Wednesday, May 5, 2010

''కమ్యూనిస్టు వ్యతిరేకులారా ఇక మీ విమర్శలు చాలించండి''

Published in Marxistu, May 2010

* ''ఫస్ట్‌ యాజ్‌ ట్రాజెడీ, దెన్‌ యాజ్‌ ఫార్స్‌'' Book Review
* స్లావొజ్‌ జిజెక్‌ వెర్సొ ప్రెస్‌ పేజీలు : 157, వెల : రూ. 650

21వ శతాబ్దంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తొలి సంక్షోభం గురించి అనేక రచనలు వచ్చాయి. ఇందులో కొన్ని రచ నలు సంక్షోభం తీరు తెన్నుల వర్ణణకు పరిమితం అయితే, మరికొన్ని రచనలు సంక్షోభ కారణాలు వెతికే ప్రయత్నం చేశాయి. కొన్ని రచనలు మాత్రమే సంక్షోభానికి పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేశాయి. అందులో కూడా సాంప్ర దాయక పరిష్కారాలు చూపించే రచనలే ఎక్కువ. వీటన్నింటికి భిన్నంగా వర్తమాన సంక్షో భాన్ని సరికొత్త కోణంలో పరిశీలించిన రచన స్లావోజ్‌ జిజెక్‌ రచించిన ''తొలుత ఒక విషాదంగా తరువాత ఒక ప్రహసనంగా'' (ఫస్ట్‌ యాజ్‌ ట్రాజెడీ, దెన్‌ యాజ్‌ ఫార్స్‌) అన్న గ్రంథం. మార్క్స్‌ ప్రసిద్ధ గ్రంథం లూయీ బోనపార్టీ 18వ బ్రూమెయిర్‌ రచనలో ఒక వాక్యాన్ని తన రచనకు శీర్షికగా ఎంచుకోవడం ద్వారా జిజెక్‌, సంక్షోభంపై తన విమర్శ మిగిలిన విమర్శలకు భిన్నంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. లండన్‌ విశ్వవిద్యా లయంలో బిర్క్‌బెక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యుమాని టీస్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు జిజెక్‌. ఈ కాలంలో అత్యధిక విశ్లేషణలు నిర్దిష్టంగా పెట్టుబడిదారీ విధానాన్ని బ్రతికించే ఏకైక లక్ష్యంతో వచ్చాయి. కాని వారంతా బయటికి మాత్రం తటస్థ విశ్లేషకులుగా వ్యవహరించారు. అటువంటి వారికి భిన్నంగా జిజెక్‌ ''ఇక్కడ నేను తటస్థ విశ్లేషణను ముందుంచటం లేదు. సంపూ ర్ణమైన పక్షపాతంతోనే వాదనలు ముందుకు తెస్తున్నాను. అవి కూడా పాక్షికమైనవే. ఎందు కంటే సత్యం పాక్షికమైనది. అటువంటి పాక్షిక సత్యాన్ని చేరుకోవాలంటే పక్షపాత వైఖరి తీసుకోక తప్పదు. ఇక్కడ నేను కమ్యూనిజం పక్షం వహిస్తున్నాను'' అంటూ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ''కమ్యూనిజాన్ని నమ్మిన వారు ఇకపై ఏ మీమాంసకు లోను కావాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకులారా, ఇక చాలిం చండి. ఇంతకాలం అవాకులు చెవాకులు పేలారు. వాటన్నింటిని క్షమించి వదిలేస్తున్నాము. ఇకనైనా విషయాన్ని తీవ్రంగా పరిశీలించండి'' అని పేర్కొన్నాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభాన్ని మాత్రమే కాదు, సైద్ధాంతిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నది. ఈ సైద్ధాంతిక సంక్షోభం నుండి బయటపడేందుకు ముందుకొచ్చిన, వస్తున్న పలు సంక్లిష్ట వాదనలను కేవలం 160 పేజీల్లో సంక్షిప్తీకరించటం ద్వారా జిజెక్‌ ఒక నూతన ప్రపంచాన్ని పాఠకుల కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పుస్తకాన్ని 1. బడుద్ధాయిలూ...ఇది సైద్ధాంతిక పోరాటం, 2. కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం అన్న రెండు భాగా లుగా విభజించారు. మధ్యమధ్యలో ఉపశీర్షికలు ఉన్నాయి. జిజెక్‌ తన గ్రంథంలో అత్యంత సంక్లిష్ట వాదనలను సంక్షిప్తంగా పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశాడు. పుస్తకం చిన్నదే అయినా చదివి అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. ఇందులో ఉన్న వాదనలు, ప్రతి వాదనలు అంత వైవిధ్యమైనవి కావటమే దీనికి కారణం. తాజా సంక్షోభం వలన విప్లవ రాజకీ యాలు, విముక్తి రాజకీయాలు తమంతతాముగా విజృంభించబోవనీ, సంక్షోభం కాస్తా సామాజిక సంక్షోభంగా మారి కార్మికవర్గంపై దాడి పదు నెక్కుతుందనీ, జాత్యంహంకార వివక్ష, యుద్ధం, పేదరికం విజృంభిస్తాయనీ, అన్ని దేశాల్లోనూ పేదలు సంపన్నుల మధ్య అంతరాలు మరింత పెరుగుతాయనీ పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రం పరిధికి బయటే పరిష్కారం వెదకాలని ప్రతి పాదించారు.

మొదటి భాగాన్ని ప్రధానంగా పెట్టుబడి దారీ సంక్షోభాన్ని సమర్థించుకోవటానికి జరుగు తున్న పలు ప్రయత్నాలనూ, వాటి రాజకీయ పర్యవసానాలనూ విశ్లేషించటానికి కేటాయిం చారు. రెండో భాగంలో కమ్యూనిస్టు ప్రతిపా దనలు ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారీ విధానం గురించీ, కమ్యూనిస్టు ప్రతిపాదనల గురించీ ఆయన ప్రధానంగా సామాజిక రాజ కీయ విశ్లేషణకు బదులు సామాజిక మనస్తత్వ వివశ్లేషణ చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఈ రచనలో క్రియాశీల రాజకీయ కోణంపై డోలయమానం కనిపిస్తుంది. పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించటంలో సమర్థవంతంగా వ్యవహరించినా కమ్యూనిజానికి సంబంధించిన పలు ప్రతిపాదనల విషయంలో యూరప్‌లోని సైద్థాంతిక ధోరణుల పరిమితి నుండి బయట పడలేకపోయారని ఆయన ముందుకు తెచ్చిన పలు ప్రతిపాదనలు గమనిస్తే అర్థమవుతుంది.

సంక్షుభితమైన పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిజం స్థాపన మినహా మరో ప్రత్యా మ్నాయం లేదంటూ ప్రత్యక్ష రాజకీయకార్యా చరణకు ప్రోత్సహించే పుస్తకం ఇది. అదేసమ యంలో కమ్యూనిజం భావనలు వేళ్లూనుకో కుండా ఉండేందుకు, దృష్టి మళ్లించేందుకు అత్యంత మితవాదులు, ఉదారవాదులే కమ్యూ నిస్టు పరిభాషలో వాదనలు ముందుకు తెస్తారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిస్తారు. అమెరికా ఆధునిక చరిత్రలో ప్రత్యేకించి 21వ శతాబ్దంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు- 9/11 ఉగ్రవాదుల దాడి, తదనంతర పరిణామాలు, 2007-2008లో పెల్లుబుకిన పెట్టుబడిదారీ సంక్షోభం...ఈ రెంటినీ పోలుస్తూ విశ్లేషణ మొదలవుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ అమెరికా పాలక వర్గాలు ముందుకు తెచ్చిన వాదనలు - అమెరికా విలువలనూ, జీవన విధానానీ కాపాడుకోవాలన్న వాదనలను ప్రస్తా విస్తూ వాటిపై తన ప్రతివాదన వినిపించారు. ఈ సందర్భంగానే 1989లో బెర్లిన్‌ గోడ పతనం సందర్భంగా ముందుకు వచ్చిన చరిత్ర అంతం, మానవ సమాజ అభివృద్ధిలో పెట్టుబడిదారీ విధానమే ఆఖరి దశ, సంతోషదాయకమైన 90వ దశకం అన్న వాదనలు ఊహాజనిత వాదనలని జిజెక్‌ నిర్ధారించాడు. ఫ్రాన్సిస్‌ ఫుకుయామా ప్రతిపాదించిన చరిత్ర అంతం సిద్ధాంతం కూడా తప్పని రెండు సార్లు రుజువయిందని చెప్పారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం గురించి మొదటి భాగంలో విపులంగా చర్చించిన జిజెక్‌ మిగిలిన వారికి మల్లే ఈ చర్చను పెట్టుబడిదారీ విధానం పరిధిలో నుండే చూడకుండా దాని పరిధి బయట నుండి సమీక్షించటం ఇందులోని ప్రత్యేకత. అదేసమయంలో ఈ నూతన విశ్లేషణకు అవసరమైన సైద్ధాంతిక పునాదిని మాత్రం జిజెక్‌ చూపలేకపోయాడు. ఈ వైఫల్యం కమ్యూనిస్టు ప్రతిపాదనల గురించిన చర్చలో మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పెట్టుబడి దారీ విధానంలోని తాజా ధోరణుల గురించి చర్చను రచయిత ఆయిదు అంశాలుగా విభజిం చాడు. 1. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌కు, మెయిన్‌ స్ట్రీట్‌కు మధ్య జరుగుతున్న చర్చ 2. సమానత్వం ప్రాతిపదికన సంపద పంపిణీకీ, పెట్టుబడిదారీ విధానంలో కనిపించే సంపద వడపోతకు మధ్య జరుగుతున్న సంవాదం 3. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యమే తాజా సంక్షోభానికి మూల కారణమనే చర్చ 4. సంక్షోభ రహిత పెట్టుబడి దారీ విధానం గురించిన చర్చ. తటస్థ మార్కెట్‌ అంటూ ఏదీ లేదని, ఏ సందర్భ పరిమితుల్లోనైనా మార్కెట్‌ను రాజకీయాలు నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నాడు. చివరిగా పెట్టుబడిదారీ విధానానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురాలేకపోతే ఈ వాద ప్రతివాదాల వల్ల వామపక్ష భావజాలానికే ఎక్కువ నష్టం జరుగు తుందని రచయిత అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా పాలకవర్గాలు సంక్షోభ కారణాల గురించిన శక్తివంతమైన వ్యాఖ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాయి. తాజా సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న సంక్షోభం కాదని, నిజానికి పెట్టు బడిదారీ విధానం నుండి వైదొలగిన ఫలితమే ఈ సంక్షోభమనే వాదనలు పాలక వర్గాల వ్యాఖ్యానాల్లో అంతర్భాగంగా ఉంటాయి. ఇటు వంటి వాఖ్యానం ప్రజలను నిద్ర నుండి మేల్కొ ల్పేది కాదు. మరింత గాఢ నిద్రకు ఉపక్రమింప చేసేది. అంతేకాదు, పెట్టుబడిదారీ విధానం ఒక తటస్థ సామాజిక యంత్రాంగం అన్నదే ఒక సైద్థాంతిక వాదన. ప్రజలను ఆశల పల్లకి లోకి ఎక్కించిన వ్యవస్థ ఏదైనా ఉంటే అది పెట్టుబడిదారీ వ్యవస్తే. పెట్టుబడిదారీ విధానం తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటానికిగాను వస్తు ఆరాధాన, వస్తు కాంక్షతో పాటు భావ ఆరాధానను కూడా ప్రోత్సహిస్తుంది. ఒకసారి దేని గురించైనా ఆరాధ్యభావం ఏర్పర్చిన తర్వాత సదరు విషయం వలన కలుగుతున్న దుష్ప్రభా వాన్ని తగ్గించి చూపటంలో ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడిదారీ విధానం భావ ఆరా ధన రూపంలో నిర్మిస్తున్న మిథ్యావాదంపై కూడా పోరాడాల్సిన అవసరముంది అని రచయిత విశదీకరించాడు.

