలు బయటికి తేగలిగితే, బర్టన్‌ ప్రక్రియ ద్వారా ఒక్కో బారెల్‌ చమురు నుండి రెండు బారెళ్ల పెట్రోలు బయటికి తేగలుగుతారు. నాటి నుండి చమురు శుద్ధి ప్రక్రియే స్వతంత్ర పరిశ్రమ హోదాకు ఎదిగింది. భారతదేశంలో హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌ కంపెనీలు చమురు శుద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కాక గుజరాత్‌ కేంద్రంలో పని చేస్తున్న రిలయన్స్‌ పెట్రో కెమికల్స్‌ ప్రైవేటు రంగంలో కీలకమైనది. మన దేశ పారిశ్రామిక అవసరాలకు సరిపడినంత చమురు నిల్వలు దేశీయంగా అందుబాటులో లేకపోవటంతో విదేశాల నుండి పెద్దఎత్తున చమురు నిల్వలు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి దేశీయ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఈ విధంగా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను మార్కెట్‌ చేయటానికి ఉన్నవే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వంటివి. వీటికి తోడు ఇండియన్‌ గ్యాస్‌, భారత్‌ గ్యాస్‌ అంటూ రెండు రకాల గ్యాస్‌ బ్రాండ్లు మన దేశంలో మార్కెట్‌లో ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాల అమలు ప్రారంభించిన నాటి నుండీ క్రమంగా చమురు, సహజవాయువు వెలికి తీతను ప్రైవేటు పరం చేస్తూ వచ్చిన ప్రభుత్వాలు, శుద్ధి పనులు కూడా ప్రైవేటు రంగానికి అప్పగించే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇక మిగిలింది చమురు ఉత్పత్తులు మార్కెటింగ్‌ మాత్రమే. నేటి వరకూ చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ప్రస్తుతం అమల్లోకి రానున్న నూతన విధాన ద్వారా ఈ నియంత్రణ గాల్లో కలవనుంది.

నిల్వ నిర్ధారణ- పన్నులు

చమురు రంగం ద్వారా ప్రభుత్వానికి రెండు రకాల ఆదాయాలు సమకూరతాయి. ఒకటి ముడి చమురు దిగుమతి చేసుకునే సందర్భంలో వచ్చే దిగుమతి సుంకం. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను పారిశ్రామిక ప్రక్రియ ద్వారా వినియోగానికి వీలయ్యే సరుకుల రూపంలో మార్చినపుడు విధించే సుంకాలు. ఇవి ఎక్సైజు పన్ను, కార్పొరేట్‌ పన్ను, రాయల్టీ, డెవిడెండ్‌, డెవిడెండ్‌ పై పన్ను, ఇతరములు. ఈ విధంగా మార్కెట్‌లో వినియోగానికి వీలయిన సరుకులు వినియోగదారుడికి చేరే క్రమంపై విధించే పన్నులు వేరే ఉన్నాయి. అవి వాణిజ్య పన్ను, వాట్‌, ఆక్ట్రారు పన్నులు. ఇన్ని రూపాల్లో వచ్చే ఆదాయాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. బహుశా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో అబ్కారీ ఆదాయం తర్వాత ఈ రూపేణా వచ్చే ఆదాయమే ఎక్కువ. ఉదాహరణకు ఢిల్లీ లాంటి చోట్ల ఒక లీటరు పెట్రోలు ధరలో ఎన్ని పద్దులు కలిసి ఉంటాయో చూద్దాం. లీటరు పెట్రోలు ధరను రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి ముడి చమురు కొనుగోలు నుండి శుద్ధి వరకూ అయ్యే ఖర్చు. రెండోది శుద్ధి అయిన సరుకును మార్కెట్లోకి తెచ్చే ప్రక్రియలో ఉండే ఖర్చు. అంతర్జాతీయ ధరవరలను ప్రభుత్వం నియంత్రించలేకపోయినా పన్నుల విధానాన్ని మాత్రం నియంత్రించ గలిగే శక్తి దానికి ఉంది. అందువల్లనే చమురు ఉత్పత్తులపై పన్నులను పునర్వవస్థీకరించటం ద్వారా వినియోగదారులపై భారాలు తగ్గించవచ్చని నిపుణులు వాదిస్తున్నారు.

కొనుగోలు, శుద్ధి తర్వాత లీటరు పెట్రోలు ధర - 20.42 రూపాయలు

ఎక్సైజు పన్ను - 14.63 రూపాయలు

విద్యారంగ సెస్‌ - 2.92

వాణిజ్య సుంకం - 7.2

డీలర్‌ కమీషన్‌ - 0.84

వెరసి లీటరు పెట్రోలు ధర 46.01(పెంచటానికి ముందు)

ధరల్లో మార్పు

చమురు ఉత్పత్తుల ధరల్లో వచ్చే మార్పులకు కారణాలు జాతీయ, అంతర్జాతీయంగా ఉంటాయి. జాతీయ కారణాలు అంటే పైన చెప్పుకున్న పన్నుల విధానంలో వచ్చే మార్పులు. అంతర్జాతీయ కారణాలు అంటే చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఉత్థాన పతనాలు, డెరివేటివ్‌ వాణిజ్యం ముఖ్య కారణాలు. ఉదాహరణకు 2006-08 మధ్య బారెల్‌ చమురు ధర కుడిఎడంగా 180 డాలర్లకు చేరింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇది తగ్గిపోయి నేడు షుమారు 77 డాలర్లగా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు మారినపుడల్లా పైన చెప్పుకున్న చమురు సంబంధ పద్దుల్లో పెద్దఎత్తున తేడాలు వస్తాయి. చమురు ధరలు చంచలంగా మారుతూనే వుంటాయి. నష్టం వచ్చే మాట ఉండదు. ధరలు పెరిగినపుడు ఆ ధరల భారాన్ని ప్రజల నుండే వసూలు చేస్తారు. ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేటు ఉన్నపుడు ఎక్కువ దిగుమతి సుంకం ఆదాయం, తక్కువ రేటు ఉన్నపుడు తక్కువ దిగుమతి సుంకం ఆదాయం వస్తుంది. మిగిలిన పద్దులన్నీ వినియోగదారుల నుండి వసూలు చేసేవే కనుక పెద్ద మార్పు ఉండదు.

2010 జూన్‌ వరకు భారతదేశంలో చమురు ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఇకపై ఈ నియంత్రణ ఉండదు. అంటే పెట్రోలియం కంపెనీలే అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకొకసారి చమురు ఉత్పత్తుల ధరలు మార్చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయి. ఈ రకమైన స్వేచ్ఛ ఉంటే చమురు శుద్ధి రంగంలో ప్రైవేటు పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వం వాదన. అదేవిధంగా ధరలు కూడా తగ్గుతాయన్నది ఈ వాదనల ఉమ్మడి సారాంశం. ఇప్పటికే వర్థమాన దేశాల్లో అనేక దేశాల్లో చమురు ఉత్పత్తుల ధరలను మార్కెట్‌ ధరలతో అనుసంధానం చేశారు. అయితే అయా దేశాల్లో ఎక్కడా మార్కెట్‌ మాయాజాలంలో ధరలు తగ్గిన దాఖలాలు లేవు. లాభాల కోసం వచ్చే కంపెనీలు ప్రజల స్థితిగతులను పట్టించుకుంటాయని నమ్మటం చెరువులో స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు చెరువుగట్టున ఉన్న పులి చేతిలో బంగారు కడియం గురించి ఆశపడినట్లే ఉంటుంది సుమా.



పెట్రో పన్ను లెక్కించే విధంబెట్టిదనిన...

పెట్రోల్‌ ధరలో అసలు ధర (baరఱష జూతీఱషవ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, డీలరు కమీషన్‌, రవాణా చార్జీలు కలిసి ఉంటాయి. ముందుగా పెట్రోల్‌ అసలు ధరను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. ప్రభుత్వం ముడిచమురు బ్యారెళ్ల లెక్కన దిగుమతి చేసుకుంటుంది. ఒక బ్యారెల్‌కు 42 అమెరికా గ్యాలన్ల ముడిచమురు పడుతుంది. 42 గ్యాలన్లంటే 159 లీటర్లు. దీనిని లెక్కల సౌకర్యార్ధం 160గా తీసుకుంటారు. అంటే ఒక బ్యారెల్‌కు 160 లీటర్లన్నమాట. 1 లీటరు ముడిచమురు (క్రూడ్‌ ఆయిల్‌) ధరనే పెట్రోల్‌ అసలు ధరగా ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. అంటే 1 లీటరు పెట్రోల్‌ అసలు ధర = బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర (రూపాయిలలో) క్ష్మి 160 లీటర్లు. పెట్రోల్‌ ధరలు పెంచిన రోజున (25.06.2010న) బ్యారెల్‌ ముడిచమురు ధర 77 డాలర్లుగా ఉంది. అంటే 77 × 46.39 = రు||3572.03 అన్నమాట. ( 1 డాలరు 46.39రు||లు). దీని ప్రకారం 1 లీటరు పెట్రోల్‌ అసలు ధర = రు||3572.03 క్ష్మి 160 = 22.33 ( దీనిని రు||23గా తీసుకున్నారు). ఇక పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన అనంతరం మన రాష్ట్ర రాజధానిలో పెట్రోల్‌ ధరను విశ్లేషిద్దాం.