శతృ శిబిరం ప్రచార యుద్ధం గురించి సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశాడు రచయిత. శతృ శిబిర ప్రచార యుద్ధపు ఏకైక లక్ష్యం ఉనికిలో ఉన్న ఒక శక్తిని... ప్రతిఘటించే సామర్థ్యం గల శక్తిని హతమార్చటం కాదు, అసలు అటువంటి ప్రతిఘటించే సామర్థ్యం ఉన్న శక్తే ఉనికిలోకి వచ్చే అవకాశం లేకుండా చేయటమే దాని లక్ష్యం. అందువల్లనే తాజా సంక్షోభం వ్యవస్థకు సంబంధించిన సంక్షోభంగా కాక వ్యవస్థపై నమ్మకానికి సంబంధించిన సంక్షోభం అన్న వాదన ముందుకు తేవటం ద్వారా మొత్తంగా చర్చనే పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. తాజా సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం కొత్త ముసుగు తొడుక్కుని ముందుకు వస్తుంది. ''సామాజికంగా బాధ్యతాయుతమైన పర్యావరణ పెట్టుబడిదారీ విధానం'' రూపంలో ఇది మనకు కనిపిస్తుంది. అమెరికాలో హరిత విద్యుత్‌ బిల్లు, భారత దేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల విస్తరణ గురించి జరుగుతున్న చర్చలను ఈ నేపథ్యంలోనే మనం చూడాలి. కోపెన్‌హేగెన్‌ సదస్సులో సంపన్న దేశాలు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనాలు. ఇటువంటి ధోరణులు పెట్టుబడిదారీ విధానంలో ఆధునికోత్తర వాదంగా చెప్పుకోవచ్చు. వీటి పర్యవసానం సాంప్రదాయక పెట్టుబడిదారీ విధానం కంటే మరింత దారుణంగానూ, తీవ్రంగానూ ఉంటుంది. ప్రతి సంక్షోభం నేపథ్యంలో వామ పక్షాల జోక్యానికి ఎంతగా అవకాశాలు అందివ స్తాయో అంతకంటే ఎక్కువ అవకాశాలు ఒంటెత్తు పోకడలకు, ప్రజలను దారి మళ్లించే రాజకీయాలకూ వస్తాయనీ, దీనికి యూరోపియన్‌ దేశాల అనుభవాలే నిదర్శనాలనీ రచయిత చెప్పాడు.

మానవత్వం, మానవతావాదం గురించిన చర్చకు కూడా జిజెక్‌ సమర్థవంతమైన జవా బిచ్చారు. సైద్థాంతిక భావజాలాలకు అతీతంగా ఉండాలంటూ ముందుకు వస్తున్న కొన్ని భావ నలు, చర్చలు నిస్సందేహంగా సైద్ధాంతిక కోణం నుండి వస్తున్నవే తప్ప సైద్ధాంతిక భావజాలానికి అతీతమైనవి కావని ఆయన చెప్పారు. అమెరికా ప్రతిపాదిస్తున్న ప్రజాస్వామ్యం కేవలం ఎత్తుగడే తప్ప దానికి వాస్తవిక పునాది లేదన్నాడు. రాజకీయాలకు, ప్రజా జీవనానికి మధ్య పెరుగు తున్న అంతరానికీ, అస్తిత్వ రాజకీయాల ఆవిర్భా వానికీ మధ్య మధ్య సంబంధం ఉందని చెబుతూ ''ఇతరులు'' అన్న భావన రాజకీయ భావజాలంలో ఎలా ప్రవేవించింది, నాటి నుండి మనవాళ్లు, ఇతరుల అన్న అర్థంతో జరుగుతున్న చర్చలకు, అస్తిత్వ రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా స్పృజించాడు రచయిత. చారిత్రక పరిణామ క్రమంలో తెరమీదకు వచ్చిన బహుముఖ అస్తిత్వాల గురించిన సమగ్ర అంచనా లేకపోతే ప్రజలు అస్తిత్వవాదానికి, విముక్తి వాదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేరని ఆయన చెప్పాడు.

నేడు మనం చూస్తున్న పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరించగలమా అన్న ప్రశ్న వేసి దానికి సమాధానంగా కమ్యూనిస్టు పరిష్కారాలు ప్రతిపాదించాడు రచయిత. ఈ అధ్యాయంలో జరిగిన చర్చ అంతా అనేక ప్రతిపాదనలు, సూచనలు చుట్టూ తిరుగుతుంది. సంపూర్ణమైన మార్క్సిస్టు -లెనినస్టు అర్థంలో కమ్యూనిజం సాధన అన్న పదబంధాన్ని రచయిత వాడలేదనిపిస్తుంది. మరోవైపున కమ్యూనిజం సాధనకు కీలకమైన మార్క్సిస్టు లెనినిస్టు సూత్రాలపై నడిచే కమ్యూనిస్టు పార్టీ, విప్లవానికి అవసరమైన కార్మికవర్గ నాయకత్వం, విప్లవానం తరం బూర్జువా రాజ్యాంగయంత్రం స్థానంలో కార్మికవర్గ నియంతృత్వం స్థాపనల గురించి రచయిత చర్చను వాయిదా వేశాడు. కార్మిక వర్గం పొందికలో వచ్చిన మార్పులను ప్రసా ్తవిస్తూ ప్రపంచీకరణ నేపథ్యంలో పలు రకాలుగా చీలిపోయిన కార్మికవర్గాన్ని ఐక్యం చేయాల న్నాడు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదం నాడు కార్మికవర్గాన్ని సమీకరించటానికి దోహదం చేస్తే పోరాడకపోతే సర్వం కోల్పోతామన్న ఆందోళన నేటి సమీక రణకు పునాదిగా ఉండాలని రచయిత ప్రతిపా దించాడు. అయితే ప్రస్తుత పెట్టుబడిదారీ సంక్షో భం నుండి బయట పడి కమ్యూనిజం సాధన కోసం పోరాడేందుకు అవసరమైన సమగ్ర రాజ కీయ వ్యూహాన్ని ప్రతిపాదించటంలో రచయిత వెనకంజ వేశాడు.

నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు తెస్తున్న సంక్లిష్టమైన సమస్యల పరిధి, నిడివి దృష్టిలో పెట్టుకున్నపుడు కమ్యూనిజం ఒక్కటే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వగల దని రచయిత నిర్థారించాడు. ఈ మధ్య కాలం లో ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బాం ప్రచురించిన ''సోషలిజం విఫలమైంది, పెట్టు బడిదారీ విధానం దివాళా తీసింది. ప్రత్యామ్నా యం ఏమిటి?'' అన్న ప్రశ్నకు రచయిత కమ్యూ నిజం సమాధానంతో ముందుకు వచ్చాడు. ఈ పరిష్కారం దిశగా ప్రపంచ కార్మికవర్గం పయ నించకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగానే పెట్టుబడిదారీ విధానం పరిమిత సామ్యవాద భావనలను ప్రచారాస్త్రాలుగా మారుస్తోందనీ, ప్రకృతి వనరులపై ప్రజల ప్రత్యక్ష హక్కు అన్న పర్వావరణ ఉద్యమకారుల వాదనలు ఇందులో భాగమేనని ఆయన పేర్కొన్నాడు. ఇటువంటి వాదనలన్నింటికీ సమాధానం ఇవ్వాలంటే కమ్యూనిజం నిరంతరం ప్రగతిశీల నూతనత్వా న్ని తనలో ఇముడ్చుకోవాలంటాడు. సామ్రాజ్య వాద ప్రపంచీకరణ నేపథ్యంలో మెజారిటీ ప్రజలు కార్మికవర్గంలో చేరుతున్నారు. అంతర్జా తీయంగా రిజర్వు కార్మికవర్గ సైన్యం విస్తరి స్తోంది. ముందు ముందు వీరందరూ ప్రజా స్వామ్యంపేర చెలామణీ అవుతున్న బూర్జువా రాజకీయ క్రమంలో కూడా స్థానం సంపాదిం చుకునే పరిస్థితుల్లో ఉండరు. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో మార్క్స్‌ ప్రతిపాదించిన అత్యున్నత విముక్తి సిద్ధాంతంలోని వాస్తవిక ప్రతిపాదనల గురించి ప్రజలను చైతన్యపర్చా ల్సిన అవసర ముంది అని జిజెక్‌ తన గ్రంథం లో చెప్పాడు. సామ్రాజ్యవాదపు ఆధిపత్య వ్యాఖ్యానం నడుమ వాస్తవిక విషయాలు ప్రజలకు చేరటం లేదు. అందువల్ల ప్రజలు మిథ్యావాదానికి దగ్గరవుతున్నారు. పైన చెప్పుకున్నట్లు ఈ మిథ్యావాదపు ఉపరితలాన్ని బద్దలు కొట్టి వాస్తవాలు ప్రజలకు చేరేలా చేయటం కూడా నేడు సైద్ధాంతిక పోరాటంలో అంతర్భాగమే అవుతుందని ఆయన పేర్కొ న్నాడు.

యూరోపియన్‌ దేశాల రాజకీయాలపై పట్టు కలిగిన జిజెక్‌ ఫ్రాన్స్‌, ఇటలీల్లో జరుగు తున్న రాజకీయమార్పులపై కూడా దృష్టి సారించాడు. ఫ్రెంచి అధ్యక్షుడు, ఇటలీ ప్రధానిల శృంగార క్రీడలు, ఆయా దేశాల రాజకీయాల్లో వాటి ప్రభావం గురించి రేఖా మాత్రంగా పాఠకుల దృష్టికి తెస్తూ, ఇవన్నీ రాజకీయాల పట్ల ప్రజా దృక్ఫధాన్ని మార్చటంలో భాగమనీ రచయిత అభిప్రాయపడతాడు. కారణాలు ఏవైనా ఇటువంటి ఏవగింపు చర్యలపై చర్చ మొదలు పెట్టిన తర్వాత ప్రజానీకం ఎదుర్కొం టున్న దైనందిన జీవన సమస్యలపైకి దృష్టి మళ్లించటం సాధ్యం కాదని, తద్వారా పాలక వర్గాలు తమ ప్రయోజనాలను యథాతథంగా కొనసాగించుకోవటంలో కృతకృత్యులవుతాయని చెప్పాడు. పైన చెప్పుకున్నట్లు సంక్షోభం పర్యవ సానంగా మితవాద రాజకీయాలు, కార్మిక వర్గంపై దాడి పెరుగుతాయి. వివిధ దేశాల్లో ఈ దాడులు ప్రారంభం కావటానికి ముందు జరుగుతున్న చర్చల ధోరణిని రచయిత ప్రస్తా వించిన తీరు ఇంగ్లాండ్‌, అమెరికా, ఆస్ట్రేలి యాల్లో ప్రవాసుల పట్ల జరుగుతన్న వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రవాసుల వల్లనే దేశీయ యువత నిరుద్యోగం బారిన పడుతుందన్న వాదన ముందుకు తేవటం ద్వారా నిరుద్యోగ యువతను ప్రభుత్వ వైఫల్యం నుండి దృష్టి మళ్లించటంలో వివిధ దేశాల్లోని పాలక వర్గాలు కృతకృత్యులయ్యాయి. ఈ ధోరణి ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

వామపక్ష వాదనల్లో ఆధునికానంతర వాదనల గురించి కూడా రచయిత ఈ గ్రంధంలో ప్రస్తావించాడు. కార్మిక వర్గ నియంతృత్వం సిద్థాంతాన్ని వ్యతిరేకించే వారిని రచయిత ఆధునికానంతర వామపక్ష వాదులుగా వర్గీకరించాడు. కార్మికవర్గ నియంతృత్వాన్ని ఆచరణలోకి తెచ్చింది లెనిన్‌ నేతృత్వంలోని బోల్షివిక్‌ పార్టీ. అందువల్ల వీరు సహజంగానే లెనిన్‌ సూత్రీకరణలకు వ్యతిరేక వాదనలు ముందుకు తెస్తారు. వేతన కార్మికుల పోరాటాలను కమ్యూనిస్టు పోరాటాల్లో అంతర్భాగంగా చూడకపోవటం కూడా ఆధునికోత్తర వామపక్ష వాదనల్లో భాగంగా ఉంటుంది. దీనికి గాను వీళ్లు ముందుకు తెచ్చే వాదన ''వేతన శ్రమకు కాలం చెల్లింది. పెట్టుబడికి, శ్రమశక్తికి మధ్య వైరుధ్యం గతం మాట. దీని స్థానంలో ప్రభుత్వం, బహుముఖ వ్యవస్థల మధ్య వైరుధ్యం ముందుకొస్తోంది. కాబట్టి మనం దానిపై కేంద్రీకరించాల''న్న నూతన సామాజిక ఉద్యమకారుల సైద్థాంతిక వాదనలను తీవ్రంగా విమర్శిస్తాడు రచయిత. అంతేకాదు. కమ్యూనిజాన్ని ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టుగా మలచాలంటే పెట్టుబడిదారీ విధానంపై మరింత కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని రచయిత చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవటానికి రచయిత ''ఎన్నికల ప్రజాస్వామ్యం ఏకాభిప్రాయంతో కూడిన పెట్టుబడిదారీ విధానమే. దీన్నే నేడు మనం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అని పిలుచుకుంటున్నాము'' అంటూ ప్రజాస్వామిక వ్యవస్థ పరిధిలోనే శాశ్వత పరిష్కారం వెతకాలని ప్రయత్నించటం సరికాదని పేర్కొన్నాడు. అందుకనే ''కమ్యూనిస్టు వ్యతిరేకులారా, ఇక మీ విమర్శలు చాలించండి. ఇంతవరకు మీరు చేసిన విమర్శలను సహించి మిమ్ములను క్షమిస్తున్నాము. ఇకనైనా పరిస్తితి తీవ్రతను గమనించండి'' అంటూ కార్యోన్ముఖులను చేయబూనుకుంటాడు జిజెక్‌.

Monday, May 3, 2010

గ్రీకు ట్రాజెడీతో ప్రశ్నార్థకమవుతున్న ఆర్థిక పునరుత్థానం

PRajasakti May3th 2010
గ్రీసులో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మొత్తం యూరోపియన్‌ యూనియన్‌ను ముంచెత్తనుంది. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులు ఏటా ఏప్రిల్‌లో జరిపే సమావేశాలు ఈ సారి ఏప్రిల్‌ 23-24 తేదీల్లో ముగిశాయి. మొదట్లో గ్రీసును ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోవటానికి అభ్యంతరాలు తెలిపిన జర్మనీ ఎట్టకేలకు తమ వంతు వాటా అందిస్తామని ప్రకటించింది. మొత్తం గ్రీసు రుణాలు 300 బిలియన్‌ యూరోలు. దీనిమీద ప్రతి ఏడాదీ పెరుగుతున్న వడ్డీ భారం 54 బిలియన్‌ యూరోలు. ఇది కాక బాండ్ల మీద చెల్లించాల్సింది షుమారు 45 బిలియన్‌ యూరోలు. ఇందులో మే మాసం చివరికి 8.5 బిలియన్‌ యూరోలు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకుని చూస్తే గ్రీసు బడ్జెట్‌లోటు 13 శాతానికి పైమాటే. యూరోపియన్‌ యూనియన్‌ పదకొండేళ్ల క్రితం ఉమ్మడి కరెన్సీకి సంబంధించిన విధి విధానాలు రూపొందించేటపుడు ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీన్నే మాస్ట్రిచ్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం యూరోపియన్‌ యూనియన్‌లో చేరి ఉమ్మడి కరెన్సీగా యూరోను అంగీకరించిన దేశాలు తమ బడ్జెట్‌ లోటును సగటున మూడు శాతానికి మించకుండా చూసుకోవాలి. ఇటువంటిదే మన దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన ఎప్‌ఆర్‌బిఎం చట్టం. గ్రీసు తక్షణం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడేయటానికి కావల్సిన నిధులు 145 బిలియన్‌లు. పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కటానికి షుమారు 5 ట్రిలియన్‌ డాలర్లు నిధులు వివిధ రూపాల్లో కుమ్మరించిన సంపన్న దేశాలు, సంపన్నులమవుదామనుకుంటున్న దేశాలు గ్రీసును ఆదుకోవటానకిఇ 145 బిలియన్‌ యూరోల నిధిని సమీకరించలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

యూరోపియన్‌ యూనియన్‌ ముందు నేడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గ్రీసును దివాళా తీయించటం ఒకటి. గ్రీసును ఆదుకోవటం ద్వారా గ్రీసు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని యూరోపియన్‌ దేశాలన్నీ పంచుకోవటం మరోటి. ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రశ్చన్న యుద్ధ కాలంలో వివిధ దేశాల మధ్య కుదిరిన నాటో, సీటో, సెంటో రక్షణ ఒప్పందాలు మనకు తెలుసు. ఈ ఒప్పందాల ప్రకారం సదరు కూటముల్లో ఏ ఒక్క సభ్యదేశమైనా శతృదాడిని ఎదుర్కొంటున్న పక్షంలో మిగిలిన అన్ని దేశాలు దాడికి గురవుతున్న దేశానికి రక్షణగా నిలవాలి. కుడి ఎడంగా ఇదే సూత్రాల మీద ఆధారపడి ఉనికిలోకి వచ్చినవే ప్రాంతీయ ఆర్థిక మండళ్లు. ఇందులో యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భావానికి 1970 దశకం నుండీ పెద్దఎత్తున కృషి సాగితే ఉత్తర అమెరికా స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం 90లలో ముందుకొచ్చింది. మిగిలిన ప్రాంతీయ కూటములు సార్క్‌, ఏషియాన్‌, జి8+వంటివి ప్రధానంగా రాజకీయ కూటములుగానే ఉన్నాయి. పరిపూర్ణమైన ఆర్థిక కూటమిగా యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. తద్వారా ఈ యూనియన్‌లోని సభ్యదేశాలన్నీ ఉమ్మడి బ్యాంకు, ఉమ్మడి కరెన్సీ, ఉమ్మడి ఆర్థిక విధానాల ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక ఉన్న సైద్ధాంతిక ప్రాతిపదిక పెట్టుబడిదారీ విధానం అజేయం అన్న భావన. ప్రత్యేకించి 90 దశకంలో తూర్పు యూరప్‌ దేశాల్లో సోషలిస్టు రాజ్యాలు పతనం అయిన తర్వాత ఈ భావన మరింత వేళ్లూనుకొంది. దాంతో అప్పటి వరకు నత్తనడక నడుస్తూ వచ్చిన యూరోపియన్‌ యూనియన్‌ భావన అంగలు పంగల మీద ఒక కొలిక్కి వచ్చింది. దానికనుగుణంగానే విధి విధానాలు రూపొందాయి. ఈ పరిస్థితుల్లో గ్రీసును ఒంటరిగా దివాళా తీయించటం ఇయు కోసం ఏర్పాటు చేసుకున్న చట్రం పరిధిలో సాధ్యం కాదు. అలా చేయటం అంటే సభ్య దేశాల ఆర్థిక స్థిరత్వానికి ఇయు హామీ ఇవ్వలేదన్న సారాంశాన్ని ప్రపంచానికి తెలియచేయటమే. ఇదే జరిగితే అమెరికా, డాలర్‌ ఆర్థిక శక్తి సామర్థ్యాలకు దీటుగా తెరమీదకు వస్తుందనుకున్న యూరో, యూరోపియన్‌ యూనియన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అంతర్జాతీయంగా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయి.

మిగిలింది అమెరికా సంక్షోభ భారాన్ని ప్రపంచం మొత్తం పంచుకున్నట్లుగా గ్రీసు సంక్షోభ భారాన్ని యూరోపియన్‌ దేశాలు పంచుకోవటం. అలా చేయాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ కూడా కొంత భారాన్ని భరించాలి. ఇయులో సభ్య దేశాల హౌదాకు అనుగుణంగా ఈ భారాల పంపకం ఉంటుంది. అంటే ఈ భారంలో సింహభాగం జర్మనీ భరిస్తే, తదుపరి ముఖ్యవాటాలు ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలు పంచుకోవాలి. అంటే ఈ దేశాలు తమ జాతీయ అవసరాల కోసం కేటాయించుకున్న నిధుల్లో కొంత మొత్తాన్ని తగ్గించి గ్రీసుకు రుణాలు ఇవ్వాలి. దీనివల్ల ఆయా దేశాల్లో సామాజికరంగ వ్యయం తగ్గిపోవటం అనివార్యం. అంతేకాదు. ఈ దేశాల బ్యాంకుల్లో గ్రీసును దివాళా తీయించిన బాండ్లు వచ్చి చేరతాయి. తద్వారా ఆయా దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్థల సామర్థ్యం తగ్గిపోతుంది. దీని ప్రభావం అంతర్జాతీయ ద్రవ్యరంగంపైనా పడుతుంది.

ఈ రెండింటిలో ఏ నిర్ణయానికి వచ్చినా ముప్పు అనివార్యం. అందువల్లనే ఈ ముప్పు గురించి యూరోపియన్‌ దేశాల ప్రజలు చర్చించకుండా చేయటానికి గ్రీసు ప్రభుత్వం మాస్ట్రిచ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని, బడ్జెట్‌లోటును 3 శాతానికి తగ్గంచాలని అటు ఐఎంఎఫ్‌, జర్మనీలు ఒత్తిడి తెస్తున్నాయి. 13 శాతంగా ఉన్న బడ్జెట్‌ లోటును ఒక్కసారిగా 3 శాతానికి తగ్గించటం అంటే సామాజిక, రక్షణ రంగాల్లో ప్రభుత్వ కేటాయింపులు పెద్దఎత్తున కోతకు గురికావాలి. కనీసం 70 శాతం వరకూ ఈరంగాల్లో వ్యయం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పదిశాతానికిపైగా ఉన్న నిరుద్యోగం మరింత పెరగటం ఖాయం. ఐఎంఎఫ్‌ మాజీ అధ్యక్షుడు కెన్నెత్‌ రోగాఫ్‌ '' గ్రీసు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడిని ఒప్పించటం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం వల్లనే స్టాండర్డ్‌ మరియు పూర్‌ రేటింగ్‌ సంస్థ గ్రీసు ప్రభుత్వ బాండ్లను చిత్తుకాగితాల కోవలోకి చేర్చింది. ఈ సంస్కరణలు చేపట్టనిదే ఐఎంఎఫ్‌ కూడా నిధులు విడుదల చేయటం సాధ్యం కాదు'' అని ప్రకటించారు. గ్రీసు ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్‌ చేతుల్లో పునర్వవస్థీకరణకు గురవటం అంటే 70 దశకం నుండి వర్ధమాన దేశాలు అమలు జరిపిన ఆర్థిక సంస్కరణలను గ్రీసు అమలు జరపటమే. దీని పర్యవసానం రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ఈ సంస్కరణలను దేశీయంగా కొనుగోలుశక్తిని మరింత తగ్గించి వేస్తాయి. దాంతో గ్రీసు ఆర్థిక వ్యవస్థ 70,80 దశకాల్లో అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థ తరహాలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఏ రకంగా చూసుకున్నా గ్రీసు ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కమ్ముకున్న పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభంలో ఒక కీలకమైన మలుపుగా నిలవబోతోంది. అంతర్జాతీయ విశ్లేషకులు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలతో సహా ఇప్పుడిపుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2007 నాటి సంక్షోభం నీడ నుండి బయటకు వస్తోందని అంచనా వేస్తున్నారు. గ్రీసు పరిణామాలు, గ్రీసు పరిణామాలనే పోలిన పోర్చుగల్‌, స్పెయిన్‌, ఐర్లండ్‌, ఇటలీ ( ఈ దేశాల మొదటి అక్షరాలను ఒక చోట చేర్చి పిగ్స్‌ అని పిలుస్తున్నారు.) దేశాల పరిణామాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పునరుత్థానంపై కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Monday, April 12, 2010

ద్రవ్యోల్బణం పడగనీడన ఆహారభద్రత

Published in Prajasakti Business Watch, April 12th, 2010
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మరో మారు ద్రవ్యోల్బణం పడగనీడన విలవిల్లాడుతోంది. గత సంవత్సరం ఎన్నికల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ప్రతికూల దశకు చేరుకున్నదనిపించినా నిజానికి దాని తీవ్రత ఏనాడు మందగించలేదు. అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం పర్యవసానంగా భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణంలో పారిశ్రామిక ఉత్పత్తుల వాటా మోతాదు తగ్గింది. దాంతో 2008 నాటికి రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణం తిరిగి 2009 ఫిబ్రవరి నాటికి ప్రతికూల దశకు చేరింది. నాటి నుండీ ప్రభుత్వ అంచనా ప్రకారమే వరుసగా 18 నెలల పాటు పారిశ్రామికోత్పత్తుల ధరల భారం స్థానంలో ఆహారోత్పత్తుల ధరల భారం ఆర్థిక వ్యవస్థను వెన్నాడుతూ వచ్చింది. 2010-2011 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 7-9 శాతం ఉంటుందని హామీ ఇచ్చినా బడ్జెట్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందిన నెలరోజులు కూడా గడవక ముందే '' ద్రవ్యోల్బణం అదుపు తప్పేట్లుంది'' అంటూ సెలవిచ్చారు. కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారు కౌశిక్‌ బసు మాత్రం ద్రవ్యోల్బణం 5 శాతం లోపే ఉంటుందని ఢంకా బజాయిస్తున్నారు. బసు మాటలను లెక్కపెట్టని ద్రవ్యోల్బణం మార్చి చివరి వారానికి 9.9 శాతానికి చేరింది. ఫిబ్రవరి, మార్చిల్లో 16 శాతానికి అటు ఇటుగా ఉన్న ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ మొదటి వారానికి తిరిగి 18 శాతానికి చేరింది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరం అంతా ఆర్థిక వ్యవస్థ రెండంకెల ద్రవ్యోల్బణం నీడన కొనసాగాల్సి వస్తుందన్న విషయం ఖాయంగా కనిపిస్తోంది.