పెట్రోల్‌ అసలు ధర రు||23.00

సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రు||15.35 (ఇది కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయించిన స్థిరమైన ధర)

ఎడ్యుకేషన్‌ సెస్‌ రు||00.46 (సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ మీద 3%)

క్రూడ్‌ ఆయిల్‌ కస్టమ్స్‌ డ్యూటీ రు||01.15 (అసలు ధరపై 5%, ఇది కేంద్ర ప్రభుత్వ పన్ను)

పెట్రోల్‌ పై కస్టమ్స్‌ డ్యూటీ రు||01.73 (అసలు ధరపై 7.5%, ఇది కేంద్ర ప్రభుత్వ పన్ను)

వ్యాట్‌ రు||07.59 (అసలు ధరపై 33%, ఇది రాష్ట్ర ప్రభుత్వ పన్ను)

డీలర్‌ కమీషన్‌ రు||01.05

రవాణా చార్జీలు రు||07.17

మొత్తం రు||57.50

పై అంశాలలలో కేంద్ర పన్నులు రు||18.69 (అసలు ధర మీద 81.26%)

రాష్ట్ర పన్నులు రు||07.59 (అసలు ధర మీద 33%)

మొత్తం పన్నులు రు||26.28 (అసలు ధరమీద 114.26%)

దీనిని బట్టి చూస్తే పెట్రోల్‌ అసలు ధర లీటరు రు||23లు. దీనిమీద పన్నులు రు||26.28లు. పన్నులు అసలు ధరను మించిపోయాయన్నమాట.

25.06.2010న పెట్రోలు రేటు లీటరుకు రు3.50 పెంచింది. దీనితో మార్కెట్‌ రేటుకు సమానమైంది. అంటే అంతకు ముందు రు||3.50లు తక్కువకు ఇచ్చింది. దీని ప్రకారం పెంచకముందు కేంద్రం మనకు లీటరుకు ఇచ్చిన సబ్సిడీ రు||3.50. పన్ను రూపంలో మన దగ్గర తీసుకున్నది రు||17. నిజంగా కేంద్రం ఇంత కాలం పెట్రోలుపై సబ్సిడీ ఇచ్చిందా? లేక మనదగ్గరే కాజేసిందా? ఆలోచించండి. ప్రభుత్వం మన నుండి లీటరుకు రు||17 పన్నుల రూపంలో తీసుకుని, లీటరుకు రు||3.50 సబ్సిడీ ప్రకటించింది. మన నుండి తీసుకున్న రు||17 నుండే ఈ రు||3.50 ను ఆయిల్‌ కపెంనీలకు చెల్లిస్తే ఆయిల్‌ కంపెనీలకు నష్టం వుండదు. ప్రభుత్వం ప్రత్యేకంగా తన ఖజానా నుండి చెల్లించ నవసరంలేదు. ప్రాంతాలను బట్టి రవాణా చార్జీల్లో కొద్ది మార్పులొస్తాయి. దాంతో పెట్రోల్‌ ధర స్వల్పంగా మారతుంది. ఇక డీజిల్‌ ధర చూసినా ఇదే పరిస్థితి. డీజిల్‌ అసలు ధర మీద కూడా ఇవే పన్నులు, ఇవే మోతాదులో వసూలు చస్తున్నారు. డీజిల్‌ ధర అసలు ధర కన్నా 1.49 శాతం తక్కువ వున్నదని మన ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెబుతున్నారు. మనమీద ఏదో దయ దలచినట్లుగా చెబుతున్నారు. కానీ వసూలు చేస్తున్న పన్నులు 36 శాతం వున్నాయి. ఈ విషయాన్ని మంత్రిగారు చెప్పడంలేదు. 36 శాతం తీసుకుని 1.49 శాతం ఇస్తున్నారన్నమాట. ఇదీ వరస.

యం.వి. ఆంజనేయులు, ఎల్‌.ఐ.సి.ఆఫ్‌ ఇండియా సి.ఎ.బి, విజయవాడ.


ప్రధానమైన

చమురు నిల్వలున్న దేశాలు

సౌదీ అరేబియా - 261750 మిలియన్‌ బారెళ్లు,

ఇరాక్‌- 112500 మి.బా,

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ - 97800

కువైట్‌ - 96500,

ఇరాన్‌ - 89700,

వెనిజులా - 77685,

రష్యా -48573,

లిబియా-29500,

మెక్సికో-26941

నైజీరియా-24000,

చైనా-24000,

అమెరికా-22045,

కతార్‌ - 15207,

హనవోరు -9947,

అలర్జీయా- 9200

బ్రెజిల్‌ - 8465,

ఒమన్‌-5506,

కజకిస్తాన్‌-5417,

అంగోలా-5412,

ఇండోనేషియా-5000.

డిల్లీలో చమురు ఉత్పత్తుల పన్ను

పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ కిరోసిన్‌

వ్యాట్‌ 20% 12.5% 4% 4%

సెంటర్‌

సేల్స్‌ టాక్స్‌ 2% 2% 2% 2%

- కొండూరి వీరయ్య

Monday, July 5, 2010

ఫైనాన్స్‌ పెట్టుబడి పడగ నీడన జి 20


జి 20 కూటమి సమావేశాలు జూన్‌ చివరి వారంలో కెనడాలోని టొరంటోలో జరిగాయి. ఈ కూటమి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది నాల్గో సమావేశం. దీనికి ముందు జి 20 ఆర్థిక మంత్రుల సమావేశం జూన్‌మొదటి వారంలో జరిగింది. ఈ సమావేశాల తీరు, తీర్మానం గమనిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభం నుండి కూడా ఏమాత్రం పాఠాలు నేర్వలేదని స్పష్టమవుతోంది. టొరంటో సమావేశాల చర్చలన్నీ అభివృద్ధి వర్సెస్‌ లోటు నియంత్రణ చుట్టూ తిరిగాయి.అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి ప్రపంచాన్ని బయటపడేసే శక్తి అమెరికాకు,దాని నాయకత్వంలో పని చేస్తున్న జి 8కు లేకపోయింది. తొలుత 97లో ఆసియా ఆర్థిక సంక్షోభం భారాన్ని మోయడానికి జి20 వేదికగా మారింది. నేడు దశాబ్ధం తరువాత (2008లో) అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ భారాన్ని మోపేందుకు మళ్లీ జి 20 కావాల్సి వచ్చింది. అంటే అప్పటి వరకూ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మండువా లోగిలిని నిలబెట్టటానికి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎనిమిది స్థంభాలు జి8 శాయశక్తులా కృషి చేశాయి. ఇంటిని నిలబెట్టి ఉంచాల్సిన నిట్టాడుల కూసాలకు చెదలు పడితే ఇళ్లునెలమట్టమవుతుంది. అటువంటపుడు రెండే మార్గాలు. పాత స్థంభాల నడుమ కొత్త స్థంభాలు నిలబెట్టి పాతవాటిపై భారాన్ని తగ్గించటం ద్వారా మరికొంత కాలం ఇంటిని నిలబెట్టటం. లేదా పూర్తిగా పడేసి కొత్త పునాదులపై కొత్త ఇల్లు కట్టుకోవటం. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభ భారానికి జి8 కూసాలు కుళ్లిపోయాయి. దాంతో మరో పన్నెండె కూసాలు అదనంగా చేర్చి దాన్ని నిలబెట్టేప్రయత్నం జరిగింది. ఆ విధంగా 2008లో అంతర్జాతీయ వ్యవహారాల్లో బేరసారాల వేదికగా ఉన్న జి20 అమాంతంగా బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు వచ్చింది.

ఈ పరిణామాన్ని అప్పట్లో పలువురు విశ్లేషకులు ఆహ్వానించారు. జి20 సరైన దిశలో నడిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏకధృవ ప్రపంచం నుండి బహుళ ధృవ ప్రపంచంగా మారుతుందని దాంతోపాటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దూకుడు తగ్గుతుందని ఆశించారు. ఈ కలలు కల్లలేనని రుజువు చేసింది టొరంటో సమావేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నీడ నుండి బయటకు తేవటానికి గల మార్గాలు ఏమిటి, ఈ దిశగా ఏదేశం ఏమి చేయగలదు అన్న చర్చకు బదులుగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో పెరిగి పోతున్న లోటు గురించిన చర్చ కేంద్రక స్థానం ఆక్రమించింది. తుది ప్రకటనలో కూడా దేశాలు తరతమ స్థాయిల్లో లోటు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

గత రెండేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపనల పేరుమీద 11.9 ట్రిలియన్‌ డాలర్ల మేర నిధులు కుమ్మరించారు. అయినా ఉపాధి కల్పన, ఉత్పత్తి, ఎగుమతుల వృద్ధి ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిందని దేశాధినేతలు విచారం ప్రకటించారు. ఇంత మొత్తంలో అదనపు నిధులు ఆర్థిక వ్యవస్థలో కుమ్మరించేందుకు మద్దతుగా కీన్స్‌ను తిరిగి బతికించారు. మహా మాంద్యం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బతికించటానికి ప్రభుత్వాలు లోటుతో కూడిన ఆర్థిక విధానాలు అమలు జరిపినా తప్పు లేదని ఆయన ప్రతిపాదించారు.

లోటుతో కూడిన ఆర్థిక విధానాలు అంటే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయటం అన్నమాట. ఈ విధంగా చేసే అదనపు ఖర్చు ఉపాధి కల్పన పెంచేందుకు, నిజ ఆర్థిక వ్యవస్థలో కదలిక తెచ్చేందుకు వెచ్చించాలని ఆయన సిఫార్సు చేశారు. కీన్స్‌ పేరుతో అమలు జరుగుతున్న నేటి ఉద్దీపనలన్నీ ఈ మౌలిక సూత్రాన్ని పక్కన పెట్టాయి. పైన పేర్కొన్న మొత్తాన్ని ద్రవ్య మార్కెట్లోకి కుమ్మరించాయి. దాంతో ద్రవ్య మార్కెట్‌లో కదలిక వచ్చింది. పెద్ద పెద్ద ద్రవ్య సంస్థల లాభాలు పెరిగాయి. తప్ప ఉత్పాదక రంగంలో పెద్దగా మార్పు రాలేదు. చైనా, భారతదేశం వంటి చోట్ల ఉద్దీపనలు లేకపోతే ఈ మాత్రం వెసులుబాటు కూడా ఉండేది కాదు. ద్రవ్య మార్కెట్‌ కాస్తంత ఊపిరి తీసుకోవటంతో ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరిగి కొమ్ములువచ్చాయి. ఈ ద్రవ్య పెట్టుబడి సమర్థకులు పెరుగుతున్న లోటు గురించి గొంతు చించుకుని అరవటం ప్రారంభించారు. దీనికితోడు యూరోపియన్‌ యూనియన్‌లో దేశాలకు దేశాలే దివాళా తీసే స్థితి వచ్చింది. వెరసి జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో లోటు తగ్గించుకోకపోతే కష్టమన్న నిర్ధారణకు వచ్చాయి యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాలు. జర్మనీ, బ్రిటన్‌లు ఈ వాదన లంకించుకున్నాయి. అమెరికా కూడా ఇందుకు భిన్నంగా లేకపోయినా తానున్న ఆర్థికస్థితిలో ఇయుతో పెద్దగా వివాదానికి సిద్ధపడే పరిస్థితి లేదు. దాంతో ఇయు మాట నెగ్గింది. ద్రవ్యలోటు నియంత్రణ చర్యలు గురించిన చర్చ కొలిక్కి వచ్చింది. 2015 గడువుగా నిర్దేశించుకుని సంపన్న దేశాలు ద్రవ్య లోటు తగ్గించాలని టొరంటో సమావేశాలు తీర్మానించాయి.

ఈ పరిణామాలు చూస్తుంటే ఉద్దీపన నేపథ్యంలో కనపిస్తున్న కాస్తంత అభివృద్ధి వాపును చూసి ఇదే తమ బలమని ద్రవ్య పెట్టుబడి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకింగ్‌ లావాదేవీలపై పన్ను విధించే విషయంలోనూ, పన్నుఎగవేతదారుల స్వర్గధామాలపై చర్చ విషయంలోనూ ద్రవ్య పెట్టుబడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కీన్స్‌ ప్రతిపాదించిన ఆర్థిక విధానాల మద్దతుదారుల మాటకు విలువ లేకుండా పోయింది. మరోవైపున ఆర్థిక వ్యవస్థ సరిగ్గా గాడిలో పడలేదన్న విషయాన్ని దృష్టిలోకి తీసుకుని నోబెల్‌ బహుమతి గ్రహీత పాల్‌ క్రుగ్‌మాన్‌ వంటి ఆర్థిక వేత్తలు ఉన్న ఫళంగా ఉద్దీపన వ్యయంలో కోత కోస్తే జపాన్‌ తరహా అనుభవాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు. జి 20 సమావేశాలకు ముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన నేపథ్య పత్రంలో కూడా ఇప్పుడున్న ఉద్దీపనలను యథావిధిగా కొనసాగిస్తూ ఆర్థికాభివృద్ధికి అవసరమైన మిగిలిన చర్యలు చేపడితే రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా సగటున రెండు శాతం అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని, మొత్తంగా ప్రపంచంలో మూడు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు వస్తాయని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఉద్దీపన రద్దు చేస్తే ఆసియాదేశాలు సాధించగలుగుతాయనుకుంటున్న ఆర్థికాభివృద్ధి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ చర్చ మొత్తం 1937-38 నాటి కీన్స్‌, ఆయన ప్రత్యర్ధులకు మధ్య జరిగిన సంవాదాన్ని గుర్తు చేస్తోంది. బ్రిటన్‌, మరియు ఇతర యూరోపియన్‌ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరగటంతో యూరప్‌ సాధ్యమైనంత త్వరగా మహా మాంద్యం నుండి బయటపడగలిగింది.

అదే సమయంలో రూజ్వెల్డ్‌ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ విధానాల్లో పెద్దఎత్తున కోత విధించటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించటంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి సంక్షోభంలోకి కూరుకుపోయింది. విచిత్రమేమిటంటే తాజా సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఉద్దీపనలను కొనసాగించాలని వాదిస్తుంటే యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ప్రత్యేకించి బ్రిటన్‌, జర్మనీ దేశాలు ఉద్దీపన నిధుల్లో కోత కోయాలని నిర్ణయించాయి.ఏతావాతా చూసుకుంటే ఏ ద్రవ్య పెట్టుబడిని పరిరక్షించే విధానాలు తాజా సంక్షోభానికి కారణం అయ్యాయో జి20 దేశాధినేతలు అవే ద్రవ్య పెట్టుబడి పరిరక్షణ విధానాల పంచన చేరాలని చూస్తున్నారు. ఇది ఏ ఒక్క దేశానికో కాక మొత్తంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే అశనిపాతంలా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు, ఆర్థిక మేధావులు ద్రవ్య పెట్టుబడి ప్రభావం నుండి బయట పడనంత వరకూ ఈ ముప్పు కొనసాగుతూనే ఉంటుంది.

Thursday, June 24, 2010

డెరివేటివ్‌ ట్రేడింగ్‌కు పదేళ్లు

ప్రజాశక్తి బిజినెస్‌ డెస్క్‌ కొండూరి వీరయ్య Sun, 20 Jun 2010, IST

భారతదేశంలో ఈక్విటీ మార్కెట్‌లో డెరివేటివ్‌ ట్రేడింగ్‌కు పదేళ్లునిండాయి. ఈ పదేళ్ల కాలంలో డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. 2000-2001లో తొలిసారిగా భారతదేశంలో ఇండెక్స్‌లలో డెరివేటివ్‌ వాణిజ్యానికి అనుమతించారు. ఆ సంవత్సరం దేశంలోని అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజిల్లో జరిగిన డెరివేటివ్‌ లావాదేవీల విలువ 11,477 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం మే నెల్లో ఒక్క బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి మరియు ఢిల్లీ స్టాక్‌ ఎక్స్ఛేంజిల్లో సగటు రోజువారీ లావాదేవీల విలువే 16872 కోట్లు. దేశవ్యాప్తంగా డెరివేటివ్‌ లావాదేవీలు పరిగణనలోకి తీసుకుంటే 2010 మే నెల్లోనే 1.01 ట్రిలియన్‌లు ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్‌లోకూడా నేరుగా రొక్కం చేతులు మారే దాంతో పోల్చి చూస్తే డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు ఐదు రెట్లు అధికం. ఇంకా చెప్పాలంటే ఈ పదేళ్లలో ప్రపంచంలోని డెరివేటివ్‌ మార్కెట్లలో మూడో అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది.

డెరివేటివ్‌ మార్కెట్‌ విస్తరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను దిగువనున్న పట్టికలో చూడవచ్చు.

జూన్‌ 2000- బోంబే స్టాక్‌ ఎక్చేంజిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

జూన్‌ 2000- నిఫ్టిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

ఆగస్టు 2000- నిఫ్టి, బోంబే స్టాక్‌ ఎక్జేంజిలో ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ ప్రారంభం

2001- సింగిల్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌, ఈక్విటీ ఇండెక్స్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం

2002 - ఆహారోత్పత్తులల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఉన్న ఆంక్షల రద్దు

2008- ద్రవ్యమార్కెట్‌ ఉత్పత్తుల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి.

గత రెండేళ్లలో డెరివేటివ్‌ మార్కెట్‌ అనేక కొత్త పుంతలు తొక్కింది. తొలుత ఈక్విటీ డెరివేటివ్‌లలో వాణిజ్యానికే పరిమితమైన లావాదేవీలు రాను రాను డెరివేటివ్స్‌లోని ఇతర అంశాలు స్టాక్‌ ఆప్షన్స్‌, ఫ్యూచర్స్‌ మరియు ఇండెక్స్‌ ఆప్షన్స్‌తో సహా అన్ని రకాల లావాదేవీలకు తలుపులు తెరవబడ్డాయి. 2007 డిశంబరు నాటికి స్టాక్‌ ఆప్షన్స్‌ లావాదేవీలే మొత్తం డెరివేటివ్‌ లావాదేవీల్లో మూడింట రెండు వంతులు ఉంటే ఇండెక్స్‌ లావాదేవీలు 22-33 శాతం మధ్య ఉండేవి. నాడు ఆప్షన్స్‌ విభాగంలో 10 శాతం మాత్రమే లావాదేవీలు జరిగితే నేడు 60 శాతానికి పెరిగాయి. సెక్యూరిటీస్‌ లావాదేవీలపై విధించే పన్ను విషయంలో సడలింపు ఇచ్చిన తర్వాత ఈ డెరివేటివ్‌ మార్కెట్‌లో లావాదేవీలు ఊపందుకోవటం స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యూచర్స్‌ వాణిజ్యం కంటే ఆప్షన్స్‌ వాణిజ్యం మరింత తేలిక కావటంతో నేడు స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్లు ఆప్షన్స్‌ మార్కెట్‌పై కేంద్రీకరిస్తున్నారు. ఆప్షన్స్‌ మార్కెట్‌ ద్వారా వాణిజ్యంలో ఎదురయ్యే రిస్కును సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవకాశం ఉండటంతో పాటు డెరివేటివ్‌లలోని మిగిలిన పద్ధతుల కంటే ఆప్షన్స్‌ పద్ధతిలో ఎక్కువ సౌలభ్యం, అదనపు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉండటంతో బ్రోకర్లు ఇతర మార్కెట్‌ సాధనాల కంటే ఆప్షన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికనుగుణంగానే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణా సంస్థ దీర్ఘ కాల ఆప్షన్స్‌లో వాణిజ్యానికి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకొంది.