భారతదేశం ఆర్థికాభివృద్ధి లాగానే ప్రధానంగా ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉంది. అవి ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, రుతుపవనాలు, ముడిచమురు ధరలు, సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి స్తబ్ధతకు లోనుకాకుండా ఉండటం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. తొలి అంశం ద్రవ్యోల్బణం ఇప్పటికే అదుపు తప్పిందని, ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ ద్రవ్యోల్బణం పెంచేదిగా ఉందన్న విషయంలో విమర్శలకు మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైన సమగ్ర విధానాన్ని ప్రతిపాదించటానికి బదులుగా ప్రభుత్వం, ముఖ్యంగా రిజర్వు బ్యాంకు ద్రవ్య చలామణి, వడ్డీ రేట్ల నియంత్రణ ద్వారా అదుపు చేయాలని ప్రయత్నిస్తోంది. మార్చి చివరి వారంలో రెపో రేట్లు, రివర్స్‌ రెపో రేట్లు పెంచటం ఇందులో భాగమే. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచటం ద్వారా మార్కెట్‌లో అదనంగా ఉన్న రొక్కం నిధులు తొలగించాలని తారాపూర్‌ వంటి ద్రవ్య ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు. వీరు సరఫరా వైపున ఉన్న సమస్యలకు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 2008కు పూర్వం మార్కెట్లో ల్వికిడిటీ, ద్రవ్య సరఫరా ఈ స్థాయిలో లేదు. అయినా ద్రవ్యోల్బణం 16 శాతం వరకూ పెరిగింది. అప్పట్లో అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు కారణం అని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఈ సంవత్సరం బారెల్‌ ముడి చమురు ధర 70-78 డాలర్లు ఉంటుందన్న అంచనాపై ఆధారపడి 2010-2011 బడ్జెట్‌ అంచనాలు రూపొందించబడ్డాయి. కానీ నెలరోజులు తిరక్కముందే చమురు ధర 85-90 డాలర్లకు చేరింది. కనీసం 20 శాతం పెరిగింది. ఈ భారం అంతా వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతుందనటంలో సందేహం లేదు. ఇక రుతుపవనాల సంగతి సరే సరి. జూన్‌, జూలై నాటికి కానీ దాని ప్రభావం పూర్తి స్థాయిలో అవగతం కాదు. చివరికి మిగిలింది సంపన్న దేశాల ఆర్థికాభివృద్ధి స్థితి గతులు. యూరప్‌ పరిణామాలు పరిశీలిస్తున్న వారికెవరికైనా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంత తేలికగా కుదుట పడుతుందన్న నమ్మకం కలగటం లేదు. అమెరికా తాజాగా ఆమోదించిన ఆరోగ్య బీమా చట్టం వలన భారతదేశంలో ఐటి, బిపిఒ, ఔషధ పరిశ్రమలు లబ్దిపొందవచ్చునేమో కానీ మౌలిక ఆర్థిక రంగం లబ్ది పొందటం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ ఆర్థిక వ్యవస్థను కట్టుదిట్టం చేసి, ఉపాధి భద్రత, ఆహార భద్రత కల్పించటంద్వారా శ్రమశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే తప్ప జాతీయ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధి రేటు సాధించటం వీలుపడదు.

కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు శ్రమశక్తి మార్కెట్‌కు పూర్తి స్థాయిలో పని కల్పించే విధంగా లేవు. ఒక్క బిఎస్‌ఎన్‌ఎల్‌లోనే మూడో వంతు ఉద్యోగులకు ఉద్వాసన పలకటానికి పిట్రోడా కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా నవరత్న, మినీ నవరత్న మొదలు లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలన్నీ పెట్టుబడుల ఉపసంహరణ వధ్య శిలపై ఉన్నాయి. ఒక కంపెనీలో పెట్టుబడులు ఉపసంహరణ జరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు పెరగటం మాట అటుంచి ఉన్న ఉపాధి అవకాశాలు నిలుపుకున్న దాఖలాలు గత రెండు దశాబ్దాల అనుభవంలో కనిపించటం లేదు. ఇప్పటికే గృహనిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో వృద్ధి రేటు మందగించటంతో ఈ రంగాలను ఆసరా చేసుకుని పట్టణాలకు వలస వచ్చిన కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులు ఆహార భద్రతకు దూరమవుతున్నారు. గ్రామీణ భారతంలో కోట్లకొద్దీ ఆకలి కడుపులు కనీసం ఒక్క పూట తిండి గ్యారంటీ కోసం ఎదురు చూస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పెద్దఎత్తున వ్యవసాయ కార్మికుల చేతుల్లో ఆదాయాలు నింపుతున్నామని ప్రభుత్వ అధ్యయనాలు తెలుపుతున్నా, పెరుగుతున్న ధరల భారంతో పోల్చినపుడు ఈ ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు ఆహారోత్పత్తుల విషయంలో ఫ్యూచర్స్‌ మార్కెట్‌, ఫార్వర్డ్‌ మార్కెట్‌లకు అనుమతించటం, అందులో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే యోచనలో ప్రభుత్వం ఉండటంతో ధరలు దీపావళికి ముందే తారాజువ్వల్లా పైకెగుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహార భద్రత చట్టం గురించి ప్రభుత్వం చర్చిస్తోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ చమురు ధరలు కలిసి ధరాఘాతం ఆహారోత్పత్తుల పరిధి దాటి పారిశ్రామికోత్పత్తులను తాకింది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం పలు రూపాల్లో పరోక్ష సుంకాలు పెంచి ఈ ద్రవ్యోల్బణాన్ని, ధరాఘాతాన్ని మరింత పెంచేలా చేసింది.

ఈ చర్చకు గ్రామీణ భారత వాస్తవికతకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. ఎప్పుడో 1973-1974లో రూపొందించిన పౌష్టికాహార ప్రమాణాల ప్రాతిపదికన 2010లో పౌష్టికాహార అవసరాలు గుర్తించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూడు దశాబ్దాల్లో ఆహార అలవాట్లే కాదు, అందుబాటులో ఉన్న ఆహారంలో పౌష్టికాహార మోతాదు కూడా మారిపోతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సంవత్సరం క్రితం 20-30 రూపాయలు ఉన్న కిలో మంచి బియ్యం ధర నేడు 35-45 రూపాయలకు పెరిగింది. ఈ పెరుగుదలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు చేస్తే ఈ నిధులు ఒక రోజు తిండికి బదులు ఒక పూట తిండి పెట్టటానికే సరిపోతాయి. జాతీయ ఆహార అవసరాలు లెక్కించేటపుడు ప్రభుత్వం ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ పేదరికం గురించిన మేధోమధనం ఈ దిశగా జరగటం లేదు. ఎంతమందిని ఆకలిగొన్న వారిగా గుర్తిస్తారన్నది అవసరాన్ని బట్టి కాక అవకాశాన్ని బట్టి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే నిజంగా ఎన్ని ఆకలి కడుపులు నింపాలి అన్నది ప్రాతిపదికగా కాక ఖజానాలో ఎన్ని నిధులున్నాయి, ఈ నిధులు ఎంతమందికి సరిపోతాయన్న ప్రాతిపదికన పేదరికాన్ని అంచనా వేసేందుకు ఆక్స్‌ఫర్డ్‌ నుండి హార్వార్డ్‌ విశ్వవిద్యాలయాల్లో అర్ధశాస్త్రం పట్టా పుచ్చుకున్న మేధావులు లెక్కలు వేస్తున్నారు. ఈ విషయం చూస్తుంటే మనిషి పొడవును బట్టి మంచం తయారు చేయటానికి బదులు ఉన్న మంచం పొడవుకు మనిషిని తగ్గించటం అన్న సామెత గుర్తుకు వస్తోంది. మారుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఆహారభద్రతపై జరుగుతున్న చర్చ మరింత విశాల దృక్ఫథంతో జరగాలి. సంకుచిత దృక్ఫథంతో కాదు.

కొండూరి వీరయ్య

Saturday, April 10, 2010

To Andhra Pradesh with love

From Business Standard, April 10th 2010

David Shulman, professor of humanistic studies, Hebrew University of Jerusalem and an expert on South Indian languages and cultures has written Spring, Heat, Rains: A South Indian Journey (University of Chicago Press, $25/Special Indian price, Rs 1,004) which is not just a travelogue but a long meditation on Telegu literature with reflections on Andhra history. As a journey across space and time, it is rather like a genre without rules, free from precept or precedent: part travel writing, part literary appreciation but above all, a philosophy expressed in images. Shulman is also a scholar in Sanskrit and classical Hindustani music, plus much else besides, and brings to bear his formidable learning to this book, which he admits to “a restlessness that rules me, so the landscapes shift like the languages and the texts”. All of which makes it difficult to write about it in this limited space! As you might expect, the diary is lyrical, sensual but more than anything else, it is introspective. Just about everything becomes a part of the huge canvas Shulman builds his story on. There are reflections on daily happenings and the life around: “Rocks. Goats. Dry shrubs, Buffaloes. Thorns. A fallen tamarind tree.” Simple observations of the daily lives of ordinary people of Rajahmundry, on the banks of the river Godavari which like all rivers in India are sacred and determine the life styles of millions around. Shulman has been bitten by the metaphysical bug: “How did I happen to find myself in Rajamundhry in the early spring of 2006? The answer would be the river called me. She — the Godavari — is imperious, also infinitely seductive. Rajamundhry is her town. When I saw her, she extracted a promise that I would return:….” And long before he first saw India, he had a calling within, “as if India was the magnet, and I the iron filing, unconscious, unmelted…. If words mean anything — but why should they mean? —it is only when the underlying echo, the music that motivates all real language, fades into silence”.

It is classical Hindustani music which Shulman had studied in depth that had drawn him to India, along with the music of the Dravidian languages, which fascinated because he says, “Linguistics had shown that South Indians utter, on average, more syllables per second than any other attested speakers of known human languages — and sometimes give the impression of a bubbling or cascading stream.” Telugu, he adds, is in fact “the main language of classical South Indian musical compositions”. Shulman goes into history to explain “the strangely hypnotic, contrapuntal complexity of tremendous aural power — a musical experience unlike any other, perhaps transcending meaning in any of the usual senses of the word”.