ఇంత భారీ స్థాయిలో ట్రిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నా దీని నిజస్వభావం గురించి సాధారణ మార్కెట్‌ ఆపరేటర్లకు అంతగా సమాచారం అందుబాటులో లేదు. అంతేకాదు. స్టాక్‌ ఎక్స్ఛేంజి నియంత్రణా బోర్డు కేవలం నెలవారీ డెరివేటివ్‌ కాంట్రాక్టులను మాత్రమే అనుమతించటంతో ప్రతి నెలా కాంట్రాక్టులను పునరుద్ధరించుకోవటం కోసం పెద్దఎత్తున రుసుములు చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఇందులో దాగి ఉన్న మరో సమస్య ఏమిటంటే దీర్ఘకాల డెరివేటివ్స్‌కు సంబంధించింది. ఒక సారి ఇటువంటి దీర్ఘకాలంలో మెచ్యురిటీ అయ్యే డెరివేటివ్‌లలో పెట్టుబడులు పెట్టడం అంటే సదరు పెట్టుబడులను అంత కాలం పాటు నిర్జీవంగా వదిలేయటమే. దీన్నే పెట్టుబడులు లాక్‌ చేయటం అంటారు. దాంతో మెచ్యూరిటీ కాల వ్యవధి ఎక్కువగా ఉండటంతో అటువంటి వాటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టటానికి బ్రోకర్లు వెనకాడుతున్నారు. ఇన్ని పరిమితులున్నా డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు దేశంలో ట్రిలియన్‌ డాలర్లకు చేరుకొందంటే పందేలు కాసే సంస్కృతి మార్కెట్‌లో ఎంతగా పెరిగిపోయిందో స్పష్టం అవుతోంది.

మరో వైపున ఓవర్‌ ది కౌంటర్‌ ఈక్విటీ డెరివేటివ్‌లకు అవకాశం ఇవ్వాల్సిందిగా సెబిపై ఒత్తిడి పెరుగుతోంది. గత సంవత్సరం దేశంలో డెరివేటివ్‌ మార్కెట్‌ను సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవటానికి సెబి స్వయంగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ స్టాక్‌ మార్కెట్‌లో ఓవర్‌ ది కౌంటర్‌ ట్రేడింగ్‌ తరహాలో డెరివేటివ్‌ మార్కెట్‌లో కూడా ఓవర్‌ ది కౌంటర్‌ ట్రేడింగ్‌ను అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఈ లోగా అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం ముంచుకు రావటంతో ఈ సిఫార్సులను కార్యరూపం దాల్చేలా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే ఇప్పటికే భారతదేశానికి చెందిన కొన్ని సంస్థలు విదేశీ డెరివేటివ్‌ మార్కెట్లలో ఓవర్‌ ది కౌంటర్‌ డెరివేటివ్‌ వాణిజ్యంలో నిమగమై ఉన్నాయి. దాంతో ఈ ప్రక్రియకు మనదేశంలోనూ అనుమతించాలన్న ఒత్తిడి క్రమేణా పెరుగుతోంది. ఓవర్‌ ది కౌంటర్‌ డెరివేటివ్‌ వాణిజ్యాన్ని నియంత్రించటం ద్వారా అంతమేర పెట్టుబడులు విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని, ఈ ప్రక్రియకు దేశంలోనే అనుమతిస్తే సదరు వాణిజ్యానికి వినియోగించే పెట్టుబడులు దేశంలోనే ఉంటాయన్నది వీరి వాదన. కర్ణాటకలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వైద్యకళాశాలలకు అనుమతించి, ఆంధ్రప్రదేశ్‌లో అనుమతించనందున శక్తి కలిగిన వారు కర్ణాటక వెళ్లి చదువుకోవటంతో మన రాష్ట్రం నుండి డబ్బులు తరలి వెళ్లుతున్నాయని, దానికి బదులుగా రాష్ట్రంలోనే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వైద్య కళాశాలలు స్థాపించటానికి అనుమతించాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వాదించినట్లుగా ఉంది పై వాదన. ఇటువంటి వాదనలతోనే డెరివేటివ్‌ మార్కెట్లో నిషేధిత ఉత్పత్తుల్లో వాణిజ్యాన్ని అనుమతించే దిశగా ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుని ఈ మార్కెట్‌ను ప్రభుత్వం ఎలా నియంత్రించనున్నదన్న విషయం రానున్న కాలంలో గానీ స్పష్టం కాదు.

Monday, June 14, 2010

డెరివేటివ్స్‌ : ఒక పరిచయం Share Buzz up! మార్క్సిస్టు Thu, 3 Jun 2010, IST

కొండూరి వీరయ్య, డా|| బి. గంగారావు

డెరివేటివ్స్‌ అంటే ఒకరకమైన బొమ్మా బొరుసు పందెం కాయటం. ఈ పందెం ఎందువల్ల కాయల్సి వస్తుంది? అసలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పందేలు కాయటంపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? నేడు మనం చూస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకూ, ఈ డెరివేటివ్స్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? భారత ఆర్థిక వ్యవస్థలో డెరివేటివ్స్‌ మార్కెట్‌ పాత్ర ఏమిటి?

ఆర్థిక వ్యవహారాలు రోజువారీ పరిశీ లించే వారికి నేడు నిత్యం వినిపించే పదం డెరివేటివ్స్‌. రెండేళ్ల క్రితం వరకూ అంతర్జాతీయ మార్కెట్‌ విశ్లేషకులు, దేశీయంగా ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ విధాన రూపకర్తలకు పరిమి తం అయిన డెరివేటివ్స్‌ చర్చ నేడు సర్వసాధా రణంగా మారింది. ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిన గత రెండేళ్లుగా ప్రపంచం డెరివేటివ్స్‌ గురించి విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. గత మూడేళ్లుగా విరామ లేకుండా పెరిగిపోతున్న ధరలకూ, అంతర్జాతీయంగా పుంజుకుంటున్న డెరివేటివ్స్‌ వాణిజ్యానికీ మధ్య విడదీయరాని సంబంధం ఉంది. అమెరికా సంక్షోభానికి- డెరివేటివ్స్‌ వాణిజ్యానికీ మధ్య సంబంధం ఉంది.

డెరివేటివ్స్‌ అంటే ఒకరకమైన బొమ్మా బొరుసు పందెం కాయటం. ఈ పందెం ఎందువల్ల కాయల్సి వస్తుంది? అసలు అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పందేలు కాయటంపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? నేడు మనం చూస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకూ, ఈ డెరివేటివ్స్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? భారత ఆర్థిక వ్యవస్థలో డెరివేటివ్స్‌ మార్కెట్‌ పాత్ర ఏమిటి? అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

ప్రాథమిక పరిచయం

పెట్టుబడి లాభాన్ని ఆశిస్తుంది. వెచ్చించిన రూపాయి ఉత్పత్తి దశ దాటి సరుకు రూపంలో మార్కెట్‌లోకి వెళ్లి తిరిగి లాభం రూపంలో పెట్టుబడిదారుడిని చేరుకోవటమే ఆర్థికవ్యవస్థ సారాంశం. ఈ మొత్తం వలయం పూర్తయ్యే లోపు అనేక అవాంతరాలు ఎదురవుతాయి. వీటినే వాణిజ్యపరిభాషలో రిస్క్‌ అంటారు. ఏ వ్యాపారంలోనైనా రిస్క్‌ ఉంటుంది. ఈ రిస్క్‌ మార్కెట్‌ కారణాల వల్ల కావచ్చు. మార్కెటేతర కారణాల వల్ల కావచ్చు. ప్రకృతిపరమైన కారణాలు కావచ్చు. ఏ వ్యాపారాన్ని ప్రారంభిం చటానికైనా ముందు ఆ వ్యాపారంలో రిస్క్‌ ఎంత ఉంది, ఎంత మేర లాభాలు సంపాదించ వచ్చు, రిస్క్‌ ఎదురైతే బయటపడే మార్గాలు ఏమిటి అన్నది ఆలోచించటం వ్యాపారస్తుల సహజలక్షణం. ఈ లక్షణంతో తీసుకునే జాగ్ర త్తల పర్యవసానంగా అనేక నూతన వాణిజ్య పద్ధతులు, విధి విధానాలు, సరుకులు తెరమీ దకు వచ్చాయి. ఉదాహరణకు బీమా. జీవిత బీమా గురించి మనందరికీ తెలుసు. ఒక వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే రిస్క్‌ ప్రభావం కుటుం బం మీద పడకుండా ఉండేందుకు జీవిత బీమా పాలసీ తీసుకోవటం సర్వసాధారణంగా మనం చూస్తున్నాము. పంటల బీమా గురించి కూడా మనం విన్నాము. చూస్తున్నాము. ప్రకృతి వైపరీ త్యాల వల్ల నష్టం జరిగినపుడు రైతుకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పథకాలు ఇవి. అదేవిధంగా సరుకుల వాణిజ్యంలోనూ ఉంటుంది. నౌకా వాణిజ్యంలో ఎదురయ్యే ప్రమాద నష్టాలు నుండి బయటపడేందుకు వ్యాపారులు, బ్యాం కులకు ప్రీమియం చెల్లించి సరుకులకు బీమా తీసుకుంటారు. ఈ విధంగా ఉనికిలోకి వచ్చిందే ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌. అంటే ఫలానా సంవత్సరం, ఫలానా రోజుకు ఫలానా సరుకు ధర ఇంత ఉంటుందని ఇప్పుడే అంచనాకు వచ్చి సదరు భవిష్యత్తు సరఫరాకు సంబంధించి ఇపుడే ఒప్పందం కుదుర్చుకోవటం. ఇది డెరివేటివ్స్‌లో ఒక లక్షణం మాత్రమే. ఇటువంటి ఒప్పందాలు క్రీస్తు పూర్వం 17వ శతాబ్దికి చెందిన మెసప టోమియా నాగరికత కాలం నుండీ అమల్లో ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అవి కేవలం ప్రకృతి వైపరీత్యాల కార ణంగా తలెత్తే నష్టాలనుండి వ్యాపారాలను కాపాడుకోవటానికి అమల్లోకి వచ్చిన ప్రత్యా మ్నాయ మార్గాలు. ఈస్టిండియా కంపెనీ పాలనలో మన దేశంలో కూడా అటువంటి ఒప్పందాలు అమల్లో ఉండేవి. వీటిని ఫ్యూచర్స్‌ అనే వారు. అయితే ఆధునిక పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందక ముందు మనం చూసిన ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు నేడు మనం చూస్తున్న పరిణామం పూర్తిగా విభిన్నమైనది. అందుకు దారితీసిన పరిస్థితుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

డెరివేటివ్స్‌ భావనను విస్తృత పర్చిన ప్రపంచీకరణ

19వ శతాబ్దం చివరి భాగం, 20వ శతా బ్దంలో మూడొంతుల కాలం ప్రధానంగా ప్రభు త్వ యాజమాన్యంలో ఆర్థిక వ్యవస్థ సాగింది. దీంతో ఇటువంటి ఆకస్మిక నష్టాలకు అవకాశం తగ్గిపోయింది. అంతర్జాతీయంగా కూడా నికరమైన వడ్డీరేట్లు ఉన్నాయి. ప్రభుత్వమే పెట్టు బడిసమీకరణ సాధనంగా మారింది. అటువంట పుడు డెరివేటివ్స్‌ అవసరం తగ్గిపోయింది. ఈ కాలంలో అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య మార్కెట్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో స్థిరత్వం ఉంది. కానీ 1970 దశకం నుండీ అంతర్జాతీయ ఆర్థిక చట్రంలో వచ్చిన మార్పులు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ స్థిరత్వానికి కాలం చెల్లింది. తొలుత బంగారం స్థానంలో డాలర్‌ అంతర్జాతీయ కరెన్సీగా రూపుదాల్చింది. దాంతో పాటు వివిధ దేశాల ద్రవ్యమార్కెట్లలో ప్రభుత్వం పాత్ర గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. సుమారు మూడు దశాబ్దాల పాటు దేశీయ ఆర్థిక అవసరాల రీత్యా నిలకడగా సాగిన వడ్డీ రేట్లు నిలకడతనం కోల్పోయాయి. తొలుత ఏడాది కొకసారి మారటం ప్రారంభించిన వడ్డీ రేట్లు నేటికి మూడు నెల్లకొకసారి మారిపోతూ ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో వేగం పెరి గింది. రాత్రికి రాత్రి శతకోట్ల డాలర్లు చేతులు మారుతున్నాయి. దాంతో స్పాట్‌ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. ఉదాహరణకు బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ నిర్ణయించే విధానాన్నే తీసుకోండి. పాతికేళ్ల క్రితం లక్ష రూపాయలు నాలుగు సంవత్సరాలకు అప్పు తీసుకుంటే నాలుగేళ్ల పాటూ ఒకే వడ్డీ రేటు అమలయ్యేది. కానీ నేడు రెండు రకాల వడ్డీ రేట్లు, స్థిర వడ్డీరేటు, అస్థిర వడ్డీ రేటు వర్తింపచేస్తున్నారు. స్పాట్‌ వడ్డీ రేటు క్రమంగా తెరమీదకు వచ్చింది. వీటన్నింటి పర్యవసానంగా జాతీయ, అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లు, పెట్టు బడి మార్కెట్లలో అస్థిరత వేగం పెరిగింది. పెరుగుతున్న అస్థిరతతో పాటు కొత్త రకాల రిస్కులు తెరమీదకు వచ్చాయి. దాంతో పాటే ఈ రిస్కులను అంచనా వేసి వాటి నుండి తమను తాము కాపాడుకునేందుకు పెట్టుబడిదారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల పర్యవసానంగా తెరమీదకు వచ్చిందే నేడు మనం చర్చించుకుంటున్న డెరివేటివ్స్‌ భావన. తొలుత 1973లో ఫిషర్‌ బ్లాక్‌, మైరోన్‌ ష్కోల్స్‌ అనే ఆర్థికవేత్తలు రిస్కును అంచనా వేసి దానికి వెలకట్టేందుకు కొత్త ఫార్ములా కనిపెట్టారు. ఇదే బ్లాక్‌-ష్కోల్స్‌ ఫార్ములాగా నేడు డెరివేటివ్‌ మార్కెట్లలో చలామణి అవుతుంది. ఈ ఫార్ములాను మార్కెట్‌కు అన్వయించటానికి వీలుగా రూపొందించినందుకు నోబెల్‌ బహు మతి కూడా ప్రకటించారు. స్థూలంగా చెప్పా లంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఉత్థాన పతనాల వలన కలిగే నష్టం నుండి బయటపడేందుకు రూపొం దించిన ప్రక్రియే డెరివేటివ్స్‌.

నిర్వచనం

అంతర్జాతీయంగా డెరివేటివ్స్‌ను నిర్వచిం చేందుకు శతవిధాలా ప్రయత్నం జరుగుతోంది. సామాన్య మార్కెట్‌ పరిభాషలో ఏదైనా సరుకు, వస్తువు, సేవల వర్తమాన విలువకు బదులు భవిష్యత్తు విలువను అంచనా వేసి ఆ విలువపై లావాదేవీలు సాగించటం. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే డెరివేటివ్‌ అంటే మరో సరుకుకు ఫలానా సమయానికి, ఫలానా చోట ఫలానా విలువ ఉంటుందని అంచనా వేయటం. ఆ మేరకు కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాలను డెరివేటివ్‌లు అంటారు. ఏ వాణిజ్య ఒప్పందం లో సరుకుల లావాదేవీలు ఉంటాయో వాటినే ఆధారభూతమైన సరుకు (అండర్‌లయ్యింగ్‌ ఎస్సెట్‌)అంటారు. అటువంటి ఆధారభూతంగా ఉన్న సరుకు ఉత్పత్తి, సరఫరా, వినియోగంలో మారుతున్న విలువతో పాటు డెరివేటివ్‌ విలువ కూడా మారుతూ పోతుంది. డెరివేటివ్స్‌ను నిర్వచించేందుకు 1990 దశకం నుండీ ప్రయ త్నాలు ముమ్మరం అయ్యాయి. 1992లో రూపొందించిన ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజిమెంట్‌ డిక్ష్టనరీ నిర్వచనం ప్రకారం డెరివేటివ్స్‌ అంటే వాణిజ్యానికి ఆధారభూతమైన సెక్యూరిటీ, ఫ్యూచర్‌ లేదా ఇతర వాణిజ్య సాధనం విలువతో పాటు విలువ మార్చుకుంటూ పోయే సరళమైన వాణిజ్య ఒప్పందం. 1995లో ఈ నిర్వచనాన్ని మరింత విస్తృతపర్చింది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నే షనల్‌ సెటిల్‌మెంట్స్‌. బిఐఎస్‌ నిర్వచనం ప్రకారం ఆధారభూతమైన వాణిజ్య సరుకు విలువతో పాటు తన విలువ మార్చుకోవటమే కాదు, డెరివేటివ్స్‌లో మౌలిక వాణిజ్య సాధనా లపై పెత్తనం చేతులు మారదు అని వివరిం చింది. మొదటి నిర్వచనంలో లేని యాజమాన్య బదలాయింపు గురించిన స్పష్టత రెండో నిర్వచ నంలో వచ్చింది. ద్రవ్య మార్కెట్‌లో డెరివేటివ్స్‌ పాత్ర పెరిగే కొద్దీ ఈ నిర్వచనం పరిధి కూడా విస్తృతమవుతూ వచ్చింది. చివరిగా 1998లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ డెరివేటివ్స్‌ను నిర్వచిస్తూ మరో ద్రవ్య మార్కెట్‌ సాధనంతో అనుసంధానించబడిన ఏ మార్కెట్‌ సాధనాన్నైనా డెరివేటివ్‌గా పిలవవచ్చు అని చెప్పింది. ఇది కేవలం ఒక సూచి, ఇండెక్స్‌ కావచ్చు, సరుకు కావచ్చు. ఈ విధంగా అనుసంధానించే క్రమం లో రూపొందే ఉత్పత్తులపై స్వతంత్రంగా లావా దేవీలు నిర్వహించగల స్థోమత కలిగి ఉంటాయి అని నిర్ధారించింది. ఈ చివరి నిర్వచనం డెరివేటివ్స్‌ స్వభావంలో మౌలికమైన మార్పును తెచ్చింది.