Shulman uses the metaphors of music to describe early mornings in Rajahmundry. “The rooftops, white, gray, streaked with grime, partly hidden by thick green clusters of palm, seem to be humming a barely audible morning raga. Birdcalls, the bells on the bicycles, the constant backdrop of horns from the cars and rickshaws, the cries of fruit vendors, the distant ring of a radio broadcasting a Sanskrit prayer to the waking god, mothers shouting at their children: all this is the raga as it breaks through the surface to audibility.” For the non-Telugu speaker or for those unfamiliar with classical Hindustani music, we have simply to go along, overawed by the depth and range of Shulman’s scholarship, and the meanings he gives to the everyday happenings around him.

It is Shulman’s principle not only to read poetry in the original language “but also to absorb it in the setting where it was written” because language does not exist independent of the environment in which it is rooted.

Shulman plunges deep into Telugu poetry and in the process into the beliefs, philosophies, the myths and legends of the land. So, “Godavri is not somewhere outside us but deeply alive within.” Like the Hindu way, he is inclined to see divinity in the earth itself, in rocks, in trees, in stone sculptures, in mountains, in rivers but specially in the Godavri in spate: …marvelling at the dramatic swelling and acceleration of their goddess, this necklace hanging over the breast of the Andhra Earth-goddess….” Shulman does not lose his critical eye and sees the muck behind the façade of modernity and the pollution of the river “smothered in the stench of the Andhra Pradesh Paper Mills upstream”.

This book isn’t an easy read and has to be taken in small doses by the noncognoscenti. But it is fascinating the extent to which some foreign scholars go in understanding us. How many of our own do so?

Monday, March 22, 2010

కుంభకోణం పెట్టుబడుల ఉపసంహరణ

యుపిఎ 2 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ కుంభకోణం దిశగా నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వరంగ సంస్థల గ్రామీణ విద్యుదీకరణ కంపెనీ, జాతీయ గనులు, ఆర్‌ఇసి, ఖనిజాభివృద్ధి సంస్థ, ఎన్‌ఎంఎండిసి, జాతీయ థర్మల్‌ విద్యుత్పత్తి కార్పొరేేషన్‌ ఎన్టీపిసిల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ వ్యవహారాన్ని పరిశీలిస్తే నా ఈ సందేహం నిరాధారం కాదని స్పష్టమవుతోంది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి 25000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. యుపిఎ- 1 మరియు యుపిఎ 2 మధ్య ఆర్థిక విధానాల్లో ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తూ 2009 జూన్‌లో రాష్ట్రపతి, 'ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్లో వాటాలు పొందే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలో మార్పు లేకుండా సాధ్యమైనంత మంది ఎక్కువ ప్రజలకు వాటాలపై హక్కులు కల్పించేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపడుతుంది' అని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు ప్రైవేటు శక్తులకు కట్టబెట్టే పనికే నాజూకుగా ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించటం అని పిలిచింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయంలో ప్రజలు తండోపతండాలుగా పాల్గొనాలి. లక్షలాది షేర్లు, వాటాలు కొనుగోలు చేయటానికి గాను మార్కెట్‌ను ప్రజలు ముంచెత్తాలి. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా సాగుతోందని దిగువనున్న పట్టిక తెలియచేస్తోంది.

ఈ మొత్తం ప్రక్రియలో మరో కీలకమైన అంశం దాగి ఉంది. షేర్లు కొనటానికి సాధారణ ప్రజలు సిద్ధం కాకపోవటం ఒక అంశమైతే మరోటి ప్రయివేటు కంపెనీలు కూడా సిద్ధం కాకపోవటం. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెదకటంలోనే అసలు కిటుకు దాగి ఉంది. ప్రభుత్వం ఆశించినంతగా వాటాల కొనుగోళ్లుకు దరఖాస్తులు రాలేదని ఈ పట్టికలోని సమాచారం తెలియచేస్తోంది. అలా అని వాటాల ఉపసంహరణ ప్రక్రియను విరమించుకుంటే ప్రభుత్వ మౌలిక స్వభావమే ప్రశ్నార్థకం అవుతుంది. అందువల్ల పెద్దఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలైన, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత జీవిత బీమా కంపెనీలను మార్కెట్‌లోకి దించి వారి పెట్టుబడులను వాటాల కొనుగోళ్లకు పురమాయించింది ప్రభుత్వం. ఉదాహరణకు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ వాటాలు కొనుగోలు చేయటానికి ఎల్‌ఐసి 3000 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఎన్‌ఎండిసి కంపెనీ వాటాలు కొనుగోలు చేయటానికి మరో రూ.8000 కోట్ల ఎల్‌ఐసి నిధులు వినియోగించబడ్డాయి. ఇతర ప్రయివేటు సంస్థలు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, ఇతర ద్రవ్య సంస్థలు ఈ వాటాలు కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. తత్పర్యవసానంగా ఆయా కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ విలువ తగ్గిపోయింది. ఫలానా కంపెనీ వాటాలు మార్కెట్‌లో విడుదలైన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా అమ్ముడయితే ఈ కంపెనీ మార్కెట్‌ విలువ అంత ఎక్కువ ఉన్నట్లు. మరి ఆర్‌ఇసి, ఎన్‌ఎండిసి కంపెనీల మార్కెట్‌ విలువ పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు దోహదం చేయలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం సాధించదల్చుకున్నది, నిరూపించదల్చుకున్నది ఏమిటి?

ఇక్కడ ఒక విషయాన్ని చర్చించుకుందాం. ఎవరైనా షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఫలానా కంపెనీ లాభాలు, స్థిరాస్తుల, అప్పులు, ఇతర లావాదేవీలు గురించి ఆరా తీస్తాము. అపుడపుడూ కీలకమైన విషయాల్లో ప్రభుత్వం తన ఆశక్తతను, అసహాయతను కప్పిపుచ్చుకునేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ప్రకటించటం అలవాటుగా మారింది. అదే తరహాలో ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే బాధ్యత నుండి తప్పుకునేందుకు మార్కెట్‌ తన పని తాను చేసుకుపోతుంది. 'మార్కెట్‌ ధర్మం' దీనికి అంతరాయం కలిగించకూడదు అని వాదించటం కూడా అలవాటుగా మారింది. ఈ సూత్రాన్ని మాటవరసకు అంగీకరించినా ఈ విషయాల్లో ఏ కంపెనీ మెరుగ్గా ఉంటే ఈ కంపెనీ వాటాలు అమ్ముడవటం సోకాల్డ్‌ మార్కెట్‌ ధర్మం. ఆ విధంగా చూసుకున్నపుడు పట్టికలో ప్రస్తావించిన కంపెనీలన్నింటిలో ఎన్‌ఎండిసి, ఆర్‌ఇసి కంపెనీల స్థిరాస్తులు, నికర లాభాలుఎక్కువ అన్నది నిస్సందేహం. కనీసం నరవత్న కంపెనీల్లో ఒకటి, అంతర్జాతీయంగా మార్కెట్‌ ఆదరణ పొందిన ఫోర్బ్స్‌ 500 కంపెనీల్లో స్థానం పొందిన ఎన్టీపిసీ వాటాలు కూడా కొనుగోలు చేసే నాధుడు కరువయ్యాడని ఈ పట్టిక తెలియచేస్తోంది. అటువంటప్పుడు మార్కెట్‌ ధర్మం ప్రకారం ఈ కంపెనీల వాటాలకు గిరాకీ ఉండాలి. కానీ మార్కెట్‌ ధర్మం ఇక్కడ పని చేయలేదు. చిన్న చిన్న కంపెనీలు, నామమాత్రపు స్థిరాస్థులు కలిగి, మార్కెట్‌ రుణాలపై ఆధారపడే కంపెనీల వాటాలు అమ్ముడయినంతగా ప్రభుత్వరంగంలోని పెద్దఎత్తున స్థిరాస్తులు కలిగి, ప్రతి ఏటా లాభాలు సంపాదిస్తున్న కంపెనీల వాటాలు అమ్ముడుకాలేదు. అంటే ఇక్కడ మార్కెట్‌ మానాన మార్కెట్‌ పని చేయలేదని సదరు పెట్టుబడుల ఉపసంహరణ వాదులు, మార్కెట్‌ వాదులు అంగీకరించాల్సివుంది.

అలా కాదనుకున్న పక్షంలో చట్టానికి కళ్లు లేవు అన్న ధోరణిలో మార్కెట్‌ కూడా గుడ్డిది, వాస్తవికతను గుర్తించలేదు అని అంగీకరించాలి. ఈ రెండింటిలో ఈ ఒక్క వాదనను అంగీకరించినా పెట్టుబడుల ఉపసంహరణ అర్థం లేని పని అని తీర్మానించాల్సి వస్తుంది. ప్రభుత్వం మరి ఏ వాదన అంగీకరిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి సమయం పడుతుంది.ఈ లోగా మార్కెట్‌ అవకతవకల కోణాన్న పరిశీలిద్దాం. శక్తివంతమైన కంపెనీల వాటాలుమార్కెట్‌లో పలుకుబడి కోల్పోవటం వెనక ఖచ్చితంగా మార్కెట్‌ ఆపరేటర్లు జట్టు కట్టటం కారణం అయి ఉంటుందన్న సందేహాలు ఉన్నాయి. ఒక వేళ మార్కెట్‌ వివేకవంతం అయినదైతే షేర్లుకంపెనీల్లో ఒకటి కాకపోతే మరోటైనా వివేకవంతంగా వ్యవహరించాలి కదా... మరి పబ్లిక్‌ ఇషఉ్య ముగింపు తేదీ వరకూ సదరు కంపెనీల వాటాలు అమ్ముడవకపోవటం వెనక ఉన్న మర్మం ఏమిటి? ప్రభుత్వం స్టేట్‌ బ్యాంకు, ఎల్‌ ఐసి వంటి కీలకమైన సంస్థల నిధులు మళ్లించి మరీ ఈ మార్కెట్‌ సెంటిమెంట్‌ కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తే తప్ప పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో నిజాలు, నీడలు వెలుగు చూడటం సాధ్యం కాదు.