డెరివేటివ్స్‌లో రకాలు

డెరివేటివ్స్‌ అన్నది సర్వనామం వంటిది. ఈ సర్వనామం సూచిక కింద అనేక నామవా చకాలు ఉన్నాయి. వీటిని రెండు తరగుతులుగా విభజించవచ్చు. మొదటివి సరుకులకు సంబంధించిన డెరివేటివ్‌లు కాగా రెండో తరగతి ద్రవ్య సరుకులకు సంబంధించిన డెరివేటివ్‌లు. మళ్లీ వీటిలో ముఖ్యమైనవి, అంతర్జాతీయ మార్కెట్లు గుర్తించినవి మూడు రకాలు. మొదటివి ఫార్వార్డ్‌ తరహావి. రెండోది ఆప్షన్‌ డెరివేటివ్‌లు, మూడో మిశ్రమ డెరివేటివ్‌లు. ఫార్వార్డ్‌ డెరివేటివ్‌లు అంటే నిర్దిష్ట భవిష్యత్తులో నిర్దిష్ట ప్రదేశంలో ఒక సరుకును నిర్దిష్ట పరిణామంలో నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకోవటం. ఈ సరుకు పారిశ్రామిక సరుకు కావచ్చు. వ్యవసాయ సరుకు కావచ్చు. ద్రవ్యమార్కెట్‌ సరుకు కావచ్చు. స్టాక్‌ మార్కెట్‌ షేరు కావచ్చు. ఫార్వార్డ్‌ డెరివేటివ్‌లను తిరిగి మూడు రకాలుగా విడగొట్టవచ్చు. ఫార్వార్డ్‌ కాంట్రాక్టులు, ఫ్యూచర్స్‌, బదలాయింపులు (శ్వాప్‌లు). ఇందులో మొదటిది ఫార్వార్డ్‌ కాంట్రాక్టులు ప్రధానంగా నిర్దిష్ట అవసరాలు తీర్చుకోవటానికి వినియోగించబడతాయి. ఫార్వార్డ్‌ డెరివేటివ్‌లకిచ్చిన వివరణే వీటికీ సరిపోతుంది. ఫార్వార్డ్‌ కాంట్రాక్ట్‌లో స్థలం, కాలం, పరిమాణం గురించిన స్పష్టమైన ఒప్పం దం ఉండదు. ఇక ఫ్యూచర్స్‌ విషయానికొస్తే, ఫార్వార్డ్‌ కాంట్రాక్టుకున్న అన్ని లక్షణాలతో పాటు స్థలం, కాలం, పరిమాణం, నాణ్యత, ధరల గురించిన స్పష్టత ఇందులో ఉంటుంది. మూడో ది, బదలాయింపులు. ఫార్వార్డ్‌ కాంట్రాక్టు, ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు ప్రధానంగా ఉత్పత్తితో ముడిపడి ఉంటాయి. బదలాయింపులు ఉత్పత్తితో సంబంధం లేని ద్రవ్య మార్కెట్‌లో జరిగే లావాదేవీలు. ఈ ఒక్క ప్రత్యేకత మినహా ఫార్వార్ట్‌, ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులకున్న లక్షణాలన్నీ శ్వాప్‌లకు ఉంటాయి.

రెండో కేటగిరీ ఆప్షన్‌లు: ఫార్వార్డ్‌ డెరివే టివ్‌లలో సరుకుల లావాదేవీలకు సంబంధించి హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఆప్షన్‌ల కేటగిరీలో హక్కులే తప్ప బాధ్యతలు ఉండవు. అంటే కుదుర్చుకున్న కాంట్రాక్టును అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు కూడా.

మూడో కేటగిరీ మిశ్రమ డెరివేటివ్‌లు: మిశ్రమ డెరివేటివ్‌లు ప్రధానంగా ఉత్పత్తితో సంబంధం లేని రంగాల్లో జరిగే లావాదేవీల్లో రిస్కు తగ్గించుకునే సాధనాలు. డెరివేటివ్‌ల వల్ల రిస్కు తగ్గుతుందనుకోవటం పొరపాటు. ఇవి కేవలం రిస్కును వాయిదావేయటానికీ లేదా మరొకరి నెత్తిన మోపటానికీ ఉపయోగపడే సాధనాలే. ప్రస్తుతం అమెరికా సంక్షోభం అనుభవంలో మనకు రుజువైన అంశం ఇదే. ఈ కొత్త పరిణామం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం నుండి కాపాడలేకపోయింది.

వివరణ

పశ్చిమగోదావరి జిల్లాలో ఆధునిక ఫ్లోర్‌ మిల్లులు ఉన్న విషయం తెలుసు. ఫ్లోర్‌ మిల్లు యజమాని ఒక గ్రామంలో రైతుల నుండి పంట నూర్పిడి తర్వాత మొత్తం సరుకు తన మిల్లుకే తోలాలని ఒప్పందం కుదుర్చుకోవటం ఫార్వార్డ్‌ కాంట్రాక్టు అయితే నూర్పిడి సమయానికి 1000 క్వింటాల ధాన్యం 700 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చు కోవటం, 200 కాయిదా, బయానా తీసుకోవటం ఫ్యూచర్స్‌ అవుతుంది. కొనుగోలు షరతులు కుదరని పక్షంలో కాయిదా ఇచ్చిన 200 రూపాయలు వదిలేసుకుని పోవటం ఆప్షన్‌ అవుతుంది. ఇదే 200 రూపాయల బయానా తో మరో మిల్లుకు సరుకు తోలించటం శ్వాప్‌ అవుతుంది.

మార్కెట్‌ వాదనలు

డెరివేటివ్‌ మార్కెట్‌ గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు ప్రధానంగా నాలుగు వాదనలు ముందుకు తెస్తున్నారు. మార్కెట్‌ రిస్కును సరిగ్గా అంచనా వేసి నివారించవచ్చు. వాణిజ్య సామర్థ్యం పెరుగుతుంది. గాలివాటు వాణిజ్యం తో లాభాలు పెంచుకోవచ్చు. ఉత్పత్తులకు సాధ్యమైనంత ఎక్కువ విలువ సాధించవచ్చు. ధరవరల స్థిరీకరణకు సాధనంగా ఉపయోగించ వచ్చు. ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌లో డెరివేటివ్‌ వాణిజ్యం వలన రైతులకు మరింత ధర వస్తుందనీ, డెరివేటివ్స్‌ల మార్కెట్‌ కొనుగోళ్ల ద్వారా ముందస్తుగానే సరుకు సేకరణ ప్రారం భించటం వల్ల మార్కెట్‌లో సరుకులు నిరాటం కంగా వస్తుంటాయనీ, దాంతో కొరత నివా రించవచ్చుననీ చెబుతోంది. అవసరాల ప్రాతిపదిన అమ్మకం జరుగుతుంది కనుక సరసరమైన ధరలకు సరుకులు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది.

భారతదేశంలో డెరివేటివ్స్‌ మార్కెట్‌గమనం

న్యూయార్క్‌లో తొలి డెరివేటివ్స్‌ ఎక్జేంజి 1875లో ఏర్పాటైతే భారతదేశంలో అంతకు పూర్వమే పత్తి వ్యాపారులతో ఈస్టిండియా కంపెనీ ఫార్వార్ట్‌ ట్రేడింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకొన్నది. 1875లో బొంబాయి కాటన్‌ అసోషియేషన్‌ వ్యవసాయోత్పత్తులపై ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ సంస్థాగతం చేసింది. స్వాతంత్య్రం వచ్చే వరకూ ఈ వ్యాపారం నిరాఘాటంగా కొనసాగింది. ఈ వ్యాపారంతో పాటే సరుకుల అక్రమ నిల్వలు పెరిగిపోయాయి. 1952లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తులు మార్కెట్లోకి తెచ్చే లక్ష్యంతో డెరివేటివ్‌ ట్రేడింగ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించంతో పాటు సరుకుల మార్కెట్‌ను నియంత్రించటానికి నిత్యావసర సరుకుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నాటినుండీ ఐదు దశాబ్దాలపాటు డెరివేటివ్స్‌ వాణిజ్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ 1995లో ద్రవ్యసరుకుల మార్కెట్‌లో డెరివేటివ్స్‌ వాణిజ్యాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఆర్డినెన్స్‌ తెచ్చింది. దిగువనున్న పట్టిక 1995 నుండీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ వేళ్లూనుకునేందుకు ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు చేపట్టిందో తెలియచేస్తోంది.

1995- సెక్యూరిటీస్‌ చట్ట సవరణ ద్వారా ద్రవ్య ఉత్పత్తుల్లో వాణిజ్యానికి తెర తీశారు.

1996 - ఇండెక్స్‌ల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ఎల్‌ సి గుప్త కమిటీ నియమాకం

1998 - గుప్త కమిటీ నివేదిక సమర్పణ

1999 - ఓవర్‌ ది కౌంటర్‌ ఫార్వార్డ్‌ కాంట్రాక్టులకు ఆర్‌ బి ఐ అనుమతి

మే 2000- నిఫ్టి స్టాక్‌ ఎక్జేంజిలో ఇండెక్స్‌ లపై ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం

జూన్‌ 2000- బోంబే స్టాక్‌ ఎక్చేంజిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

జూన్‌ 2000- నిఫ్టిలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి

ఆగస్టు 2000- నిఫ్టి, బోంబే స్టాక్‌ ఎక్జేంజి లో ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ ప్రారంభం

2001- సింగిల్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌, ఈక్విటీ ఇండెక్స్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం

2002 - ఆహారోత్పత్తులల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఉన్న ఆంక్షల రద్దు

2008- ద్రవ్యమార్కెట్‌ ఉత్పత్తుల్లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కు అనుమతి.

విస్తృతమవుతున్న డెరివేటివ్స్‌ మార్కెట్‌

నేడు భారతదేశంలో జాతీయ స్థాయి సరుకుల ఎక్జేంజిలు 16 ఉన్నాయి. అందులో అహ్మదాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న నేషనల్‌ మల్టీ కమోడిటీస్‌ ఎక్చేంజి, ముంబయి కేంద్రంగా నడుస్తున్న కమోడిటీస్‌ డెరివేటివ్స్‌ ఎక్సేంజి, మల్టీ కమోడిటీస్‌ ఎక్సేంజి, ఇండియా కమోడిటీస్‌ ఎక్సేంజిలు ముఖ్యమైనవి. ఇవికాక వ్యవసా యోత్పత్తుల లభ్యతను బట్టి ఆయా ప్రాంతాల్లో ఒక్కో ఉత్పత్తికి సంబంధించిన ఎక్చేంజిలు ఉన్నాయి. ఉదాహరణకు పసుపు కొమ్ముల డెరివేటివ్‌ మార్కెట్‌కు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు కేంద్రంగా ఉంటే గుంటూరు మిర్చియార్డు ఎర్రమిరపకాయల డెరివేటివ్‌ మార్కెట్‌గా ఉంది. కాకినాడ చమురు ఉత్పత్తుల డెరివేటివ్‌లకు కేంద్రంగా ఉంది. 2000 నాటికి కేవలం 8 రకాల వ్యవసాయోత్పత్తుల గురించి డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు సాగితే నేడు 64 వ్యవసాయోత్పత్తులకు సంబంధించి డెరివేటివ్‌ మార్కెట్‌ నడుస్తోంది. మరో 16 ఖనిజోత్పత్తులకు సంబంధించి కూడా డెరివేటివ్‌ మార్కెట్‌ ఈ కాలంలో విస్తరించడింది. 2000 లో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో 1,50,000 కోట్ల విలువైన లావాదే వీలు జరగ్గా, 2009-2010 ఆర్థిక సంవత్స రానికి లావాదేవీల విలువ 77,64,754 కోట్లకు చేరింది. ఇది స్థూల జాతీయోత్పత్తికి రెట్టింపు. అంటే సగటున రోజుకు 13,792 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ద్రవ్య ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్‌ కూడా దీనికంటే వెనకబడేమీ లేదు. ఇందులో ముఖ్యమైనది ఈక్విటీ ఇండెక్స్‌లో జరిగే వాణిజ్యం. నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజిలో జరిగే లావాదేవీల విలువ కంటే ఇదే ఎక్చేంజిలో ద్రవ్య ఉత్పత్తులపై జరిగే లావాదేవీల విలువ ఎక్కువ. ఉదాహరణకు 2008లో నేషనల్‌ స్టాక్‌ ఎక్జేంజి లో డబ్బు ఆధారిత లావాదేవీల విలువ 35,51,038 కోట్లు కాగా డబ్బుకు సంబంధిం చిన డెరివేటివ్‌ మార్కెట్‌లో జరిగిన లావాదేవీల విలువ 1,30,90,477.75 కోట్లు. అంటే 400 రెట్లు ఎక్కువ. 2008-2009 ఆర్థిక సంవత్స రంలో అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో ఈ వేగం కొంత మందగించి డెరివేటివ్స్‌ మార్కెట్‌ 76,50,896.80 కోట్లకు పరిమితం అయ్యింది. వ్యవవసాయోత్పత్తులపై డెరివేటివ్‌ వాణిజ్యం కంటే ద్రవ్య ఉత్పత్తులపై డెరివేటివ్‌ వాణిజ్యం మరింత ప్రమాదకరం. ఎందుకంటే ద్రవ్య ఉత్పత్తుల డెరివేటివ్‌ వాణిజ్యం కాగితాలకే పరిమితం అవుతుంది. ఉత్పత్తితో ఏమాత్రం సంబంధం లేదు. అంటే కనీసం ఒక్క యువకు డికి కూడా అదనంగా ఉద్యోగ అవకాశం కలిగించకుండా, ఒక్క ధాన్యం బస్తాగానీ, పారిశ్రామిక సరుకుగానీ, మీటరు గుడ్డగానీ ఉత్పత్తి చేయకుండానే 1,30,90,477.75 కోట్లు విలువైన వాణిజ్యం జరిగిపోయింది. ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చినట్లు ? ఎవరికి జేబులోకి వెళ్లినట్లు?

ద్రవ్యపెట్టుబడిదారులకు ఆటస్థలం

డెరివేటివ్స్‌ వాణిజ్యం వల్ల దేశానికి, ప్రజలకు ఎదో ఒరిగి పడుతుందన్న వాదన సత్య దూరం. సాధ్యమైనంత ఎక్కువ విలువ రాబట్టుకోవటం అన్నది కూడా పాక్షిక సత్యమే. పై వాదనల్లో ఒక్కటే సంపూర్ణ సత్యం. గాలి వాటు వాణిజ్యం ప్రోత్సహించటం ద్వారా లాభాలుపెంచుకొనే అవకాశం ఈ డెరివేటివ్‌ మార్కెట్‌ వల్ల కలుగుతుంది. ఈ డెరివేటివ్‌ వాణిజ్య క్రీడలో సామాన్య పౌరులెవ్వరూ పాల్గొనలేరు. ఎందుకంటే మల్టీ కమోడిటీస్‌ ఎక్సేంజిలో సభ్యతం తీసుకోవాలంటేనే 26 లక్షల సుంకం చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించ లేని వారు ఈ క్రీడలో పావులుగా మారతారే తప్ప క్రీడాకారులు కాలేరు. ఎక్చేంజిలో సభ్యత్వం తీసుకోవటానికి అంత సొమ్మే ఉంటే రైతుకు గిట్టుబాటు ధర రాలేదని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ! కనీస స్థాయిలో పాతిక కోట్లు పెట్టుబడి పెట్టి ఈ మార్కెట్‌లో ప్రవేశం పొందుతారు. పాతికోట్ల పెట్టుబడి అంటే ఈ మార్కెట్లో సముద్రంలో చెంబుడు నీళ్లు పోయటంతో సమానం. ఏతా వాతా కేవలం జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలే ఈ మార్కెట్‌లో ప్రవేశించగలుగుతాయి. దాంతో దేశంలో 99.999 శాతం ప్రజలు ఈ లావాదేవీలకు దూరంగా ఉంటారు.

డెరివేటివ్స్‌ మార్కెట్‌ పర్యవసానంగా సరు కులు దైనందిన మార్కెట్‌లోకి రావటం తగ్గుతుంది. భవిష్యత్తులో మరింత మంచి రేటు వస్తుందన్న ఆశ, అంచనా మరింత రిస్కు తీసుకో వటానికి ప్రేరేపిస్తుంది. దాంతో ఉన్న సరుకులు కాస్తా గోడౌన్లలో మూలుగుతుంటాయి. ఉదాహరణకు 40 క్వింటాళ్ల మిర్చి పండించిన రైతు మరో ఆర్నెల్ల తర్వాత మంచి రేటు పలుకుతుందంటే ఆ ఆర్నెల్లపాటు సరుకు కోల్డ్‌ స్టోరేజిలో ఉంచటానికి సిద్ధమవుతాడు. అయితే ఆర్నెల్ల తర్వాత రేటు ఇప్పుడున్న రేటు కంటే ఖచ్చితంగా పెరుగుతుందని ఎవ్వరూ హమీ ఇవ్వరు. రైతే రిస్క్‌ తీసుకోవాలి. సరుకులు చేతులు మారుతున్నాయా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా వాస్తవిక మార్కెట్‌లో భవిష్యత్తు ధరల అంచనాతో నేడు సరుకుల రేట్లు పోటెత్తు తాయి. ఉదాహరణకు యాలక్కాయలు కిలో ధర గత సంవత్సరం 650-700 రూపాయలు పలికింది. ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గిపోతుం దన్న వార్తలు రావటంతో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో దీని ధర ఒక్కసారిగా రెట్టింపయ్యింది. ఇప్పుడు దైనందిన మార్కెట్‌లోకూడా రేటు పెరిగి 1300కు చేరింది. పసుపు పరిస్థితి కూడా అదే. జనవరి 2010లో 7398 పలికి క్వింటా ధర మేనెల వచ్చే సరికి 14,851కి చేరుకొంది. దీని ప్రభావం దైనందిన మార్కెట్‌లో పడుతుంది. 2002లో ఎన్డీయే ప్రభుత్వం ఆహారోత్పత్తుల మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఉన్న ఆంక్షలు రద్దు చేయటంతో పాటు డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీలు జరిగే ఉత్పత్తుల సంఖ్య 61 నుండి 80 కి పెంచింది. దీని ప్రభావం వల్ల రెండేళ్ల క్రితం వరకూ కిలో 28 రూపాయలు ఉండే చక్కెర నేడు 48 రూపాయలకు చేరింది. 38-48 రూపాయల మధ్య ఉన్న వంటనూనెల ధరలు నేడు 80-100కు చేరాయి. ఢిల్లీలో ఐదు రూపాయలు ఉండే గోధుమ పిండి ధర నేడు 11 రూపాయలకు చేరింది. అలాగని ఈ పెరిగిన మార్కెట్‌ ధరల కనుగుణంగా రైతుల వద్ద కొనుగోలు ధరలూ పెరగలేదు.