కంపెనీ ఇష్యూ మోతాదు వచ్చిన దరఖాస్తులు గిరాకీ శాతం

డిక్యు 123 11083 86.3

మాన్‌ ఇన్‌ఫ్రా 142 8904 67.8

ఎఆర్‌ఎస్‌ఎస్‌ 103 5286 51.3

ఇన్‌ఫినిట్‌ కంప్యూటర్‌ 190 6840 36.0

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్‌పోర్ట్‌ 700 22694 32.4

జుబిలియంట్‌ ఫుడ్స్‌ 328 8941 27.3

ఆర్‌ఇసి 3486 10945 3.1

ఎన్‌ఎండిసి 9957 12459 1.3

ఎన్‌టిపిసి 8480 10515 1.2

Tuesday, March 9, 2010

పన్ను విధానంలో మార్పుతో చేతిలో మిగిలిలేదెంత?

ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌ Sun, 7 Mar 2010, IST
కొండూరి వీరయ్య

బడ్జెట్‌ తతంగం పూర్తయ్యింది. ఇక మీదట బడ్జెట్‌ తర్వాత ఏయే రంగాలకు ఎంతమేర నష్టం కలిగింది, ఎంతమేర ప్రయోజనం కలిగింది అన్న అంశాలపై చర్చలు, సమీక్షలు దృష్టిపెడుతున్నాయి. ముఖ్యంగా విష్లేషకులు వ్యక్తిగత ఆదాయ పన్నుల విధానంలో వచ్చిన మార్పులపై కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మార్కెట్‌లో సరుకుల కదలికపైనా, నిధుల లభ్యతపైనా ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. మార్కెట్‌ విశ్లేషకులు, ఆర్థిక సంస్థలన్నీ ఈ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పు ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్దఎత్తున మిగులు డబ్బులు చేతిలో ఉంటాయని వాదిస్తున్నారు. దానికనుగుణంగానే పన్నుల్లో వచ్చిన మార్పుల ద్వారా మిగిలిన డబ్బును ఫలానా స్కీంలో పెట్టుబడులు పెట్టండి, ఇంత కాలం తర్వాత అంత ఆదాయం వస్తుందన్న ప్రకటనలుకుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల విధానం వల్ల ప్రజల వద్ద అంత ఎక్కువ మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయా అన్న విషయాన్ని పరిశీలిద్దాం.

తాజా బడ్జెట్‌లో వ్యక్తిగత పన్నుల విధానాన్ని విశ్లేషించేముందు 2011 ఏప్రిల్‌ 1 నుండీ ప్రత్యక్ష పన్నుల విషయంలో నూతన విధి విధానాలు అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలు ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయి. పన్నుల శ్లాబుల్లో ప్రతిపాదించిన మార్పుల వల్ల గతం కంటే ప్రజల వద్ద అదనపు వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని దిగువనున్న పట్టిక రుజువు చేస్తోంది. సదరు మార్పులను అంతవరకే పరిమితం చేసి చూస్తే నిజమే కదా అన్న భావన కూడా కలగటం కద్దు. కానీ ఈ మార్పులను అదే బడ్జెట్‌ పత్రంలో ప్రతిపాదించిన ఇతర మార్పుల నేపథ్యంలో పరిశీలిస్తే తప్ప నిజంగా కలిగే ప్రయోజనం ఏమిటన్నది అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.ఇదే విధంగా సంత్సరానికి యాభై లక్షల ఆదాయం వచ్చే వారికి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా 50,000 రూపాయలు తక్కువ పన్ను కడితే సరిపోతుంది. ఇదే సందర్భంలో ఇతర అంశాల్లో తెచ్చిన మార్పుల వల్ల ఈ మిగులు ఆదాయాన్ని నిర్భయంగా ఉపయోగించే అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఈ విధంగా మిగిలిన డబ్బును ఇతర తక్షణ ప్రయోజనకరమైన పనికి - అంటే ఇల్లు కట్టుకోవటానికో మరోదానికో వెచ్చిస్తే భారం మరో రూపంలో వచ్చి పడుతుంది. కేవలం కాపిటల్‌ మార్కెట్లు, ఈక్విటీ, బాండు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకుంటేనే ఈ రాయితీల వల్ల వచ్చిన ప్రయోజనం ఒనగూడుతుంది. అంటే ఈ ఆదాయ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పులన్నీ ప్రజల చేతిలో అదనపు ఆదాయం మిగిల్చేందుకు కాదు. ద్రవ్య మార్కెట్లలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకే అన్నది స్పష్టం అవుతుంది.

ఈ ఇచ్చిన రాయితీలు ప్రధానంగా బాండ్‌ మార్కెట్‌ను, మ్యుచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ను, పెన్షన్‌ మార్కెట్‌ను బలోపేతం చేసేవిగా ఉన్నాయి. పై పద్ధతిలో మిగుల్చుకున్న ఆదాయాన్ని మౌలిక వసతుల కల్పనా రంగంలో విడుదలయ్యే బాండ్లుపై (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు) ఖర్చు పెడితే మరో రూ.20,000 వరకూ మినహాయింపు వస్తుంది. ఆర్థిక రంగంలో ఏ విభాగాన్ని కదిలించినా ఆ విభాగంలో మౌలికవసతుల కల్పనకు లక్షల కోట్లలో నిధులు అవసరం అని ప్రభుత్వం, నిపుణుల కమిటీలు ప్రకటించటాన్ని చూస్తూనే ఉన్నాము. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వం సదరు నిధులు కల్పించేందుకు బదులుగా మార్కెట్‌ ద్వారా, అంటే ప్రజల ద్వారా ఆ నిధుల సేకరణకు మార్గం సుగమమం చేస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు ఎవరు విడుదల చేస్తారు అన్నది కీలక అంశంగా ఉంది. అంతేకాదు. బాండ్ల ద్వారా వచ్చే సగటు ఆదాయం, వడ్డీనికూడా పన్నుల పరిధిలోకి తెస్తూ నిర్ణయించింది ప్రభుత్వం. ప్రైవేటు కంపెనీలకు విడుదల చేసే అటువంటి బాండ్లుకు కూడా ఈ పన్ను రాయితీలు వర్తింపచేస్తే ఇకపై రూపాయి పెట్టుబడి లేకపోయినా ప్రజల సొమ్ముతో దర్జాగా వేల కోట్ల లాభాలు దిగమింగటానికి మార్గం తేలికపర్చటమే అవుతుంది.

ఈ బడ్జెట్‌ ప్రతిపాదించిన పన్నుల విధానంలో మరో ముఖ్యమైనది నూతన పెన్షన్‌ పథకానికి సంబంధించింది. కార్మిక సంఘాలు, వామపక్షాల ఒత్తిళ్ల వల్ల నూతన పెన్షన్‌ విధానం ఇంతవరకూ చట్టరూపానికి నోచుకోలేదు. తాజా బడ్జెట్‌లో ఇపిఎఫ్‌, పిపిఎఫ్‌ల లబ్దిదారులకు స్కీం మెచ్యూరిటీతో వచ్చే ఆదాయంపై కూడా పన్ను ప్రతిపాదించారు. అంటే ఆర్థిక మంత్రి ప్రతిపాదన పార్లమెంట్‌ ఆమోదం పొందితే ఇపిఎఫ్‌ స్కీం మెచ్యూరిటీతో లక్ష రూపాయల ఆదాయం సంపాదించుకుంటే అందులో 60 వేల రూపాయలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల చదువులకో, పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవటానికో దాచుకున్న డబ్బులపై పన్ను వేటు పడుతోంది. మరోవైపున నూతన పెన్షన్‌ పథకంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగికీ ఏటా ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున మూడేళ్ల పాటు నిధి జమచేయనుంది. కొత్త పథకం పట్ల మోజు కల్గించే ప్రయత్నం తప్ప ఇది నిజంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే ప్రయత్నం కాదు.

ఒకవేళ ఎవరైనా ప్రయోజనకరమైన వస్తువులు కొనుగోలుచేయాలని ప్రయత్నిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వివిధ రంగాలపై సర్వీసు పన్ను పెంచటం ద్వారా వస్తువులు, సేవలు మరింత భారంగా మారనున్నాయి. ఉదాహరణకు నిర్మాణంలో ఉన్న ఇంటికి బ్యాంకు రుణం తీసుకుంటే దానిపై కూడా సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఇన్‌స్టాల్‌మెంట్ల భారం పెరగనుందన్నమాట. వినిమయ వస్తువులు కొందామంటే కూడా పరిస్థితి అంత తేలికగా ఏమీ లేదు. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన భారం అన్ని రంగాల్లోనూ, అన్ని తరగుతల ప్రజలపైనా వడ్డించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా కనీస ప్రత్యామ్నాయ పన్ను (మాట్‌)లో పెరిగిన భారాన్ని, ఎక్జైజు, కస్టమ్స్‌ సుంకాల రూపంలో పెరిగిన భారాన్ని కంపెనీలు నేరుగా వినియోగదారులపై వడ్డించేందుకు సిద్ధమయ్యాయి. ఈ దిశలోనే ఎలక్ట్రానిక్‌, మరియు గృహోపకరణాలు ఉత్పత్తి చేసే ఎల్జీ కంపెనీ తమ ఉత్పత్తుల ధరల్లో 1.5 శాతం నుండి 3.5 శాతం పెంపుదలకు ఆదేశాలు జారీ చేసింది. గోద్రెజ్‌ కంపెనీ ఉత్పత్తులు బడ్జెట్‌కు ముందు రెండు శాతం తక్కువ ధర పలికితే బడ్జెట్‌ మరునాడు రెండు శాతం అదనపు ధర పలుకుతున్నాయి. వళ్‌పూల్‌ కంపెనీ తమ ఉత్పత్తుల న్నింటిపైనా సగటున రెండు శాతం ధరలు పెంచాలని నిర్ణయిం చుకుంది. ఎక్జైజు సుంకాలు పెరగటం వల్ల కార్ల కంపెనీల తమ ఉత్పత్తులపై 3000 నుండి 50000 వరకు పెంచుతూ నిర్ణయించాయి. కొత్త పన్నుల విధానం ద్వారా చేతిలో మిగిలిన డబ్బులు వెచ్చించాలని మార్కెట్‌లోకి అడుగుపెట్టే సోదరులారా... ఎంత ఖర్చుపెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి మరి....