ఏ రూపంలో చూసుకున్నా లాభాలు పోగేసు కునే విషయంలో తప్ప మిగిలిన ఏ విషయం లోనూ డెరివేటివ్స్‌ మార్కెట్‌ అటు జాతీయ ఆర్థిక వ్యవస్థల అవసరాలూ తీర్చలేదు. ఇటు సామాన్య ప్రజల అవసరాలు అంతకంటే తీర్చలేదు. ఇది దేశీయ అనుభవం, అంతర్జాతీయ అనుభవం ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. 2006- 2008 మధ్య ప్రాఛ్య దేశాలు ఆహార సంక్షో భాన్ని ఎదుర్కొన్న విషయం గుర్తుకు తెచ్చు కోవాలి. తాజా దశ ఆహార సంక్షోభానికి మూల కారణం ఉత్పత్తిలో కొరత కాదు. కొనుగోలు శక్తిలో కొరత. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయో త్పత్తుల డెరివేటివ్స్‌ వాణిజ్యం వలన ధాన్యం ధర 2006-2008 మధ్య 217 శాతం పెరిగింది. గోధుమల ధర 136 శాతం, మొక్క జొన్నలు 125 శాతం పెరిగాయి, సోయాబీన్‌ గింజలు 107 శాతం పెరిగాయి. ఇదే కాలంలో చికాగో స్టాక్‌ఎక్సేంజిలో గోధుమల డెరివేటివ్‌ వాణిజ్యం వల్ల 73 శాతం అదనపు లాభాలు వచ్చాయని అంచనా వేయగా సోయా నూనె డెరివేటివ్‌ల ద్వారా 44 శాతం లాభాలు అదనంగా వచ్చాయి.

ఎవరు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ?

ఇన్ని వివరాలు పరిశీలించిన తర్వాత సమాజంలోని 99.999 శాతం మంది ప్రజలకు నష్టం చేకూరుస్తున్న ఈ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకో వాలంటే ముందుగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌కు, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మార్కెట్‌కూ, డెరివేటివ్‌ మార్కెట్‌కూ మధ్య ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంబంధాలు పెట్టుబడిదారీ వ్యవస్థ మౌలిక లక్షణం లాభాల రేటు పతనం సిద్థాంతాన్ని మరోసారి చర్చకు తీసుకొస్తున్నాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి క్రమంలో ఉన్న మౌలిక వైరుధ్యం, ఉత్పత్తి సంబంధాల్లో ఉన్న వర్గ ఘర్షణ అనివార్యంగా ఈ వ్యవస్థను మౌలిక లక్షణమైన లాభాల రేటు పతనం దిశగా నెడుతుంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతుంది. ఆయా స్థల కాల పరిస్థితులను బట్టి సంక్షోభం నుండి బయట పడటానికి కొన్ని సార్లు ప్రభుత్వాలే దోహదం చేస్తే మరికొన్ని సార్లు ప్రజలు ప్రభుత్వాలను మార్చి వ్యవస్థను సంక్షోభం నుండి బయటకు తెచ్చుకుంటారు. విప్లవాత్మక మార్పులకు అవకాశం లేకుండానే ఈ పతనాన్నీ, సంక్షోభాన్నీ నివారించేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థ గత నాలుగు శతాబ్దాల నుండి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. శాస్త్రసాంకేతిక విజ్ఞాన రంగాల్లో వస్తున్న మార్పులు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచటంతో పాటు నిరుద్యోగాన్ని సృష్టించటం ద్వారా కొనుగోలు శక్తి పతనాన్ని కూడా వేగవంతం చేశాయి. గుత్తపెట్టుబడి ద్రవ్య పెట్టుబడిగా మారే పరిణామం మొదటి ప్రపంచ యుద్థానికి ముందు ఆరంభస్థాయిలో ఉంటే నేడు అవధుల్లేని స్థితికి చేరింది. ఉత్పత్తికి అవసరమైన అదనపు నిధులు సమకూర్చుకునే సాధనంగా తెరమీదకు వచ్చిన స్టాక్‌మార్కెట్‌లు నేడు జూదశాలలుగా మారాయి. ఉత్పత్తి క్రమంలో నెలకొన్న వైరుధ్యం, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాల మధ్య ఉన్న వైరుధ్యం నుండి బయటపడటానికి పెట్టుబడిదారీ వర్గం మార్కెట్‌ లో తిమ్మిని బమ్మిని చేయటం ద్వారా సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నాలు ముమ్ము రం అయ్యాయి. దీని ఫలితమే మనం నేడు చూస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ.

ఈ ప్రపంచీకరణ పర్యవసానమే మొత్తం ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యీకరణ చెందటం. అంటే ఆర్థిక వ్యవస్థలు పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి క్రమం కంటే మార్కెట్‌లో ద్రవ్య సరుకుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తాయి. వాస్తవిక మార్కెట్‌ కంటే ద్రవ్య సరుకుల మార్కెట్‌ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఒక్క భారతదేశంలోనే ఈ తేడా ఎంతుందో పైన చూశాము. అంతర్జాతీయంగా చూసుకున్నపుడు 2008లో ప్రపంచ స్థూల ఉత్పత్తి విలువ 60 లక్షలకోట్ల (ట్రిలియన్ల) డాలనేకల అయితే ఒక్క డెరివేటివ్‌ మార్కెట్‌ లావాదేవీల విలువ 1140 లక్షలకోట్ల (ట్రిలి యన్‌) డాలర్లు. సాధారణ ఆర్థిక అవగాహన మేరకు ఉత్పత్తి అయిన సరుకు మార్కెట్‌కు చేరి వినిమయదారుడి వద్ద నున్న రొక్కంతో మార్పిడి జరిగితే సరుకుల వలయం పూర్తవుతుంది. ఈ వలయం పూర్తయినపుడే నికర లాభం చేతులు మారుతుంది. తిరిగి ఉత్పత్తికి కావల్సిన పెట్టు బడి సమకూరుతుంది. కానీ డెరివేటివ్‌ మార్కెట్‌ దీనికి భిన్నమైంది. దీన్లో వినియోగం, పెట్టుబడి తిరిగి చేతికి రావటం ఉండదు. దాంతో ఉన్న లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అవుతాయి. ఉత్పత్తి ఆధారిత పెట్టుబడి సహజంగా దీర్ఘకా లిక పెట్టుబడి. దాని స్థానంలో మార్కెట్‌ ఆధారిత కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పెట్టుబడిపై కేంద్రీకరణ మళ్లింది. స్వల్పకాలిక పెట్టుబడితో రిస్కును కాలచక్రంలో బంధించవచ్చన్న అవగాహన దీనికి మూలం.

సూత్రీకరణగా చెప్పుకోవాలంటే పై పరిణామాలన్నీ క్రోడీకరించబడ్డాయి. వీటికి తోడు శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రత్యేకించి కంప్యూటర్‌ గణాంక ప్రక్రియలు గణితంలో నూతన ఫార్ము లాలకు దారితీశాయి. ఈ నూతన ఫార్ము లాలను ఆర్థిక రంగానికి వర్తింపచేయటానికి వేగంగా చర్యలు చేపట్టబడ్డాయి. దాంతో ప్రపంచీకరణ వేగానికి మించి డెరివేటివ్‌ అంతర్జాతీయ మార్కెట్‌ను కమ్ముకున్నాయి. ఇంత జరిగినా ఇవి కేవలం మార్కెట్‌ లావాదేవీల పర్యవసానంగానే మిగిలిపోయాయి తప్ప ఉత్పత్తి క్రమంతో అనుసంధానించబడలేదు. అందువల్లనే అమెరికా ఎదుర్కొన్న తాజా సంక్షోభంలో డెరివేటివ్‌లు కీలక పాత్ర పోషిం చాయి. ఈ మార్కెట్‌ వలయంలో అట్టడుగు స్థానంలో ఉన్న వినియోగదారులు ఉత్పత్తి క్రమంతో నిమిత్తం లేని ద్రవ్యీకరణలో పావు లుగా మారారు. ఉత్పత్తి లేకపోతే ఉపాధి లేదు. ఉపాధి లేకపోతే కొనుగోలు శక్తి లేదు. దీంతో కేవలం అమ్మకాలకే పరిమితమైన డెరివేటివ్‌ మార్కెట్‌ సరుకుల వలయాన్ని పూర్తి చేయలేకపోయింది. ఈ వైఫల్యంతో ద్రవ్య పెట్టుబడి ప్రధాన కార్యకలాపాలు సరుకుల ఉత్పత్తికి బదులు గణాంక పద్ధతుల్లో స్పెక్యులేషన్‌ లావాదేవీల నడపడమే అని తేలిపోయింది. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఎదురయ్యే రిస్కు నుండి పెట్టుబడులు, లాభాలు గ్యారంటీ చేసుకునేందుకు ఉనికిలోకి వచ్చిన డెరివేటివ్‌లు నేడు రిస్కును మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు మూల మూలలా విస్తరింపచేస్తున్నాయి. అయినా గత రెండు దశాబ్దాలుగా డెరివేటివ్‌ మార్కెట్‌ విస్తరణతో తేలికగా లాభాలు పోగేసుకోవటమే కాదు, సంక్షోభ భారాలను అంతే తేలికగా ఇతరులపై నెట్టటానికి సాధనాలుగా మారటంతో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు తాజా సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకోవటం కాక ఈ ధోరణిని కొనసాగించే దిశగా ముందుకు సాగుతున్నారు.