పన్ను పరిధిలోకి గత ప్రస్తుత తేడా

వచ్చే ఆదాయం బడ్జెట్‌ బడ్జెట్‌ (మిగులు)

2,00,000 4120 4120 0

5,00,000 55620 35019 20,601

10,00,000 210120 158619 51,501

12,00,000 2,71,919 2,20,419 51,500

15,00,000 3,64,619 3,13,119 51,500

20,00,000 5,19,119 4,67,619 51,500

Wednesday, March 3, 2010

సంస్కరణలపై యావ తగ్గని ప్రభుత్వం

ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌కొండూరి వీరయ్య Sun, 28 Feb 2010, IST

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది వేరే దారట. సంస్కరణలను వేగవంతం చేసేందుకు మన భారతదేశం 2010-2011 బడ్జెట్‌లో పెద్ద పీట వేయటమే దీనికి ఉదాహరణ. గతవారం చెప్పుకొన్నట్లు రెండు దశాబ్దాల సంస్కరణల అనుభవాలు మదింపు చేసుకునేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని ప్రభుత్వం వృధా చేసుకొందని చెప్పకతప్పదు. 1990-1991 సంస్కరణలకు ఆరంగేట్రం చేసిన ప్రణబ్‌ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్‌, మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాలే నేడు కూడా కీలక విధాన నిర్ణాయక హౌదాలో ఉన్నారు. పైగా మొదటి రెండు దశాబ్దాల్లో మౌలిక రంగాలకు పరిమితం అయిన సంస్కరణలను నేడు సామాజిక, అనుబంధ రంగాలకు కూడా విస్తరించటానికి వీరి నేతృత్వంలో ప్రభుత్వం నడుం కట్టినట్లు బడ్జెట్‌ ప్రసంగాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.

ఏ దేశానికి సంబంధించిన ఆర్ధిక వ్యవస్థలోనైనా రెండు భాగాలు ఉంటాయి. మొదటిది పరపతి విధానం. దాన్నే విస్తృతార్థంలో మానిటరీ పాలసీ అంటారు. రెండోది ద్రవ్య విధానం. దాన్నే ఫిస్కల్‌ పాలసీ అంటారు. పరపతి విధానం ద్వారా రిజర్వు బ్యాంకు మార్కెట్లో ఉండాల్సిన రొక్కం నిధులు, దానికి అవసరమైన విధి విధానాలను ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ద్రవ్య విధానంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్‌లో ఉన్న నిధులు ఎవరి వద్దకు చేర్చాలి అన్న విషయంలో తన విచక్షణ ప్రదర్శిస్తుంది. ఇందులో ముఖ్యమైనది పన్నుల విధానం. ఏ ప్రభుత్వం అయినా ఎవరి పక్షపాతిగా ఉంది అని చెప్పటానికి సదరు బడ్జెట్‌లో అనుసరించిన పన్నుల విధానం కీలక ప్రాతిపదికగా ఉంటుంది. పరోక్ష పన్నులు (ఎక్సైజ్‌, కస్టమ్స్‌, సర్‌చార్జి వంటివి) నూటికి 95 శాతం ప్రజల జీవితాలను, ఆదాయ వ్యవయాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. దీనికి భిన్నంగా ప్రతక్ష్య పన్నుల పరిధిలోకి వచ్చే ప్రజల వాటా కేవలం 5 శాతం మాత్రమే.95 శాతం మందిపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరవచ్చు. కానీ ఆ మేరకు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పదే పదే కౌటిల్యుడి ఆర్థిక సూత్రాల ప్రకారం బడ్జెట్‌ రూపొందించామని చెప్పుకున్న ప్రణబ్‌ ముఖర్జీ , ''మార్కెట్‌లో నియంత్రణలు లేని ధరల వల్ల వేర్వేరు వర్గాల ప్రజలు వేర్వేరు మోతాదుల్లో భారాలపాలవుతారు. ప్రత్యేకించి శ్రమజీవులపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది'' అన్న కౌటిల్యుని సూత్రాన్ని మాత్రం మర్చిపోయారు. ఉత్పాదక క్రమాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటానికి అవసరమైతే జూద గృహాలు (నేటి స్పెక్యులేటివ్‌ వ్యాపారులు)పై కూడా పన్ను వేయాలని కౌటిల్యుడు చెప్పిన సూత్రం మాత్రం ఆర్థిక మంత్రికి గుర్తుకు రాలేదు.

ప్రభుత్వం చమురు ధరలు, ఎరువులపై నియంత్రణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తంగా 95 శాతం మంది ప్రజానీకంపై భారాలు మోపటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దాంతో పాటే ధరలు కూడా పెరుగుతాయి. ధరలు పెరగటం అంటే మార్కెట్‌లో ప్రజల చేతిలో ఉన్న రొక్కం (లిక్విడిటీ) తగ్గిపోవటం అన్నమాట. ధరల రూపంలో ఈ నిధులు చేతులు మారి సంపన్నులకు చేరతాయి. అదే 5 శాతం మంది పారిశ్రామికవేత్తలు, కుబేరులపై విధించే పన్నులు పెంచటం వల్ల నేరుగా ఆర్థిక వ్యవస్థపై పడే భారం పరిమితంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మొదటి నిర్ణయానికే ప్రాధాన్యత ఇచ్చింది.సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) అంచనా మేరకు కేవలం వివాదాల కారణంగా ప్రభుత్వం ఏటా పన్నుల ద్వారా రావాల్సిన ఆదాయంలో 50 వేల కోట్ల రూపాయలు కోల్పోతోంది. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ద్వారా వసూలు చేయదల్చుకొన్న మొత్తం ఆదాయంలో ఇది మూడోవంతు. అంతేకాదు. గత మూడు సంవత్సరాలుగా దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రత్యక్ష పన్నుల వాటా, కార్పొరేట్‌ పన్నుల వాటా తగ్గిపోతోందని ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. అయినా ఈ విషయాలు సరి చేయటం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలు పరిశీలించటానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.

మధ్యతరగతి ప్రజల మెప్పు పొందటం కోసం ఆదాయపు పన్నుల్లో నామమాత్రపు మార్పులు చేసింది. చూడటానికి 1,60,000 రూపాయలకు లోబడి ఆదాయం వచ్చే వారిపై పన్ను భారం తగ్గించటం ద్వారా వారి చేతిలో ఖర్చుపెట్టటానికి పుష్కలంగా అవసరమైన నిధులు అందుబాటులో ఉంచామని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించారు. అదే సమయంలో ధరల నియంత్రణను గాలికి వదిలేయటం ద్వారా కుడిచేత్తో ఇచ్చిన రొక్కాన్ని ఎడమ చేత్తో లాగేసుకున్నట్లయ్యింది. చమురు, ఎరువుల ధరలపై నియంత్రణ రద్దు చేయటం ఈ ఒక్క బడ్జెట్‌కే పరిమితమైన కసరత్తు కాదు. రానున్న కాలంలో ఈ ధరల నిర్ణయ క్రమాన్ని మార్కెట్‌ ఒడిదుడుకులకు అనుగుణంగా నిర్ణయించే స్వతంత్ర అధికారాన్ని ఆయా కంపెనీలకు చేతిలో కట్టబెట్టింది. గత నెల రిజర్వు బ్యాంకు వెలవరించిన ఒక నివేదికలో '' ప్రభుత్వం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు భారం తక్షణమే ప్రజలకు చేరుతుంది. సానుకూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరేసరికి ఆలస్యం అవుతున్నాయి'' అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్దఎత్తున పతనం చవిచూసిన గత రెండు సంవత్సరాల్లో రిటైల్‌ ధరలు ఏమాత్రం తగ్గాయో మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఇకపై ప్రజలపై పడే ధరల భారం ఎగమోరతో ఉంటుందే తప్ప తిరుగుముఖం పట్టే అవకాశాలు లేవు.

సంస్కరణల విషయంలో చెప్పుకోవాల్సిన మరో కీలక అంశం వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలన్న ప్రతిపాదన. విద్యా రంగంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన ముఖ్యమైనవి. ప్రభుత్వం మూడ్‌ గమనించిన రిజర్వు బ్యాంకు కూడా ఈ విధానాలకు మానిటరీ పాలసీలో ఉన్న అవాంతరాలు తగ్గించే విధంగా అవసరమైతే రూపాయి పూర్తి మారకాన్ని అనుమతించేందుకు వెనకాడబోమని ప్రకటించింది. ఆర్థిక సర్వేలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ విధానాల దశ, దిశను మార్చాలని ప్రతిపాదించింది. పాశ్చాత్య దేశాల్లో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చల సారాంశాన్ని భారత ప్రభుత్వం తన విధాన పత్రాల్లో చొప్చించింది. తద్వారా భారతదేశంలో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చకు ఆందోళనకరమైన నూతన కోణాన్ని జోడించింది ఈ బడ్జెట్‌.